విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం
- -మల్లెల నరసింహమూర్తి
- 06/12/2014

పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్గ్యాలరీ’లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్యసౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం సాధారణంగా అలవాటుపడ్డ Verbal expression కవి ప్రసాదమూర్తి “heightened emotions’ ని అంధుకోవడానికి, అభివ్యక్తం చెయ్యడానికి చాలా సిమితమైన మార్గంగా అగుపిస్తుంది. అతని కళాత్మక అనుభూతి పూలతోటల్లోకి సీతాకోక చిలుకలై ఎగిరిపోవాల్సిందే.
సుప్రసిద్ధ సాహితీవేత్త సోమసుందర్గారు ప్రసాదమూర్తి కవిత్వంలో ప్రసాద గుణం స్పష్టంగా కనిపిస్తుంది అని, విశిష్ట కవి అని అభినందించారు. ప్రసాదమూర్తి సహజంగానే సౌజన్యమూర్తి, భావుకుడు, సౌందర్యోపాసకుడు, ప్రకృతి ఆరాధకుడు, సాత్వికుడు, సదాసంచారి, సత్యానే్వషి, సంఘమిత్రుడు, ఉలిపట్టని కవిశిల్పి.
‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని ‘చిత్రచిత్రాలు’గా రంగురంగులుగా, నది పాయలు పాయలుగా చదువుతూ, అనుభూతి చెందుతూ ఉంటున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన తాదాత్మ్యంలోకి వెళదాం. చైనా దేశపు తాత్త్విక పరిభాషలో ‘తావోయిజం’ పదజాలంలో అక్షరీకరించాలంటే అదొక “Transcendental consciousness’.
‘పూలండోయ్ పూలు’ కవిత ఇటీవల తెలుగు కవిత్వంలో వచ్చిన “the most melodious, magical, mesmerising and enchanting poem గా సహృధయుల్ని సమ్మోహపరిచింది. తన్నుతాను గానం చేసుకుంటూ, సరసుల హృదయ సరస్సుల్లోనే, హంసలా భావతరంగ మాలికలపై డోలలూగుతున్నది.
ఈ కవితలో ఈ చరణాలు.. ప్రసాదమూర్తి విలక్షణమైన ఊహాశక్తికి అద్దం పడుతున్నాయి.
‘‘మనుషులంతా పువ్వులైపోయినట్టు..,
పువ్వులు మనుషుల్ని మూటలుగట్టి
మంచికీ, మానవత్వానికీ మధ్య,
ఆదానప్రదానాలు చేస్తున్నట్టు..,
పై చరణాల్లోంచి ఒక సారాంశాన్ని పిండుకోవడానికి వీలుంది. కవిత్వ కళ ఆత్మకళగా, హృదయ కళగా విమర్శ పరిభాషలో ప్రస్తావించబడుతూ వుంటుంది. అది మనిషిని తన అంతస్సీమలలో గూడుకట్టుకున్న చీకటి నుంచి తేజస్సుదిశగా ప్రస్థానం సాగింపచేసే కళాత్మక సాధనం. మనిషిలోని negative impulses, క్రూరత్వం, ధ్వేషం, అసూయల్ని సమూలంగా ‘ప్రక్షాళన’ చేసి, వాటి స్థానంలో నిష్కళంక ప్రేమ, అవ్యాజమైన కరుణ, మైత్రి వంటి positive emotionsని ప్రతిష్టించే సంస్కారోన్నత ప్రక్రియ. దీనినే (catharisis (purgation) కెథారిసిస్ అని ప్రసిద్ధ గ్రీకు సాహిత్య తత్త్వవేత్త అరిస్టాటిల్ విశే్లషించాడు.
ప్రసాదమూర్తిపై కవితలోనే ‘పరమార్థం’ అనే మాటలో టాల్స్టాయ్ భావన “poetic justice’ ద్వారా నీతిబద్ధత, ధర్మాచరణ, మానవతాదీప్తి స్ఫూర్తిని ప్రతిష్టించగలడు అన్న భావన అంతర్గతంగా ప్రవహిస్తున్నది.
ఈ కవితలో మరొక విలక్షణత కనిపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మనిషి తనకు సంబంధించి కేవల పదార్థంగా కాకుండా దాన్ని తనలో పెనవేసుకున్న మానవీయ సంబంధాల్లోంచే చూస్తాడు. కనుక సాహిత్యం ఎప్పుడైనా మానవ సంబంధాలకు అతీతంగా బాహ్యప్రపంచాన్ని దర్శించలేదు. తత్త్వానేషణకు ప్రయత్నించదు. సాహిత్యంలో హృదయపరమైన, నిర్మలమైన, నిసర్గమైన ఊహలకు ఉన్నతమైన స్థానం కలదు. అదే కళాత్మక స్థానం. ఈ ప్రక్రియలోనే బాహ్యప్రకృతి మానవీకరణ చెందింది. ప్రాచీన సాహిత్యంలో నదులు జవనాశ్వాలుగా, పరుగెత్తే గోవులుగా పోల్చబడ్డాయి. కవుల సృజనల్లో నదులు, సముద్రాలు మానవీకరణ చెందాయి.
ఇక్కడ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కవితలో విలక్షణంగా, మనుషులంతా పువ్వులైనట్లుగా భావించాడు. మానవులు వాళ్లకంటే ఉదాత్తమైన, ప్రేమ పాత్రమైన సుమనోహరమైన, సుకుమారమైన పువ్వులుగా రూపాంతరం చెందారు. అంటే మనుషులు పుష్పీకరణ చెందారు అనవచ్చునేమో. ప్రసాదమూర్తి భావన ప్రకారం మానవత్వం కన్నా పూలతనం (పుష్పతనం) (Flowerliness) మరింత ఉదాత్తమైనది. మానవ సహజం తనకుతాను ఒంటరితనంతో కుంచించుకుపోకుండా సామూహికత్వాన్ని పొందాలి. తద్వారా మానవ సంబంధాలు బలపడతాయి. అదే మానవప్రగతి. మనిషిని మరొక మనిషికి మరింత సమీపానువర్తిగా చేయటంలో దోహదపడటమే సాహిత్యంయొక్క అంతిమ లక్ష్యం. మానవ జీవితాన్ని మరింత సంస్కారవంతంచేసి, ఉత్తమంగా ఉన్నతీకరించడం సాహిత్యంయొక్క ఉదాత్తమైన బాధ్యత. ఈ సామాజిక సత్యం తెలిసినవాడు సాహిత్య సూత్రం కమ్యూనిజం, హ్యూమనిజం ద్వారా అధ్యయనం చేసినవాడు కనుకే ప్రసాదమూర్తి.
కవి ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కావ్యంలో ఎన్నో కవితలు, అమ్మ పుట్టినరోజు, వాన, వాన, వాన, చిలకల రైలు డబ్బా, చెల్లి అమెరికా యాత్ర, పురాప్రియురాలు మొ… అన్నీ ఈ కవిచిత్రకారుని కవిత్వ చిత్రశాల (పొయెట్రీ ఆర్ట్గ్యాలరీ)లో కళాఖండాలు. మాలాంటి కరువుసీమలో వజ్రకరూరు వజ్రాల్లాంటి వడ్లగింజలు, సన్నబియ్యపు గింజల లాంటి వాన చినుకులు, కవి చిత్రకారుడు (Poet Painter) ప్రసాదమూర్తిగారి “Rare collection of poetry paintings”.
ఫ్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్ధతి ఒక చిత్రకారుడు దృశ్యాన్ని కళ్లద్వారా మనసులోకి ఒంపుకునే ధ్యాన మార్గం. శిల్పిశిల్పాన్ని మలిచే ముందు సంభావించిన శిల్పానికి అనుగుణమైన శిలను ఉలితో హస్తస్పర్శతో పరిశీలించే నిపుణత్వం. నైశిత్యం.
అందుకే చివరగా ప్రసిద్ధ చిత్రకారుడు పి.మోహన్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు డావిన్సీ, మొనాలిసా చిత్ర రచననుచేసే రసాత్మక సౌందర్య సమయ వర్ణన ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
‘‘డావిన్సీ నవ్వుతూ కుంచెను, రంగుల పలకను అందుకున్నాడు. ఈజిల్పై అప్పటికే కొంత ఆవిష్కృతమైన మోనాలిసా వర్ణచిత్రాన్ని నిశితంగా చూశాడు. కుంచెను లేత గోధుమ, రోజా రంగులను కొద్దిగా అద్దుకుని పలకపైనే వాటిని కలిపాడు. మోనాలిసా ముఖంపై ఆవరించిన వెంటాడే నవ్వును, వెలుగునీడలను కళ్లలోకి ఆవాహన చేసుకున్నాడు. తూలికాచాలనం మొదలైంది. అందులోంచి సౌందర్యోపాసనానాదం మంద్రంగా విస్తరిస్తోంది. మోనాలిసా మనోదేహాలు అతని కుంచెలో రంగుల స్నానంచేసి తడితడిగా చిత్రంలోకి ఒదిగిపోతున్నాయి.’’
ఈ వర్ణనతో పొయెట్ పెయింటర్, అనే్వషి, సంచారజీవి ప్రసాదమూర్తిగారిని నిండు గుండెతో అభినందిస్తూ. మనసున మల్లెల మాలలూగుతూ ఉండగా, అతని కవిత్వపు కర్పూర వెనె్నలలో కరిగిపోతా