భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )
జుబైదా దావూది
మౌలానా షఫీ దావూది భార్య అయిన జుబైదా దావూది బ్రిటిష్ వారి తో పోరాడిన దీర వనిత .సహాయ నిరాకరణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది .భర్త ,బంధువులకు చెందిన విదేశీ వస్త్రాలు సేకరించి బహిరంగం గా కాంగ్రెస్ ఆఫీస్ వద్ద తగల బెట్టింది .ఇంటింటికి తిరిగి విదేశీ వస్త్రా లను పోగు చేసి తగల బెట్టించేది .బహిరంగ సభల్లో ధైర్యం గా పాల్గొని ఉత్సాహ పూర్వక ప్రసంగాలు చేసి మహిళలను స్వాతంత్రోద్యమం లో భాగస్వాములను చేసింది .ఉద్యమం తారా స్తాయిలో ఉన్నప్పుడు విద్యార్ధులు స్కూళ్ళు ,కాలీజీలు మానేస్తే ,వారికోసం ఆమె భర్త మౌలానా షఫీ ప్రత్యేకం గా ఒక స్కూల్ ను ఏర్పాటు చేసి చదువు నేర్పించాడు .జుబేదా వారికి భోజనం వసతి సౌకర్యాలు సమకూర్చేది .
అజిజాన్
1832లో లక్నో లో పుట్టిన అజిజాన్ ముస్లిం స్వాతంత్ర్య యోధురాలు .సారంగి మహల్ లో ఉమ్రావ్ జాన్ తో ఉండేది .1857జూన్ నాలుగున హిందూ ముస్లిం లు ఏకమై ఐక్యం గా కలిసి తనతో పాటు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించటానికి కలిసి రమ్మని నానా సాహెబ్ పిలుపు నిచ్చాడు .ఆ పిలుపుకు వెంటనే స్పందించిన అజిజాన్ నానాసాహెబ్ తో కలిసి తెల్ల వాళ్ళపై పోరాటం చేసింది .మహిళా సైన్యాన్ని ఏర్పరచి నాయకత్వం వహించింది .యుద్ధనైపుణ్యం బాగా తెలిసిన అజిజాన్ మిగిలిన మహిళలకు యుద్ధ సామగ్రిని ఎలా ఉపయోగించాలో శిక్షణ నిచ్చి నేర్పింది .బ్రిటిష్ సైన్యం పై ఒక కన్ను ఎప్పుడూ వేసి ఉంచి ,వారి ఆను పానులను స్వాతంత్ర్య సమార యోధులకు ఎప్పటికప్పుడు తెలియ జేసేది .అయితే ఆమె ను వెంబడించిన బ్రిటిష్ వారు ఆమెను బంధించి జెనరల్ హావ్ లాక్ ముందు నిల బట్టారు .చేసిన తప్పులు ఒప్పుకొంటే క్షమిస్తానని హావ్ లాక్ అన్నాడు .ఆమె తిరస్కరించింది .వారి చేతుల్లో అజిజాన్ వీర మరణం పొందిన అసామాన్య పోరాట యోధురాలు .
అంజది బేగం
మౌలానా అహ్మద్ ఆలి జోహార్ భార్య అంజది బేగం .రాంపూర్ లో ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ.భర్త జోహార్ రాజకీయ తాత్విక ఆలోచనలను అనుసరించింది .భర్త తో బాటు అనేక సమావేశాలకు వెళ్ళేది .సత్యాగ్రహ ఉద్యమానికి ,ఖిలాఫత్ ఉద్యమానికి ధన సేకరణ చేసి అందించేది .మహాత్మా గాంధి గారి ప్రయాణపు ఖర్చులన్నీ తానె స్వయం గా భరించి ఆయన సభలను ఏర్పాటు చేయించి ప్రజలలో జాతీయ ఉద్యమ స్పూర్తి కలిగించిన సేవా పరాయణురాలు అం జది బేగం .
సాదత్ బానో కిచ్లూ
సాదత్ బానో కిచ్లూ డాక్టర్ షఫియుద్దీన్ కిచ్లూ భార్య .ఉర్దూ ,పర్షియన్ భాషల్లో గొప్ప పాండిత్యం ఉన్న మహిళ .అనేక కవితలు,రచనలు చేసి , ప్రచురించి ప్రజల్ని ప్రభావితం చేసింది .దీనికి ఏంతో ధైర్యం కావాలి .ఆ నాటి సంఘం పరిస్తితులలో ఒక ముస్లిం మహిళ ఇలా బహిరంగం గా కవిత్వం రచనలు చేసి తన మనో భావాలను బయట పెట్టటం నేరం అని మత పెద్దలు భావించే రోజులవి .1920లో భర్త కిచ్లూ అరెస్ట్ అయినప్పుడు ఆమె ‘’దేశ సేవలో నా భర్త జైలుకు వెళ్ళటం నాకు గర్వం గా ఉంది ‘’అని ప్రకటించిన ధీరో దాత్తురాలు సదాత్ బానో .’’దేశం కోసం వ్యక్తీ చేసే త్యాగం వెయ్యి జన్మలెత్తిన భాగ్యం ‘’అనేది .సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేది .భర్త స్థాపించి,చైర్మన్ గా ఉన్న ‘’స్వరాజ్ ఆశ్రమం ‘’లో సేవలందించింది .
జులేఖా బేగం
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి భార్య జులేఖా బేగం .చాలా ధైర్య సాహసాలున్న మహిళ .కలాం గారు గాంధి గారి నాయకత్వం లో స్వరాజ్య ఉద్యమం లో ముందుకు దూసుకు పోతున్నప్పుడు ,ఇంటికి దూరమై జైలు పాలైనప్పుడు ఆమె ఎన్నో ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నది కాని ఏనాడు భర్త మార్గానికి అడ్డుగా నిలబడ లేదు .1942క్విట్ ఇండియా ఉద్యమంలో భర్తను ఏడాది పాటు ఖైదు చేసినప్పుడు గాంధీ గారికి ‘నాభర్తకు ఏడాది జైలు శిక్ష వేశారు .అది ఆయన చేసిన పోరాటానికి చిన్న శిక్షే .ఇంత తక్కువ కాలం శిక్ష పడుతుందని మేము ఊహించ లేదు .ఈ విషయం లో ఆయన శక్తి సామర్ధ్యాలకు తగిన సరైన న్యాయమైన శిక్ష కాదు . ఈ రోజు నుండి నేను బెంగాల్ ఖిలాఫత్ కమిటీ కార్య భారాన్ని వహించి నా శక్తి సామర్ధ్యాల మేరకు పని చేస్తాను ‘’అని రాసిన దేశ భక్తురాలు బేగం .ఇలా రాయటానికి ఎంత తెగువ సాహసం కావాలో అన్నీ ఆమెకున్నాయని రుజువు చేసింది . సహజం గా ఆమె అనారోగ్యమనిషి. అయినా ఆమె ధైర్యానికి ఆశ్చర్యం వేస్తుంది .భర్త అరెస్ట్ ను నిబ్బరం గా భరించి స్వాతంత్ర్య పోరాటం లో ముందుకు దూకిన జుఖా బేగం అందరికి ఆదర్శ ప్రాయం .
నిషాత్ ఉన్నీసా బేగం
భర్త మౌలానా హస్రత్ మోహాని 1916ఏప్రిల్ పదమూడున రెండవ సారి అరెస్ట్ అయినప్పుడు స్వాతంత్రోద్యమం లో చురుగ్గా పాల్గొన్న మహిళ నిషాత్ ఉన్నీసా బేగం.బ్రిటిష్ కోర్టులలో ఆమె భర్తకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పని చేసేది భర్తకు కేసుల్లో ఏంతో సాయం చేయటం తో బాటు ,ఏంతో దేశభక్తినీ కలిగి ఉండేది .ఆర్ధికం గా వెసులు బాటు లేకపోయినా ఇతరులకు సాయం చేయటానికి ముందు ఉండేది .భర్త తో సభలూ సమావేశాలకు హాజరై రాజకీయాలను బాగా అర్ధం చేసుకొన్నది .భర్త రాసిన పుస్తకాలను మేగజైన్ లను అమ్మి తమ ప్రయాణపు ఖర్చులకు ఉపయోగించేది .1921లో అబ్దుల్ హమీద్ ఖాజా భార్య బేగం ఖుర్షీద్ ఖాజా తో కలిసి కాంగ్రెస్ సబ్జెక్ట్ కమిటీకి నాయకత్వం వహించింది .స్వదేశీ ఉద్యమం లో చేరి ఆలీఘడ్ లో మౌలానా మోహాని ఏర్పాటు చేసిన ఖిలాఫత్ స్టోర్స్ కు సాయం చేసింది .క్వాజా అహ్మద్ జైలుకు వెళ్ళగానే భార్య కుర్షీద్ ఆయన నడుపుతున్న ‘’హింద్ ‘’పత్రిక బాధ్యతలు తీసుకొన్నది .జామి మిల ఇస్లామి బాధ్యతలను కూడా ఆయన లేనప్పుడు స్వీకరించి పని చేసింది .1930లో హమీదియా బాలికల సెకండరి స్కూల్ ను ఏర్పాటు చేసి విద్యా వ్యాప్తికి కృషి చేసి నిర్వహించింది .ఇది తరువాత డిగ్రీ కాలేజ్ అయింది .
రజియా ఖాటూన్
నజీరుద్దీన్ కుమార్తె అయిన రజియా ఖాటూన్ బ్రిటిష్ పాలనను ఎదిరించిన మొట్ట మొదటి బెంగాల్ ముస్లిం మహిళ.దీనికి కినిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి ‘’కాలాపానీ ‘’జైలు లో ఉంచారు .అక్కడే ఆమె ప్రాణాలు విడిచింది .బారిస్టర్ ఆసిఫ్ ఆలి తల్లి అక్బరీ బేగం ఆ రోజుల్లో ముస్లిం మహిళలను ప్రేరణ కలిగించి స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గోనేట్లు చేసింది .సహాయ నిరాకరణ మొదలైన ఉద్యమాలను వెంట ఉండి నడిపించింది .1920మే లో ఆమె ఒక చారిత్రాత్మక ప్రసంగం చేసింది .అందులో ఆమె ‘’మనం మన మతాన్ని పూర్తిగా విశ్వసించి ,అనుసరించాలి దీనికి వ్యతిరేకులైన వారిని సాంఘికం గా బహిష్కరించాలి ‘’అని పిలుపు నిచ్చిన ఉద్యమ కారిణి రజియా ఖాటూన్ .
వీరు మాత్రమె కాదు ఇంకా ఎందరో ముస్లిం మహిళా మణులు స్వాతంత్ర్య ఉద్యమం లో మగవారికి దీటుగా నిలిచారు .ముజఫర్ నగర్ కు చెందిన అస్గారి బేగం బ్రిటిష్ సైన్యం తో ధైర్యం గా పోరాడి ఓడిపోతే బ్రిటిష్ కిరాతకులు ఆమెను నిలువునా కాల్చేశారు .ముజఫర్ నగర్ కే చెందినా హబీబా ,రహీమి ఇద్దరు బ్రిటిష్ సైన్యాన్ని ముందుకు రాకుండా అడ్డగించి ,వారికి చిక్కి ఉరి తీయబడ్డ దేశ భక్తులు .జహీదా ఖాటూన్ షెర్వాని దేశ భక్తీ గీతాలు రాసి పాడి అందర్నినీ ఉత్తేజితుల్ని చేసింది .ఖదీజా బేగం ఇంటింటికి టిరిగి స్వదీశీ వస్తువులనే వాడమని ఖాదీ దుస్తులే ధరించమని ప్రచారం చేసింది .మునీరాబెగం ,అమీనా కురేషి ,ఫాతిమా కురేషి అమీనా త్యాబ్జీ,హమీదా త్యాబ్జీ బేగం షకీలా లుక్మాని , ఫాతీమా టై ద్ఆలి ,శాఫాట్ ఉన్నీసా ,సఫియా సాద్ ,బేగం కుల్సూం శియాని ,అస్మత్ ఆరా ఖాటూన్ ,సుఘ్రా ఖాటూన్ ,బిబి అమాతుల్ ఇస్లాం ,ఫాతిమా ఇస్మాయిల్ ,సుల్తానా హయత్ అన్సారి ,హజరా బేగం ,జుహ్రా అన్సారి మొదలైన ఎందరో ముస్లిం మహిళల త్యాగాల వల్లనే మన స్వాతంత్ర్యం వచ్చిందని మనం మరువ రాదు .225మంది ముస్లిం మహిళలు స్వాతంత్ర్య ఉద్యమం లో అసువులు బాసి అమరులైనారు .
ఈ నెలలో వచ్చే భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా ఈ ముస్లిం మహిళా త్యాగధనుల్ని ఒక సారి స్మరించటానికి నేను చేసిన ప్రయత్నమే ఇది .వీరి జీవితాలకు సంబంధించిన పూర్తీ వివరాలు రికార్డ్ కాలేక పోవటం విచారకరం .నాకు అందిన సమాచారాన్ని బట్టి మాత్రమె రాయగలిగానని మనవి చేస్తున్నాను .
‘’ భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం మహిళలు’’ సమాప్తం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-14-ఉయ్యూరు