-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )
డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1956 న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం యలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బాసావిత్రి గారు .కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠంలో చదివి ఆంధ్ర విశ్వ విద్యాలయం లో చేరి 1980లో ఏం .ఏ . పాసైనారు . 1979లో శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు .వీరికి ముగ్గురు కుమారులు –శ్రీ సుబ్రహ్మణ్య సీతా రామ శర్మ ,జయ మాణిక్య శాస్త్రి ,శ్రీ శ్రీనివాస యజ్ఞ దక్షిణా మూర్తి శాస్త్రి .82లో గుంటూరు విద్వత్ పరిషత్ ,గౌరవ డాక్టరేట్ నిచ్చి గౌరవించింది .తిరుపతి .కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం 1985లో గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పురస్కారమిచ్చి సన్మానించింది . .
గుంటూరు లో డాక్టర్ శ్రీ కొలచల వెంకట కృష్ణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో 1977నుండి 83వరకు లెక్చరర్ గా పని చేసి 1983-88 కాలం లో తిరుపతిలోని న్యాయ సంస్కృత విద్యా పీఠంలో సేవలందించి ,తర్వాత బెనారస్ లోని న్యాయ వైదిక దర్శన సంస్కృత కళాశాలలో రీడర్ గా ఉన్నారు .1988నుండి బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు ..1997 నుంచి తర్క ,వేదాంత శాస్త్రాలలో ప్రొఫెసర్గా ఉన్నారు .
శాస్త్రి గారి గీర్వాణ రచనలు -1982లోజగదీశ భట్టా చార్య తర్కామృతం పై ‘’మాణిక్య ప్రభ ‘’రాశారు .1995మాధురీ గాదాధరీ మత భేద విమర్శ రచించారు .1987 లో’’ పంచలక్షణ శత కోటి’’కి సంపాదకత్వం వహించారు .రామ రుద్రీయ వ్యుత్పత్తి వాద౦ మొదలైన వాటిపై ధారా వాహికం గా 1978నుండి 1981వరకు నాలుగేళ్ళువిజయవాడ ఆకాశ వాణి లో తర్క శాస్త్ర వైభవం ,అనిత్యః శబ్దః ,పరమాణు స్వరూపం ,వ్యక్తి వివేక విమర్శనం మున్నగు అంశాలపై ప్రసంగాలు చేశారు .
శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు 1984-88వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఉపన్యాసకులుగా ఉన్నారు .వారణాసి కే .కే. డి.లో ,హైదరాబాద్ లోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు, వక్తలు గాఉండి భాగవత ,రామాయణ ,స్కాంద పురాణా౦ తర్గత కాశీఖండాలపై ప్రవచనం చేశారు .సంప్రదాయ న్యాయ మీమాంస వేదాంత శాస్త్రాలను బోధించటమే శాస్త్రిగారి ముఖ్య అభిరుచి .ఈ శాస్త్రాలలో వీరికి గురువులు మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు ,పండిత రాజ ఎస్.సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,పండిత రాజ,పద్మభూషణ్ పి .యెన్ .పట్టాభి రామ శాస్త్రి గారు ,న్యాయ వేద వేదాంత విద్వాన్ శ్రీ ధూళి పాళ రామచంద్ర శాస్త్రి గారు ,కవితార్కిక చక్రవర్తి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు .
1670 కాలపు వాడైన నాగేశ భట్టు భట్టోజీ దీక్షితుల భారతీయ పంచాంగం ప్రకారం కాల ,తిధి నిర్ణయం పై ‘’తిధినిర్ణయం ‘’ అనే సంస్కృత శాస్త్ర గ్రంథాన్ని ప్రకాశింప జేశారు .జగదీశ భట్టాచార్యుడి తర్కామృత గ్రంథంపై సంస్కృతం లో శాస్త్రిగారు ‘’ మాణిక్య ప్రభ సంస్కృత వ్యాఖ్యా విభూషితం’’చేశారు . శాస్త్రిగారి ద్వితీయ పుత్రులు ,పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో తర్క శాస్త్రం లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన శ్రీ జయమాణిక్య శాస్త్రి ‘’మణిప్రభ హిందీ వ్యాఖ్య’’సంవలితం ‘’చేశారు . దీనిని వారణాసి శారదా సంస్కృత సంస్థానం 2012లో ప్రచురించింది .ఇది న్యాయ తత్వ శాస్త్రం పై మహా వ్యాఖ్యానం .జ్యోతిశ్శాస్త్రం పై కాళిదాసు ని ‘’కాలామృతం ‘’కు చింతలపాటి వెంకట యజ్వ రచించిన ‘’ఉజ్వలా వ్యాఖ్యానం ‘’ను శాస్త్రి గారు సంపాదకులుగా వెలువరించారు . .దీన్ని తిరుపతి వేద విశ్వ విద్యాలయం ముద్రించింది .క్రీ. శ.1600 కాలం వాడైన మధురానాథ తర్క వాగీశుని ‘’మాధురీ ‘’17,18శతాబ్దాలకు చెందిన గదాధర భట్టాచార్య రాసిన ‘’గాదాధరీ ‘’,13వ శతాబ్దికి చెందిన గంగేశుని ‘’తత్వ చింతామణి ‘’వ్యాఖ్యానాలను తులనాత్మకంగా పరిశోధించి శాస్త్రిగారు ‘’మాధురీ గాదాధర్యోర్మత భేద విమర్శ ‘’అనే ఉద్గ్రంధాన్ని రాశారు .దీన్ని తిరుపతి పద్మావతీ ప్రకాశన సంస్థ ప్రచురించింది .రామరుద్ర భట్టాచార్యులు రాసిన ‘’ వ్యుత్పత్తి వాద వ్యాఖ్యానాన్ని ’ మద్రాస్ లోని అడయారు లైబ్రరీ నుంచి కంచి కామ కోటి పీఠ ఆస్థాన విద్వాంసులైన మహా మహోపాధ్యాయ శ్రీ ఎస్ .ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రిగారి ద్వారా తెప్పించి ‘’వ్యుత్పత్తి వాదః –రామ రుద్రీయ వ్యాఖ్యన సహితః ‘’ అని ప్రకాశనం చేశారు .. దీనిని న్యు ధిల్లీ సంస్కృత సంస్థానం ముద్రించింది .ఆదిత్యాచార్య వైదిక కర్మకా౦డలపై రాసిన ‘’షడ శీతి ‘’పై నంద పండిత వ్యాఖ్యాన పరామర్శ రాశారు .దీన్ని ఉజ్జైన్ లోని ఇండలాజికల్ రిసెర్చ్ సంస్థ ముద్రించింది .
డా.శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు అనేక మంది విద్యార్ధులకు తర్క ,వేదాంత ,మీమాంస శాస్త్రాలను బోధిస్తూ పరిశోధనకు ప్రోత్సహిస్తూ సుమారు 25 మంది చే తర్క వేద వేదాంత శాస్త్రాలలో పి .హెచ్ .డి .సాధించటానికి మార్గ దర్శనం చేశారు .ప్రస్తుతం వీరి మార్గ దర్శనం లో 10 మంది పి .హెచ్. డి.,పి .డి.ఎఫ్ .చేస్తున్నారు . కంచి కామకోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధిలో శాస్త్రిగారు శాస్త్రార్ధం చేసి స్వర్ణపతకం పొందారు .శ్రీ వారి అనుగ్రహం తో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారికి తర్క శాస్త్రాన్ని వినిపించారు . ఆంధ్ర పీఠమైన పుష్పగిరి శంకరాచార్యులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి ఆదేశం తో వారి ఉత్తరాధికారి ,ప్రస్తుత పీఠాదిపతి శ్రీ విద్యా శంకర భారతీ స్వామివారికి తర్క వేదాంత శాస్త్రాలను కాశీ లో శ్రీ శాస్త్రి గారి ఇంటి వద్దనే శ్రవణం చేయించారు .అనేక మంది పీఠాదిపతుల వద్ద గోలోక౦ ,కాళీ శాంకరి ,బచ్యాఝా ‘’ అద్వైత సిద్ధి ,బ్రహ్మాన౦దీయ క్రోడ పత్ర’’విషయాలపై శాస్త్రార్ధాలు చేసి జగద్గురువుల అనుగ్రహం పొందారు .కంచి ,శృంగేరి, ద్వారక ,పుష్పగిరి ,ఉడిపి పీఠాలలో శాస్త్రార్ధ చర్చ చేసి ‘’శాస్త్ర విద్వన్మణి’’, ‘’న్యాయరత్న ,’’ఆర్షవిద్యా భూషణ’’ బిరుదులను అందుకున్నారు . శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆజ్ఞానుసారం మహా మహోపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి ఇంటిలో అంతేవాసిగా ఉండి తర్క వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టారు .
‘’న్యాయ విద్యా ప్రవీణ ‘’ మరియు వేదా౦తాచార్య ‘’బిరుదులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి న్యాయ, మీమాంసా శాస్త్ర పాండిత్యానికి ,వేదాంత ప్రతిభకు సార్ధకతను చేకూర్చాయి .
శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి ఫోటో జత చేశాను చూదాండి
గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-2017 –ఉయ్యూరు