నా దారి తీరు -9
బదిలీ ప్రయత్నాలు –నిలుపుదల –అయిన బదిలీ
మోపిదేవి లో పని చేస్తుండగా ఒక సారి ఉయ్యూరు లో నా తో పాటు హైస్కూల్ లో చదివిన నా స్నేహితుడు గండి వాసు అనే తూర్పు కాపుల కుర్రాడు నాతో మాట్లాడుతూ ‘’ఏమయ్యా !మోపిదేవి లోనే ఉండి పోతావా /ఉయ్యూరు రావా ?’’అన్నాడు అప్పుడు నాకు ఓహో మనం ఉయ్యూరు రావాలి కదా అనే ఆలోచన కలిగింది .అతనే ఇంకోసారి ‘’నీకు రావాలని ఉంటె చెప్పు .మనకు తెలిసిన ఒక పెద్దాయన కపిలేశ్వర పురం లో ఉన్నారు మనంఎంత చెబితే అంత ట్రాన్స్ఫర్ చేయించి పెడతారు ‘’అన్నాడు సరే నన్నాను .ఈ విషయం మా హెడ్ మాస్టారు కోటేశ్వర రావు గారితో చెప్పాను.ఆయన’’ప్రసాద్ గారూ ! మా అమ్మాయి ప్రభావతి ఎస్.ఎస్.ఎల్.సి. క్లాస్ కు వచ్చింది మీరే సైన్సు చెప్పాలి కనుక ఈ సంవత్సరం ఇక్కడే ఉండి పొమ్మని కోరుతున్నాను .ఒక వేళమీరు ప్రయత్నాలు చేసినా నేను వెళ్ళనివ్వను ‘’అన్నారు నా శ్రేయోభిలాషి, నా మీద అంత నమ్మకం ఉన్న ఆయన మాట నేనుకాదన లేక పోయి ఆ ఏడాది ఉండి పోయాను .కోటేశ్వర రావు గారి దగ్గర బంధువు తూమాటి బాల కోటేశ్వర రావు లాయరు .సోషల్ వర్కర్ కూడా .అవని గడ్డ లో ఉండేవారు అవని గడ్డలో అప్పుటి రాజకీయ నాయకులలో సనక బుచ్చి కోటయ్య గారు అన్నప రెడ్డి సత్యనారాయణ ,మండల రామారావు గార్లు భోగాది దుర్గా ప్రసాద్ ప్రసిధులు కొమరగిరి కృష్ణ మొహాన రావు గారికి అవని గడ్డలో ఒక హోటల్ ఉండేదని విన్నాను అలాగే జాగృతి వార పత్రికలో రాసే ఒక మీసాల లావు ఆయనదీ అవని గడ్డ ఏ .మాస్కూల్ లో నాన్చారయ్య అనే పదో తరగతి కుర్రాడు జెనరల్ నాలెడ్జి లో భలే తెలివి తేటలు చూపేవాడు అతన చేతిలో ఎప్పుడూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఉండేది అంత చురుకైన కుర్రాడు .
నెహ్రు మరణం –లాల్ బహదూర్ ప్రధాని – గుంటూరులో కాంగ్రెస్ సభలు –
మోపిదేవిలో పని చేసినప్పుడే గుంటూర్ లో అఖిల భారత కాంగ్రెస్ సభలు రంగ రంగ వైభవం గా జరిగాయి కాసు బ్రహ్మా నంద రెడ్డి అప్పుడు ఆంధ్రా చీఫ్ మినిస్టర్ .మా పెళ్లి అయిన ఏడాదే పంచాయితీ ఎన్నికలు జరిగాయి ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు వేసవిలో చని పోయాడు ఎన్నికలు వాయిదా పద కుండా జరిగాయి అదే నేను ఎన్నికల విధి నిర్వహణ లోమొదటి సారిగా . పాల్గొనటం మోపిదేవి దగ్గర నాగాయ తిప్ప ఎన్నికలకు వెళ్లాం రాజ మర్యాదలు చేశారు .ఏ గొడవా లేకుండా నిర్వహించాం నిజాయితీకి నిలువు అడ్డం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు తాష్కెంట్ లో ఆయన అకస్మాత్తు గా మరణించారు కామరాజ్డులు తెరవంక ప్రయత్నం చేసి ఇందిరా గాంధి ని గద్దె పై కూర్చో బెట్టారు ఆమె ఆధ్వర్యం లోనే గుంటూరు కాంగ్రెస్ సభలు జరిగిన జ్ఞాపకం .
అతి రహస్యం కాపాడాను
ఉయ్యుర్లో మా ఇంటి దగ్గరే దేవుల పల్లి వారింట్లో అంటే వెంపటి శర్మ గారింట్లో ఉయ్యూరు హై స్కూల్ లో హెడ్మాస్టర్ గా పని చేస్తున్న శ్రీ రాళ్ళబండి సత్యనారాయణ గారుండే వారు .ఆయన నా గురించి తెలుసుకొని నన్ను ఒక సారి ఇంటికి పిలిపించుకొన్నారు ఆ రోజుల్లో డిటేన్షన్న్ విధానం ఉంది మార్కులోస్తేనే ప్రమోషన్ ఉండేది .కనుక మేస్టార్లు తమ దగ్గర ప్రైవేట్ చదివే విద్యార్ధులకు పరీక్షల్లో ఎక్కువ మార్కు లేసి తప్పి పోకండా జాగ్రత్త పడే వారు . అన్ని రకాల అవినీతికి ఆస్కారం ఉండేది సత్యనారాయణ గారికి అప్పుడు ఉయ్య్రు హైస్కూల్ లో పని చేసే ఎ మాస్టర్ మీదా నమ్మకం ఉండేది కాదు .అందుకని వేసవిలో తానే ఇంటి దగ్గర మార్కుల లిస్టులు దగ్గర పెట్టుకొని మార్కులరిజిస్టర్లో పోస్ట్ వేసుకొనే వారు ఆయన నన్ను తనకు సహాయం చేయమన్నారు ఇదంతా సీక్రెట్ గా జరగాలని చెప్పారు ‘’నిన్ను చూస్తె నాకెందుకో నా మాట మీద గౌరవం తో రహస్యం గా ఉంచుతావనే నమ్మకం కలిగింది .నాకు హెల్ప్ చేయండి ‘’అన్నారు అలానే రెండేళ్ళు వారికి సహాయ పడ్డాను వారమ్మాయి వివాహం జరిగితే మా ఇంట్లోనే విడిది ఏర్పాటు చేశాం ఆయన చాలా లావుగా ఎత్తుగా ,గంభీరం గా పంచ ,లాల్చి తో నెహ్రు కోట్ పైన వేసుకొని ఉండే వారు సైకిల్ మీద స్కూల్ కు వెళ్లి వచ్చే వారు నాతో పని ఉంటె వాళ్ళ అమ్మాయితో మా ఇంటికి కబురు చేసే వారు .నా పని తీరు మెచ్చి ఒక సారి ‘’I want to help you gentleman ‘’అన్నారు అయన నాకేమి సహాయం చేస్తారా అని నేను ఆశ్చర్య పోయాను ఏదో మాట వరసుకు అని ఉంటార్లే అనుకోని మర్చి పోయాను
పొలం నూర్పిడులలో మాధవ ,శ్రీరామ మూర్తి సహాయం –డబ్బాకేమేరా
కాటూరు పొలం నూర్పిడులలో నాకు సహాయం చేయటానికి ఒక ఏడు శ్రీరామ మూర్తి ,మాధవ వచ్చి సంక్రాంతి సెలవుల్లో వచ్చి పది రోజుల పై గా ఉండి పోయారు అప్పుడు పొలం కుప్ప నూర్చటానికి పది రోజులు పట్టేది. నాకు కాఫీ టిఫిన్ తేవటం ,అన్నం కారియర్లో తెచ్చివ్వటం ,నా తో పాటు పొలం లో కాపలా పడుకోవటం వాళ్ళు చేసి నాకెంతో సాయం చేశారు .మా పెళ్ళికి మా చిన్న బావ గారు ఒక నల్లటి’’ కోడాక్ డబ్బా కెమెరా’’ బహుమతి గా ఇచ్చారు .దానితోనే ఫోటోలు చాలా తీశాను .దాని ఖరీదు అప్పుడు పాతిక రూపాయలు ఇప్పటికి జాగ్రత్త గానే ఉంది .పొలం లో వీల్లిద్దరితో ఫోటోలు తీసుకొన్నాం మా వేదవల్లి వాళ్ళు కూడాపొలం వచ్చారు .ఇదో వింత అనుభవం ఏ నాటి రుణానుబంధమో మాతో మాధవ్, శ్రీరామ మూర్తిలది వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టినట్లు గుర్తు .మా వివాహాన్ని వీరిద్దరూ దగ్గ్గరుండి జరిపించారు .మా ఆవిడను ‘’పిన్ని గారూ పిన్ని గారూ ‘’అని పిలిచే వారు .ఇప్పటికీ అదే ఆత్మీయత వారిది .మహా సరదా గా ఉన్నారు ఎంతో సహాయం చేశారు అన్నీ తామే అయి ప్రవర్తించి మా అమ్మా వాళ్లకు ఏ ఇబ్బందీ కలక్కుండా చేసిన ఈ జంట మిత్రుల గురించి ఎంత చెప్పినా తక్కువే .
శ్రీ కొల్లిపర సూరయ్య గారి మాట –ఉయ్యూరు బదిలీ
ఒక సారి మా ఫ్రెండ్ వాసు నన్ను వేసవిలో కపిలేశ్వర పురం లో ఉన్న మాజీ శాసన సభ్యులు శ్రీ కొల్లిపర సూర్య గారి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు ఆయన చాలా సహృదయులు .ఎంతో మర్యాద చేశారు గుబురు మీసాలు ఖాదీ వస్త్ర ధారణా .గాంధీ గారి అనుయాయి .వాసు బదిలీ విషయం చెప్పాడు ఆయన ‘’మేస్టారూ !ఇప్పుడు జిల్లా బోర్డు ప్రెసిడెంట్ మాగంటి అంకినీడు .అయన కు చెప్పినా పని కాదు .ఒక వేళ బదిలీ చేసినా సాయంకాలం దాకా అది నిలబడని అనిశ్చిత మనసు అతనిది . .ఒక్క నెలలో మాంచి కుర్రాడు బాగా అవగాహన ఉన్న వాడు రుద్రపాక పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్ పిన్నమ నేని కోటేశ్వర రావు జిల్లా బోర్డ్ ప్రెసి డెంట్ అవుతాడు అతను సంస్క్కారి అతను అన్నమాట నిల బెట్టుకొనే రకం .కనుక అప్పుడు నేను మిమ్మల్ని బదిలీ చేయిస్తాను మీ డైరీలో స్కూల్ తెరిచే సరికి ఉయ్యురులో ఉన్నట్లు ఈ రోజే రాసుకోండి ‘’అని భరోసా ఇచ్చారు .అంత గొప్ప మనసు వారిది .నేనూ నా ప్రయత్నాలు చేశాను .ఆఫీసులో గుమాస్తా లు ఫైల్ పుటప్ చేస్తారు వాల్లేదైనాకొర్రి పెడతారేమో నని మా లాబ్ అసిస్టంట్ భాస్కర రావు నన్ను బందరు కు తీసుకొని వెళ్లి అక్కడి ఆఫీసులో పని చేసే క్రుపారావు దగ్గరకు తీసుకు వెళ్లి పరిచయం చేసి పాతిక రూపాయలు ఇప్పించాడు ఆయన తాను అంతా చూసుకొంటాను అని హామీ ఇచ్చాడు మా హెడ్ మాస్టారూ తన నోటి సాయం చేశారు .పిన్నమనేని బోర్డు అధ్యక్షులైన కొద్ది రోజులకే జరిగిన మొదటి బాచ్ ట్రాన్స్ ఫర్లలో నా కు మోపి దేవి నుంచి ఉయ్యూరు హైస్కూల్ కు బదిలీ అయింది .అందరు సంతోషించారు .ఇక్కడ ఒక తిర కాసు జరిగింది ఉయ్యురులో అప్పుడు సైన్సు పోస్ట్ కు ఖాళీ లేదు అందుకని ఇక్కడి హెడ్ మాస్టారు తనకు లెక్కలు సైన్సు చెప్పే వాళ్ళు కావాలని ప్రత్యేకం గా ఒక లెటర్ రాశారట .దాని ప్రకారం లెక్కలు ఎక్కువ గా చెప్పాల్సిన అవసరం కలిగింది .అలా ఖాళీ లేదని తోసేయకుండా లెక్కల పోస్ట్ లో నన్ను వేశారన్నమాట అదీ రాళ్ళ బండి సత్యనారాయణ గారు చేసిన గొప్ప సాయం .ట్రాన్స్ఫర్ అవగానే సూరయ్య గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పి వచ్చాం నేను వాసు .వాసుకేమైనా డబ్బు ఇవ్వాలని పించింది .ఇస్తే తీసుకో లేదు ఆ తర్వాతా ఎప్పుడో ఒక వంద రూపాయలు జేబులో కుక్కాను .సూర్య గారికి వాసు కుటుంబం బాగా పరిచయం వారికి కావలసిన ఊరగాయలన్నీ పెట్టి పంపించే వారట వాసు వాళ్ళు .వాసు నాన్న, అన్న నాగేశ్వర రావు మామిడి తోటలు కొని కాయలు దిగుమతి చేసి మార్కెట్ కు వేసే వారు .వాసు తర్వాతా నెమ్మదిగా మందుకు బానిసై పోయాడు ఎప్పుడు రక్తం చిమ్మినట్లుండేకళ్ళ తో ఉండే వాడు నన్ను ‘’బ్రదర్ ‘’అని పిలిచే వాడు మంచి మనిషి వాళ్ళ నాన్న కూడా బాగా పరిచయమే .
మోపిదేవి లో నాకు ఘనమైన వీడ్కోలు సభ జరిపారు అందరికి కృతజ్ఞతలు చెప్పాను హేద్మాస్తారి అమ్మాయి స్కూల్ ఫాస్ట్ వచ్చింది సైన్సు లో చాలా ఎక్కువ మార్కులోచ్చాయి ఆమె డాక్టరీ చదివి పాసైంది ఆమె తమ్ముడు రామ కృష్ణ కూడా బాగా చదివి ఉన్నత ఉద్యోగం సంపాదించాడని విన్నాను ..ఇలా నా జీవితం లో నా మొదటి స్కూలు మోపిదేవి ఎన్నో జ్ఞాపకాలకు నిలయ మైంది .ఎప్పుడు అటు వెళ్ళినా మోపిదేవి శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామిని దర్శించటం ఒక అలవాటు గా మారింది .నరసింహారావు లెక్కల మేష్టారు ,తెలుగు మేస్టర్ సత్యనారాయణ (గోపాల కృష్ణ అని ఇప్పటి దాకా రాశాను పొరబాటు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది అయన పేరు సత్యనారాయణ—అదే మా ‘’వాసన మేష్టారు ‘’),పెదప్రోలు కాపురం ,అడవి శ్రీరామ మూర్తి కృత్తి వెంటి మాధవ ,శ్రీరామ మూర్తి తల్లి గారు వారింట్లో నాకు అన్నం వండి పెట్టి అన్నపూర్ణ గా ఆదరించిన తీరు, నా బోధనా విధానం మెరుగు పరచుకొన్న విధానం, హెడ్ మాస్టర్ గారు శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారికి నాపై ఉన్న అభిమానం ,నమ్మకం, నాపై చూపిన గౌరవం, ఇవన్నీ అక్కడి తీపి గుర్తులు .
సశేషం
మీ –గబ్బిట.దుర్గా ప్రసాద్ -25-2-13-ఉయ్యూరు