‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-9
న్యూయార్క్ లో పెట్రో కెమికల్స్ లో ఉద్యోగం
న్యూయార్క్ లో పెట్రో కెమికల్ బిజినెస్ లో బాగా అనుభవమున్న’’ L Sonne born sons inc’అనే ప్రైవేట్ సంస్థ వారు ఆహ్వానించి రామయ్యగారికి ఉద్యోగం ఇచ్చారు .ఈ కంపెనీ 1890 నుంచి ఉంది .రామయ్యగారికి లేబరేటరి బాధ్యతలు అప్పగించారు .అక్కడ పని చేస్తూ బ్రూక్లిన్ లో నివాసమున్నారు .ఇక్కడ రామయ్యగారి ముఖ్యమైన పని ఏమిటంటే తిక్సో ట్రోఫిని కొలవటం , మంచి నాణ్యమైన అడిటివ్ లనుకలిపి లూబ్రికంట్ ల జీవితకాలం పెంచటం .దీనికోసం ఆయన చాలా శ్రమ పడాల్సి వచ్చేది .ఇంజన్ లలోని భాగాలు ఘర్షణకు గురికాకుండా చేయటానికి ఇంజిన్ నిర్మాణాన్నే పూర్తిగా మార్చేశారు రామయ్య .ఇలా చేయకపోతే లూబ్రికంట్ ల వలన ఇంజిన్ లోపలి భాగాలు బాగా దెబ్బతిని పోతున్నాయని గ్రహించారు .ఇంజిన్ సునిసిత్వాన్ని కాపాడుతూ ,,లూబ్రికంట్ లోని పదార్ధాలను మార్చారు .దీనివలన ఇంజిన్ రొటేషన్ సామర్ధ్యం పెరుగు తుంది ,ఇంజిన్ భాగాలు దెబ్బ తీసే లూబ్రికంట్లు కాకుండా వాటి ఆయుస్సును పెంచే విధానాలను కనిపెట్టారు .ఈ పరిశోధనా ఫలితాలు చాలా ప్రోత్సాహకం గా ఉన్నాయి అందరూ అభినందించారు .కాని ఈ కంపెనీ రామయ్య గారి కృషి ఫలితాలన్నిటికి పేటెంట్ హక్కులు తీసుకో కుండా అలక్ష్యం చేసింది .ఒక్క మూడు ఫలితాలకు మాత్రమె పేటెంట్ హక్కులు పొందేట్లు చేసింది .పేటెంట్ హక్కు కోసం 1930 లో అప్లికేషన్ పెట్టినా మూడేళ్ళ తర్వాత కాని వాటిని పొందే అవకాశం రాలేదు .మొదటి పేటెంట్ హక్కు ‘’art of purifying petroleum sulphonic acids derived from the treatment of mineral oils with sulphuric acid (17-10-1933)2-Petroleum sulphonic acids ,compositions containing them and the process for preparing them (21-11-1933) 3-Art of treating petroleum sludges (1-5-1934).
ఒక రష్యన్ స్నేహితుడు ఇచ్చిన కమ్యూనిస్ట్ మేని ఫెస్టో చదివారు .దాస్ కాపిటల్ నీ జీర్ణించుకొన్నారు .క్రమంగా తాను ఎర్రజెండా వైపు ఆకర్షింప బడుతున్నానా అని కొంచెం సందేహం లో పడ్డారు కూడా .రామయ్య గారు పని చేసే కంపెనీ యజమానుల్లో వా౦డర్ హేంక్ ఒకడు .ఆయన తో తరచూ కలిసి మాట్లాడేవారు .వాళ్లకి రామయ్యగారి సామర్ధ్యం తెలుసు .ఈయనకు ఉద్యోగం కావాలి .కాని ఆత్మా గౌరవం అంతకన్నా ముఖ్యం అనుకొనేవారు .హేంక్ రామయ్యగారికి కంపెనీలో అత్యున్నత పదవిస్తానన్నాడు .దానికి ఆయనే సమర్ధుడు అనీ అన్నాడు .తమకంపెనీ జెనరల్ మోటార్స్ కంటే వేగంగా పురోగమించాలని దిశా నిర్దేశామూ చేశాడు .రామయ్య గారి లాంటి మేదావి ,సమర్ధుడికి ఈ ఉద్యోగం ఇవ్వటం తమకంపెనీకి గర్వకారణం అని ఉబ్బేశాడు .రామయ్యగారి ఆలోచనలు వేరుగా ఉన్నాయని పసిగట్టాడు .ఆయనకు పని అవసరం అని గ్రహించాడు .తనను బాగా పూర్తిగా అర్ధం చేసుకోమన్నాడు. ఆయన ఎక్కడ పని చేస్తున్నా తన కన్ను ఒకటి ఆయన మీదే ఉంటుంది అనీ చెప్పాడు .
‘’ కాలమే డబ్బు ‘’అన్నసంగతి తనకు తెలుసనీ ,రామయ్యగారి ఫ్రెండ్ హషిమాటోతో లాంగ్వేజ్ ప్రాబ్లెం ఉందని ,అందుకని అతను వెళ్లిపోయాడని అన్నాడు .కొత్త లాబరేటరి ఏర్పాటు చేసి దానికి అన్ని సౌకర్యాలు కలిగించి అధిపతిని చేస్తానన్నాడు .రామయ్య గారి జోలికి వేరెవరూ రారని ,హాయిగా స్వతంత్రంగా పని చేసుకోవచ్చని చెప్పాడు .రామయ్య గారి దిసీస్ సమర్పించటానికి ముందుగా కొంత పని అప్పగిస్తానని ఆశ పెట్టాడు .ఒకటి రెండేళ్లలో అది పూర్తీ చేసుకోవచ్చు .ఇలా చాలా తెలివిగా వా౦డర్ రామయ్య గారితో ‘’మైండ్ గేమ్’’ ఆడాడు .అన్నీ అర్ధం చేసుకొన్నారు రామయ్య .తన్ను ములగ చెట్టు ఎక్కి౦చేశాడని అర్ధమై పోయింది ..రామయ్య బాగుపడితే ఫర్మ్ కూడా బాగు పడ్డట్టే అన్నాడు .రామయ్య గారు వాండర్ వాల్ట్ తప్పేమీ లేదని అవన్నీ వ్యాపార లక్షణాలే నని గ్రహించారు .ఈ బెస్ట్ ఆఫర్ ను కాదనటానికి కొంత సమయం కావాలనుకొన్నారు రామయ్యాజీ .ఒక పక్క వాడు ఊరిస్తున్నాడు .ఇందులో దిగిపోతే తన అస్తిత్వానికే ప్రమాదం రావచ్చునని రామయ్య గారు సంశయిస్తున్నారు .పూర్తిగా ఔననీ చెప్పలేదు కాదనీ అనలేదు .తన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరీక్షించి మాట్లాడిన మాటల్లా అనిపించాయి హేంక్ మాటలు .రామయ్య గారి మస్తిష్కం లో కాసేపు ఒక వెలుగేదో వెలిగింది .చివరికి ఆ కంపెనీ పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకొని చేరటానికి అంగీకరించారు సైంటిస్ట్ రామయ్య .
చిరకాల స్వప్నం అయిన పూర్తీ విజ్ఞానం ,డిగ్రీ ,లేబరేటరీ మూడు సమకూరుతున్నాయని సంతోషించారు .తన పరిశోధనలు భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తాయో తెలీదు . .ఇది అంతా వాతాపి భోజనం లాగా ఉందా ?అని ఒక పక్క భయం .వాతాపి ఇల్వలుడు అనే రాక్షస సోదరులు దారికాచి యాత్రికులను ఇంటికి పిలిచి వాతాపిని కోసి కూరచేసి వడ్డించి అతిధి తినగానే ఇల్వలుడు ‘’వాతాపీ ‘’అని పిలవటం వాడు అతిధి పొట్ట చీల్చుకొని బయటికి రావటం అన్నదమ్ములిద్దరూ అతిధిని ఆరగించటం జరుగుతూ ఉండేది .వీరి బాధ భరించలేక అగస్త్యమునిని శరణు వేదారుజనం ఆయన కు కూడా ఇలానే అతిధి మర్యాద చేశారు ఆయన వాతాపిని తిన్న వెంటనే ‘’జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ‘’అన్నారు వెంటనే వాడు మహర్షికడుపులోనే చచ్చాడు .ఈ కద గుర్తుకొచ్చింది .ఇలాంటిదే ఇంకోరకమైన కదా విన్నారు రామయ్య .ఒక యాత్రికుడికి ఏ అనుమానం కలగా కుండా భోజనానికి పిలిచి ,రుచికర భోజనం పెట్టి ‘’కై కై ‘’అని అరిచి అతిధిని తినేసే కద అది’’కై కై కద ‘’
సకల సౌకర్యాలతో లేబరేటరి
అన్నమాట ప్రకారం లేబరేటరీ ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసి రామయ్య గారికి స్వాధీనం చేసింది కంపెనీ .కస్టపడి పని చేసేవారు దొరికారు .అంతా అనుకోన్నట్లుగా సాగిపోతోంది .ఇక్కడ లెనిన్ చెప్పిన మాటలు ‘’it is easy to start a revolution in Russia but will be more difficult to build socialism than in the developed countries of the West ‘’ జ్ఞాపకమోచ్చాయి .అక్కడ రష్యాలో తిండిలేక ,పండించలేక జనం ఆల్లల్లాడి పోతుంటే ఇక్కడ అమెరికాలో వేలాది టన్నుల గోధుమను టన్నులకొద్దీ కాఫీ గి౦జలను సముద్రం పాలు చేయటం ,కాలిఫోర్నియాలో అధికం గా పండిన ఆరంజ్ లను సముద్రం లో పారేయటం పేపర్లలో చదివి ఆశ్చర్య పోయేవారు రామయ్య .ఇక్కడ అదిక ఉత్పత్తి సమస్య. రష్యాలో ‘’ఉత్పత్తి లేమి ‘’సమస్య .ఇ౦త అధిక ఉత్పత్తి సాధించినా అమెరికాలో తిండీ ,బట్టా లేని నిర్భాగ్యులేందరో ఉన్నారని తెలుసుకొన్నారు .రవాణాకోసం బస్సులున్నాయి ట్రె యిన్లున్నాయి కానీ నిరంతర జన సందోహం తో అవి కిక్కిరిసి పోతున్నాయి . ముఖ్యమైన సైంటిఫిక్ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి రామయ్య బృందం అనుక్షణం పని చేస్తోంది .కంపెనీకి లాభాల వర్షం కురిపిస్తున్నారు .లాబ్ ఫలితాలు విజయ వంతంగా ఉన్నాయి .
‘’ఎర్ర ‘’ఆలోచనలు
న్యూ యార్క్ లో పరిచయమైన ఒక కమ్యూనిస్ట్ పెద్దాయన వలన ‘’కమ్యూనిస్ట్ స్టూడెంట్ సర్కిల్ ‘’ కు చేరువయ్యారు .త్వరలోనే చురుకైన పాత్ర వహించారు .మిగిలిన సర్కిల్స్ లో కూడా పని చేయమని వాళ్ళు కోరారు .తనకు మార్క్సిజం మీద మాత్రమె సానుభూతి ఉందని ,తాను కమ్మ్యూనిస్ట్ ను కానని తేల్చి చెప్పేశారు .వారు కమ్మ్యూనిజం హ్యూమనిజం కంటే గొప్పదని చెప్పారు .ఇది కొంత ప్రభావం కలిగించి కమ్య్యూనిజం గురించి చదివి ఇతరులకు బోధించసాగారు రామయ్య .ఏదీ శాశ్వతం కాదని, మార్పు ప్రకృతి సహజమని గ్రహించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు