పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం
చిత్తూరు జిల్లా తిరుచానూర్ కు రెండుకిలో మీటర్ల దూరం లో జోగిమల్లవరం అనే చిన్న గ్రామం ఉన్నది .ఇదిఒకప్పుడు తిరుచనూరు లో భాగమే .దీనికి తిరుచుకానూర్ అనీ ,తిరు చోగినూర్ ,శుకగ్రామం అనే పేర్లు కూడా ఉండేవి .శుకమహర్షి పేరు మీద ఏర్పడిన గ్రామం అని అర్ధం యోగి చివరికి జోగి అయింది .ఇక్కడే అద్భుత శ్రీ పరశారేశ్వర చోళ దేవాలయం ఉంది .ఈగ్రామానికి పరశారేశ్వరం అనే పేరు స్వామి వలన కలిగింది .వశిష్ట మహర్షి మనవడు పరాశర మహర్షి ఈ లింగాన్ని ప్రతిస్టించాడు .ఈయన శక్తి మహర్షికు కుమారుడు .శక్తిమహర్శిని ఒకరాక్షసుడు సంహరిస్తే ,తండ్రిలేని పరాశరుడిని తాత వషిస్టుడే పోషించి పెంచాడు .తండ్రిని చూడాలని తాతను అడిగితె తాత శివుడికోసం తపస్సు చేయమని చెప్పగా పరశారుడు శివునికోసం ఇక్కడే తపస్సు చేశాడు.శివుడు ప్రత్యక్షమై స్వర్గం లో తండ్రిని దర్శించగలవని చెప్పాడు .అందుకే పరాశరమహర్షి ఇక్కడ శివలింగం ప్రతిస్టించాడు .కనుక పరాషరేశ్వర లింగం గాపేరు వచ్చింది .
అర్జునుడు యోగి గా దేశాలు తిరుగుతూ ఇక్కడే పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయగా శివుడు వేటగాడి రూపం అంటే మల్ల రూపం లో ప్రత్యక్షమై పాశుపతాస్త్రం అనుగ్రహించాడు .యోగి అయిన అర్జునుడు మల్లుడైన శివుడు పవిత్రం చేసిన ప్రదేశం కనుక యోగిమల్లేశ్వరం అయి ఇప్పుడు జోగి మల్లవరం అని పిలువబడుతోంది .
ఆలయం లోచాలా శాసనాలున్నాయి .మొదటి రాజరాజ చోళుడు తన 23వయేట పాలనలో 1 008 లో వేసిన శాసనం బట్టి ఆలయం 11వ శతాబ్దికి ము౦దుదని తెలుస్తోంది .9వ శతాబ్దం చివర చోళరాజులు తిరుపతిని జయించారు .కనుక ఇది 10వ శతాబ్ది మధ్యకాలం నాటి ఆలయం అని అందరూ భావిస్తారు .చోళరాజచక్రవర్తి వీర రాజేంద్ర దేవుడు ఈ ఆలయాన్ని ‘’పిప్లాధీశ్వర ముదైయ మహాదేవాలయం ‘’గా పేర్కొన్నాడు .కులోత్తుంగ చోళ చక్రవర్తి దేవాలయానికి కానుకలు సమర్పించాడు .అలాగే త్రిభువన చక్రవర్తి రాజరాజ దేవుడుకూడా స్వామికి కానుక సమర్పించిన శాసనం ఉన్నది .మరొక శాసనం లో ఇక్కడి కోనేరు ను తిరుప్పత్తి ఉదై యార్ త్రవ్వించి నట్లున్నది .స్వామికి సమర్పించిన భూములు బంగారం తెలియజేసే రికార్డ్ లున్నాయి .
ఆలయం ఒకేఒక దక్షిణ ముఖద్వారమున్న ఆలయం .గర్భాలయం లోస్వామి లింగం ,అమ్మవారు ,ముఖమండపం ఉన్నాయి .గర్భాలయ, అంతరాలయాలు అధిష్టాన, ఉపానాలు కలిగిఉంటాయి.కొష్టాలు,తోరణాలు భూతమాలలు ఉంటాయి .ముఖమంటపం ఉంది .గర్భాలయం పై విమానం ఇటుకలతో కట్టారు .అంతరాలయ ప్రవేశం దగ్గర కుడివైపు గణపతి విగ్రహం అంకుశ,పాశ , దంత ,మోదుక,కర్ణ దామకూటం,యజ్ఞోపవీతం కలిగి ఉంటాడు .గర్భాలయం దక్షిణాన వీరాసన దక్షిణామూర్తి అక్షమాల కమండలం చిన్ముద్ర ,ప్రభామండలం ,చక్రకుండల గ్రైవేయక ,యజ్ఞోపవీత ఉదర బంధనాలతో జటాజూటం తోదర్శనంస్తాడు .కింద ఇరువైపులా ఇద్దరు మహర్షులుంటారు .గర్భాలయం పడమటి గోడపై విష్ణుమూర్తి సామభ౦గ౦ తో నిలబడి శంఖు చక్ర అభయ ముద్రతో ఉంటాడు .వాయవ్యభాగం లో కుమారస్వామి ఇద్దరు దేవేరులతో వీరాసనం లో ఆరు ముఖాలతో ,12చేతులతో ,వజ్ర బాణ ఖడ్గ చక్ర త్రిశూల ధనుస్సు శక్తి ,కుక్కుట,పాశాలతో అభయ ,వరద హస్తాలతో ఉంటాడు .చక్రకు౦డలం గ్రైవేయకం ,చన్నవీర ,ఉదర బంధనాలుంటాయి .కుడిప్రక్కా అమ్మవారు ఉత్పలం తో ఎడమవైపు అమ్మవారు కూడా చేతిలో ఉత్పలం తోకనిపిస్తారు .
బ్రహ్మ సమభంగం లో నిలబడి మూడు తలలు నాలుగు చేతులతో అక్షమాల కమండలం అభయముద్ర కటి హస్తం ,జటామకుట ,మకరకుండల గ్రైవేయక యజ్ఞోపవీత సింహలలాటాలతో ఉంటాడు .బ్రహ్మకు ఎడురుగా చండీశ్వరుడు ఎడమకాలు మడిచి కుడికాలు వేలాడుతూ ఎడమచేతిలోపద్మం ,కుడి తొడపై కుడిచేతితో శివ బంటుగా ఉంటాడు .కామాక్షి అమ్మవారి ప్రవేశ ద్వారం ఎడమవైపు సమభంగం లో నిలబడి బాల సుబ్రహ్మణ్యస్వామి కుడి అభయహస్తం ఎడమ కటిహస్తం తో యజ్ఞోపవీత ,ఉదరబంధన,గ్రైవేయక ,సింహ లలాట ,మెడహారం మోకాళ్ళవరకు వ్రేలాడుతూ కనిపిస్తాడు .
ముఖమండప ప్రదక్షిణ మార్గంలో కామాక్షీ అమ్మవారి చిన్న విగ్రహం సమభంగం లో నిలబడి ఉన్న ఆలయం ఉంటుంది .కుడిపై చేతిలో అంకుశం ,ఎడమ పై చేతిలో పాశం ,కింది చేతులలో అభయ వరముద్రలతో దర్శనమిస్తుంది
పార్వతీ పరిణయ దృశ్యం నృత్యగణపతి సోమస్క౦ద ,కంకాళమూర్తిలు కూడా చూడ ముచ్చటగా ఉంటారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-8-20-ఉయ్యూరు