ఊసుల్లో ఉయ్యూరు –45
ఇద్దరు గ్రంధ సాంగులు
మా చిన్న తనం లోనే మాకు గ్రంధాలయా లపై మక్కువ కల్గించి మాతో మంచి పుస్తకాలను చదివించి ,ఎంతో ప్రోత్సహించి ,మాకు కావాల్సిన పుస్తకాలను ఇంటికి ఇస్తూ ప్రోత్సహించిన ఇద్దురు గ్రంధాలయ నిర్వాహకులు నాకు ఎప్పుడు గుర్తుకు వస్తారు సరదాకి వారిని ‘’గ్రంధ సాం గులు ‘’అన్నాను .ఇందులో దురుద్దేశామేమీ లేదు పై గా మిక్కిలి గౌరవం ఉంది వారిద్దరే జాన్ భాయ్ ,సత్యనారాయణ గార్లు
జాన్ భాయ్
నల్లగా ,ఎత్తుగా రివట లా పాంటు ,షర్టు వేసి పంచాయితీ లైబ్రరి కి గ్రంధాలయానికి అధికారిగా ఉన్న ఉండే వాడు మా జాన్ భాయ్ ..అతను క్రిస్టియన్ . అసలాయన కు పంచాయితీ లో గుమాస్తా ఉద్యోగం .కాని మా చిన్నప్పుడు పంచాయితీ గ్రంధాలయం ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఎదురు గా ఉన్న బిల్డింగ్ లో ఉండేది .అక్కడ దాదాపు ఏడెనిమిది చెక్క బీరువాల్లో పుస్తకాలు ఉండేవి. ..దిన, వార్తా, మాస పత్రికలు ఉండేవి . .సాయంత్రం స్కూల్ అయిన తర్వాతా కాసేపు ఆడుకొని మా మిత్ర బృందం తో లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం .అక్కడి పత్రికలూ చదివే వాళ్ళం .మేము రాగానే మాకు స్వాగతం పలికే వాడు జాన్ భాయ్ .’’పంతులు గారూ రండి’’ అని ఆహ్వానించే వాడు .అక్కడి బీరువాలు తెరిచి ఉంచే వాడు .ఫలానా పుస్తకం బాగుంటుంది చద వండి అని ప్రోత్స హించే వాడు .అక్కడే కూర్చుని చదివే వాళ్ళం .అవసరం వచ్చి తీసుకొని వెళ్ళాలని పిస్తే నాపేర పుస్తకం లో రాసుకొని ఇంటికి ఇచ్చే వాడు .జాన్ మా నాన్న గారికి సి.బి.ఏం.స్కూల్ లో శిష్యుడట .అతనే చెప్పాడు .అందుకని ఆ గౌరవం తో ,నమ్మకం తో పుస్తకాలు ఇంటికి ఇచ్చే వాడు .నేనూ అంత బాధ్యత గానే దాన్ని తీసుకొచ్చి చదివి ,అందులోని విషయాలకు మిత్రు లందరకు చెప్పి ఇచ్చే వాడిని .అతను సూచించిన పుస్తకాలన్నీ దాదాపు అక్కడ చదివాం .చాలా మంచి పుస్తకాలు ఉండేవి . .డికేన్సు రాసిన ‘’రెండు మహానగరాలు ‘’టాల్ స్టాయ్ రాసిన పుస్తకాలు ,కరుణశ్రీ పద్యాలు ,జాషువా రచనలు ,కృష్ణా పత్రిక సంపాదకీయాలు వగైరాలెన్నో మా తో చది వించాడు జాన్ భాయ్ .మాకు గ్రందాలయాభినివేశం కల్పించిన జాన్ భాయ్ ఔదార్యం ,ప్రోత్సాహం మరువ లేనిది .ఇప్పటికి గ్రందా లయం అంటే ఆరాధన భావం ఏర్పర టానికి అతడే కారణుడని నిర్ద్వంద్వం గా చెప్ప గలను .
తర్వాత ఈ పంచాయితీ గ్రంధాలయం సి.బి.ఏం.ఆసు పత్రీ కి ప్రక్క ఉన్న బ్రాహ్మణుల సత్రం లో కి మారింది .ఇది రెండస్తుల బిల్డింగు.కింద లైబ్రరి పైన పంచాయితీ ఆఫీసు ఉండేది .అక్కడికి వచ్చిన లైబ్రరి జనానికి దూరం అవటం వల్ల జనానికి పట్టేది కాదు .జాన్ కు ఆఫీసు పను లూ ఎక్కువ గా ఉండేవి .ఆఫీసు పని మీద ఎక్కడికో అక్కడికి వెళ్ళ వలసి వచ్చేది .కనుక లైబ్రరి లో ఉండే కాలం తక్కువ గా ఉండేది .అయినా మేము వెళ్తే అదే ఆప్యాయం తో ఆదరించే వాడు .అయితే అక్కడ విద్యుత్ సౌకర్యం లేక పోవటం వల్ల పెంద్రాళే దుకాణం కట్టేయాల్సి వచ్చేది .బాగా చీకటి పడే దాకా ఉండి ,పుస్తకాలు వెలుగు లో ఉంచుకొని చదువుకొనే వాళ్ళం .కొంచెం పెద్ద వాళ్ళ మయిన తర్వాతహిందూ ,ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్లు కూడా చదివే వాళ్ళం .పాపం జాన్ భాయ్ పనుల వత్తిడి లో చిక్కి శల్యం అయి నట్లు ,నీరసించి నట్లు కన్పించే వాడు .ఎప్పుడు చిన్న ఫ్లాస్క్ తీసుకొని అధికార్లకోసమో ,ప్రజా ప్రతి నిదులకోసమో కాఫీ కోసం సైకిల్ వేసుకొని తిరగటం నిత్య గంట కృత్యం గా కని పించేది .’’పంతులు గారూ అనే పలకరింపు పోయి మాస్టారూ ‘’అనే వాడు .యే మైనా మాకు గ్రంధ భిక్ష పెట్టిన వాడు మాత్రం జాన్ భాయ్ .అతను నవ్వుతు ఎప్పుడూ పలకరిస్తున్డటం ఇంకా స్పష్టం గా జ్ఞాపకం ఉంది .అయితే సుమారు ఇరవై ఏళ్ళ కింద జాన్ భాయ్ మరణించాడని విన్నాను .మా ఉయ్యూరు పంచాయితీ గ్రంధాలయం నిర్వహరణాదికారి నాకెప్పుడు ప్రాతస్మరనీయుడే .ఆతని తర్వాతఆ లైబ్రరి ని పట్టించుకొనే వారు లేక పోయారు .లైబ్రరి ని తీసే వారే కరువై క్రమం గా అది కను మరుగై పోయింది .దాని అభి వృద్ధి కోసం ఆకాలం లో సర్పంచ్ గా ఉన్న నా శిష్యుడు ప్రస్తుత శాసన మండలి సభ్యుడు శ్రీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ కు తరచు చెప్పుతూ ఉండే వాడిని .అది బధిర శంఖా రావం అయింది ..అరుదైన పుస్తకాలున్న ఆ గొప్ప గ్రంధాలయంఇలా కాల గర్భం లో కలిసి పోవటం చాలా విచారం గా ఉంది .ఆ పుస్తకాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు .
చిన్న వాడైన సత్య నారాయణ .
సుమారు యాభై ఏళ్ళ క్రితం మా ఉయ్యూరు లో జిల్లా గ్రంధాలయ సంస్థ ఒక శాఖ నుఏర్పాటు చేసింది .అది మా బజారులోనే సీతం రాజు సత్య నారాయణ గారి రోడ్డు మీదే ఉన్న పెంకు టింట్లో ఉండేది .ఎర్రగా పొట్టి గా ఖద్దరు లాల్చీ ,పైజమా వేసి ముఖాన యెర్రని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొనే సత్య నారాయణ అనే చిన్న వాడు అధికారి గా ఉండే వాడు మంచి వాడు బ్రాహ్మణుడు .నిదానస్తుడు కొంచెం కీచు గొంతు తో మాటలాడే వాడు .అప్పుడే తెలుగు స్వతంత్ర ,ప్రకాశం గారి దిన పత్రిక ,ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా పత్రిక ,భారతి ,ప్రజా మిత్ర మొదలైనపత్రికలూ చదివే వాళ్ళం .లైబ్రరి పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళ టానికి చందా అయిదు రూపాయలే అది కట్టిచందా దారులు గా చేరాం .కావాల్సిన పుస్తకాలు తీసుకొని వెళ్లి చదివే వాళ్ళం .అతను మంచి పుస్తకాలు ఎంపిక చేసి మాకు ఇచ్చే వాడు స్దత్య నారాయణ .మాకు ఆత్మీయుడి గా ఉండే వాడు .ఇక్కడే మేము చాలా పుస్తకాలు చదివాం .శ్రీ దేవి కాలా తీత వ్యక్తులు , నవలా ,కొమ్మూరి వారి నవలలు ,చలం పుస్తకాలు ,విశ్వనాధ ,బాపి రాజు ,కరుణశ్రీ రచనలు ,గోరా శాస్త్రి రచనలు చదివే అరుదైన అవకాశం పొందాం .రాజ కీయాలు చదివాం .వైవిధ్యం ఉన్న రచనలు చదివే అదృష్టం కూడా లభించింది ..అతను చాలా ఓర్పుగా ,నేర్పుగా నిర్వహించే వాడు .అయిదు రూపాయల సభ్యత్వం చాలా ఏళ్ళు కోన సాగింది .ఆ తర్వాతా పది రూపాయలు ,తర్వాతా ఏభై ,ఇప్పుడు వంద రూపాయలు అయింది .లైబ్రరి ఇక్కడి నుంచి కాపుల వీధి రామాలయం దగ్గరకు చేరింది .అక్కడ చాలా ఏళ్ళు ఉంది .వర్షానికి పుస్తకాలు దెబ్బ తినేవి .లైబ్రేరియన్లు ఎందరో మారారు .నాంచారయ్య మొదలైన వారు అభి వృద్ధికి దోహదం చేశారు .మేము తెలుగు ఏం యే .చేసే టప్పుడునాకు,మిత్రుడు స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు కురిఫెరెన్సు పుస్తకాలు ఇంటికి తీసుకొనే అవకాశం కల్పించారు అవి మా చదువు కు ఎంతో దోహదం చేశాయి . ఆ తర్వాత ఒకాయన ఇక్కడ పని చేశారు .ఆయన పదవిలో ఉండే, ఆకస్మికం గా మృతి చెందారు .దాదాపు ఐదారేళ్ళు గ్రందాలయాదికారే లేరు .ఆ నాటి శాసన సభ సభ్యులు స్వర్గీయ అన్నే బాబూ రావు గారికి అనేక సార్లు చెప్పాను .రాజేంద్ర ప్రసాద్ దృష్టికి కూడా తీసుకొని వెళ్లాను .కాని ఏమీ లాభం లేక పోయింది .ఆ తర్వాతఇన్చార్జి లను వేయటం ఆ తర్వాతా సుజాత గారిని లైబ్రేరియన్ గా వేశారు .ఆమె బాగా పని చేశారు .అప్పుడే జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ గొర్రె పాటి గోపీ చంద్ ,రాజేంద్ర ప్రసాద్ గార్ల కృషి వల్ల శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి భారీ ఆర్ధిక సాయం(అయిదు లక్షల రూపాయలు ) వల్ల హైస్కూల్ కు సమీపం లో ,పశువుల ఆస్పత్రికి దగ్గర్లో యే.సి.గ్రంధాలయం ఏర్పడింది ..దాని నిర్మాణ కమిటీ లో రాజేంద్ర ప్రసాద్ నన్ను కన్వీనర్ ను చేశాడు .ఆరు నెలల్లో దాన్ని సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దాం ఆ నాటి ముఖ్య మంత్రి శ్రీ చంద్ర బాబు దక్షిణ దేశం లోనే మొదటి యే.సి.లైబ్రరి అయిన .ఈ లైబ్రరి ని తన చేతులతో ఆవిష్కరించాలని ఉవ్విల్లూరారు .కాని ఎన్నికలలో ఓటమి పాలైనందు వల్ల 2004 జూలై ఎనిమిది న కొత్త మంత్రు లైన కోనేరు రంగా రావు ,స్వర్గీయ జక్కం పూడి రామ మోహన రావు వగైరామంత్రులు శాసన సభ్యులు ,రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది .సుమారు లక్ష రూపాయల విలువ గల అరుదైనరిఫెరెన్స్ పుస్తకాలను లైబ్రరీకి అందించారు గోపాల కృష్ణ గారు .కుటుంబ సమేతం గా అమెరికా నుంచి వచ్చి ప్రారంభోత్సవ సమా వేశానికి గోపాల కృష్ణ గారు హాజరయ్యారు .ఇంకో లక్ష ఖర్చు పెట్టి సభా కార్యక్రమాలు నిర్వ హించారు .సాహిత్య సభలు అక్కడే నిర్వ హిస్తున్నాం ..చిన్న వాడైన సత్య నారాయణ నాటిన గ్రంధాలయ బీజం మహా వృక్షమై ఫల పుష్పాలతో వర్ధిల్లుతోంది .కనుక సత్యనారాయణ కృషికి జోహార్లు .ఇలా ఇద్దరు గ్రందాలయాదికారులు జాన్ భాయ్ ,సత్యనారాయణలు చిరస్మరణీయ గ్రంధాలయ సేవ చేసి మా ఆదర పాత్రులయారు .వారిని స్మరించి నేను ధన్యుడి నయ్యాను .అందుకే వారు గ్రంధ సాంగులన్నాను
సశేషం —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—28-12-12-ఉయ్యూరు