గీర్వా కవుల కవితా గీర్వాణం -38
38-బౌద్ధ నాటక కర్త –హర్ష వర్ధనుడు
స్థానేశ్వరాన్ని రాజ దాని చేసుకొని వింధ్య నుండి హిమాలయాల వరకు రాజ్య పాలన చేసిన హర్ష చక్ర వర్తి మూడు నాటకాలు రాశాడు. హర్షుడు క్రీ .శ.606-648కాలానికి చెందినవాడు .తననాటకాలలో హర్ష వర్ధనుడు అని చెప్పకుండా హర్ష దేవుడు అని చెప్పుకొన్నాడు .తండ్రి ప్రభాకర వర్ధనుడు .చైనా యాత్రికులు హ్యూన్ సాంగ్ ,ఈత్సింగ్ లు ఇతని పాలన గురించిరాశారు .బాణుడు హర్ష చరిత్ర రాశాడు .శీలాదిత్యుడు అనే బిరుదు ఉంది .అంటే శీలం లో, సదాచారం లో సూర్యుని వంటి వాడని అర్ధం .హర్షుడికి ముందు అన్న రాజ్య వర్ధనుడు రాజరికం చేశాడు .సూర్యారాధక వంశం .తర్వాత బౌద్ధమతావలంబి అయ్యాడు .గౌడ రాజు శశాంకుడు రాజ వర్ధనుడిని ఓడి చనిపోతే హర్షుడు రాజ్యాభి షిక్తుడయ్యాడు.రెండవ పులకేశిని ఓడించి దక్షిణం లో నర్మదా నది వరకు హర్షుడు రాజ్య వ్యాప్తి చేశాడు ..అయిదేళ్లకోసారి ధనాగారం లోని డబ్బునంతా ప్రజలకు దానం చేసేవాడు .రాజ్యాధికారం కంటే సాహిత్యం పై మోజేక్కువ .మంచికవి .హర్షునికాలం లో నలందా విశ్వ విద్యాలయంపది వేల మంది దేశ విదేశీ విద్యార్ధులతో మహోన్నత దశలో ఉండేది .ధర్మ కీర్తి ఇక్కడ ఆచార్యుడు గా ఉండేవాడు .తన అన్నరాజ వర్ధనుడిని చంపిన శాశాంకుని ఓడించి సంహరించి ప్రతీకారం తీర్చుకొన్నాడు హర్షుడు . శశాంకు ని చెరలో ఉన్న చెల్లెలు రాజ్యశ్రీ తప్పించుకొని బయట పడి బౌద్ధ భిక్షువు చేత రక్షింప బడి హర్షుని చేరుతుంది .ఆ భిక్షువు తత్వ బోధతో హర్షుడు బౌద్ధాన్ని స్వీకరించాడు .అంతకు ముందు హర్షుడు శివుడి అభిమాని .హర్షుని పట్టమహిషి పారశీక కన్య .ఆమెనే మహాశ్వేతాగా బాణుడు చిత్రించాడని అంటారు .రెండవ భార్య సౌరాష్ట్ర రాజ వంశానికి చెందినదని ఆమెయే కాదంబరి అని పండితుల పిండితాభిప్రాయం .హర్ష సామ్రాజ్యం అస్సాం నుండి సౌరాష్ట్ర వరకు ,హిమాలయం నుండి వింధ్య వరకు వ్యాపించింది .
హర్షుని కవితా హర్ష వైభవం
హర్షుడు రాసిన మూడు నాటకాలలో ప్రియ దర్శిని మొదటిది .నాలుగు అన్కాలున్నాయి .బృహత్కధ నుండి తీసుకొన్న ప్రేమకధ ఇది .వత్సరాజు ఉదయనుడు నాయకుడు. కాలింగ రాజు దృఢ వర్మ శత్రువుల చేతిలో ఓడిపోగా కూతురు ప్రియ దర్శినిని ఉదయనుడి భార్య వాసవ దత్త దగ్గర పరిచారికగా చేరుస్తాడు .సేనాపతి విజయ సేనుడు .ప్రియ దర్శినిని ఉదయనుడు ఒక సారి ఉద్యానవనం లో చూడటం తో ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది .వీరిద్దరి ప్రేమను నాటకం గా వేస్తారు .అందులో ఉదయనుడు వాసవ దత్తగా ప్రియ దర్శిని నటిస్తారు .వీరిప్రేమ రాణి వాసవ దత్తకు తెలుస్తుంది .ప్రియ దర్శికను బంధిస్తుంది .దృఢ వర్మ శత్రువులను జయించి వాసవ దత్తకు అసలు విషయం చెబుతాడు .వాసవ దత్త ఉదయన ప్రియ దర్శనికల వివాహం జరిపిస్తుంది ..ఈ నాటకం పై మాళవికాగ్ని మిత్ర ప్రభావం ఉంది .
రత్నావళి నాటకం లో నాలుగు అన్కాలున్నాయి .రత్నావళి నాయిక సింహళ దేశానికి చెందింది .రత్నావళి పెళ్లి చేసుకొన్నా వాడు చక్ర వర్ర్తి అవుతాడనే జ్యోతిష్యం బయట పడుతుంది .వాసవ దత్త ,యౌగంద రాయణులు ఒక పన్నాగం పన్ని వాసవ దత్త చనిపోయినట్లు పుకారు పుట్టించగా, వార్త తెలిసిన మంత్రి వాసు భూపతి ఉదయునిదగ్గరకు రత్నావళి ని పంపుతాడు .ప్రయాణం లో నౌక ప్రమాదానికి గురై రత్నావళి సముద్రం లో పడిఎల్లాగో బయట పడి వాసవ దత్తను చేరి సాగరిక పేరుతొ పనిమనిషిగా ఉంటుంది .రాజు కంటబడకుండా ఈమెను జాగ్రత్త గా చూసుకొంటున్నా ఒక సారి వారిద్దరూ ఉద్యానవనం లో కలుసుకొని హృదయాలను పారేసుకొంటారు .తరువాత కొన్ని మలుపులు తిరిగి ఉదయన సాగారికల వివాహం జరిగిపోతుంది .ప్రియ దర్శినిలోను ఇందులోనూ దాదాపుఒకే కద ఉంది. భాసుడి స్వప్న వాసవ దత్త ప్రభావం దీనిమీద ఎక్కువ .నాటకం మనసును ఆకర్షిస్తుంది .
మూడవ నాటకం నాగానందం .ప్రౌఢ రచన .అయిదు అంకాలు .ఇది జీమూత వాహనుడిత్యాగ కద .అహింసకు ప్రాధాన్యతనిచ్చాడు .ఈ కధకు ఆధారం జాతక కధలోని విద్యాధర చరిత్ర అని హర్షుడు చెప్పాడుకాని అది దొరకలేదు .నాటకారంభం లో బుద్ధుని స్తుతించాడు .అయినా హిందూ మతం పై కోపం లేదు కనకనే నాటకం లో నాయిక మలయా వతిని గౌరీ దేవి భక్తురాలుగా చిత్రించాడు .సన్నివేశాలను వేగవంతం గా నడిపిస్తాడు .విసుగుఉండదు ..మొదటి మూడు అన్కాలలో శృంగార రసం పోషింప బడింది .తరువాత శాంత రసం సాగింది .హాస్య అద్భుతరసాలకూ ఇందులో చోటు కల్పించాడు
కాళిదాస భవ భూతుల తర్వాతి స్థానం హర్ష దేవుడిదే .సరళ సుందర శైలితో కోమలమైన రచన చేశాడు .హర్షుడు నాట్య సంగీతాలలో నిష్ణాతుడు అని తెలుస్తుంది .లలితకళా ప్రియుడుగా కనిపిస్తాడు .హర్షుని రస హృదయం ప్రేక్షకాదరణ పొందింది .ప్రక్రుతి చిత్రణా సహజ సుందరం గా చేశాడు .పాత్రల స్వభావాలను సుస్పష్టం గా చిత్రించాడు ..కవిగా,నాటక కర్త గా హర్షుడు సవ్య సాచిత్వం చేశాడు .రచనా ప్రావీణ్యం అమోఘమని పిస్తుంది .హర్షుడు హృదయ హర్షుడనిపిస్తాడు .నాగానంద నాటకాన్ని 2008లో దేశం లో పలుచోట్ల ప్రదర్శించారు .అఖిల భారతీయ మరాఠీ నాట్య పరిషద్ ఆధ్వర్యం లో చాలా చోట్ల ప్రదర్శించారు .
ఈ నాటి హర్యానా పంజాబ్ ప్రాంతం లో రాజధాని నేర్పరచుకొన్న హర్షుడి సైన్యం లో లక్ష మంది అశ్విక సైన్యం , అరవై వేలమంది ఏనుగులు ఉండేవి .ప్రజలకు విద్యా వైద్య సౌకర్యాలను ఉచితం గా కల్పించాడు మంచినీటి సరఫరా నాణ్యం గా ఉండేది . విశ్రాంతి గృహాలు ఉండేవి . ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడడాని చరిత్రకారులు రాశారు .తక్కువ పన్నులు వేసేవారు ఆరోవంతు భూమి శిస్తు వసూలు చేసేవాడు .ఈ నాడు స్తానేశ్వరం లో ఒక కిలో మీటరు పొడవు ముప్పాతిక కిలోమీటరు వెడల్పు ఉన్న శిధిల ‘’హర్ష కా తిల ‘’కనిపిస్తుంది .అత్యాధునిక సౌకర్యాలున్న ప్రాంతంగా ఇది కనిపించి ఆశ్చర్య పరుస్తుంది .తాంగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి తిజాంగ్ తో సత్సంబంధాలు నేరపాడు .సందర్శకులు ఇరుదేశాలనుంది వచ్చి వెడుతూ ఉండేవారు .చైనా యాత్రికుడు హ్యూన్ చాంగ్ హర్షుని రాజ్యం లో ఎనిమిదేళ్ళు భారత దేశం లో గడిపాడు .ప్రయాగలో అయిదేళ్లకోసారి మహా కుంభ మేలను నిర్వహించేవాడు .నలభై ఒక్క ఏళ్ళు హర్షుడు రాజ్యాన్ని పాలించాడు .హర్షునికుమారులు వ్యాఘ్ర వర్ధనుడు ,కళ్యాణ వర్ధనుడు .హర్షుని ముఖ్యమంత్రి అరునణాశ్వుడు వీరిద్దరిని చంపి ,రాణి ప్రభావతిని చెరలో పెట్టాడు .
జయదేవుడు తన గీత గోవిందం లో హర్షుని కాళిదాసుతోపోల్చాడు .జయదేవునికాలానికే హర్షుని కీర్తి దేశావ్యాప్తమైందనిదని తెలుస్తోంది .ఆర్.సి మజుందార్ అనే పరిశోధకుడు హర్షుని గురించి రాస్తూ ‘’A great general and just administrator .Harsha was even greater than patron of religion and learning .He gathered around himself finest intellects holiest sages .Men like Bana ,Mayura ,Divakara and Huen tsang thronged round his throne .In this respect he is more fortunate than Samudra Gupta for still we posses some gems of literature that proceedede according to tradition from his pen ‘’అని హర్షుని భహుముఖీన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు .
ఈ సారి నైషధాన్ని రాసిన హర్ష దేవుడి గురించి తెలుసుకొందాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు