గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి
గబ్బిట దుర్గా ప్రసాద్ సాహితీ ప్రియులకు , అటు అంతర్జాల చదువరులకు సుపరిచితమైన పేరు . వృత్తి రీత్యా సైన్స్ మాస్టర్ అయిన , ప్రవృత్తి రీత్యా సాహిత్య వేత్త , బహు గ్రంధ రచయిత . ఇప్పటి వరకు తన స్వీయ రచనలు తొమ్మిది పుస్తకాలు వెలువరించారు . స్వీయ సంపాదకత్వంలో సరస భారతి ప్రచురణలో ఏడు గ్రంధాలను ప్రచురించారు . ప్రస్తుత రచన “ గీర్వాణ కవుల కవితా గీర్వాణం” .
ఈ పుస్తకం సుమారుగా 146 వ్యాసాల సమాహారం . ప్రసిద్ధ కవులు వ్యాస , వాల్మీక , శ్రీ హర్షుడు , విశాఖ దత్తుడు , భారవి , శూద్రక , దండి , హర్షవర్ధనుడు , మాఘుడు , బాణుడు ,భోజుడు ,కవిరాజు , కల్హణుడు , గౌడ డిండిమ భట్టు మొదలైన కవులు లతో పాటుగా అలంకార శాస్త్ర రచయితులైన దండి , ఉద్భుటుడు , వామనుడు , ఆనందవర్ధనుడు , రాజశేఖరుడు ,రుద్రుటుడు , అభినవ గుప్తుడు , విశ్వనాధుడు , వామనభట్టు , బాణుడు , మధుసూదన సరస్వతి , జగన్నాధ పండితరాయులు గురించి వివరణ కూడా పొందుపరిచారు .
అదే విధంగా కవియిత్రులు గంగాదేవి , ప్రణయ కవియిత్రి మోరిక , స్వభావోక్తి కవియిత్రి మురళ , నంజన గూడు తిరుమలాంబ , రామ భద్రాంబ , పద్మా వతి , గౌరీ వారి విశేషాలతో పాటు నాట్యం , సంగీతం కళలకు తమ రచనల ద్వారా వన్నె తెచ్చిన కవులు , పండితులు భరతముని , జయదేవుడు , జాయపసేనాని, సింగభూపాలుడు . కొమారగిరి రెడ్డి,నారాయణతీర్ధులు మొదలైన వారి జీవిత విశేషాలు , రచనల వివరాలు పొందుపరిచారు .
అపర శంకరులు . శంకర భాగాత్వాదులు మొదలుకొని శతావధాని గణేష్ వరకు ఎందరో సంస్కృత పండితుల సమాచారం పొందుపరిచారు రచయిత . కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు . అద్వైత మత స్థాపనాచార్యులు , త్రిమతాచార్యులలో ప్రధములు , శంకరాచార్యుల బాల్యం గురించి , గురుదర్శనం , స్తోత్రరత్నాలు , అద్వైతం మొదలైన ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి . అర్ధ శాస్త్ర రచయిత కౌటిల్యుడు విశేషాలు , భరత నాట్య సృష్టి కర్త భరతముని వివరాలు , భరతముని రచించిన నాట్య శాస్త్రాన్ని పి.యస్ .అప్పారావు తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు .
క్రీ.పూ 1వ శతాబ్దానికి చెందిన ఘటకర్పకుడు గురించి వివరణ ఉంది . భాసుడే ఘటకర్పకుడు అనే ప్రచారం ఉంది అని , అది నిజం కాదు అనే వివరణ కూడా రచయిత ఆ పుస్తకంలో ఇచ్చారు . ఘటకర్పకుడికి యమక చక్రవర్తి అనే బిరుదు కూడా ఉంది . బౌద్ద వేదాంత కవి అశ్వ ఘోషుడు గురించి సమాచారం విపులంగా తెలియజేశారు . తెలుగు సాహిత్యంలో శ్రీనాధుడి పేరు సుపరిచితమే . శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన నైషధీయ చరిత్రను శ్రీనాధుడు తెలుగులోకి అనువదించాడు . అలాగే సంస్కృతం నైషదీయంలో శ్రీహర్షుడు మంత్ర శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప వ్యాఖ్యానం రాశారు .
మహా కవి శూద్రకుదు , ఈయన నాటక నవలాకారుడు ,3 వ శతాబ్దానికి చెందినవాడు . శూద్రక అనేది కలం పేరు . అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహ . ప్రకరణ రచనకు ఆద్యుడు శూద్రకుడు . అలాగే మృచ్చకటికం గురించి , నామ ఔచిత్యం గూర్చిన వివరణ కూడా తెలియజేశారు రచయిత . విశాఖ దత్తుడు అనగానే ముద్రారాక్షసం నాటకం గుర్తుకు రాక మానదు . ఆయన దేవీ చంద్ర గుప్తా నాటకం అభిసారికా వంచితం మొదలైన నాటకాలను కూడా రాశాడు . అలాగే విశాఖ దత్తుడు అర్ధ , నాట్య , న్యాయ , రాజనీతి శాస్త్రాలలో నిష్ణాతుడు .
పాల్కురికి సోమన గురించి తెలియని తెలుగు వారు అరుదు . కాని ఆయన సంస్కృతి పాండిత్యం అంతగా తెలియక పోవచ్చు . సోమనాధుని “వీర శైవాగ్రేసరుగు” అంటారు . బసవేశ్వరుని చరిత్రను పురాణంగా రాసి కొత్త దారి తీశాడు . చరిత్రకు పురాణ వైశిష్ట్యతను కలిగించిన మొదటి కవి పురాణ కర్త సోమన . ఎవరైనా ఏ పుస్తకం మీదనైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లినాధ సూరి వ్యాఖ్యానంలా ఉంది అంతం పరిపాటి . ఈయన 1350- 1450 కాలంలోని వాడు . కాళిదాసు కుమారా సంభవం , భారవి కిరాతార్జునీయం , మాఘడు , హర్షుడు వారి కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసాడు సూరి .
రేడియోలో సంస్కృత పాఠాలు బోధించిన సర్వోదయ ప్రచారకులు కేశిరాజు వెంకట అప్పారావు 1913 మార్చి 14 న తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జన్మించారు . తెనాలి నుండి వెలువడే సామ్య యోగం ‘సర్వోదయ పక్ష పత్రికకి గౌరవ సంపాదకులుగా సేవ చేశారు . వీరి కావ్యాలు పంచవటి , గంగాలహరి . వీటిని తెలుగులోకి అనువాదం చేసారు . బృందావనం అనే కావ్యాన్ని హిందీ , తెలుగు , సంస్కృతి భాషలలో రచించి తమ ప్రతిభను చాటుకున్నారు . చివరి వ్యాసంగా శతావధాని గణేష్ పరిచయం వివరాలతో ముగుస్తుంది . సంస్కృత , కన్నడ , ఆంద్ర భాషలలో శతావధానం చేసి ఆశు కవిత్వంలో దిట్ట . అవధానాలతో పాటు శతావధాన శారద , శతావధాన శ్రీవిద్య , శతావధాన శాశ్వత గ్రంధాలను రాశారు . షేక్ స్పియర్ రాసిన నాటకం హామ్లెట్ కు కన్నడ అనువాదంగా హొరాషియో రాసి , తానే ముఖ్య పాత్ర పోషించారు .
విరూపాక్ష కవి , సంబందు , మయూరుడు , అమరుక కవి , భట్టి మురారి , వాక్పతి రాజు , దిజ్నాగుడు , పరిమళ పద్మ గుప్తుడు , రుమ్యకుడు , జినరత్న , వామన భట్ట బాణుడు , నంజన గూడు , తిరుమలాంబ , నుదురుపాటి వెంకన్న , రాజవర్మ , శొంటి భద్రాద్రి రామ శాస్త్రి మొదలైన కవులు సమాచారం కూడా పొందుపరిచారు . అలాగే కాళిదాసు కుమారా సంభవం కావ్యాన్ని కన్నడంలోకి అనువాదం చేసిన కవి ఎవరు ?, జైన తీర్ధం కురులలో చివరి వాడైన మహా వీరుని జీవితం పై వచ్చిన మొదటి గ్రంధం ఏది ?, అభినవ కాళిదాసు అని ఎవరిని పిలుస్తారు ?, షేక్ స్పియర్ నాటకాలను సంస్కృతంలోకి అనువదించిన రచయిత ఎవరు ?, సంస్కృతంలో ఉత్తరాలు రాసిన రచయిత పేరేమిటి ? ఇత్యాది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే .
ఇది వరకు వచ్చిన “పూర్వ ఆంగ్ల కవుల చరిత్ర పుస్తకం ఆంగ్ల సాహిత్యానికి ఒక కర దీపికగా లభించిందో ,ఈ పుస్తకం పేర్కొన్న కవులు, రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకత కలిగిన వారే . సంస్కృత సాహిత్యాన్ని అభిమానించే వారికి ఈ గ్రంధం అపురూప కానుక . సంస్కృత సాహిత్యాన్ని చదవాలి అనుకునే వారికి ఈ గ్రంధం ఒక కరదీపిక అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .
– అరసి
ప్రతులకు :
గబ్బిట దుర్గా ప్రసాద్
శివాలయం వీధి ,ఉయ్యూరు
కృష్ణా జిల్లా
సంచార వాణి:9989066375
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నమస్తే హేమలత గారు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ” గ్రంధం పై శ్రీ /శ్రీమతి” అరసి ”గారు ”లోనారసి ”విపులమైన అర్ధ వంతమైన సమీక్ష చేసి గ్రంధం ఔచిత్యాన్ని ,ప్రస్తుత సమాజానికి దాని అవసరాన్ని ,అందులోని వివిధ విశేషాలను ఆసాంతం ఆస్వాదనీయం గా రాశారు వారికి నా తరఫున సరసభారతి తరఫున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ..సమీక్ష రాయించి విహంగ లో ప్రచురించిన మీకు ధన్యవాదాలు . -దుర్గాప్రసాద్