మహా శివ రాత్రి –శత రుద్రీయం
మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో పదకొండు అనువాకాలు ఉన్నాయి .ఈ ఇరవై రెండు అనువాకాలను కలిపి ‘’రుద్రాధ్యాయం ‘’అంటారు .దీనికే మరో పేరు ‘’శత రుద్రీయం ‘’.అంటే అపరిమిత శివ రూపాలు అని అర్ధం .మహా భారత యుద్ధ ప్రారంభం అప్పుడు అర్జునుడు భయ కంపితుడై శస్త్ర అస్త్రాలను లను కింద పడేసి భీరువు లా ఏడుస్తూ ఉంటె శ్రీ క్రిష్ణ భగవానుడు ధైర్యం చెప్పి ‘’గీత ‘’ను ఉపదేశించిన సంగతి మనకు తెలుసు .దీనిని ‘’’’ సాం గ్రామికం ‘’అంటారు .అశ్వత్థామ శ్రీ కృష్ణ ,అర్జునులపై బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని భీష్మ పర్వం లో ప్రయోగించినప్పుడు అది వారినిద్దరినీ ఏమీ చేయలేక పోయింది .అప్పుడు ద్రోణ సుతుడు వ్యాస భగవానుడిని ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమైనాడు .అశ్వత్థామ తన అస్త్రం ఎందుకు విఫలమైందని అడిగాడు .దానికి వ్యాసభగవానుడు పూర్వ జన్మ లో కృష్ణుడు, అర్జునుడు శివలింగాన్ని పూజించారని ,అశ్వత్థామ శివుని ప్రతిమను అర్చిన్చాడని ,లింగాభిషేకం సకల శ్రేయోదాయకం అని ,దాని ఫలితం గొప్పదని అంతటి ఫలితం ప్రతిమా పూజ వలన లభించ దని తెలియ జేశాడు .అందుకే శివలింగానికే పూజా, అభిషేకము చేయాలి .ద్రోణుడు మరణించిన తర్వాత మహా శివుని విభూతిని గొప్పగా ఆవిష్కరించి అశ్వత్థామకు వివ రించాడు .అలాగే అర్జునునికి మరో సారి శివుని మహత్వాన్ని వివరించాడు .వ్యాసుడు చెప్పిన ఈ విషయాలన్నీ ‘’శత రుద్రీయం ‘’అంటారు .కనుక భగవద్ గీత లాగే శత రుద్రీయం కూడా ‘’సాం గ్రామికం ‘’అని పించు కొంది.
శత రుద్రీయం అమృతత్వ సాధనం అని ‘’జాబాల శ్రుతి’’ చెప్పింది .’’నమశ్శివాయ శివ తరాయచ ‘’లో పంచాక్షరి మంత్రం ఉంది .శివ అంటే అవాజ్మానస గోచమయిన సత్య ,జ్ఞాన ,ఆనంద లక్షణం ఉన్న పర బ్రాహ్మయే. కనుక శివ అంటే అమృత భావన .అంటే శ్రీ విద్యా పరం కూడా .నమకం లో మొదటి అనువాకం లో అన్ని వ్యసనాలకు మూలం అయిన క్రోధానికి నమస్కారం చెప్ప బడింది .తరువాత బాధ కలిగించే బాణానికి ,దాన్ని పూరించే ధనుస్సుకు ,దాన్ని సంధించే చేతులకు నమస్కారాలు చెప్పారు .అంటే ఈ జగత్తు ను లయం చేసే రుద్రుడైన శివుని’’ ఘోర రూపం’’ వర్ణించ బడింది .శివుడు ‘’అఘోర రూపం’’ లో కూడా ఉంటాడు . రెండవ అనువాకం లో సుఖాన్ని కలిగించే ‘’శాంత స్వభావం ‘’వర్ణించ బడింది .ఎనిమిదవ అనువాకం లో ‘’శివ పంచాక్షరి ‘’మంత్రం ఉంది .ఇది బంధ విచ్చేదనం చేసే సాధనం అయి ,జ్ఞానాన్ని ఇచ్చి ,ముక్తిని కలిగిస్తుంది . ఈ ఎనిమిదవ అనువాకం రుద్రాధ్యాయ మాలలో మణి పూస గా నిలిచింది .
నమకం లో మొదటి అనువాకం ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః’’-నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం నమః ‘’అనే మంత్రం తో ప్రారంభ మవ్తుంది .క్రోధం నశిస్తే శాంతి లభిస్తుంది .శాంతి ఉంటె అన్నీ ఉన్నట్లే .అందుకే జగత్ ను పరి పాలించే ,మహా విష్ణువు ‘’శాంతా కారం భుజగ శయనం ,పద్మ నాభం సురేశం-విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం ‘’అనీ ,లయ కారకుడైన మహా దేవుడిని ‘’శాంతం పద్మాసనస్తం శశి ధర మకుటం పంచ వక్త్రం త్రినేత్రం ‘’అనీ ‘’శాంతం’’ అనే ముందు మాట తోనే స్తుతిస్తాం .చమకం ‘’అగ్నా విష్ణూ సజోష సేమా వర్ధంతు వాంగిరః –ద్యుమ్నై ర్వాజేభి రాగతం ‘’అనే మంత్రం తో ప్రారంభ మవుతుంది .నమకం లో శివునికి నమస్కారాలు ఉంటె చమకం లో శివుడిని అర్దించే విషయాలు కో కొల్లలు గా ఉన్నాయి .ఇందులో ‘’చమే ‘’అనే మాట అనేక సార్లు వస్తుంది .అంటే ‘’కూడా నాకు కావాలి ‘’అని అర్ధం .’’కల్పతాం’’ అనే మాట లో’’ కలుగు గాక ‘’ అనే అర్ధం ఉంది .రుద్రీయం లో రెండు వాక్యాలున్న మంత్రాలను’’ రుక్కులు ‘’అని,ఒకే వాక్యం ఉన్న మంత్రాలను ‘’యజుస్సు ‘’లని అంటారు .
రుద్రుడు అంటే ?
రుద్రుడు అంటే రోదసి లేక అంతరిక్షం (ఈధర్ )కు అధిపతి .పదకొండు రూపాలలో వ్యక్తమయ్యే అంతరిక్ష దేవత .అంత రిక్ష రుద్రులు పద కొండు మంది.వీరికి’’ ఏకాదశ రుద్రుల’’ని పేరు . వీరిని ‘’gods of vibration ‘’అంటారు .దివికి సంబంధించిన దేవతలు పన్నెండు మంది వీరిని ‘’ద్వాదశాదిత్యులు’’ అంటారు .వీరికి ‘’gods of radiation ‘’అని పేరు .పృధివి లేక భూమి కి సంబంధించిన దేవతలు ఎనిమిది మంది .వీరిని’’ అష్ట వసువు’’లంటారు .’’gods of materialization ‘’అని వీరిని పిలుస్తారు .ఈ సంఖ్యలను బట్టే ‘త్రిష్టుప్ ‘’అనే పద కొందు అక్షరాల ఛందస్సు ,’’జగతి ‘’అనే పన్నెండు అక్షరాల ఛందస్సు ,’’గాయత్రి ‘’అనే ఎనిమిది అక్షరాల ఛందస్సు ,పదహారు అక్షరాల ‘’అనుష్టుప్ ‘’ఛందస్సు లు ఏర్పడ్డాయి .
‘’శివ తమా ‘’అనే మంత్రం లో శివ తమ అంటే శివత్వమే .అంటే మోక్షమే నన్న మాట .రుద్రుడు ధరించే ధనుస్సు మొదటి సగం మన శిరస్సు లో బ్రహ్మ రంధ్రం నుండి ముందు వైపుకు భ్రూ మద్యం వరకు ఉంటుంది .ఇక్కడే ‘’మన్యువు ‘’అనే శక్తి ఉంటుంది .శివధనుస్సు రెండవ సగం బ్రాహ్మ రంధ్రం నుంచి మెడ వరకు ఉంటుంది .మన కను బొమల నుండి మెడ వరకు అడ్డంగా పుర్రె పై వ్యాపించి ఉన్న రేఖ యే’’ శివ ధనుస్సు’’ గా భావిస్తారు .అందుకే శివుడు కపాలాన్ని చేత ధరిస్తాడు .అది సంకేతం అన్న మాట .అలాగే ఆకాశం లో ఉదయం నుంచి అస్తమయం దాకా సూర్యుని దారి ఒక చాపం ‘’ఆర్క్’’ లాగా ఉంటుంది . ఇది కూడా శివ ధనుస్సుయే.దీని వలన పగలు ,రాత్రి ఏర్పడతాయి .శివుడు కాల స్వరూపుడు అందుకే ‘’మహా కాలుడు’’ అన్నారు .మనస్సు ,ఇంద్రియ ప్రవృత్తులు ,కపాలం నుండి రుద్ర గ్రంధి వరకు అంటే ‘’మెడుల్లా ‘’ మీదుగా పని చేస్తాయి .అయిదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు ,మనసు ను ఆశ్రయించిన రుద్రుని పదకొండు రూపాలే శివుని పదకొండు బాణాలు .
మహాశివ రాత్రి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-14-ఉయ్యూరు
Super explanation. Excellent article