వీక్లీ అమెరికా–15 (3-7-17 నుండి-9-7-17 వరకు ) గురుపూర్ణిమ ,షార్లెట్ లో సరసభారతి 104 కార్యక్రమంగా వ్యాసజయన్తి వారం

వీక్లీ అమెరికా–15 (3-7-17 నుండి-9-7-17 వరకు )

గురుపూర్ణిమ ,షార్లెట్ లో సరసభారతి 104 కార్యక్రమంగా వ్యాసజయన్తి వారం

3-7-17 సోమవారం గీర్వాణం 3 లో 365 వరకు రాశా .

4-7-17 మంగళవారం -శయన ఏకాదశి అనే తోలి ఏకాదశి పేలపిండి ప్రత్యేకప్రసాదం గా నైవేద్యం పెట్టాం . సాయంత్రం శ్రీ సుంకర అప్పారావు గారొచ్చి సాయి సచ్చరిత్ర పారాయణ చేద్దామంటే రేపటి నుంచి చేద్దామని చెప్పా .రాత్రి 11-30 వరకు కూర్చుని గీ -3 లో 372 వరకు రాశా ఇప్పటికి మూడుభాగాలు కలిపి 1000 మంది సంస్కృత కవులను గురించే రాసే అదృష్టం దక్కింది

     శ్రీ  షిర్డీ సాయి సచ్చరిత్ర పారాయణ

5-7-17 బుధవారం 6-7-17 గురువారం లలో ఉదయం ,సాయంత్రం రోజుకు 5 గంటలు చదివి 51 అధ్యాయాల 400 పేజీల శ్రీ సచ్చరిత్ర పారాయణ పూర్తి చేసాం నేనూ అప్ప్పారావుగారూ .మా అమ్మాయి ప్రసాదం చేయగా గురువారం సాయంత్రం నైవేద్యం పెట్టాం . సాయి ని పూలతో అలంకరించాము .

అప్పారావుగారు  .ఆయన ఎంతో సంతృప్తీ ఆనందం పొందారు నాకు ఇదే మొదటిపారాయణ ,ఆయన చాలా సార్లు చేసి ఉంటారు రెండు రోజుల్లో ఆయన జీవితం లో ఎప్పుడూ జరగలేదట .భలే ఖుషీ అయ్యారు .భగవత్ కృప ఉంటె కార్యాక్రమాలు అలానే జరుగుతాయని నమ్మకం .గురు వారం తో పూర్తవటం మరీ సంతోషంగా ఉంది .

  బుధవారం సాయంత్రం కారీ నుంచి మా అన్నయ్యగారి మనవడు హరి ఫోన్ చేసి వాళ్ళబ్బాయిని హాస్పిటల్ నుండి 30 వతేదీ శుక్రవారమే ఇంటికి తీసుకొచ్చామని బాగా కోలుకున్నాడని చెప్పాడు . కనుక మా కారీ ప్రయాణం దగ్గర పడిందనుకొన్నాం ..రాత్రి యు ట్యూబ్ లో భానుప్రియ ఇంటర్వ్యూ చూసాం .ఎంత కమ్మగా ,సరళంగా స్వచ్చంగానే మాట్లాడింది ప్రఖ్యాత నర్తకి సుమతీ కౌశల్ ఆమె అత్తగారట .భర్త నేషనల్ జగ్రాఫికల్ ఛానెల్ లో పనిచేస్తే ప్రపంచ ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ అట మరిది పండిట్ రవి శంకర్  గ్రూప్ లో  తబలా కళా కారుడు . స్వర్ణకమలం సినిమాలో ఆమె చెప్పిన ‘’అర్ధం చేసుకోరూ ‘’అనే డైలాగు ను ఎన్ని రకాలుగా చెప్పి కనుబొమలు మూతి తో ఎంత గొప్పగా అన్నదో  వాటిని మళ్ళీ చేసి చూపించింది మా కుటుంబానికి భానుప్రియ చాలా బాగా నచ్చిన నటి .శివాజీ గణేశన్ ఒక సభలో సావిత్రి ,పద్మిని ల నటన అంతా భానుప్రియలో ఉందని అలాంటి నటి అరుదని అన్నాడట .

   గురువారం ‘’గొట్టం ‘’లో రాజేంద్రప్రసాద్ ‘’గడుగ్గాయి ‘’సినిమా చూసాం .మొదట్లో బాగున్నా తర్వాత బోర్ .

 శుక్రవారం గీర్వాణం 3 అంతా ఒక చోటుకు తెచ్చి డెస్క్ టాప్ పై  ఉంచా . మామనవాడు శ్రీకేత్ చాలా సహాయ పడ్డాడు దీనికి .

8-7-17  శనివారం ఆషాఢపౌర్ణమి గురు పూర్ణమి అనే వ్యాసపూర్ణమి .ఇంట్లో మా మూలు గా పూజ చేశా .షార్లెట్ లో కొత్తగా కట్ట బోయే షిరిడీ సాయిబాబా గుడి ప్రాంగణం లో గురుపౌర్ణమి  సుదర్శన హోమం నిర్వహించారు .మేము వెళ్ళలేదు . కానీ ఎందుకో మనసులో ఇక్కడ గురుపౌర్ణమిగా వ్యాస జయంతి జరిపితే బాగుండు ననిపించి మధ్యాహ్నం రాంకీ కి ఫోన్ చేశా .అతడు లిఫ్ట్ చేయలేదు .సాయంత్రం 6 గంటలకు అతనే ఫోన్ చేసి ఫోన్ చేసిన కారణం అడిగితె  ఇక్కడ గురుపౌర్ణమిగా వ్యాస జయంతి జరపాలని ఉంది మీ ఇంట్లో ఒక అరగంట సేపు నాలుగురైదుగురం కూర్చుని వ్యాస మహర్షి పూజ చేసి నాలుగు ముక్కలు మాట్లాడుకొందాం .నీకు వీలైతేనే ‘’అన్నాను క్షణం కూడా ఆలోచించకుండా తప్పని సరిగా రేపు ఉదయం 10 గంటలకు మా ఇంట్లో ఏర్పాటు చేద్దాం

ప్ర సాదం(భోజనం ) కూడామా ఇంట్లోనే .ఇది మాకు దక్కిన అదృష్టం అనుకొంటున్నాము అని భార్యా భర్తలిద్దరూ చెప్పటం చాలా సంతోషమేసింది .ఒక నాలుగు కుటుంబాలవాళ్ళకు చెబుతాను అన్నాడు సరే నన్నాను . అతనే మా అమ్మాయితో అల్లుడితో మాట్లాడి విషయం చెప్పాడు .

9-7-17 ఆదివారం వ్యాసజయంతిగా షార్లెట్ లో సరసభారతి 104 వ సమావేశం

            ఉదయం 10 గంటలకు నేనూ మా అల్లుడు కలిసి రాంకీ ఇంటికి  ఉదయం 10-30 కు చేరాం .దంపతులు అప్పటికే అన్నీ తయారు చేసి రెడీగా ఉన్నారు .నేను నిన్న సాయంత్రమే రాంకీకి వ్యాసుని ఫోటో నెట్ లోనుంచి డౌన్ లోడ్ చేసి ఒక అత్తకు అంటించి ఉంచమన్నాను కానీ అతడు50 డాలర్లకు  కలర్ ఫోటో డౌన్ లోడ్ చేయించి  దానికి చక్కని  ప్రేంకూడా కట్టించి ఉంచాడు శ్రద్ధ అంటే అలావుండాలి .అప్పుడు నేను చెప్పాను ఈ కార్యక్రమాన్ని సరసభారతి 104 వ సమావేశంగా జరుపుదామని అన్నాను మంచి ఆలోచన అన్నాడు . 11 గంటలకు పవన్ కుటుంబం ,ప్రభల రామకృష్ణ కుటుంబం పేరి చంద్ర శేఖర్ కుటుంబం మా అమ్మాయి మా శ్రీమతి మనవళ్లు వచ్చారు అప్పటికే ప్లాస్టిక్ బోర్డు మీద కార్యక్రమం నాతో రాయించి రాంకీ బయట డిస్ప్లే పెట్టాడు తానూ ఈ మధ్యే ఇండియా నుంచి తెప్పించిన మహా భారతం 18 పర్వాలు రామాయణం మూడు భాగాలు దేవుడి దగ్గర చక్కగా ఏర్పాటు చేశాడు . .అప్పుడు రాంకీ దంపతులు కూర్చునిముందు  విఘ్నేశ్వర పూజ,తర్వాత విష్ణు అష్టోత్తరం తర్వాత వ్యాస అష్టోత్తర పూజ చేసి ,నైవేద్యం హారతిఇచ్చారు అనుకోకుండా చాలా బాగా జరిగింది .రాంకీ ని ముందు మాట్లాడ మన్నాను ఒక అయిదు నిమిషాలు మాట్లాడి నన్ను మాట్లాడమన్నాడు .. నేను సరసభారతి గురించి కార్యక్రమాల గురించి ముందు చెప్పివ్యాసునిపై స్తోత్రాలు చదివి వ్యాసుని గురించి వివరించా .దాని సారాంశం –

            వ్యాస అష్టోత్తర స్తోత్రం

‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిహ్ -సత్య సందహ్ ప్రశాంతస్య సత్య వాదీ సుతః

2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ  సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః

3-సర్వ వేదాంత తత్వజ్ఞహ్ సర్వేజనా వేద మూర్తిమాన్-వేదం శాఖావ్యసన కృత కృత్యో మహా మునిహ్

4-మహా బుద్ధిర్మహాసిద్ధిర్మహా శక్తి ర్మహా ధృతిః మహా కర్మా మహా ధర్మా మహా భారత కల్పకహ్

5-మహా పురాణ క్రుజ్ఞానీ జ్ఞాన విజ్ఞాన భాజనం -చిరంజీవీ చిదాకారీ శ్చిత్త దోష నివారకః

6-వాశిష్ఠహః శక్తి పౌత్రస్య శుకదేవర్గునుర్గురుహః -ఆషాఢ పూర్ణిమా పూజ్యా పూర్ణ చంద్ర నిభాననః

7-విశ్వనాథ స్తుతికరో విశ్వజనో జగద్గురుహ్  – జితేన్ద్రియో జితక్రోధో వైరాగ్య నిరతః శుచిహ్

8-జైమిన్యాది సదాచార్యహ్ సదాచార సదాస్థితః స్థితప్రజ్ఞహ్ స్థిరమతిః సమాధి సంస్ధితారతహః

9-ప్రశాంతిదః ప్రసన్నాత్మా శంకరార్యప్రసాద కృత్ -నారాయణాత్మకః స్తవ్యహ్ సర్వ లోక హితే  రతః

10-అఛత్రవదన బ్రహ్మ ద్విభుజబర కేశవః -అఫాల లోచనశ్శివః పరబ్రహ్మ స్వరూపకః

11- బ్రహ్మన్యో   బ్రహ్మణో బ్రాహ్మీ బ్రహ్మ విద్యా విశారదః -బ్రహ్మాత్మైకత విజ్ఞాతా బ్రహ్మ భూతః సుఖాత్మకః

12-వేదాంగ భాస్కరో విద్వాన్ వేద వేదాంత పారగః -ఉపాంతరతమో నామా వేదాచారో విచారవాన్.

 వ్యాసునిపై కొన్ని ప్రత్యేక శ్లోకాలు

1-వేద వ్యాసః  స్వాత్మ రూపం సత్య  సంధం పరాయణం –  శాంతం జితేంద్రియ క్రోధం సా శిష్యం ప్రణమామ్యహం

2-వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌరుష మకల్మషం -పరాశరాత్మజం వన్డే శుక తాతం తపోనిధిమ్

3-వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే -నమో వై బ్రహ్మ నిధ్యాయ వాసిష్టాయ నమోనమః

4-అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే -సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే

5-వ్యాస స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే -నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే

            పరాశర స్తుతి

6-కరుణాతీత చిద్రూపం పరి పూర్ణ పరాయణం – పరమానంద సంతుష్టం పరాశర మొహం శ్రయే

              శుక స్తుతి

7-త్రికాలాతీత చిన్మాత్ర ప్రశాంత స్వా0త సంయుతం -వికార ఘోర సంస్కృష్టం శుకం గురు మొహం శ్రయే

శంకరాచార్య  స్తుతి

8–శంకా   రూపేణ మచ్చిత్తం పంకీకృత మాభూద్యేయా -కింకరీ  యస్య సా మాయా శంకరాచార్య మాశ్రయే

భావం -మాయ అందర్నీ కప్పి ఆడిస్తుంది .మనసు బుద్ధిలలో కల్లోలాలు తుఫాన్లు సృష్టిస్తుంది .అలాంటి మాయను కింకరి అంటే సేవకురాలినిగా చేసుకొన్నశంకరాచార్యులు ప్రణామం .

           వేద వ్యాస చరిత్ర

నేపాల్ దేశం లో తానాహుజిల్లా ‘’దమౌళీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు  వేద విభజన చేసిన గుహ ఉంది అది గొప్ప యాత్రాస్థలం .విష్ణు మూర్తి యొక్క ‘’కాలావతారం ‘’వ్యాసుడు .చిరంజీవులలో ఒకడు .అద్వైత ఋషిపరంపరలో నాల్గవవాడు .ప్రతి యుగం లో ఒక వ్యాసుడు పుడతాడు .వ్యాసుడు అనేది ఒక అధికారం .ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు లేక బాదరాయణుడు వ్యాసుడయ్యాడు .వ్యాస పరంపరలో 28 వ వాడు .మొదటి ద్వాపరం లో స్వాయంభువు వ్యాసుడు అయ్యాడు .రెండవ ద్వాపరం లో ప్రజాపతి వ్యాసుడు .మూడవదానిలో శుక్రుడు వ్యాసుడు .ఆతర్వాత వసిష్ఠుడు ,త్రివర్షుడు ,సనద్వాజుడు వగైరా 27 మంది వ్యాసులు అయ్యాక ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అయ్యాడు .

 విష్ణు మూర్తి నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టి నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలను ప్రసరింప జేయాలనుకొన్నప్పుడు విష్ణువు మనసులో తలచుకోగానే ‘’అపాంతర తముడు ‘’జన్మించాడు .పుత్రోత్సాహం తో నారాయణ మూర్తి ‘’వ్యాసా !రా నాయనా !నా మానస పుత్రుడివిగా పుట్టి  నాకు ఆనందాన్నిచ్చావు .అన్ని మన్వంతరాలలోనూ ఇలానే జన్మించు .తర్వాత పరాశర కుమారునిగా పుట్టి ,కురురాజుల అధర్మ క్రూర హింసా దౌర్జన్యాలను అదుపు చేసి ,వేదాన్ని వ్యాపకం చెయ్యి .నీకు రాగద్వేష రహితుడైన కొడుకు పుట్టి నిన్ను మించిపోతాడు ‘’అన్నాడు .రాబోయే సూర్య సావర్ణికాలం లో వ్యాసుడు సప్తర్షులలో ఒకడు అవుతాడు . .

కృష్ణ ద్వైపాయన వ్యాస జననం

లోకోద్ధరణకోసం నారాయణుడు కొన్ని ధర్మాలు ఏర్పాటు చేశాడు కాలక్రమంలో అవి లోపించాయి .బ్రహ్మ రుద్రా ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని దర్శించి ధర్మ  పునరుద్ధరణ చేయమని ప్రార్ధించగా మూడవదైన ద్వాపర యుగం లో పరాశార సత్యవతి దంపతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడునారాయణుడు వ్యాసభగవానుడుగా అవతరించాడు ..ఒక రోజు వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి తపోధ్యానాలు పూర్తి చేసి ఏకాంతం లో ఆసీనుడై దివ్య దృష్టితో యుగ విశేషాలను తెలుసుకున్నాడు .కాల ప్రభావాన భౌతిక భావనలు అంటే శక్తులు తగ్గుతున్నాయని గ్రహించాడు .శ్రద్ధ బలం ఆయుస్సు తగ్గి దౌర్బల్యం పెరిగి నట్లు గుర్తించాడు అన్ని వర్ణాలవారికి ఉపయోగ పడేట్లు వైదిక కర్మలను పరీక్షించి యజ్ఞ విస్తరణకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు .పంచమ వేదంగా మహా భారతం రచించాడు .పైలుడికి ఋగ్వేదం ,వైశంపాయుడికి యజుర్వేదం జైమినికి సామం ,సుమంతునికి అదర్వణం ఉప దేశించాడు .ఇతిహాస పురాణం అనే పంచమ వేదం భారతాన్ని రోమ హర్షుడు అనే సూతమునికి  చెప్పాడు .వీరంతా తమ శిష్యులకు బోధిస్తే వారు వారి శిష్యులకు ఉపదేశించగా అనేకశాఖలయ్యాయి .

 కొంచెం బుద్ధి తక్కువ గా ఉన్నవారికి ఉపాఖ్యాన కదా రూపం గా మహా భారతం రాశాడు దీనిలో ధర్మం సంస్కృతీ మొదలైన విషయాలన్నీ చెప్పాడు వ్యాసుడు .ద్వాపరాంతం లో వచ్చే కలియుగం లోవచ్చేఅనర్దాలు,ఆపద గ్రహించటానికి భారత రచన చేశాడు .అన్ని వర్ణాలవారు జాతులవారు  లింగ వయో భేదం లేకుండా ఆచరించదగిన  ధర్మాలు  ధర్మ సూక్ష్మాలు చిన్న చిన్న కధలలో చెప్పాడు

  దీనితో తృప్తిపడక జ్ఞానులకు పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటానికి 545 బ్రహ్మ సూత్రాలు రాశాడు దీనికి శంకరాచార్య భాష్యం రాశారు ..అష్టాదశ అంటే 18 పురాణాలు రచించాడు. వేదానికి అంతాలైన ఉపనిషత్తులు రాశాడువీటిలో దశోపనిషత్తులకు శంకర భాష్యం ఉంది . అంతా బాగానే ఉంది కానీ సర్వ వ్యాపకుడైన పరమేశ్వరుడి గురించి భక్తి తాత్పర్యాలతో రాయలేక పోయానని చింతి స్తుంటే నారద ముని హితోపదేశం తో శ్రీ విష్ణు లీలామృతమైన శ్రీ మద్ భాగవతం రాశాడు ..దీన్ని పోతనామాత్యుడు మందార మకరంద తుందిలంగా తెలుగులోకి అనువదించాడు .భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రనలనే కవిత్రయం అనువదించారు ..ఇవన్నీ లోక శ్రేయస్సుకోసం రాయబడినవే .భారతం హరివంశం కలిపి 1 లక్షా 25 వేలు పురాణాల్లో 5 లక్షల శ్లోకాలు మొత్తం 6 లక్షల 25 వేళా శ్లోకాలు రాశాడు భగవాన్ వేదం వ్యాసుడు .. భారతం చివరలో వ్యాసుడు  -’’యదాహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి సతత్  క్వచిత్ ‘’ అని ఒక ప్రతిజ్ఞ చేశాడు-అంటే ‘’భరతం లో లేనిది ఎక్కడా ఉండదు -ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు ‘’శాంతి ఆనుశాశానిక స్వర్గా రోహణ పర్వతాలలో 26 వేల  శ్లోకాలలో  రాజనీతి ,ఆపద్ధర్మాలు ,దాన0  ధర్మం ,మోక్షప్రాప్తి,స్త్రీ ధర్మాలు వివవిడి విడిగా చెప్పాడు .అంటే పాత్రలచేత చెప్పించాడు .భారతం లోని పాత్రలు మనమే మన ఇళ్లల్లో జరిగే కథయే భారత కధ ..

 ఇన్ని ఇన్ని రకాలుగా చెప్పినా పెడ  చెవిని పెట్టి వారిని చూసి జాలితో బాధతో వ్యధతో ‘’ఊర్ధ్వ బాహుహ్ విరోమ్యేష నహి కశ్చిత్ శృణోతిమే -పరోపకారాయ పుణ్యాయ ,పాపాయి పర పీడనం ‘’అని చేతు  లెత్తి మొక్కాడు -అంటే ‘’ఇతరులకు మేలు చేస్తే పుణ్యం -ఇతరులను బాధిస్తే పాపం  ‘’అని చేతులు పైకెత్తి నెత్తీ నోరూ మొత్తుకున్నా నా మాట ఎవరూ వినటం లేదే ‘’అని పరితపించాడు  ఆ విశాల దయార్ద్ర హృదయుడు వ్యాస భగవానుడు .

భారతం లో వ్యాస పాత్ర

 భారత రచన చేయటమేకాక అందులో తానూ పాత్రధారియే వ్యాసుడు .తల్లికిచ్చిన మాటకోసం కురు వంశాన్ని నిలపటానికి పాండవ ధృతరాష్ట్ర విదురులకు జన్మ నిచ్చాడు .అవసరమైనప్పుడు రంగ ప్రవేశం చేసి ధర్మ సూక్ష్మాలు  చెప్పాడు అర్జునుడు మత్శ్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని దక్కించుకొంటే ధర్మరాజు ఆమె సోదరులందరికి భార్య  అవ్వాలంటే ద్రుపదుడు వ్యాసుడిని తలచుకొంటే వచ్చి ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు అయోనిజ యాజ్ఞ సేనీ  కనుక పంచ భర్త్రుక అవటం లో తప్పు లేదని తీర్పు చెప్పాడు .వనవాసం లో పాండవులు కస్టాలు పడుతూ ప్రార్ధిస్తే ‘’మీకే కాదు కస్టాలు మీ ముందు నలమహారాజు దమయంతి ఎన్నో కష్టాలుపడి చివరికి సుఖపడ్డారని ఆ కద చెప్పి ఊరట కలిగిచాడు .అర్జుడిని శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించామని సలహా ఇచ్చాడు .కురుపాండ బలాలను బేరీజు వేసి చెప్పమని గుడ్డిరాజు కోరితే ధర్మ0  కృష్ణ రూపం లో పాండవుల వద్ద ఉంది ధర్మం ఉన్న చోట విజయం తప్పదు అని నిష్కర్షగా చెప్పాడు ..కురుక్షేత్ర సంగ్రామం ముందు వచ్చి ‘’నువ్వు తెచ్చిన యుద్ధం యెంత అనర్ధాన్ని తెస్తోందో చాడాలని ఉంటె కళ్ళు ఇస్తానంటాడు .చేసిన తప్పు తెలుసుకనుక తాను ఆ భీభత్సాన్ని చూసి తట్టుకోలేను అంటే సూతుడికి దివ్య ద్రుష్టి ప్రసాదించి యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం గా చూసి గుడ్డిరాజుకు  చెప్పించాడు  .

అశ్వత్ధామ కృష్ణార్జునులపై నారాయణాస్త్రం సాధించగా వారిద్దరో దానికి నంస్కరించగానే అది నిర్వీర్యమై పొతే ,కారణం తెలీక జుట్టు పీక్కొని వ్యాసుని స్మరిస్తే వచ్చి ‘’మీ మీ శివ పూజా ఫలితం ఇది .వాళ్లిద్దరూ పూర్వ జన్మలో శివుడిని మట్టి లింగంగా చేసి ఆరాధిస్తే నువ్వు విగ్రహ రూపం లో పూజించావు .  లింగా రాధన సర్వ శ్రేయస్కరం అది వారిని కాపాడింది ‘’అని ధర్మ సూక్షం చెప్పాడు .వ్యాసునికి ఆంద్ర దేశానికీ సంబంధం ఉంది .ఏడు రోజులు కాశీలో వ్యాసునికి శిష్యులకు భోజనం దొరక్కపోతే కోపం తో కాశీని శపించాలని సంకల్పించి భిక్షా పాత్రను నేలమీద శతధా భిన్నం ఎట్లు పగలకొడితే ముదుసలి సాధ్వీరూపం లో పార్వతీదేవి వచ్చి విందుకు ఆహ్వానించి కమ్మని భోజనం పెడితే అప్పుడు శివపార్వతులు వారి వద్ద ప్రత్యక్షమవగా శివుడు కోపం తో ‘’పుణ్యరాశి కాశీ పైశాపం పెడతావా పొమ్ము నిర్భాగ్య మా యూరి పొలము విడిచి ‘’అని కాశీనుంచి గెంటేస్తే బ్రతిమాలితే దక్షిణకాశి దాక్షారామం వెళ్లి భీమేశ్వర సేవలో తరించామని చెబితే విధవ లేక విధవ లేక ద్రాక్షారామ చేరగా అక్కడ అగస్త్య మహర్షి ఊరట కలిగిస్తాడు .బాసర సరస్వతీ ఆలయంమనకు తెలుసు.  వ్యాస బాసర అయింది

  అలాగే కాశ్మీర్లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అని అర్ధం . ఇలా ప్రకృతితో మమేక ఆమినవాడు వ్యాసుడు .

  రెండు చిలుకలు సంసార0 చేస్తుంటే ముచ్చటపడి తనకు ఒక కొడుకు కావాలనుకొని హిమాలయాలకు వెళ్లి’’శక్తిని గూర్చి  తీవ్ర ఆతపస్సు చెస్తే ,తపోభ0 గానికి వచ్చిన ఘృతాచి అనే అప్సరస చేసిన ప్రయత్నాలు ఫలించక చిలుక రూపం లో వస్తే రేతస్కలనం జరిగి పుట్టిన కుమారుడే శుకమహర్షి ఆయన మూతి చిలక మూతిలాగా ఉంటుందంటారు .పుట్టగానే సకలశాస్త్రాలు వచ్చేశాయి జనకమహా రాజు  వద్ద బ్రహ్మ విద్య నేర్చాడు . పరీక్షిత్తుకు ఏడు రోజులలో మహా భారత కదా అంతా  చెప్పాడు శుకమహర్షి . నిరీహుడు నిస్సంగుడు శుకుడు . తండ్రి పరాశరుని పేరా పరాశర సంహిత ఉంది .ఆంజనేయ చరిత్ర అంతా అందులో ఉంటుంది .

  ఇంతటి జ్ఞానాన్ని ధర్మాలను నీతులను అక్షరరూపం గా ప్రసాదించిన భారత జాతి వ్యాసభగవానునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు  కనీసం వ్యాస పూర్ణిమ నాడైనా ఆ గురుమహారాజు ను స్మరిద్దాం .ఇలాంటి అరుదైన అవకాశం అమెరికాలో షార్లెట్ లో సరసభారతి 104 వ సమావేశంగా వ్యాస జయంతిని తమ ఇంట్లో  జరిపించిన  రాంకీ  ఉషా ద0పతులకు ,ఆసక్తిగా వచ్చి పాల్గొన్న వారందరికీ సరసభారతి ధన్యవాదాలు తెలియ జేస్తోంది .ప్రతి సంవత్సరం మా అమ్మాయి శ్రీమతి  విజయ లక్ష్మి  అల్లుడు శ్రీ అవధాని శంకర జయంతి జరుపుతున్నట్లే వ్యాస జయంతి ని గురుపౌర్ణమిగా నిర్వహించాలని ఈ దంపతులను కోరుతున్నాను ‘’

 అని చెప్పి ఇక్కడ భారతీయ సంస్కృతిని ఆచరిస్తూ నిలబెడుతున్న చి అడుసుమిల్లి రామకృష్ణ(రాంకీ ) కు సరసభారతి ఆనందంగా ‘’సంస్కృతీ ప్రదీపక  ‘’బిరుదు ప్రదానం చేస్తున్నానని  అనగానే అందరు హర్ష ధ్వానాలతో చప్పట్లు మోగించారు .సరసభారతి గ్రంధం ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం ) రాంకీ దంపతులకు మా ద0పతులం కానుకగా అంద  జేశాము . మంత్ర పుష్పం తో కార్యక్రమం పూర్తయింది .

  ఆ తర్వాత పప్పు ,వంకాయ కూర చిక్కుడుకాయకూర కాబేజీ కూర టమేటా చట్నీ ,స్వీ టు ,పులిహోర ,బజ్జీలు అప్పడ0 , మజ్జిగ పులుసు ,చారు పెరుగు పల్లముక్కలతో   కమ్మని భోజనం ఏర్పాటు చేశారు అందరం తృప్తిగా తిని ఆనందించాం  .మా దంపతులకు రాంకీ దంపతులు నూతన వస్త్రాలు సమర్పించి ‘’ఘనమైన నగదు ‘’తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందారు . ఇలా సుమారు 15 గంటల వ్యవధిలో సరసభారతి 104 వ కార్యక్రమంగా వ్యాస జయంతి ని అమెరికాలోని షార్లెట్ లో జరిపి అందరి సహకారం తో రికార్డ్ సృష్టించింది ..ఈవారం  వార్తలు ఇంతటితో సమాప్తం .

 మీ గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.