‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం )
ఇప్పుడు మూర్తిగారి కధానికా సుస్రవంతిలో జలకాలాడుదాం .అందులో మొదటిది చదివితే సునిసిత హాస్యం ,పెదవి దాటే చిరునవ్వు ,పగలబడి నవ్వించే సరస౦, దాంపత్యం లో చిలిపి సరదాలు అన్నీ కనులముందు ప్రత్యక్షమౌతాయి .ఆయనలో ఒక భమిడిపాటి రామగోపాలం ,ఒకముళ్ళపూడి ,ఒక కే .ఆర్ .కే .మోహన్ కనిపిస్తారు .ఆ కథల్లో గోదారి చల్లదనం ,తాపేశ్వరం కాజా ,కాకినాడ కాజా ,పాలకొల్లు అల్లం మురబ్బా ,వేరు సెనగ చెక్కలు ,కోనసీమ కొబ్బరి లౌజులు ,మామిడి తాండ్ర ,మహా రుచి మంతంగా ,శుచిమంత౦ గా అనుభవైక వేద్యం అవుతాయి. ఆ హాయి అనితర సాధ్యమని పిస్తుంది .ప్రతిదీ ఒక రస గుళిక . హాస్యానికి చాలా పెద్ద పీట వేశారు మూర్తిగారు .17 కథానికల సంపుటి ఇది .ఇందులోని ఒకకథ పేరే సంపుటికి సముచితంగా పెట్టారు .
సంభాషణలో ఈ నాటి నేటివిటీ చాలాబాగా కనిపిస్తుంది .ఉపమానాలు ఉప్మాపెసరట్టు లాగా మహా రుచికరంగా ఉండటం ప్రత్యేకత .పుస్తకం చేతిలోకి తీసుకుంటే యిట్టె పూర్తి చేయిస్తుంది .ఆ వేగం గోదారి ని తలపి౦పజేస్తుంది .చతుర సంభాషణలు మనసుకు హత్తుకు పోతాయి .య౦గ్ కపుల్ రాజేశ్వరి కృష్ణ .ఆషాఢ మాసం లో కొత్త జంట విరహానికి కమ్మని లలిత సంగీత ట్యూనే ఈ కథ.డబ్బు ఖర్చుపెట్టి ఆవార్డ్ లు కొనుక్కోవటాలు ,సన్మానాలు చేయి౦చు కోవటాలు హాస్యరసభరితంగా ఉన్నాయి .ప్రేమ బంధం యెంత మధురం లో ఎంతో మధురం చేశారు .స్నేహం బంధంగా మారిన కత’’అమలాపురం అబ్బి గాడు ‘’
2- తుంగ చాప కథలు
మూర్తిగారి 14 కధలు ఈ పేరుతో వచ్చాయి .ఇందులోనూ తుంగ చాప కథ సంపుటికే శీర్షికై శిరోభూషణమైంది .కృతజ్ఞతకు పరాకాష్ట ఈ కథానిక. గురువు కూర్చుని చదువు చెప్పిన తుంగ చాప ,ఆయన మరణం తర్వాత శిష్యుడు ఎవరి ద్వారానో డబ్భు ఇచ్చి కొని భద్రంగా దాచుకుంటాడు .దాన్ని చూసి అంతా నవ్వు కుంటారు .చివరికి తాను కూడా ఆ చాపపైనే కాలం చేస్తాడు .మనసులను కదలించే కధానిక .పెళ్ళిళ్ళలో కవి సమ్మేళనాలు దానికి చేతి చమురు భాగోతం కడుపుబ్బా నవ్వించే దే’’వారెవ్వా క్యా సమ్మేళన్ హై ‘’.పాలకువాస్తవాలుతెలియజేసే కలాలు మౌనం వహించటమే కాదు కన్నీరూకార్చాయి అశక్తత తో ఆవేదనతో ‘’కలం కార్చిన కన్నీళ్లు ‘’లో .ఇందులో ఒకటి రెండు కధలు మిగిలిన సంపుటులలోనూ కనిపిస్తాయి .అన్నీ చాలా పకడ్బందీగా కూర్చినవే. చదివి ఆనంది౦చా ల్సినవే .
ఈ రెండు సంపుటులలో ప గొ జి లోని అనేక ప్రదేశాల ప్రస్తావన అక్కడి విశేషాలు చదువరులు తెలుసుకొంటారు .
3- తెలుగు కథానిక 2016
విహారి ,కోపూరి ,మూర్తిగారు ,యర్రమిల్లి విజయలక్ష్మి ,వేంపల్లె షరీఫ్ ,రామాచంద్ర మౌళి మొదలైన లబ్ధ ప్రతిస్టులైన కధకులు రాసిన 15 కదల సంకలనం ఇది .విహారి రాసిన ‘’బహుళత్వం’’ లో ఈనాటి బాంధవ్యాలు ఎలా మసకబారుతున్నాయో తెలియ జేస్తుంది .’’గాలిలో ఓ క్షణం ‘’లో మూర్తిగారు అక్కను తల్లి చేసిన వాడిపై చెల్లెలు ఎలాప్రతీకారం తీర్చుకోన్నదో తెలిపింది .గ్లోబల్ హాస్పిటల్ కల్చర్ విస్తరిల్లుతున్న కాలం లో ప్రవాహానికి ఎదురీదలేమని ‘’విశ్వమానవుడు ‘’లో యర్రమిల్లి విజయలక్ష్మి చెబితే ,కోపూరి పుష్పాదేవి దేనికైనా పోరాడి సాధిస్తేనే విలువ ఉంటుంది అని నిజం చెప్పారు ‘’ప్రస్థానం’’లో .కుటుంబాలలో సమస్యలు వచ్చి దూరమవ్వటం సహజం .తర్వాత పశ్చాత్తాపం లో అన్నీ మరచి కలిసి పోతారని తేల్చారు ‘’బంగారు గాజులు ‘’లో సోమావజ్ఝల .తటవర్తి నాగేశ్వరి ‘చినుకు చినుకు మధ్య ‘’మంచి కధే నడిపించారు .ప్రెస్ ,పోలీసులు ,అధికారులు ,రాచకీయ నాయకులు కలిసిపోతే సామాన్యుడికి న్యాయం దక్కదు అని చెప్పారు ‘’యజ్ఞం ‘’లో గన్నవరపు .అద్దేపల్లి జ్యోతి ‘’ఆ జ్ఞానం ‘’బాగా కలిగించారు .రామాచంద్రమౌళి ‘’ మనిషి తన జీవితాన్నితానే నిర్మించుకొని తానె జీవించాలి’’అని ‘’తాత్పర్యం ‘’చెప్పారు .ఉండవిల్లి ఎం’. ’ఫేస్ బుక్ ‘’లో అది చేస్తున్న వికృతాలను వెలుగులోకి తెచ్చారు .
హాయిగా చదివించి జీవిత సత్యాలను ఆవిష్కరించిన సంకలనం ఇది .మూర్తిగారి బహుముఖీన ప్రజ్ఞకు తార్కాణం .మరి౦త సాహితీ సేద్యం చేసి మూర్తిగారు బంగారు పంటలను పండించాలని కోరుకుందాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-18 –ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797