ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126
52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్
నిరంతరం బాధిస్తున్న ఎలర్జీలతో సతమౌతూ ,ఆ బాదానివారణ కోసం డ్రగ్స్ కు అలవాటై చస్తూ బతికి ,ఇరవై వ శతాబ్దం లో అత్యుత్తమ సుదీర్ఘ నవలా రచయిత గా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ నవలారచయిత మార్సెల్ ప్రౌస్ట్ .వ్యాసాలు కొన్ని మాత్రమే రాసినా అతని ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ టైం లాస్ట్ ‘’అనే 16 భాగాల సుదీర్ఘ నవల కొంత ఫిక్షన్ ,మరికొంత ప్రౌస్ట్ స్వీయ జీవిత చరిత్ర ,సమాజం యొక్క సంపూర్ణ దృశ్య చిత్రం గా కాలాతీత నవలగా మిగిలింది .
10-7-1871లో ఫ్రాన్స్ లోని ఆటేవిల్ అనే పారిస్ కు దగ్గరలో ఉన్న శివారు గ్రామం లో జన్మించాడు మార్సెల్ ప్రౌస్ట్ .సంపన్న ఎగువ మధ్యతరగతి కుటుంబం .తండ్రి డాక్టర్ ఎడ్రీన్ ప్రౌస్ట్ వ్రుత్తి రీత్యా డాక్టర్ మాత్రమే కాక ,పారిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ ,ఫ్రెంచ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ కు హెడ్ కూడా .తల్లి జీన్నే వీల్ అందమైన సంస్కారవంతమైన ఆల్సేషియన్ జ్యూయేస్ .కొడుకును అతిగారాబంగా పెంచి ,తనపైనే ఆధార పడిన అతడిని చెడగొట్టింది .ఇద్దరు కొడుకులలో రాబర్ట్ చిన్నవాడు తండ్రినుంచి మంచి ఆరోగ్యం ,వివేకం వారసత్వంగా పొందాడు .ఇతనికి రెండేళ్ళ పెద్దవాడైన మార్సెల్ తల్లినుంచి నరాల బాధ ,అసహనం సున్నితమైన సంవేదనా శీలాలను పొందాడు .9వ ఏట మార్సెల్ ఊపిరి సలుపని జబ్బు పడ్డాడు .అదే ఉబ్బసరోగం అని తర్వాత గుర్తించారు .తరువాతి కాలం లో జరిగిన సంఘటనలు ఈ జబ్బును బాగా తీవ్రం చేశాయి .ఆస్తమా ఒకోసారి మానసిక అస్తవ్యస్తత వలన కూడా రావచ్చు .పాపం ప్రౌస్ట్ క్రానిక్ ఆస్తమా పేషెంట్ అయిపోయాడు .దీనితో జీవితం లో కొంత వరకు పనికి రాని వాడుగా ఉండి చనిపోయేదాకా ఎప్పుడూ మంచం లోనే ఉండిపోవటానికి నిర్ణ యించు కొన్నాడు .
తల్లికి అతుక్కు పోయి జీవించాడు .ఈ విషయాలన్నీ తన ప్రఖ్యాత నవల లో మొదటి భాగం అయిన ‘’స్వాన్స్ వే’’లో వర్ణించాడు .రచయిత చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి ఒకరోజు రాత్రి రోజూ లాగా ఆతను నిద్రించే ముందు ఇచ్చే’’ గుడ్ నైట్ ముద్దు’’ ఇవ్వటం మర్చి పోయింది .అది అతనిని డిప్రేస్ చేసింది .ఈ విషయాన్ని మర్నాడు డిన్నర్ టేబుల్ దగ్గర ఒక కాగితం పై రాసి ఆమె చూసేట్లు కింద పడేశాడు .ఈ సంఘటన అతన్ని మానసికంగా బాగా కుంగ దీసింది. అంతటి సెన్సిటివ్ అయ్యాడు మార్సెల్ .ఈ సంఘటననే నవలలో రాశాడు .అందుకని ప్రతిరాత్రీ ఆమె గుడ్ నైట్ కిస్ ఇచ్చి తలుపు వేసి వెడుతున్నప్పుడు తల్లిని మళ్ళీ పిలిచి మరో కోసరు ముద్దు పెట్టించుకొని నిద్ర పోయేవాడు .అప్పుడామే చాలా అసహనంగా కనిపించేది .ఈ విషయం పై రాస్తూ తన మనోభావాలను ‘’When she bent her loving face down over my bed ,and held it out to me like a Host ,for an act of Communion in which my lips might drink deeply the sense of her real presence and with it the power to sleep ‘’అని రాసుకొన్నాడు .అంతటి గాఢఅనుబంధం తల్లితో ఉండేది ప్రౌస్ట్ కు .
స్వీయ జీవిత చరిత్రలోని ‘’నేను ‘’కు ,నిజ జీవితం లో మార్సెల్ కు చిన్న తేడా మాత్రమే ఉండేది .యవ్వనం లో తల్లిని చిన్నప్పటి గాయ పడిన మనసుతోనే పిలిచేవాడు .అందులో ఉన్న నిజాన్ని ఉత్తరాలలో తల్లికి తెలియ బరచాడు కూడా .అతను పలికిమాలిన ,ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా ఇలాగే జరిగింది .తాను కొంత మెరుగైన ఆరోగ్యం తో ఉన్నప్పుడు కూడా ఆమె ఇలానే ప్రవర్తించింది అన్నాడు .తాను ఆస్తమా తో బాధ పడుతున్నప్పుడు తల్లి తనకు తోడుగా ఉంటె బాగుండును అనుకొన్నాడు .ఈ రాతలలో అతని స్వీయ కనికరం ,(సెల్ఫ్ పిటి )మూర్చ(హిస్టీరియా ) లతో కంగారు గా ఉన్న మనస్సు కనిపిస్తుంది .కొడుకు అనారోగ్యం వలన దేనికీ పనికి రాని వాడైనాదని తండ్రి పట్టించు కోవటం మానేస్తే తల్లి అతని పాలిటి ఆత్మ బంధువు అయి చదువు సంధ్యలు చూసింది .అతని నైతిక స్తైర్యాన్ని పెంచటానికి ఏదో ఒక పని చెప్పి చేయించేది .చదువు అంటే బద్ధకమేర్పడింది .తల్లి ఎప్పుడైనా తిడితే అతనికి విపరీతంగా దగ్గు వచ్చి ఎక్కువకాలం బాధించేది .అప్పుడు తల్లి తప్పక అతనికి సేవలు చేయాల్సి వచ్చేది .లైబ్రరీకి చేరి తన జీవితాన్నే సాహిత్యంగా మలిచాడు .పుస్తకాలు జుర్రి ,మనుష్యుల్ని చదివాడు .తండ్రి స్వగ్రామం ఇల్లీర్స్ లో వేసవి ఎప్పుడు గడపాలా అని ఎదురు చూసేవాడు .ఈ గ్రామమే అతని ఫిక్షన్ కు కామ్బ్రే గా మారి నేపధ్యం అయింది .సముద్ర తీర కాబోర్గ్ టౌన్ ఫిక్షన్ లో బాల్బెక్ అయింది .బ్రేకులు పడుతూ చదువు సాగింది. లైసీ కండార్సేట్ లో చేరి చదివి సెయింట్ సైమన్ ఫిలాసఫీని అర్ధం చేసుకొన్నాడు .తన పట్టణ ప్రజల ,సమాజం యొక్క పరిస్తితులపై విశ్లేషనాత్మక రచయితగ మారాలనుకొన్నాడు .కాన్స్క్రిప్ట్ ఆర్మీ లో కొద్దికాలంపని చేసి ,దిస్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ,లా స్కూల్ ,సార్బొంనే స్కూల్ లలో పేరు రిజిస్టర్ చేయి౦చు కొన్నాడు .సార్బాన్నే లో అతనిపై హెన్రి బెర్గ్ సన్ ప్రభావం పడింది .బెర్గ్ సన్ స్పెషలైజ్ చేసిన ఇమాజినేషన్ అండ్ ఇంట్యూషన్ (ఊహ ,అంతర్ దృష్టి)పై అభిరుచి కలిగింది. బెర్గ్ సన్- ప్రౌస్ట్ కజిన్ మిల్లీ ని పెళ్లి చేసుకోన్నాక వీరిద్దరిమధ్య అనుబంధం మరీ పెరిగింది .
సశేషం
ఆల్ ఫూల్స్ డే శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-16-ఉయ్యూరు