4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో, కృష్ణాజిల్లా రచయిప్రచురణార్థంతల సంఘం సహకారంతో, 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగబోతున్నాయి.
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 2007లో ప్రపంచ తెలుగు రచయితల తొలి మహాసభలు మాతృభాషోద్యమ నిర్మాణం లక్ష్యంగా జరుగగా, 2011లో సాంకేతిక తెలుగు అంశం పైన రెండవ మహాసభలు జరిగాయి. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భాషపరంగా తెలుగు వారంతా ఒక్కటేననే అంశాన్ని చాటుతూ 2015లో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగిన వైనం తెలిసినదే!
2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా ప్రకటించిన నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ వైపు దృష్టి సారించవలసిందిగా అటు తెలుగు ప్రభుత్వాలు ఇటు తెలుగు ప్రజల గుండె తలుపులు తట్టే లక్ష్యంతో 2019 డిసెంబరు 27, 28, 29 తేదీలలో విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ 4వ మహాసభలు జరుగుతున్నాయి. మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ ఈ మహాసభల ప్రధాన ధ్యేయం.
తెలుగుతోపాటు తెలుగు నేలపైన కోలమి, కోయ, గోండి, కువి, కుయి, యెరుకల, సవర, పర్జి, కుపియా, బంజారా లాంటి భాషల్ని మాతృభాషలుగా కలిగిన ప్రజలు, అలాగే ఉర్దూ మాట్లాడే ప్రజలు తెలుగువారిగానే జీవిస్తున్నారు. తెలుగుతో పాటుగా ఈ మాతృభాషలన్నీ ప్రపంచీకరణం కోరల్లో చిక్కుకున్నవే! మాతృభాషల్ని మాట్లాడేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోయి చివరికి అవి తమ ఉనికినే కోల్పోతాయి. ఇప్పటికే మాతృభాష లెన్నో అంతరించి పోయాయి. దీన్ని నివారించ గలగాలి.
ఈ మహాసభలలో ముఖ్య చర్చనీయాంశాలు:
· తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్రం మరియు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేలా నూతన విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి…
· తెలుగు నేలపైన అన్ని విశ్వవిద్యాలయాల పరిథిలో నివసిస్తున్న వివిధ జాతుల మాతృభాషల పరిరక్షణ కోసం
ప్రత్యేకంగా “మాతృభాషల పీఠాలు” ఏర్పరచి నిధులు, నిధులు సమకూర్చటం గురించి…
· తెలుగు మరియు ఇతర మాతృభాషల అభివృద్ధికి పాటుపడేందుకు స్పష్టమైన అధికారాలతో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికార సంస్థల నిర్మాణం, వాటి విధి విధానాల గురించి..
· అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష
విషయంలోనూ అనుసరింప చేయటానికి అవకాశాల గురించి…
· రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, పాఠ్యాంశాల రూపకల్పనగురించి…
· ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూనికోడ్, పదకోశాల అభివృద్ధి గురించీ…
· తెలుగు విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రోత్సాహకాలుగురించి…
· తమిళనాడు, ఒడిసా, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలుగు నేర్చుకునేందుకు కావలసిన పుస్తకాలు ఇతర ఉపకరణాల అందజేత, భాషాపరంగా అక్కడి సమస్యల గురించి…
· తెలుగేతర ప్రాంతాల్లో జీవిస్తున్న తెలుగు వారికి హిందీ మాదిరే ప్రాధమిక, మాధ్యమిక పద్దతిలో సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ గురించి…
· యేళ్ల తరబడీ నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యస్థను పటిష్ఠ పరచటం గురించి,
· గత ఐదేళ్లుగా ఆగిపోయిన సాహితీ గ్రంథాల కొనుగోళ్ల గురించి…
· ఇంకా ఇతర సాహిత్య, సామాజిక అంశాల గురించి చర్చలు జరుగుతాయి. ఈ సందర్భంగా లోతైన అధ్యయనం జరిగేందుకు వీలుగా మరిన్ని చర్చనీయాంశాలు సూచించ వలసిందిగా ఆయారంగ ప్రముఖులను కోరుతున్నారు.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం
2007 ప్రధమ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన ఒక తెలుగు రచయితల సంఘాన్ని నిర్మించి, నిర్వహించే బాధ్యతలను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానం ద్వారా “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పడింది. 2011 రెండవ మహాసభలలో “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 2015లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడి విజయవాడలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో రిజిష్టర్ చేయించే బాధ్యత కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు.
2019 జనవరిలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో విజయవాడలో రిజిష్ట్రేషన్ చేయించారు. గౌరవాధ్యక్షులుగా డా. మండలి బుద్ధప్రసాద్, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
అధ్యక్షులుగా శ్రీ గుత్తికొండ సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా శ్రీ గోళ్ల నారాయణ రావు, కార్యదర్శిగా డా. జి వి పూర్ణచందు, సహాయకార్యదర్శిగా డా. గుమ్మా సాంబశివరావు, కోశాధికారిగా శ్రీ టి శోభనాద్రి, కార్యవర్గ సభ్యులుగా డా. ఈమని శివనాగిరెడ్డి, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా. వెన్నా వల్లభరావు, శ్రీ పంతుల వెంకటేశ్వర రావు, శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గార్లతో ఏర్పడిన కార్యవర్గం ఈ మహాసభలను నిర్వహిస్తోంది.
రేపటి మహాసభల నాటికి ప్రపంచ వ్యాప్తంగా సభ్యులతో, సంపూర్ణ కార్యవర్గం కలిగిన ఒక అంతర్జాతీయ సంస్థగా రూపు దిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులైన తెలుగువారి సంస్థగా తెలుగు భాషాసంస్కృతులను, సాహిత్యాన్ని విశ్వవ్యాపితం చేస్టూ, “ప్రపంచ తెలుగు” కలను నిజం చేయటం ఈ సంస్థ లక్ష్యం. తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపించే చారిత్రక పరిశోధనలను ప్రోత్సహించటం, తాజా పరిశోధనలను తెలుగు ప్రజలకు అందించటం ద్వారా తెలుగుపట్ల జనానురక్తిని పెంపుచేసే కృషిలో ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుంది. “ప్రపంచ తెలుగు రచయితల సంఘం”లో రూ. 2000/-(విదేశాలలోని తెలుగు వారికి US 50$) చెల్లించి, జీవిత సభ్యులుగా చేరటం ద్వారా ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో సహకరించ ప్రార్థన. రచయితలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యాభిమానులైన ప్రతీ ఒక్కరూ ఈ సంస్థలో జీవిత సభ్యులుగా చేరవచ్చు.
మహాసభల ప్రతినిథులకు సూచనలు
ప్రతినిధులుగా పాల్గొనేవారు ఈ మహాసభల కోసం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవితసభ్యులుగా చేరిన వారు అదనంగా ఈ ప్రతినిథి రుసుము చెల్లించనవసరం లేకుండా మినహాయింపు నిస్తున్నారు. ప్రతినిధి రుసుమునుగానీ, జీవిత సభ్యత్వాన్ని గానీ డి.డి. లేదా చెక్కు రూపేణా PRAPANCHA TELUGU RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగా వ్రాసి, కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితలసంఘం, 1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ-520002 చిరునామాకు పంపవలసి ఉంటుంది.
ప్రతినిధులు, జీవిత సభ్యులకు, ప్రతినిధులకు మాత్రమే ఈ మహాసభల ప్రాంగణంలో భోజన, ఉపాహారాలుంటాయి. వసతి ఏర్పాట్లు మాత్రం ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది.
ప్రతినిధులుగా నమోదు కావటానికి చివరి తేదీ 2019 అక్టోబరు 31.
జీవిత సభ్యులుగానూ, ప్రతినిధులుగా నమోదయిన వారికి కవిసమ్మేళనాలు, ప్రసంగాలు, పత్ర సమర్పణలలోనూ ఈ మహాసభల కోసం ప్రత్యేకంగా ‘ప్రపంచతెలుగు’ వ్యాస సంపుటిలోనూ ప్రధమ ప్రాధాన్యం ఉంటుంది.
సభా వేదికపైన వీలుని బట్టి రచయితలు తమ రచనలను ఆవిష్కరించుకునే అవకాశం ఎప్పటిలానే కల్పిస్తున్నారు.
మహాసభల సమాచారాన్ని మీ సాహితీ మిత్రులకూ తెలుపండి. రచయితలు, భాషాభిమానులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభలు విజయవంతం కావటానికి సహకరించండి. ఎవరో వచ్చి ఆహ్వానించా లనుకోకుండా, మాతృభాషాభిమానంతో స్వచ్ఛందంగా స్పందించాలని నిర్వాహకులు ప్రార్థిస్తున్నారు.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం వివరాల కోసం http://www.prapanchatelugu.com వెబ్‘సైట్ చూడగలరు. మీ సమాచారాన్ని ఇ-మెయిల్: prapanchatelugu@gmail.com కు పంపవచ్చు. శ్రీ గుత్తికొండ సుబ్బారావు,అధ్యక్షుడు 9440167697, డా. జి వి పూర్ణచందు, కార్యదర్శి 9440172642లతో సంప్రదించవచ్చు.