ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:
ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆగస్టు 24 శనివారం మరణించినట్లు తెలుస్తోంది. భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు చెబుతారు. రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు
ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. ఒంటరితనం కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆమె రెండు లేఖలు రాసినట్లు సమాచారం. తనకు సంబంధించిన వస్తువులను అన్నింటిని రాజేష్ అనే యువకుడిగకి ఇవ్వాల్సిందిగా ఆమె ఓ లేఖలో రాసినట్లు చెబుతున్నారు. రాజేష్ ఆమెకు నిత్యజీవితంలో చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నాడు.
తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని మరో లేఖలో ఆమె రాసినట్లు చెబుతున్నారు. ఈ రెండు లేఖలను కూడా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె కవిత్వంతో పాటు విమర్శనా వ్యాసాలు కూడా రాశారు. అనువాదాలు కూడా చేశారు. కావ్య జ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ ప్రముఖ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు.
మొజాయిక్ లిటరరీ అసోసియేషన్ లో చురుకైన పాత్ర పోషించారు. వక్షస్థలే అనే కథకు ఆమె ఆర్ఎస్ కృష్ణమూర్తి అవార్డును అందుకున్నారు. ఆమె మృతికి తెలుగు సాహిత్య లోకం నివ్వెరపోయింది. సోషల్ మీడియాలో తెలుగు సాహిత్యకారులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
గతంలో ఆమె లెక్చెరర్ గా పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆమె రచనలు చేస్తూ వచ్చారు. ఇటీవలే ఆమె వెంకోజీపాలెం నుంచి ఎంపివీ కాలనీకి తన నివాసాన్ని మార్చారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె తన సూసైడ్ నోట్ లో పోలీసు కమిషనర్ ను ఉద్దేశించి రాశారు.(తెలుగు టీమ్ )
—