యోగి నివృత్తి నాధుడు
నాధ సంప్రదాయానికి చెందిన నివృత్తి నాధుడు 13 వ శతాబ్దపు మహారాష్ట్ర కు చెందిన మహా భక్తుడు,కవి ,తత్వవేత్త మహాయోగి .మొదటి వర్కారి సంత్ అయిన సంత్ జ్ఞానేశ్వర్ కు పెద్దన్నయ్య , గురువుకూడా .మహారాష్ట్ర గోదావరీ తీరం లోని పైఠాన్ దగ్గరున్న ఆపెగావ్ లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .అప్పుడు ఆ ప్రాంతాన్ని మహారాష్ట్ర యాదవ రాజు రామదేవ వర్మ పాలిస్తున్నాడు .
గ్రామ కరణం అయిన తండ్రి విఠల్ పంత్ కు జన్మించిన నలుగురు సంతానం లో నివృత్తి నాథుడు పెద్దవాడు. తల్లి రుక్మిణి బాయ్ . .నివృత్తి నాథుని తర్వాత జ్ఞానేశ్వరుడు ,సోపాన్ దేవుడు , అనే కుమారులు ,ముక్తాబాయ్ అనే కుమార్తె ఆ దంపతులకు జన్మించారు . .
నివృత్తి నాథుడు పదేళ్ళ వయసులో ముక్తాబాయ్ నాలుగేళ్ల వయసు లో ఉండగా తండ్రి కుటుంబాన్ని నాసిక్ కు మార్చాడు. ఒక సారి కుటుంబం తో జ్యోతిర్లి౦గ మైన త్ర్యంబకేశ్వరుని దర్శించటానికి తీర్ధ యాత్ర చేస్తూ దట్టమైన అరణ్యం లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద పులి బారిన కుటుంబమంతా పడింది .భయపడి ప్రాణాలు దక్కించుకోవటానికి పారి పోయారు .అదృష్ట వశాత్తు ఎవ్వరికీ ఏ ప్రమాదమూ జరగలేదుకాని నివృత్తి నాథుడు మాత్రం కుటుంబానికి దూరమయ్యాడు .తండ్రి అతనికోసం చాలా కాలం వెతికించాడు కాని జాడ తెలియలేదు .అతడు అంజని పర్వతం పైకి చేరి అక్కడ గుహలో తలదాచుకున్నాడు .అక్కడే గహాని నాథ్ అనే యోగి తపస్సమాధిలో ఉండటం గమనించాడు . ఆయన సమాధి నుంచి బయటకు రాగానే ఆయన పాదాలపై వాలి శరణు కోరాడు . ఆయన ‘’సంతోషం ,చివరికి నువ్వు ఇక్కడికి వచ్చావన్నమాట ‘’అన్నాడు. ఆయన అన్నమాటలు అర్ధం కాలేదు .ఆశ్చర్యం తో చూస్తున్నాడు .’’ఆడవి లోకి పులిని పంపింది నేనే .నువ్వు ఇక్కడికి వస్తావని ఈ గుహలో ఎదురు చూస్తున్నాను ‘’అంటూ ఆప్యాయంగా హత్తుకొని శిరసుపై హస్తం ఉంచి ఆశీర్వ దించాడు . అలనాడు శంకర భాగవత్పాదులకోసం గోవింద భగవత్పాదులు ,,వివేకానందుని కోసం రామ కృష్ణ పరమహంస ఎదురు చూసిన సంగతి మనకు తెలుసు .నివృత్తి నాదుని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలిగి ఆయన మహాగురువు గహనీనాథు లని గ్రహించాడు .గురువు అతనిని శిష్యునిగా స్వీకరించి నాథ సంప్రదాయం లో చేర్చుకున్నాడు .గహనీ నాథమహాయోగి శిష్యుడు నివృత్తి నాదుని పై సంపూర్ణ అనుగ్రహామృతాన్నివర్షించి , ఆత్మజ్ఞానం పొందిన మహాత్మునిగా యోగి మహారాజ్ గా మలచాడు .అతని జీవిత ధ్యేయం కర్తవ్య౦ బోధించాడు .గురువును వదిలి పెట్టటానికి శిష్యుడు అంగీకరించలేక తపించి పోయాడు .ఉన్నట్టుండి ఒక రోజు గురుమహరాజ్ అక్కడి నుండి అదృశ్యమయ్యాడు . .ఇప్పుడు నివృత్తి నాథుడు సంపూర్ణ ఆత్మజ్ఞానం పొందిన నాథ గురువై పూర్ణ యోగి యై జ్ఞాన బోధ చేస్తూ లోకానికి మార్గ దర్శనం చేశాడు . ,
గుర్వాజ్న నెరవేర్చటానికి అక్కడనుండి బయల్దేరి నివృత్తి నాథుడు దేశ సంచారం చేస్తూ నాద సంప్రదాయాన్ని వ్యాప్తి చేస్తూ కుటుంబాన్ని కలిసి జ్ఞానేశ్వర్ ను కూడా నాథ సంప్రదాయం లో చేర్చి గురువయ్యాడు .నాథసంప్రదాయం అంతా గురు శిష్య సంబంధం పై నడుస్తుంది .జ్ఞానేశ్వర్ కున్న అపూర్వ జ్ఞానం , భక్తి ,మేధస్సు, అతీ౦ద్రియ శక్తి , అనుభవాలను గుర్తించి అన్నగారు అతనిని వేదాంత విషయాలపై మంచి గ్రంథం రాయమని కోరాడు . అన్న కోరికపై సంత్ జ్ఞానేశ్వర్ ‘’అమృతానుభవం ‘’గ్రంథం అతని చిన్నవయసులోనే రచించాడు .దీనికి విశేషమైన కీర్తి ,ఆదరణ లభించాయి .భగవద్గీతపై వ్యాఖ్యానంగా ‘’జ్ఞానేశ్వరి ‘’రాశాడు .ఇదీ అద్భుతమైన గ్రంథమే. అమృతానుభవం రాశాక ,యోగి మహారాజ్ జ్ఞానేశ్వర్ పండరి పురం వెళ్లి పాండురంగని దర్శించి అక్కడే ఉన్న భక్త శిఖామణి నామ దేవుని పరిచయభాగ్యం పొందాడు .అనేక ప్రాంతాలు తిరుగుతూ వర్కారి సంప్రదాయ వ్యాప్తి చేశాడు .జ్ఞానేశ్వర్ నామదేవ్ ల మహాత్మ్యాలను జనం కథలు గాథలుగా చెప్పుకొంటారు .అలందిలో ఉన్నాడు .
తమ్ముడు సంత్ జ్ఞానేశ్వర్ ‘’ అలంది’’ లో సమాధి చెందిన తర్వాత, సంత్ నివృత్తి నాథుడు చెల్లెలు ముక్తాబాయ్ తో కలిసి అలంది ని విడిచి తీర్ధ యాత్రకు వెళ్ళాడు .ముక్తాబాయ్ చిన్నన్న సోపాన దేవ్ కు గురువై ఆత్మజ్ఞానం బోధించి అనేక అభంగాలు రాసి కీర్తి గడించింది .సోపాన్ దేవ్ మరాఠీ.భగవద్గీత ఆధారం గా ‘’సోపాన్ దేవి ‘’తో పాటు సుమారు 50 అభంగాలు రాశాడు .పూనా వద్ద సస్వద్ లో సమాధి పొందాడు .ఒకనాటి తుఫాను ఉరుములు మెరుపులు జడి వాన లో ముక్తాబాయ్ దారి తప్పి పోయింది .అలంది లో నిర్యాణం చెందింది .నివృత్తి నాథుడు త్రయంబకేశ్వరం వద్ద మహా సమాధి చెందాడు .సమాధిపై గొప్ప ఆలయాన్ని తర్వాత నిర్మించారు .వేలాది భక్తులు నాథ సంప్రదాయం వారు సందర్శించి స్పూర్తి పొందుతూ ఉంటారు .మొత్తం మీద నివృత్తి నాథుని కుటుంబం వారంతా మహా జ్ఞానసంపన్నులై ,భక్తిజ్ఞాన వైరాగ్య మార్గ దర్శులై నారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-18 –ఉయ్యూరు