జన వేమన — 12 ఇతిహాస పౌరాణిక అంశాల పై వేమన

  జన వేమన — 12 
                                                     ఇతిహాస పౌరాణిక అంశాల పై వేమన 

ఆది కవి రాసిన శ్రీ మద్రామాయణం ఆది కావ్యం .రామ చరిత్ర కనుక ఇతి హాసం .కృష్ణ ద్వైపావను డైన వ్యాస మహర్షి రాసిన మహా భారతం కూడా భారత దేశాన్ని పాలించిన రాజ వంశాల చరిత్రే కనుక ఇతి హాసం .వ్యాసుడే రాసిన శ్రీ కృష్ణ లీలా విలాస మైన శ్రీ మద్భాగవతం ,మత్ష్య ,కూర్మ ,వరాహ వగైరా లన్ని పురాణాలు .”ఇలా జరిగింది ”అని చెప్పినది ఇతి హాసం అని ,”పాత డైనా ,కొత్త గానే ఉన్న్డది ”గా అని పించేది పురాణం అనీ అంటాం .ఈ రెండిటి లోను ,విషయాల పైనే వేమన దృష్టి సారించాడు .వాటిని సూక్ష్మ పరి శీలన చేశాడు .వాటి రహస్య లను అందించాడు .అలాంటి వాటి లో కొన్నిటిని గురించి తెలుసు కొందాం .
నిర్మల ధర్మాన్ని ధర్మ రాజు మొద లైన వారు అనుసరించారని ,”ధర్మమే నృపులకు తారక యోగంబు ”అని వేమన భారత పరమార్ధాన్ని తెలియ జెప్పాడు .”అందు ,ఇందు నందుననక బరికించి -విష్ణు వరయు చుండు విదితముగను –చక్రి తిరుగు భూమి చక్రంబు లోపల ” అని భాగవత పరం గా శ్రీ హరి విలాసాన్ని చెప్పాడు .రామ నామ మహాత్మ్యం చాలా గొప్పదని ,బోయ అయిన వాల్మీకి ”రామ నామ పథనమహిమచే –బాపడయ్యాడు ”అని ,”కులము ఘనము కాదు ,గుణము ఘనమ్బురా” అని గుణానికే ప్రాధాన్యత నివాలనివ్వాలని వాల్మీకి చరిత్ర ఆధారం గా చెప్పి ,జ్ఞానోదయం కలిగించాడు .స్త్రీ కి విలువ ను దేవుళ్ళు  ఎలా ఇచ్చారో ,అనే విషయాన్ని తెలుపుతూ ”స్త్రీ నెత్తిన రుద్రునకు, -స్త్రీ నోటను బ్రహ్మ, కపుడు సిరి గుల్కంగా, -స్త్రీ నెదిరి రొమ్మున,హరికి, -స్త్రీ నెడపగా ,గురుడ నీవు దేవర వేమా ?”అని త్రిమూర్తుల చాపల్యాన్ని ,వారు తమ భార్యలను ఎక్కడేక్కడ ఉంచుకున్నారో అనే విషయాన్ని చమత్కారం గా చెప్పాడు .ఒకరి కంటే ఒకరు స్త్రీ కి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారని తెలిపాడు .స్త్రీ ని దూరం చేసుకొనన్న గురుడే దేవుడు అన్నాడు .అంటే ,స్త్రీ వ్యామోహం అతిగా ఒద్దని భావన .బుద్ధికర్మను అనుసరిస్తుంది అని మన ఆర్యోక్తి .దీన్ని రావణా సురుని పరం గా అన్వయించాడు .”నిలకడ బుద్ధి లేని కోతి సేన తో ,లంకంతా నాశనం అయింది .అరి వీర భయంకరుడైన రాక్షసాధి పతి రావణ బ్రహ్మ ,ఆయన రాక్షస సైన్యం కపి సేన ముందు నిలువ లేక పోయారు .పూర్తిగా ఒడి పోయారు .పోగాలము వస్తే ,గడ్డి పోచ ,పామై కరుస్తుంది .”చేటు కాల మైన ,జేరుప నల్పుడే చాలు -”అని రావణ పరం గా అతి సూక్ష్మం గా చెప్పాడు .
కొందరి పుట్టుక ,ఆ వంశానికి మేలు ,గౌరవం చేకూరుస్తాయి .కొందరు పుట్టి ,వంశాన్ని సర్వ నాశనం చేస్తారు .మొదటి రకం లో శ్రీ రాముడు ,రెండవ రకం లో రావణుడు ఉన్నారని మనకీ పాటికి తెలిసే పోయింది కదా .”ఎవరి మంచి చెడ్డ లెంచి జూచిన దేట ”అని ,మంచి,చెడులకు శ్రీ రాముడు ,కురు సార్వ భౌముడు అని చెప్పాడు .కులం కాదు -గుణమే ప్రధానం అని మరో సారి చెబుతూ వశిష్టుని వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తాడు .ఆయన తల్లి దేవ వేశ్య అయిన ఊర్వశి .భార్య మాదిగ కులం లో జన్మించిన అరుంధతి .అయితే మాత్రమేం ?వసిష్టుడు శ్రియః పతి అయిన శ్రీ రామునికే గురువై ,అరుదైన గౌరవాన్ని దక్కించు కొన్నాడు .ఇవన్నీ ఆయన తపస్సు చేత సాధించిన దివ్యత్వం, ద్విజత్వం .కనుక బురద లో పుట్టినంత మాత్రం చేత పద్మ ప్రభకు ఏమీ కొదువ ఉండదు .అందుకే ”తపము చేత ద్విజుడు తర్కింప కులమేట్లు ?”అని నిలదీశాడు .
ఎంతో మంది రాజులు ,చక్ర వర్తులు భారత దేశాన్ని పరి పాలించినా షట్చక్ర వర్తులు ,షోడశ రాజులు మాత్రమె ప్రసిద్దు లైనారని గుర్తు చేశాడు .దశరధ మహా రాజు శ్రీ రామునికి పట్టాభి షేకం చేయాలని అనుకొన్నాడు .కాని విధి విలాసం -ఆయన అరణ్యాల పాలై నాడు .జటా జూట దారి అయాడు కాని ,కిరీట దారి కాలెక పోయాడు .”తలపు మనదే ,కాని దైవిక మది వేరే ”అని తానొకటి దాలిస్తే దైవం వేరొకటి తలుస్తాడని లోక పరం గా జరిగే విషయాన్ని రామ పరం గా చెప్పి ,అంతా మన అధీనం లో ఏమీ లేదు అన్న సత్యాన్ని తెలియ జేశాడు .రామాయణం లో రాక్షస సంహారం ,భారతం లో బంధు నాశనం ఉంటె ,బసవ పురాణం లో” పాప హరణం” ఉందని దాని విశిష్టతను చాటి చెప్పాడు .రామ నామం విశిష్టతను వేమన బానే చాటాడు .”రామ ,రామ యనుచు రంజిల మది వేడి -రహిత పడగ ,మదిని రవళి వినుచు  -మనసు నంటి యున్న మహా నీయు డన దగు”అని ,కమ్మగా ,రస రమ్యం గా రామ నామాన్ని పొగిడాడు .మాయ ఎంతటి వారి నైనా లోబర్చు కొంటుంది .వారితో ఆడు కొంటుంది . హరి ,అజుడు ,దేవ మునులు ,శివుడు జన్మలు పొందారు .జరా ,మరణాలు పొందారు .విధి వైప రీత్యం తప్పదు ఎంత వారి కైనా .ఇదంతా ”మాయా వాసన వేమా ?”అని తత్త్వం బోధించాడు .రాజ యోగ సాధన చేసిన వాడికి అసాధ్యం ఉండదు .హను మంతుడు రాజ యోగ రహస్య జ్ఞాని .అందుకే ,తేలిగ్గా శత యోజన విస్తీర్ణ లవణంబుధిని అవలీలగా దాటగలిగాడు . లంకకు చేరి సీతా మాత దర్శనం చేయ గలిగాడు .ఆయన హృదయం అంతా రాముడు కొలువై ఉన్నాడు .మహాత్ములకు సాధ్యం కానిది లేదని రుజువు చేశాడని ”మాయలడచి ,రామాజ్న మీరక వర్తించాడు ”అని హనుమన్న ను పోగి డాడు .
కష్టాలు వచ్చి నప్పుడు ధైర్యం తో ప్రవర్తించటం గొప్ప వారి లక్షణం .లక్ష్య సాధన కోసం ఎంత వారి తో నైనా పోరాడి గెలవటం వారి సహజ లక్షణం .అలాగే అర్జునుడు సాక్షాత్తు కాల కం థుదు అయిన శివుని తో ద్వంద్వ యుద్ధం చేసి మెప్పించి ,పాశు పతాస్త్రాన్ని వరం గా పొందాడు దానితో కౌరవ నాశనం సుసాధ్య మైంది అని వివరిస్తాడు వేమన .అలాగే ,నల మహా రాజు అడవులకు వెళ్లి ,ఇబ్బందులు పడి ,భార్యను కోల్పోయి ,రూపం చెడి ,చివరికి అంతా సుఖాంతం కాగా ,శని ప్రభావం పోగా ,మళ్ళీ రాజ్యాన్నీ, భార్య ను దక్కించు కొన్నాడు .”బుద్ధి నొక్కి ఎరుక పోకార్చు టలు ముక్తి  ” అని నల చరిత్ర కు భాష్యం చెప్పాడు .పెద్ద వాడికి అతి సామాన్యుడు సాయం చేస్తే ,దొడ్డ మనసు తో మెచ్చి హత్తుకొంటాడు .అలానే ,లంకకు వారధి కట్టే సమయం లో ఉడుత చేసిన సాయానికి అచ్చేరువంది,వీపు నిమిరి ,తన చేతి వ్రేలి గుర్తులు దాని వీపు పై శాశ్వతం గా ఉండేట్లు అనుగ్రహించాడు శ్రీ రామ చంద్రుడు .చిన్న సాయానికి అతి పెద్ద వరం లభించింది .ఈ సందర్భం గా ”ఉడుత రాముని కెంత ఊడిగంబు చేసే –ఉడుతను ,రాముడు వాంఛ చేత -వర కరంబు చే ,వీపు దువ్వగ లేద ”అని ,ఆ ఘట్టాన్ని చిరస్మరణీయం చేశాడు వేమన .”ఉడతా భక్తీ ”అన్న మాటకు చరితార్ధకత కల్పించాడు ..ఈ విధం గా ఇతి హాస ,పురాణాల ను చక్కగా ,సమన్వయము చేసి వ్యాఖ్యానించాడు వేమన .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-8-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.