గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)
కర్ణాట రాష్ట్ర జాతీయ గీతం ‘’కాయో శ్రీ గౌరీ ‘’రాసిన బసవప్ప శాస్త్రి 1843 లో మైసూర్ జిల్లా నరసా0ద్ర గ్రామం లో జన్మించాడు . సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు . కాళిదాసుని శాకుంతల మాళవికాగ్నిమిత్ర మొదలైన సంస్కృత నాటకాలను షేక్స్పియర్ ఓదెల్లో నాటకాన్నీ కన్నడీకరించాడు .’’కర్ణాటక నాటక పితామహ ‘’బిరుదాంకితుడు . తన రత్నావళి ,ఉత్తరరామ చరిత నాటకాలకు చాలాపాటలు కూర్చాడు . 1891 లో చనిపోయాడు .
తంజావూర్ చిన్నయ్య (1803-1856 )తంజావూర్ జిల్లాలో పుట్టి మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .సంస్కృతం తెలుగులలో లో వర్ణాలు కృతులు జావళీలు విశేషంగా రాశాడు .ఆయన ఆరభిరాగం లో రాసిన ‘’అంబాసౌరంబ ‘’నీలాంబరితో రాసిన ‘’అంబా నీలాంబరి ‘’కృతులు చిత్త స్వరాలతో విశేష ప్రాభవాన్ని తెచ్చాయి .
420-సంస్కృత కృతి కర్త -వీణ పద్మనాభయ్య (1842-1900 )
కర్ణాటక చిత్తనాయక హళ్ళికి చెందిన వీణ పద్మనాభయ్య 1842లో జన్మించి 58 వ ఏట 1900 లో మరణించాడు .సంస్కృతం ఆంధ్రం లలో అనేక స్వరాలు కృతులు జావళీలు వర్ణాలు ,తోడిరాగం లో సప్త తాళేశ్వరం రచించాడు .నాట కురంజి రాగం లో ‘’శ్రీ హేరంబ మీడే ‘’,నాగేశ్వరావళి రాగం లో ‘’భావయామి తవపాదం ‘’బాగా ప్రసిద్ధమైనవి .కన్నడం లో ఒకేఒక్క జావళి రాశాడు .మిగిలినవి సంస్కృతం ,తెలుగు లలో రాశాడు .
421-సంగీత సుబోధిని కర్త -మైసూర్ కరగిరిరావు (1853 -1927 )
1853లో కర్ణాటక తుంకూర్ లో పుట్టిన కరగిరి రావు సంగీత నిధి . 200 ల దేవర నామాలకు సంగీత స్వరాలు కూర్చాడు ఆయన కృతులన్నీ చిత్త స్వరాలతో చిత్తాన్ని ఆకర్షిస్తాయి .సంగీత సుబోధిని ,గాన వాద్య రహస్య ప్రకాశిని అనే గొప్ప సంగీత గ్రంథాలు రాశాడు .మోహనరాగం లో ‘’నెనరుంచిర ‘’,సరస్వతి రాగం లో ‘’సరస్వతి భగవతి ‘’కృతులు మంచి పేరు తెచ్చాయి . 74 వ ఏట మరణించాడు .
422-108 చాముండీ అష్టోత్తర కృతులురాసిన -ముత్తయ్య భాగవతార్ (1877-1945 )
సంస్కృత కన్నడ తెలుగులలో అనేక కృతులురాసి హరికథ గానం తో ప్రేక్షకులను పరవశం కలిగించిన హరికేశ నల్లూరు ముత్తయ్యభాగవతార్ 1877 లో తిరునల్వేలిలో పుట్టి 20 వ శతాబ్దపు ఉత్తమ సంగీత స్వరకర్తగా పేరుపొందారు .వర్ణాలు కృతులు రాగమాలికలు తిల్లానాలతో వైవిద్యరచన చేసి మెప్పుపొందాడు .నిరుపనం ,పాదం లకు ఆయన పెట్టిందిపేరు . 108 చాముండేశ్వరి అష్టోత్తర కృతులురాసిన మహా భక్తుడు .ఖామాస్ రాగం లో ‘’మాతే మలయధ్వజ ‘’ కర్ణ రంజనిలో ‘’వాంఛతోను నా ‘’బాగా పేరు తెచ్చాయి .నిరోష్ట ‘’వంటి అనేక కొత్తరాగాలు సృష్టించాడు . 68 వ ఏట చాముండేశ్వరి సన్నిధానం చేరుకొన్నాడు .
423-వీణ శివ రామయ్య (1886-1946)
వీణ పద్మనాభయ్య కుమారుడు శివరామయ్య . మైసూర్ రాజ్య ఆస్థాన
సంగీత విద్వా0సుడు .సంస్కృత తెలుగు కన్నడాలలోచాలా కృతులు జావళీలు స్వరాలు కూర్చాడు 72 మళ రాగ కృతులురాశా డు. శ్రీరాగం లో ‘’వాణీ వీణాపాణి ‘’,ధర్మావతి రాగం లో ‘’శ్రీరాజ రాజేశ్వరి ‘’సుప్రసిద్దాలు . ,
424-కొత్త సంగీత రూపం ‘’నగ్మ’’సృష్టికర్త -వీణ వెంకట గిరియప్ప (1887-1952 )
కర్ణాటకలో హెగ్గేడ దేవకోటలో పుట్టి మైసూర్ పాలస్ ఆర్కెస్ట్రా డైరెక్టర్ అయిన వీణ వెంకట గిరియప్ప 1887 లో పుట్టాడు .వీణ లో అసాధారణ ప్రతిభ సాధించి భారత దేశమంతా పర్యటించి తన వీణాగానమాధుర్యాన్ని పంచాడు .సంస్కృత ,తెలుగు ,కన్నడాలలో చాలా కృతులు రాశాడు .కొత్త సంగీత రూపం ‘’నగ్మా ‘’ను సృష్టించాడు .ఇది హిందూస్థానీ గతులను కలిగి ఉండటం విశేషం .ఈయన కృతులలో భువన గాంధారి రాగం లోని ‘’లలితాంబికే శ్రీ మాతే ‘’బేహాగ్ రాగం లో ‘’శ్రీ జయలలితే ‘’ప్రత్యేకంగా పేర్కొనదగినవి .
425-సంస్కృత తిల్లానాలు రాసిన -టి .చౌడయ్య (1894-1967 )
చోడయ్యావయోలిన్ అంటే చెవులు కోసుకోవటం అందరికి తెలిసిందే .మైసూర్లోని కావేరీ తీరం లో తిరుముక్కడాల్ నర్సిపురం లో 1894 లో జన్మించి వయోలిన్ కు విశ్వ విఖ్యాతికలిగించి ఎన్నో పురస్కారాలు బిరుదులూ సన్మానాలు అందుకొన్న టి చౌడయ్య 73 వ ఏట మరణించాడు .బెంగుళూర్ లో ఆయన పేరఒక వీధి ఉంది .మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సుడు ,గాన విశారద బిడారం కృష్ణప్ప శిష్యుడు .వయోలిన్ మాధుర్యం పెంచటానికి తార షడ్జమ ,మంద్ర షడ్జమ మొదలైన కొత్త తీగలను ఏర్పాటు చేసి సప్త తంత్రులతో వయోలిన్ వాయించేవాడు .దీన్ని గురువు బిడారం అంగీకరించక ఎందుకుఈ ప్రయోగం అనిఅడిగితే బాగా వెనక ఉన్నవాళ్లకూ స్పష్టంగా వినబడటానికే అన్నాడు .వీణ శేషన్న దీన్ని అంగీకరించగా చివరికి గురువుకూడా సంతోషం తో ఒప్పుకున్నాడు .లెక్కలేనంతమంది శిష్యులను చౌడయ్య తయారు చేశాడు .సంగీత కళానిధి సంగీత శిఖామణి బిరుదులు పొందాడు 19-1-1967 నమహా వాయులీన విద్వా0సుడు చౌడయ్య మరణించాడు . చౌడయ్య సంస్కృత తెలుగు కన్నడాలలో కృతులు రచించాడు అందులో ప్రసిద్ధమైనవి-కాంభోజి రాగం లో ‘’శ్రీ వేణుగోపాల ,’’ ధన్యాసి రాగం లో ‘’దేవి పూర్ణ మంగళ ‘’చెప్పుకోదగ్గ కృతులు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా