తమాషా కలయిక
ఎప్పుడో 45ఏళ్ళ క్రితం నేను పని చేసిన నందిగామ దగ్గరున్న ముప్పాళ్ళ గ్రామం లో ,నేను అద్దెకున్న శ్రీ భండారు సుబ్బారావు శ్రీమతి సీతారావమ్మ దంపతుల ఇంటికి దగ్గరలో బొడ్రాయి దగ్గర స్వంత ఇల్లు ఉన్నవారూ ,ప్రస్తుతం కొత్తగూడెం సింగరేణి కాలరీస్ అసిస్టంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్న శ్రీ దుర్భాకుల వెంకట సుబ్రహ్మణ్యం శ్రీమతి కల్యాణి దంపతులను మన శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో పూజారి వేదాంతం మురళికి సహాయకులుగా పని చేస్తున్నవారు ,పూర్వం కొత్తగూడెం లో పని చేసిన వారూ అయిన శ్రీ బలరామ కృష్ణ గారు నిన్న 20-3-16 ఆదివారం సాయంత్రం తీసుకొని వచ్చారు .అప్పటిదాకా వారెవరో మాకూ మేమెవరో వారిద్దరికీ తెలియనే తెలియదు .ఇంటి పేరు దుర్భాకుల అని వారు చెప్పగానే సుమారు సంవత్సరం క్రితం జగ్గయ్య పేట నుండి ఉయ్యూరు లో సూరి పార్ధి మాస్టారి మనవడి ఉపనయనానికి వచ్చి, మనింటికి వచ్చిన జగ్గయ్య పేట రిటైర్డ్ తెలుగు పండిట్ దుర్భాకుల వారబ్బాయి దుర్భాకుల కిషోర్ అతని అక్క జలసూత్రం జయశ్రీ జ్ఞాపకం వచ్చి వాళ్ళు బంధువులా అని అడిగితె బంధువులే అన్నారు .సరే తీగ లాగటం మొదలైంది .
మీ స్వగ్రామం ఎక్కడ అని అడిగితె ముప్పాళ్ళ అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యం .ఎగిరి గంతేసినంత ఆనందం కలిగింది .నాకు పరమ పూజ్యులు ,ఆరాధనీయులు నేను అద్దెకున్న ఇంటివారు నన్ను పరమ ఆత్మీయంగా చూసుకొన్న దంపతులు శ్రీ భండారు సుబ్బారావు గారు ,శ్రీమతి సీతా రావమ్మ గారు జ్ఞాపకం వచ్చి వీరిద్దరూ తెలుసా అని అడిగా .తెలియకేం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న బొడ్రాయి దగ్గరే మా ఇల్లు అన్నారు .అక్కడెవరో ఒక మేస్టారుకూడా ఉండాలే అన్నాను .అవును ఆయనే గుర్నాధం మేష్టారు అన్నారు. వారింటికీ ఆహ్వానించి నాకు ఆతిధ్యమిచ్చిన విషయం గుర్తు చేసుకొని చెప్పాను .
‘’మేస్టారు గారూ’’! అని సీతారావమ్మ గారు నన్ను స్వంత కొడుకుగా నన్ను పిలవటం , మట్టి గోడల ఇల్లే ,నేలకూడా మట్టినేలే అయినా నాకు ఏ లోపం రాకుండా చూసుకొన్న పుణ్య దంపతులు భండారు వారు వాళ్ళబ్బాయి వీరభద్రం అప్పుడు తొమ్మిదో,పదో క్లాస్ చదివే వాడు .ఇంకొకడు ఏడవ క్లాసు. ఒక అమ్మాయి, ఇంకో పిల్లాడు కూడా ఉండేవారు .రెక్కాడితెకాని డొక్కాడని కుటుంబం .సుబ్బారావు గారు కరణీకం చేసేవారు .మొహమాటం జాస్తి. ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకొనేవారు .అడిగే స్వభావం కాదు .పొయిలో పిల్లి లేవాలంటే అంతా సీతారావమ్మ గారిమీదే ఆధారం ఆమె నోరు చాలా మంచిది నలుగురికీ ఉపకారం చేసే నైజం వలన ఆమె అంటే ఊళ్ళో అందరికీ గౌరవం ఆప్యాయత .నిత్యం బయట రోలులో జొన్నలు దంచి వుడకేసి తినేవారు .వారానికొకసారి వరి అన్నం తినేవారేమో .గర్భ దరిద్రం లోనే బ్రతికారు .కాని ఎన్నడూ తన కస్టాలు ఎవరికీ చెప్పుకొని ఉత్తమా ఇల్లాలు సీతారావమ్మ గారు . అందరు కుటుంబ సభ్యులు నన్ను పరమ ఆప్యాయంగా చూడటం నేను మరిచి పోలేను . నేను వారింట్లో ఒక గదిలో అద్దేకు౦డేవాడిని .నెలకు పాతికో ముప్ఫయ్యో అద్దే ఇచ్చేవాడినేమో .వంట ‘’ఉమ్రావ్ స్టవ్’’ మీదు చేసు కోనేవాడిని .అన్నం వండుకొంటే కూరలు పచ్చళ్ళు సీతారావమ్మ గారే ఇచ్చేవారు .పాలు కాచి తోడూ పెట్టేవారు .నేను ప్రతి శనివారం ఉయ్యూరు పరిగేత్తుకోస్తూ ఉంటె ,చేలలోకి వెళ్లి దోసకాయలు ఉల్లిపాయలు తెచ్చి నాకు ఇచ్చి పంపేవారు .వెన్న పూస కావాలన్నా ,కమ్మని నెయ్యి కావాలన్నా ఇంటింటికీ తిరిగి వీసేలకు వీసేలునేనిచ్చిన డబ్బుతో కొని తెచ్చి నాకు అందించేవారు .నిజంగా వారు చేసిన సహాయానికి నేనేమిచ్చినా ఋణం తీర్చుకోలేను ,లేను లేను లేను . ఎక్కడో ఉయ్యూరు కు దూరం గా ఉన్నానన్న భావన రానీకుండా స్వంత ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించిన కుటుంబం సీతారావమ్మ సుబ్బారావు గార్లది . నేను ఇక్కడి నుండి కందా పెండలం దొండకాయలు ,చెరుకు ముక్కలు తీసుకొని వెళ్లి వారికిచ్చేవాడిని .సీజన్ లో రసాలు మామిడి పండ్లు తీసుకు వెళ్లేవాడిని అవి అక్కడ దొరకవు కదా .నేను ఉయ్యూరు వచ్చేసినా ఒకటి రెండుసార్లు భండారు వారింటికి వెళ్లి వారిని పలకరించాను .ఇలా ఆప్యాయత ,ఆత్మీయత కురిపించిన ఆ కుటుంబాన్ని గురించి మనసు విప్పి మాట్లాడుకొన్నాంశ్రీ సుబ్రహ్మణ్యం దంపతులతో .వారూ ఏంతో చలించి ఆ దంపతుల సౌజన్యాన్ని ఏంతో గొప్పగా మెచ్చుకొన్నారు .దుర్భాకుల వారు చదువులకోసం ముప్పాళ్ళ వది లేసి వస్తే, ఊళ్ళో వారు వారి ఇల్లు ఆక్రమించి చాలా ఇబ్బంది పెట్టారని ఎవరూ ఇదేమిటి అన్న పాపాన పోలేదని ,,చివరికి బాగా ఒత్తిడిని అన్ని రకాలుగా తెస్తే వదిలేశారని, తమ తండ్రిగారు ఆ ఇంటిని ముప్పాళ్ళ పంచాయితీకి రాసిచ్చారని తెలియ జేశారు .ఇదీ గ్రామీణ రాజకీయవ్యవహారం .
ఏదో మాటల సందర్భం గా ‘’భైరవ భొట్ల ‘’పేరు వచ్చింది . పెనుగంచిప్రోలులో1985లో సైన్స్ మేస్టారు గా నేను పని చేసినప్పుడు ,మెయిన్ రోడ్డు మీద ఉన్న డాబా ఇంట్లో బయటి గదిలో నేను అద్దెకున్నశ్రీ భైరవ భొట్ల బాబు గారు తెలుసా ?అని వారిని అడిగాను .అయ్యో తెలియక పోవటమేమిటి ఆయన మాకు అతి దగ్గరి బంధువు అన్నారు దుర్భాకుల వారు .అందరూ ఆయన్ను బాబు గారు అనే పిలుస్తారని,అసలుపేరు రామకృష్ణ శర్మ అని స్మార్తం లో మహా దిట్ట అని ,యజుర్వేద సంధ్యావందనం మొదలైన పుస్తకాలు రాశారని ,దేవాలయ ప్రతిష్టలు చేయించటం లో తెలంగాణా లో ముఖ్యంగా ఖమ్మం వరంగల్ ప్రాంతాలలో ఆయనకు మించిన వారు లేరని ఇద్దరం గుర్తు చేస్సుకోన్నాం. బాబు గారి భార్య గారు కూడా మహా దొడ్డ ఇల్లాలని జ్ఞాపకం చేశాను .పిల్లలు లేని ఆ వృద్ధ దంపతులు నన్ను తమ పిల్ల వాడిగా చూసుకోవటం నేనెప్పుడూ మర్చి పోలేను. కాఫీ దగ్గరనుండి కూరలు పెరుగు నెయ్యి పాడుకోటానికి మంచం , అన్నీ ఆమె నాకు అమ్మలాగా అందించేవారని బాబు గారు నన్ను ఏంతో ప్రేమతో పిలిచేవారని గుర్తు చేశాను .సుబ్రహ్మణ్యం గారు కూడా వారిద్దరి ఔదార్యాన్ని కొని యాడారు .అలాంటి గొప్ప వారు జన్మించటం అరుదైన విషయం అనుకొన్నాం .ఈ మధ్య పెనుగంచి ప్రోలు కు మా కుటుంబం తో వెళ్లి నప్పుడు బాబు గారిల్లు కనపడలేదని అనగానే ,వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత అంతా అమ్మేశారని బాబుగారి అపూర్వ గ్రంధాలను అవతలి బజారులో ఉన్న బావమరిది అంటే భార్య సోదరుడికి ఇచ్చారని ఆయన వైదికం లో ఉండి,వాటిని సార్ధకం చేస్సుకొంటున్నారని దుర్భాకుల వారన్నారు .వారమ్మాయి టెన్త్ లెక్కల్లో తప్పితే సప్ప్లి మెంతరీ పరీక్షలకు నేనే లెక్కలలో కోచింగ్ ఇచ్చానని పాసైందని గుర్తు చేసుకొని చెప్పాను .మేమిద్దరం బాబు గారు దంపతులకు ,భండారు సుబ్బారావు గారి దంపతులకు రెండు చేతులూఎత్తి మనస్పూర్తిగా నమస్కారాలు సమర్పించి ధన్యులమయ్యాం .
మళ్ళీ సంభాషణలలో వేలూరి వారి గురించి వచ్చింది .చిరివాడ వేలూరి వారి అగ్రహారం అని చిరివాడ వేలూరివారికి మా చిన్నక్కయ్య ను , మా అన్నగారి అమ్మాయిని ఇచ్చామని చెప్పాను .ఆమెకూడా తనకు వేలూరి వారి గురించి బాగా తెలుసునన్నారు .తర్వాత’’గాడేపల్లి ‘’వారి పేరొచ్చింది .మా పెద్దక్కయ్య గాడేపల్లి వారి కోడలే అన్నాను .మా బావ మరిది కూతుర్ని తణుకు విజయా బ్యాంక్ లో పని చేస్తున్న గాడేపల్లి మూర్తి గారబ్బాయి శ్రీ హర్షకు ఇచ్చి వివాహం చేశారని ఈ మధ్యనే వాళ్లకు ఆడపిల్ల పుట్టిందని 11వ తేదీ హైదరా బాద్ లో భారసాలకు వెళ్లి వచ్చామని చెప్పాం .అరె భాను మూర్తి గారా ఆయన మాకు చాలా దగ్గర బంధువే అన్నారు సుబ్రహ్మణ్యంగారి భార్య .ఇంతలో మా బావమరిది ఆనంద్ వచ్చాడు అందరూ చుట్టరికాల గురించి మాట్లాడుకొన్నాం .ఇలా తమాషాగా తీగ లాగితే డొంకంతా కదిలి బంధుత్వాలు,అపూర్వ పరిచయాలు తెలిసి, తెలియని, ఊహించని ఆనందం అందరికి కలిగింది .దైవ సంఘటనలు తమాషాగా ఉంటాయి .దుర్భాకుల వారి అమ్మాయి హైదరాబాద్ లో ఐ బి ఏం లో సిస్టం మేనేజర్ గా చేస్తోందని ఆ అమ్మాయికి సంబంధాలకోసం బెజ వాడ శంకర మఠంలో రిజిస్టర్ చేయించటానికి ,ఈ ప్రాంతం తమకు తెలియదు కనుక తమతో పూర్వం కొత్త గూడెం లో పనిచేసిన శ్రీ బలరాం గారిని తీసుకొని వెళ్లి ఇక్కడికి వచ్చామని తెలియ జేశారు .మా రెండో అబ్బాయి శర్మ కూడా అదే కంపెనీలో పని చేస్తున్నాడని చెప్పాను . సరసభారతి పుస్తకాలు, జ్ఞాపిక దుర్భాకుల దంపతులకు అందజేయగా వారు సరసభారతికి 1.116రూపాయలు అందజేశారు . తరువాత శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయానికి వెళ్లి స్వామి పూజ చేయించుకొని రాత్రి ఏడు గంటలకు కారులో కొత్తగూడెం బయల్దేరి వెళ్ళారు .ఇలా ఈ ఆదివారం సాయంత్రం చాలా విశేషమైనదిగా,విశిస్టమైనదిగా , తమాషా కలయిక రోజుగా ,చిరస్మరణీయమైనదిగా నిలిచి పోయింది ‘.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-16-ఉయ్యూరు
.