కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానం
- 28/05/2015
కాచిగూడ, మే 27: పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్, జిపి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు హాజరై కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదుతో పాటు ఎన్టిఆర్-జిపిఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎన్టిఆర్ పేరుతో బిరుదును ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కోట శ్రీనివాసరావు తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. నందమూరి లక్ష్మీపార్వతి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, వంశీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు, బిజెపి మహిళా మోర్చా సభ్యురాలు కె.మధుబాల, సామాజిక కార్యకర్త అంజనారెడ్డి, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ, గానసభ అధ్యక్షుడు డా. కళావేంకట దీక్షితులు పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ, గాయకులు అలపించిన సంగీత విభావరి అందరినీ అలరించింది.
సేవా రత్న పురస్కారాల ప్రదానం
కాచిగూడ, మే 27: గోల్డెన్ స్టార్ యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీవేత్త గిరిరాజు విజయలక్ష్మీ సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ గిరిరాజు విజయలక్ష్మీ పేరుతో సేవా పురస్కారాలు ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సెంట్రల్ సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు, సాహితీవేత్త డా.శరత్ జ్యోత్నారాణి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో డా.లక్కరాజు నిర్మల, మంగళగిరి ప్రమీలాదేవి, గానసభ అధ్యక్షుడు డా.కళావేంకటదీక్షితులు పాల్గొన్నారు.
మనస్విని నృత్య మందారం
రవీంద్రభారతి, మే 27: చిదంబరంలో శివుడు ఎడమ కాలు పైకెత్తి ఒంటి కాలుతో నాట్యం చేస్తున్నట్లు నటరాజ స్వామిగా సాక్షాత్కరిస్తాడు.. ఈ భంగిమ ఆధారంగా హిందోళ రాగంలో రూపకల్పన చేసిన తిల్లాన అంశాన్ని చిన్నారి మనస్విని ముచ్చటగా రమ్యంగా నర్తించింది. 9వ తరగతిలో అడుగుపెడుతున్న ఈ చిన్నారి బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో భరటనాట్య సంప్రదాయంలో అరంగేట్రం ప్రదర్శించింది. ‘్ధరసమేరా యమునా తీరానా..’ జయదేవుని అష్టపధిని యమన్ కళ్యాణి రాగంలో మంతా శ్రీనివాస్ ఆలపించగా నాట్యాచారిణి మీనాక్షి రవీందర్ నట్టువాంగానికి అనువుగా మనస్విని హృద్యంగా నర్తనచేసి ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో ప్రధాన అంశం వర్ణం ‘దానికే తగు జానరా…’ తోడి రాగం, రూపక తాళంలో ఆలపించగా చిన్నారి అభినయానికి ప్రేక్షకులు హర్షధ్వనాలు ప్రకటించారు. ఈ అంశంలో పార్వతీదేవి చెలికత్తె శివుని గురించి కొనియాడుతూ పార్వతీ పరమేశ్వరుల ఆనంద తాండవాన్ని వర్ణించడంను తన అభినయంలో ముచ్చటగా ప్రదర్శించింది. నృత్య కార్యక్రమం పుష్పాంజలితో ప్రారంభమైంది. ఆది గురువు మాతృమూర్తికి, నటరాజస్వామికి, ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ ప్రేక్షక దేవుళ్లకు నమస్కరించి నృత్య కార్యక్రమం శుభ ప్రదం అవ్వాలని ప్రార్థించి రాగమాళికా రాగంలో శ్లోకాలను అభినయించింది. కర్ణాటక దేవగాంధారీ రాగంలో పంచాక్షరీ దేవి కీర్తనను నృత్యం చేస్తూ సృష్టి స్వరూపిణి జగన్మాతను వివిధ అవతారాలతో కొనియాడుతూ అభినయంలో చిన్నారి ప్రార్థించింది. సావేరి రాగంలో జతిస్వరంను కూడా ప్రదర్శించి చివరగా మంగళంతో అనిల్కుమార్ వయొలెన్తోను, సుధాకర్ వీణా వాయిద్యంతోనూ, నాగేశ్వరరావు మృదంగంతో సహకరించగా నృత్య కార్యక్రమం ముగిసింది. సి.శివశంకర్రెడ్డి, సీతాలక్ష్మి మనవరాలు చిన్నారి సి.మనస్విని పుష్పాలతో నాట్యగురువు మీనాక్షి రవీంద్రకుమార్కు పాదాలకు నమస్కరించి గురుసత్కారం చేసింది. మనస్విని ఇస్కాన్ ప్రతినిధి రామచంద్రకృపాదాస్, గైనకాలజిస్ట్ డా. మీనా ఉగేల్, గీతాంజలి సంస్థ ప్రిన్సిపల్ మాధవీ చంద్రా, సి.రాజశేఖర్రెడ్డి, శారద, నిశ్చల్రెడ్డి ఆశీర్వాదించారు.
sir…kota is the only person who deserves such a great award…..telugus are gifted to have him..thanks to late jandhyaala garu..