గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20-
18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి
ఎవరైనా ఏ పుస్తకం మీద నైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లి నాద సూరి వ్యాఖ్యానం లాగ వుంది అనటం లోకం లో వుంది .అంటే వ్యాఖ్యానాలకు చక్కని ఒరవడి పెట్టిన వాడు మల్లి నాద సూరి అన్న మాట .ఆయనే లేక పోతే కాళిదాసు మహా కవితో సహా ఎందరో సంస్కృత కవుల గురించి ఆంధ్రులకు తెలిసేదే కాదు .ఆయన అన్నం మెతుకు పెట్టె మెదకు జిల్లా లో జన్మించాడు .సంస్కృతీ మెతుకును ,సంస్కృత సాహిత్యపు ఓగిరాన్ని ఆంధ్రులకు అన్న ప్రాసన గా పెట్టిన మహాను భావుడు .ఆయన గురించి తెలుసు కోక పొతే తెలుగు తల్లి మనల్ని క్ష మించదు .
ఆంధ్రుల కీర్తి ని ఖండంత రాలు దాటించిన వాడు ”కోలాచలం మల్లి నాధ సూరి ”.మల్లినాద సూరి అనే మాట వ్యాఖ్యాతకు పర్యాయ పదమై పోయింది. క్రీ శ. 1350-1450కాలం వాడు .మహామహోపాధ్యాయ ,వ్యాఖ్యాన చక్రవర్తి ,అపరకాళిదాస బిరుదాంకితుడు .
.ఆయన పద వాక్య ప్రమాణ పారా వార పారాయణుడు ,మహా మహోపాధ్యాయుడు .ఆయన వ్యాఖ్య లో చారిత్రాత్మక ,విశిష్టత వుంటుంది .అందులో తర్కం ,వ్యాకరణం ,న్యాయం కలిసి వుంటాయి. ఆయనది హృదయోల్లాస వ్యాఖ్య .మూల గ్రంధానికి పూర్తి న్యాయం చేసే వ్యాఖ్యానం చేయటం ఆయన ప్రత్యేకత .కాళిదాసు కవిత్వం కొంత మనపైత్యం కొంత గా వుండదు .కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తాడు .లయకు స్థానం కల్పించాడు .ఆయన ”జ్ఞాన సింధు ”.కాళిదాసు ,మాఘుడు, భారవి ,హర్షుడు రాసిన కావ్యాలకు ఆయన వ్యాఖ్యలు లేక పొతే తెలుగు వారెవరు చదివే వారు కాదని అందరి నమ్మకం .ఆయన లేక పోతే ఆంద్ర సంస్కృతి లేదంటారు చాలా మంది .మెదక్ జిల్లా పలుకుబడికి సంస్కృతికి అద్దం పట్టిన వాడు మల్లి నాధుడు .
మల్లినాధుడు మెదక్ వాసి
కోలాచలం అన్న ఇంటి పేరున్న వారు ఇప్పటికీ మెదక్ జిల్లా లో వున్నారు రు .పటాన్ చెరువు వద్ద ఈ పేరు గల కుటుంబాలున్నాయి .14 వ శతాబ్దం ఉత్తరార్ధం లో వాడు సూరి .కాకతీయ రాజుల ఆదరణ తో ఓరుగల్లు చేరాడు .వీరి పతనం తర్వాత రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చాడు .వీరిది కాశ్యపస గోత్రం .యజుస్సాఖ .ఆపస్థంభ సూత్రం .వైదికబ్రాహ్మణులు .రాచకొండ రాజు సర్వజన సింగ భూపాలుడు ,విజయనగర రాజు మొదటి దేవరాయల ఆస్తానం లో ఉండేవాడు .తెలంగాణాలోని కొలచేలమ వీరి స్వగ్రామం .కాకతీయ రాజ్య పతనం తర్వాత కుటుంబం సింగ భూపాలుని రాజధాని అయిన రాచకొండకు చేరింది .
విద్యాకుటుంబం
తాత పేరు మల్లి నాధుడే .శ్రీ శైల మల్లన్న వీరి ఇల వేలుపు .తాత కాకతి ప్రతాపరుద్ర మహా రాజు ఆస్థాన కవి .శతావధాని .కనకాభి షేకం పొందాడు .సూరి తండ్రి ”కపర్ది”పండితుడు .శ్రౌత కల్పానికి ”వ్రుత్తి ”రాశాడు .విద్యా సంపన్న మైన కుటుంబం లో పుట్టటం ,రాజ పూజితం వుండటం ,శిష్టాచార వంశం అవటం తో సూరి కి బాగా కలిసి వచ్చింది .మల్లి నాధుడు సర్వ శాస్త్ర మల్లుడు అయాడు .శాస్త్రాలన్నీ ఆపోశన పట్టి ‘’చుళికీ కృత సర్వ శాస్త్ర పాదోది’’ అని పించు కున్నాడు .తనది సౌజన్య జన్య మైన విదుషీత్వం అని నిగర్వం గా చెప్పు కొన్నాడు .న్యాయ వైశేషిక మీమాంసాల లోతులు చూశాడు .ఈయన పెద్ద కొడుకు పెద్దయ్య ,చిన్నకొడుకు కుమార స్వామి .ఇద్దరు ఉద్దండ పండితులే .పెద్దయ్యనే పెద్ది భట్టు అంటారు .ఇతను రాచకొండ రాజు సర్వజ్ఞా సింగ భూపాలుని చే కనకాభి షేకం పొందాడు .అయితే ఇతను రాసినవేవీ లభ్యం కావటం లేదు .
కుమారస్వామి తన అన్న ను గురించి ”ప్రతాప రుద్రీయం ”పై రాసిన వ్యాఖ్యానం లో ఈ విషయాన్ని చెప్పాడు .తమ్ముడికి అన్న గారే గురువు .
కవితా గీర్వాణం -పంచ మహాకావ్య వ్యాఖ్యాన కర్తుత్వం
మల్లి నాధుడు మంద బుద్ధి ఉన్న వారికి కూడా సులభం గా అర్ధ మయేట్లు వ్యాఖ్యానం చేస్తాను అన్నాడు .’’సంస్కృత వాజ్మయ ప్రచారం తన విధి’’ అన్నాడు .విశ్వ శ్రేయస్సు తన ఆకాంక్ష అని చెప్పాడు .విపరీత వ్యాఖ్యానాలు కాళిదాసాది మహా కవుల కావ్యాల్ని పాడు చేస్తున్నాయనీ ,విషం తో మూర్చ పోయిన వాటిని ఉజ్జీవింప జేయ టానికి తాను”సంజీవిని ”అనే పేర వ్యాఖ్యానం రాస్తున్నట్లు తెలియ జేశాడు .అన్వయం ప్రకారం అర్ధాలు వివరించటం ,ప్రమాణాలుచూపటం ,అవసర మయినంత వరకే చెప్పటం సూరి వ్యాఖ్యానం లో విశేషం .
సూరి మొదట కాళిదాసు రచించిన ”కుమార సంభవం ”కావ్యానికి వ్యాఖ్య రాశాడు .అంతకు ముందు దీనిపై 37 వ్యాఖ్యానాలున్నాయి . ”రఘు వంశ సంజీవిని ”సూరి మొదటి వ్యాఖ్యానం .దీని ముందు అవన్నీ వెలవెల బోయాయి .
ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్బుత మైన శ్లోకం రాసి కొత్త దారి తొక్కాడు .కుమార సంభవానికి అంతకు ముందున్న 25 వ్యాఖ్యానాలు సూరి వ్యాఖ్యానం ముందు తల వంచాయి .అయితే ఉన్న పదిహేడు సర్గలలో ఏడు సర్గల వ్యాఖ్యానమే లభిస్తోంది .ఎనిమిదో దానికి సీతా రామ పండితుడు వ్యాఖ్య రాశాడు .అదే పార్వతీ పరమేశ్వరుల సంభోగ శృంగారం . మేఘ దూతానికి 50 వ్యాఖ్యానాలున్నాయి .సూరి వ్యాఖ్య మాత్రమే బహుళ ప్రచారం పొందింది .ఆయనే అన్నాడు ”మాఘే మేఘే ,గతం వయః ”అంటే దీనికి వ్యాఖ్యానం రాయ టానికి చాలా శ్రమ పడ్డాడని తెలుస్తోంది .
భారవి రాసిన ”కిరాతార్జునీయం ”నారికేళ పాకం .దాన్ని తాను పగల కొడ్తున్నానని అందులోని రసాన్ని ఆస్వాదించమని చెప్పి వ్యాఖ్యానించాడు .ఇందులో కొత్త బాట తొక్కాడు .సూరి వ్యాఖ్యానం లేక పొతే ఈ కావ్య సౌధం లోకి ప్రవేశం దుర్లభం అంటారు విజ్ఞులు . . .
మాఘ కవి రాసిన ”శిశుపాల వధ ”ను అద్భుతం గా వ్యాఖ్యానించి ,కవి హృదయాన్ని వెలువరించాడు .కాళిదాసు , ,భారవి ,దండి కలిస్తే మాఘుడు అన్నాడు .మాఘం పై వ్యాఖ్యానం రాసి ఆ కవిత్వ సౌందర్యానికి ముగ్ధుడై పరవశించాడు .సూరి వ్యాఖ్యాన రీతి గురించి ”సంజీవిని లో తూలికగా ,ఘంటా పధం లో శాన శీల గా ,విలసిల్లిన సూరి లేఖిని,ఈ సర్వం కష లో సంశయచ్చేదం లో ”అసిలత ”గా గుణ ప్రకాశం లో విద్యుత్ లత గా ,రస భావావిష్కరణ లో కల్పలత గా భాసించింది ”అన్నారు సూరి ని సమగ్రం గా ఆవిష్కరించిన మహా పండిత విశ్లేషకులు చలమ చర్ల రంగా చార్యుల వారు .మాఘ వ్యాఖ్యానం రాసి తాను ధన్యుడనయానని ఆనందం గా చెప్పాడు .
విద్వ దౌషధం అని పించుకొన్న ”నైషద ”కావ్యానికి కర్త మహా పండితుడు ,చింతామణి మంత్రో పాసకుడు ,శ్రీ హర్షుడు . .అందులోని రస భావ గుణ అర్ధ దోషాలను ధ్వనిని అలంకారాలను ,రహస్యాలను వెలికితీసి రసజ్ఞులకు అందజేస్తున్నట్లు సూరి ప్రకటించి అన్నంత పనీ అద్భుతం గా చేశాడు .
వ్యాకరణ కీకారణ్యం గా వుండే భట్టు కావ్యానికి సులభ వ్యాఖ్యానం చేశాడు మళ్లి నాద సూరి .ప్రౌఢ దేవ రాయల కోరిక పై వైశ్య వంశం వారి గురించి ”వైశ్య వంశ సుధాకరం ”రాశాడు .అమర కోశానికి అమర పద పారిజాతం అనే వ్యాఖ్యానాన్ని ,వైశేషికానికి ”భాష్య నికరం ”ను ,పాణినీయానికి కాశికా వ్రుత్తి అనే ఉద్యోగ టీకా వ్యాఖ్యను విద్యాధరుని , అలంకర శాస్త్రం ఏకావలి కి ”తరళ వ్యాఖ్య ”,కావ్యాదర్శానికి కూడా వ్యాఖ్య రాశాడు సూరి .సూరి కొడుకు లిద్దరూ మహా పండితులు .శిష్యులు రత్న మాణిక్యాలు .
దాదాపు తొంభై ఏళ్ళు జీవించాడు సూరి .కళ్ళు తెరిచే ఓపిక ఏక పోతే కిందిరెప్పకు తాడుతో రాయి కట్టు కోని ,పై రెప్పకు కూడా తలపై నుంచి రాయి కట్టు కోని దీపం ముందు కూచుని కావ్యాలు చదువుతూ వ్యాఖ్యానాలు రాశాడని అంటారు .జీవిత మంతా వ్యాఖ్యానాలకే అంకితం చేసిన సూరి సూరి పేరుకు సార్ధకత తెచ్చిన ధన్య జీవి .ఆసూరి (సూర్యుడు )వెలుగే లేక పోతే మన సంస్కృత కవి సూర్యుల మహా ప్రతిభ మనకు అందేది కాదు .అందుకే ఆయన్ను ”వ్యాఖ్యాత్రు చక్ర వర్తి ”అని సగౌరవం గా ఆంద్ర దేశం పిలుచు కొంటుంది ,.
తానూ రాసిన వ్యాఖ్యానాలకు భలే తమాషాగా సరియైన పేర్లు పెట్టటం మల్లినాధుని ప్రత్యేకత .మహాకవి కాళిదాసు రాసిన రఘువంశ ,కుమారా సంభావ ,మేఘ దూత కావ్య వ్యాఖ్యానకు ‘’సంజీవని వ్యాఖ్య ‘’అని తగిన నామకరణం చేశాడు .భారవి కిరాతార్జునీయానికి రాసిన వ్యాఖ్యను ‘’ఘన పాఠ’’అన్నాడు .మాఘకవి రాసిన శిశుపాల వధ కావ్యా వ్యాఖ్యానికి ‘’సర్వం కష ‘’అని పేరుపెడితే ,శ్రీ హర్షుడు రాసిన నైషద కావ్య వ్యాఖ్యానానికి ‘’జీవాతువు ‘’అని గొప్ప పేరు పెట్టాడు .భట్టికావ్య వ్యాఖ్యానాన్ని ‘’సర్వ పాఠినా ‘’అన్నాడు .
విద్యాధరుడు రాసిన అలంకార శాస్త్రం ‘’ఏకావళి’’కి చేసిన వ్యాఖ్యానాన్ని ‘’తరళ’’అని పిలువగా ,వరద రాజు రాసిన తార్కిక రాక్షతిక కు రాసిన వ్యాఖ్యానాన్ని ‘’నిష్కంటక’’అన్నాడు .అన్నీ సార్ధక నామాలే .అన్నీ అంట అద్భుతం గా రాసినవే .
సృజన కర్త
కావ్యాలకు ,అలంకారాలకు సమర్ధ వంతమైన వ్యాఖ్యానాలు రాయటం తో సరిపుచ్చు కోలేదు .సృజనాత్మక రచనలూ చేసి మెప్పించాడు .రఘువీర చరిత ,వైశ్య వంశ సుధాకర ,ఉదార కావ్య అనే రచనలు చేసి తన ప్రతిభను నిరూపించుకొన్నాడు .తమాషా ఏమిటంటే మరాఠీ భాషలో ‘’మల్లినాధి’’అనే మాట చేరింది .దీని అర్ధం వ్యాఖ్యానం ,లేక విమర్శ .అంటే విమర్శ వ్యాఖ్యానాలకు మల్లినాద సూరి పర్యాయ పదం అయ్యాడన్నమాట .
మల్లినాద సూరి స్మృతీ చిహ్నం
సంస్కృత పంచ మహాకావ్యాలకు అన్నిటికిసంస్కృతం లో వ్యాఖ్యానం రాసిన తెలుగు బిడ్డ మల్లినాద సూరి అవటం మనాందరికి గర్వకారణం .దీన్ని పురస్కరించుకొని దాదాపు అయిదు శతాబ్దాల తర్వాత సూరిమహా పాండిత్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి 1981నవంబర్ 21నమొట్ట మొదటి సారిగా మెదక్ లో మహా సభ నిర్వహించారు .ఆ నాటి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖా మాత్యులు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి ,ఆచార్య శిరోమణి శాస్త్రులు ,శ్రీ విశ్వనాధ శర్మ ,మెదక్ కలెక్టర్ శ్రీమతి గాయత్రి రామచంద్రన్ లు పాల్గొని మల్లినాధుని బహుముఖ ప్రజ్ఞా విశేషాలను ప్రస్తుతించారు .ఇంతటితో ఆగిపోకుండా మెదక్ లో మల్లినాధ సూరి కుటుంబం నివశించిన గృహాన్ని వేదం పాఠ శాల నెలకొల్పాలనుకొని చివరకు వర్గల్ కు మార్చారు .ప్రభుత్వం ఏపని చేసినా ఆరంభ శూరత్వమే నని మరొక సారి రుజువైంది .ఆ ఇల్లు శిదిలావస్తకు చేరి స్థలం కొద్ది కొద్దిగా అన్యాక్రంతమైంది .ఎస్ .జగదీశ చంద్ర ఆధ్వర్యం లో ‘’కోలాచలం మల్లినాద సూరి సాహితీ పీఠం’’ ఏర్పడి సూరి రచనలను అందుబాటులోకి తెచ్చే కృషి చేస్తోంది .కోలాచల కుటుంబం అక్కడ ఒక గ్రంధాలయాన్ని వేదంవిద్యాలయాన్ని ఏర్పరచే ప్రయత్నం లో ఉంది . నలభై ఆరు గ్రంధాలను సేకరించి భద్ర పరచారు ..
స్వస్త్యస్తు వాజ్మయోద్యానే మహసే భూయసే సదా –యశసే మల్లి నాధష్య కల్ప వల్లీ సుమత్విశే ”
–
మల్లినాద సూరి
మల్లినాద సూరి నివసించిన గృహం -మెదక్ జిల్లా -కొలచేలం
మరోకవిపరిచయం లో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-14-ఉయ్యూరు