ప్రపంచ దేశాల సారస్వతం 58-జర్మన్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం

58-జర్మన్ సాహిత్యం -1

జర్మన్ భాష –ఆర్య భాషా కుటుంబానికి చెందిన’’ట్యూటనిక్’’ ,భాషలనుంచి జర్మన్, డచ్ ,డేనిష్  ,నార్వీనిజియన్ ,స్వీడన్, ఇంగ్లిష్ భాషలు వచ్చాయి .జర్మన్ భాషలో ప్రథమ ,ద్వితీయ ,చతుర్ధి ,షష్టివిభక్తులు ,త్రిలింగాలు ,అనేక వికరణాలు ఉన్నాయి .వస్తుస్వరూపంతో సంబంధం లేకుండా వ్యాకరణ నిస్ట మైంది లింగం .ఉపవర్గాలతో కొత్తశబ్దాలు, సమాసాలు ఈ భాషలో సృష్టించవచ్చు .పూర్వం లిపి ‘’గోథిక్’’అయినా ,ఇప్పుడు రోమన్ లిపి బాగా ప్రచారం లో ఉంది .

    జర్మన్ సాహిత్యం –జర్మన్ సాహిత్యం లో అతిప్రాచీన రచన ‘’డాస్ ఇన్నే బ్రాండ్స్ లీడ్ ‘’.దీనిలో తండ్రీ కొడుకులమధ్య యుద్ధ వర్ణన ఉన్నది .మధ్యయుగం లో బాలడ్ లు వచ్చాయి .13వ శతాబ్దిలో ఇతిహాస కావ్యం ‘’నిబు లున్గెన్ లీడ్ ‘’వచ్చింది .దీనిలో మొదట్లో హాగెన్ సీగ్ ఫ్రీడ్ విరోధం ,తర్వాత ప్రేమ స్వామి భక్తీ వీరధర్మం ఉదాత్తంగా రాయబడినాయి .ఇలాంటి వీర కావ్యాలనే  తర్వాత హార్ట్ మన్,ఓల్ఫ్రంఫన్ఎషెన్ భాక్ ,గొట్ట్ ఫ్రీడ్ ఫన్స్ట్రాఫ్ బుర్గ్ రాశారు .నిరంతరం అబద్దాలతో పోరాడి చివరకు విజయం పొందిన పార్జీ వాల్ చరిత్రను వోల్ఫ్రం రాశాడు ట్రిస్టన్ ఉండ్,ఐసోల్డ్ ల   ప్రేమ గాథను గొట్జ్ఫ్ ఫ్రీడ్ రాశాడు .ఈ కాలం లోనే ‘’మిన్నె సాంగర్ ‘’అనే ప్రణయ కావ్యరచయితలు బయల్దేరారు .వీరిలో ముఖ్యుడు –వాల్టర్ ఫన్  డెర్ ఫోగెల్ వైడే.ఆస్ట్రియాకవి రైన్ మార్ ఫన్ హగెనో కి శిష్యుడు .నాటి పోప్ కు వ్యతిరేకంగా ,రాజుకు అనుకూలంగా హృదయాన్ని తాకే కవిత వాల్టర్ రాశాడు .మధ్యయుగ గాయకుడు టాన్ హౌసెర్ పై అనేక కథలూ గాథలూ ప్రచారంలో ఉన్నాయి .

   15వ శతాబ్దిలో జానపద సాహిత్యం బాగా వచ్చింది .గేయకళలో మాధుర్యం నింపి ఆనందం విషాదం జనన మరణాలు మిత్రత్వ శత్రుత్వాలు హృద్యమంగా చిత్రి౦పబడినాయి .వీరుల సాహస కృత్యాలు ,సంయోగ వియోగాలు ఋతువులు కన్నులకు కట్టినట్లు వర్ణంపబడినాయి .ఇవన్నీ తర్వాత 1774 కవి గొట్జ్   ఫ్రీడ్ ఔగుంట్ బైర్గెర్ కవి ‘’బెయో వారే ‘’అనే గొప్పబాలడ్  కావ్యం రాయటానికి దోహదపడినాయి .ఈ ధోరణి అనుసరించి ‘’మైస్టర్ సింగర్ ‘’అనే గాయకులూ వచ్చారు.వీరిలో హన్స్ సాక్స్ -1494-1576 నాలుగు వేలగీతాలు రాశాడు .’’ఫాస్ట్ నాక్ట్ స్పీలే ‘’అనే హాస్య నాటకమూ రాశాడు .ఇతని సమకాలికుడు మార్టిన్ లూధర్  కృషితో   ప్రోటేస్టెంట్   చర్చి  వచ్చింది ..జాతీయత సాహిత్యంలో కాలుమోపింది .పునర్వికాస యుగం అనబడే రేనైజాన్స్ వచ్చి, అభ్యుదయానికి దారి చూపింది .

   ఈ నవ చైతన్యంతో మానవతావాదం యోహనేస్ రాయిల్ కిన్,డెసిడెరియుస్ఎరాన్యున్ ,ఉల్రిక్ ఫన్హుట్టెన్ ల నాయకత్వం లో ప్రవేశించి ,ప్రాచీన గ్రీక్ ,లాటిన్ ,సాహిత్య సంస్కృతులు పునరుద్ధరణ పొందాయి .భావనావిస్త్రుతి పెరిగింది .సమకాలీన వ్యవహార భాషలో కావ్య రచనకు అంకురార్పణ జరిగింది .ఇందులో ప్రధముడు సెబాస్టియన్ బ్రాస్ట్ .ఇతని ‘’నారెన్ షిప్ ‘’అంటే మూర్ఖుల నౌక 1494లో వచ్చింది .కానీ రచయితలకు గ్రీక్ లాటిన్ భాషా వ్యామోహం ఇంకా తొలగలేదు .అందరూ లాటిన్ లో గిలకటం మొదలుపెట్టారు .1617లో మాతృభాషలోనే రాయాలి అనే ఉద్యమాన్ని మార్టిన్ ఓ పిట్స్ ప్రారంభించినప్పుడు వాదోపవాదాలు లాటిన్ లోనే జరగటం మిక్కిలి ఆశ్చర్యకరం .అయినా తన  ధ్యేయాన్ని నీరు గార్చకుండా పిట్స్ ఖండ కావ్య సంపుటి ,జర్మన్ కవిత్వం పై విమర్శనాత్మక గ్రంథాలను జర్మన్ భాషలోనే రాశాడు .ఇంతలోనే 1618నుండి ప్రారంభమైన యుద్ధం 30ఏళ్ళు కొనసాగటం వలన జర్మన్ భాష కవితకు ఆటంకం ఏర్పడింది .17వ శతాబ్దం లో  గ్రేమ్మెల్స్ హౌసెస్ జర్మన్ భాషలో   ‘’సి౦ప్లి సిన్సిమున్ ‘’ అనే ఉత్తమ గ్రంథాన్ని 1668లో రాసి ప్రచురి౦చాడు .ఆ తర్వాత జర్మని ముక్కలుముక్కలుగా విభజింపబడి జర్మనీలో’’ ఫ్రెంచ్ భాష ‘’పాలకుల ఆదరం పొందింది .18వ శతాబ్దిలో ‘’లీప్సిగ్ ‘’నగరం సాహిత్య కేంద్రంగా వెలిగింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.