ఊసుల్లో ఉయ్యూరు -34 మా ఆస్థాన క్షురకులు

 ఊసుల్లో ఉయ్యూరు -34
                                  మా ఆస్థాన క్షురకులు 

ఇదేదో కొత్త మాట లా ఉందా ? మా ఆస్థానం అన్నా మా సంస్థానం అన్న మా ఇల్లు అని అర్ధం .క్క్షురకులు అంటే జుట్టు పని చేసే వారు .పూర్వం జుట్టు కొట్టించు కోవా టాన్ని ”పని చేయించుకోవటం ”అనే వాళ్ళం .లేక ”మంగలి పని చేయించు కోవటం” అనే వారు .ఆ పని చేసే వారిని మంగళ్ళు అనే వారు .అయితే ఆ మాట కొంత ఎబ్బెట్టు గా ఉందని ”నాయీ బ్రాహ్మలు ”అన్నారు .అలాగే ఆ పని చేసే వారిని క్షురకులు అని సంస్కృతం లో అనే వారు .ఆ పని చేయ టాన్ని క్షవరం అనే వారు .లేక క్షౌరం ”అనీ పిలిచే వారు .ఆ స్థానాన్ని ”క్షౌర శాల ”అనటం ఉండేది .ఇప్పుడు ఇంగ్లీష్ మాటలు అలవాటై బార్బర్ అనీ బార్బర్ షాప్ అనీ చెప్పటం ,రాయటం జరుగు తోంది .అంతే కాదు క్షవరం అనే దానికి అర్ధం కూడా మారి పోయింది .ఎవ డైనా డబ్బు పోగొట్టు కొంటె ”క్షవరం అయిపోయిందన్న మాట  ”అనేస్తున్నాం .ఇంకా ఎక్కువ గా నష్ట పోతే ”తిరు క్షవరం ”అని పాపం ఆ యేడు కొండల వాడికి అంట గట్టు తున్నాం .అంటే నున్న గా గీకేశాడు ,గోకే శాడు  అని అర్ధం .ఎవరైనా సరిగ్గా క్షవరం చేయించుకోక పోతే ”ఏమిట్రా ! ఆ తిరు పతి నొక్కులు ?”అనటం బాగానే అలవాటయింది .
మేము హిందూ పురం నుండి ఉయ్యూరు కు వచ్చేసరికి మా మామయ్య గారింట్లోఉయ్యూరు వీరాస్వామి అనే ఆయనక్షురకుడు గా ఉండే వాడు .నీరు కావి ధోవతి కట్టు కొని  వచ్చి ఇళ్ళ దగ్గర పిల్లలకూ ,పెద్దలకు ”పని ”చేసే వాడు .ఈ పని చేసే వాళ్ళ చేతిలో అన్ని సామాన్లు పెట్టు కోవటానికి ఒక చిన్న నగిషీలు చెక్కిన కొంచెం కాషాయ రంగులో ఉండే  చెక్క పెట్టె ఉండేది .ఇందులో జుట్టు కత్తి రించే కత్తెరలు దువ్వెన ,కత్తికి పదును పెట్టెదీర్ఘ చతురస్రా కారపు సాన ,పటిక ముక్క , చిన్న చేతి గుడ్డ ,నీళ్ళు పోసుకోవటానికి చిన్న సత్తు బొచ్చె,  బ్రషు  ఉండేవి .కొంత మంది చిన్న అద్దాన్ని కూడా పెట్టుకొని తెచ్చే వారు .ఈ మొత్తం సామాను పెట్టె, పెట్టె ను ”పొది ”అనే వారు .దీన్ని ఎడమ చంక కింద పెట్టుకొని ఇళ్లకు వచ్చే వారు .ప్రతి ఇంటికి ఏదో నిర్ణీత వారం ఉండేది .ఆ నెలలో ఆ వారం లో వచ్చి ఎవరెవరికి పని చేయాలో చేసి వెళ్ళే వారు .అలా వీరా స్వామిని మొదట మేము చూశాం .మా ఇంట్లోను పనికి కుదిరాడు ఆయన .మా కంటే చాలా పెద్ద వాడు .అతని తమ్ముడు రఘు నాదం కొంచే క్లాస్ గా నల్ల గా పొడుగ్గా ఉండే వాడు .వీరా సామి పెద్ద కొడుకు మా కంటే పెద్ద వాడు అతను సివిల్  చదివి మంచి ఉద్యోగమే చేశాడు .అతని తమ్ముడు నాగేశ్వర రావు నాకు క్లాస్ మేట్ .వారసత్వపు పనిలోనే ఉన్నాడు .వీరా సామీ కి నాద స్వరం వాయించే బృందం ఉండేది .పెళ్ళిళ్ళకు అతని బృందం తోనే కార్య క్రమాలను నిర్వ హింప జేసే వారు .రఘు నాదానికి బాండ్ మేళం ఉండేదని జ్ఞాపకం .దాన్ని బాగా వాయించే కళా కారులుండేవారు .డబ్బున్న వాళ్ళు బాండ్ మేళాన్ని, సామాన్యులు సన్నాయిని పెట్టె వారు .రఘునాధం పెద్ద కొడుకు నాకు క్లాస్ మేట్ .వాళ్లకు ఉయ్యుర్లో మా పొలాలకు కొంచెం దూరం లో పోలాలున్దేవి .ఇంటి మంగలికి సంవత్స రానికో సారి ధాన్యం కొలిచే వారు .ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నారో లెక్క ఉండేది కాదు .దీన్ని వార్షికం అనే వారు .ఎప్పుడు కబురు చేసినా వచ్చి పని చేసి వెళ్లాల్సిందే .సా ధారణం గా ఆ కాలం లో శుక్రవారం ,అమావాస్య మొదలైన రోజుల్లో చేయించుకొనే వారు కాదు .వయసు లో పెద్ద గా ఉన్న వారందరికీ గుండు పిలకా .చిన్న పిల్లలకు యువకులకు క్రాఫు .అదీ పద్ధతి .ఇంటికి మంగలి వస్తే వాకిట్లో ఒక మూల ఒక పీట మీద కూర్చొని చేయించు కోవాలి. మంగలి వంగొని కూర్చుని చేసే వాడు .నీళ్ళు చెంబు తో ఆయన బొచ్చె లో నీళ్ళు పోయాలి .పని అయినతర్వాత ఆజుట్టంతా అతను జాగ్రత్త చేసే వాడు .వెంట్రుక కనీ పిస్తే పెద్ద వాళ్ళు ఊరుకొనే వారు కాదు .ఆ పని చేయించుకోవటానికి పెద్ద వాళ్ళు లుంగీ లతో ,పిల్లలు గోచీ లతో కూర్చునే వాళ్ళు .ఒళ్లంతాకత్తిరించిన జుట్టు పడి, చీదర చీదర గా ఉండేది .అదంతా ఒక ప్రహసనం .స్నానం చేస్తే నేకాని ఇళ్ళ లోకి రానిచ్చే వారు కాదు .ఇంట్లో పెద్ద వాళ్ళు కుంకుడు కాయలను చితక కొట్టి ,గింజలు వేరు చేసి  ఒక గిన్నె లో పోసి గోరు వెచ్చని నీరు కలిపి నురుగు వచ్చేట్లు చేసి  రుద్దు కోన మనే వారు .ఆది కళ్ళ ల్లోకి పోయి, మండిఇబ్బంది గా ఉండేది . తర్వాత కళ్ళ వెంట ధారారా పాతం గా నీళ్ళు కారేవి .ఇలా సాగేది తలంటు భాగోతం .ఇప్పుడు తలంటు అంటే కూడా అర్ధం మారి పోయింది ..”వాడు వీడికి బాగా తలంటాడు ” అంటే పూర్తిగా దోచు కొన్నాడ”నే అర్ధం ఇప్పుడు వచ్చింది .
                                   
  రామ దాసు 
కొంత కాలం గడిచింది .మేము కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాం.కాలేజిలో చేరాం .అప్పుడు వంగల కృష్ణ దత్తు గారికి పని చేసి, వ్యవహారాలూ చూసే రామ దాసు మా కూ పని చేయటానికి మా నాన్న గారు కుదిర్చారు . .రామ దాసు నల్లగా ఉండే వాడు పంచె కట్టే వాడు .మంచి మాట కారి ,పని బానే చేసే వాడు .చేస్తున్నంత సేపూ మాటలు చెబుతూనే ఉండే వాడు నవ్వించే వాడు .దత్తు గారి కబుర్లు అడిగి తెలుసుకొనే వాళ్ళం .మాకు కూడా అతను తలంటు కు కుదిరాడు .అప్పటికే కొంత ముదిరాం కనుక మా తలంటి మేము పోసుకోవటం నామోషీ అయింది .అందుకని తప్పలేదు .అదో భోగం .ఒళ్లంతా నువ్వుల నూనె పూసే వాడు .బాగా ఇగిరే దాకా రుద్దే వాడు .మెత్తని పెసర పిండి   లో కొద్దిగా పసుపు కలిపి ఒక గిన్నె లో మా పెద్ద వాళ్ళు ఇచ్చే వారు దానికి నలుగు పిండి అని పేరు ..దాన్ని రెండు చేతులకు  పులుము కొని మా ఒంటికి ఆపద మస్తకం పట్టించే వాడు .దీన్ని నలుగు పెట్టటం అనే వారు .అదంతా పూసిన తర్వాత మా ఆకారం చూస్తె దెయ్యమో భూతమో అన్నట్లు ఉండేది .చెవుల్లో నూనె పోసి గిల కొట్టే వాడు .బాగా చెవి లోకి,ఇంకి  పోయే దాకా ఇలా చేసే వాడు .ఇలా రెండు చేవులలోను పోసి గిల కొట్టే వాడు .ఒక చెవి అవగానే తల ఒక పక్కకు పెట్టి ఉండే వాళ్ళం .నూనె కారి పోకుండా వేళ్ళు అడ్డం పెట్టుకొనే వాళ్ళం .నెత్తికి ఆముదం పోసి తల అంటే వాడు .భలే తమాషా గా అంటే వాడు .ఇది ఎంత సేపున్నా భలేగా ఉండేది .మంచి మోత మోగించే వాడు .ఈ లోపు ఒంటికి పట్టించిన పెసర పిండి అంతా ఎండి  ఒలవటానికి తయారు గా ఉండేది .నెమ్మది గా చెయ్యి, కాలు ,నలుస్తూ దాన్ని బలపాలు బలపాలుగా నలిచి కింద పడేట్లు చేసే వాడు .మా చుట్టూ చిన్న పోగు గా ఆది పడి తమాషా గా ఉండేది .అప్పుడు మా వాళ్ళు ఒక పెద్ద గిన్నె లో అంతకు పూర్వమే దంచి ఉన్న కుంకుడు కాయలు పోసి ఉంచి గోరు వేచ్చని నీళ్ళు దానికి కలిపే వారు .ఇక ఆ గిన్నె ముట్టుకొనే వారు కాదు .రామ దాసు ఆ గిన్నె లో ఉన్న కుంకుడు కాయ లను బాగా కలిపి కుంకుడు పులుసు చేసే వాడు .మమ్మల్ని కళ్ళు మూసు కోన మనిఆ నురుగు నెత్తిమీద కొద్ది కొద్ది గా పోస్తూ  రుద్దే వాడు .ఆది కారుతూ జారుతూ తెల్లగా ఒళ్లంతా పాకేది .దాన్ని అన్ని చోట్లా రుద్దే వాడు .అలా మొదటి సారి అవగానే మా వాళ్ళు బొక్కెన లో తోడి ఉంచిన వేడి నీరు, కల పటానికి ఉంచిన చన్నీళ్ళు కావాల్సిన పాళం కలిపి రుద్దిన తర్వాతా పోసే వాడు .కళ్ళల్లోకి పోయి గోల చేసే వాళ్ళం .కళ్ళు మండేవి .కుంకుడు వాసన భలే తమాషా గా ఉండేది .మళ్ళీ నురుగు పోసి ఒళ్లంతా రుద్దే వాడు .మూడో సారి రసం తో తల రుద్దే వాడు .ఒంటికి పట్టిన చిలుము, కిలుము అంతా వదిలి పోయేది .ఒళ్లంతా నీళ్ళు పోసి స్నానం చేయించే వాడు .దీని తోఅతని పని అయి పోయేది .ఆ నీళ్ళ తో ఇంట్లోకి రాకూడదు .అందుకని మా పెద్ద వాళ్ళు విడి గా ఒక బకెట్ లో సమ పాళం లో నీళ్ళు కలిపి మా నెత్తిన చెంబెడు, చెంబెడు ఒళ్లంతా తడి సెట్లు పోసే వారు .అప్పుడు తువాల ఇస్తే తుడుచు కొనే వాళ్ళం .అప్పుడే  ఇంట్లోకి వేళ్ళ టానికి పర్మిషన్ .నెలకోసారి తప్పకుండా తలంటి పోయించుకొనే వాళ్ళం .తలంటి పోసుకొన్న రోజు రాత్రి విప రీతం గా నిద్ర వచ్చేది .తల లోని వేడి అంతా యెగిరి పోయి ఎంతో రిలీఫ్ గా ఉండేది .రామదాసు కు కూడా మేళం ఉండేది .అతని కొడుకుసూర్య నారాయణ  మంచి క్లారినెట్ విద్వాం శుడు.అతనికి మంచి డిమాండ్ ఉండేది .సుస్వర నాదానికి అతనికి పేరు .మా తరం లో ఇలా జరిగింది .
                                    లోక నాధం
మా పిల్లల తరం వచ్చే సరికి లోక నాధం అనే అతను పని చేసే వాడు .మాకు ,వాళ్లకు కూడా .అతను పొడుగ్గా ఒక కన్ను కొద్దిగా మూసి, లుంగీతో ఉండే వాడు .అతనికీ మేళం ఉండేది .లోక నాధం మేళం అనే వాళ్ళం .బాండ్ మేళానికి ప్రసిద్ధి .మాటలు కోటలు దాటించే వాడు .” బాబు గారు బాబు గారు ”అంటూ పిల్లల్ని, ”మేష్టారు గారు ”అంటూ నన్ను పలకరించే వాడు .పిల్లలకు జుట్టు కత్తి రించటం ,తలంటి పోయటం బానే చేసే వాడు .అప్పటికి ఫాషన్ కూడా మారి పోయింది .పిల్లలకు కాలానికి తగి నట్లు క్రాఫ్ చేయాలి .దానికి లోక నాదమే ఆ రోజుల్లో అందరికి నచ్చిన మనిషి .మా పిల్లల తో పాటు ,మా మేనల్లుళ్లు కూడా వుండే వారు .అంతా గోచీలు పెట్టుకొని నూనె రాయించుకొని వరుసగా కూర్చొని తలంటి పోయించు కుంటుంటే చూడ టానికి తమాషా గా ఉండేది .పాలేళ్ళు ఉండే వాళ్ళు కనుక వేడి నీళ్ళు కాచటం చన్నీళ్ళు బావిలోంచి తోడి గుండిగలలో పెట్టటం చేసే వాళ్ళు .అప్పటికి కొంత ఆచారమూ మార్పు చెందింది .కొంత కాలం దాకా లోకనాధనికీ వార్షికం గా వడ్లు కొలిచే వాళ్ళం .ఆ తర్వాతా డబ్బు లు ఇచ్చి నట్లు జ్ఞాపకం .సంక్రాంతి నాడు మేళ గాళ్ళు అందరు ఊదుకుంటూ ,డోలు వాయిన్చుకొంటుమంగళ వాద్యాలను విని పిస్తూ తండోప తండాలుగా  ఉదయమే ఊరంతా ఇల్లిల్లు తిరిగే వారు .అందరికి కొట్టు లోని ధాన్యం పాలేళ్ళతో తీయించి బస్తాలకు చేర్చి పిల్లల తో పెట్టించే వాళ్ళం .మా చిన్నప్పుడు మేమే పెట్టాం .ఇప్పుడు వారసత్వం గా వాళ్ళు .అదో సరదా గా చేసే వాళ్ళు .మధ్యాహ్నం పన్నెండు దాకా మేళ గాళ్ళు వస్తూనే ఉండే వారు .ఎవరికి లేదనకుండా పెట్టె వాళ్ళం .ఇంటి మంగలికి అందరి కంటే ఎక్కువ పావు బస్తా కు తగ్గ కుండా పెట్టె వాళ్ళం .రామ దాసు కూ అంతే, లోక నాధానికీ అంతే .లోక నాధం పిల్లలు మా అబ్బాయిలకు క్లాస్ మేట్లు కూడా .ఇస్తున్నా మనే గర్వం మాకు కాని తీసుకు వెళ్తున్నాం అనే న్యూనతా భావం వారి లో కాని ఉండేది కాదు .అదొక అవిచ్చిన్న సంప్రదాయం .ఇటీవలి కాలం లో అంటే సుమారు ఇరవై ఏళ్లుగా అలా,మేళ గాళ్ళేవరూ   ఇళ్లకు రావటం లేదు .వచ్చినా డబ్బులు ఇచ్చి పంపుతున్నాం .మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు లోక నాధం మేళం చేసే వాడు .లేక పోతే ఎవరి నైనా కుదిర్చే వాడు .అతని తర్వాత అతని తమ్ముడు లైన్ లోకి వచ్చాడు .ఇప్పుడెవరూ లేరు .రామ దాసూ ,లోకనాధమూ ఇద్దరు చని పోయారు .అంతా షాప్ లోకి వెళ్లి చేయిన్చుకోవటమే .తలంటి అనేది నిఘంటువు కే పరిమిత మై పోయింది .ఆ పదమే తెలీదు చాలా మందికి .మంగలి వారిలో వైద్యులు ఎక్కువ గానే ఉండే వారు ‘
ఉయ్యూరు లో మా గురువు గరుడాచలం మేస్టారి గారి తండ్రి మంచి వైద్యం చేసే వారని ప్రతీతి .ఆ ముసలాయన పొది పట్టుకొని ఇళ్ళ కు రావటం నాకు కొంత గుర్తుంది .అలాగే జగన్నాధం అనే ఆయన  కూడా ఇళ్లకు వచ్చి పని చేసే వాడు .మేళం ఉండేది .అప్పటికే ముసలి వాళ్లయి పోయారు .స్వారస్యం ఉండేది కాదు .అందుకని ఎవరింట్లోనైనా మేళం బాగా లేక పోతే ”ఇదేమిటి రా జగన్నాధం మేళం లా ఉంది ”అనటం అల వా టైనది .వ్రుత్తి ధర్మాన్ని పవిత్రం గా భావించి వారు ప్రవర్తించిన తీరు ప్రశంశ నీయం .వృత్తికి గౌరవంఇవ్వటం  ఇంకా మనకు పూర్తిగా అల వాటుకు రాక పోవటం బాధా కరం ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-9-12-కాంప్ –అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.