ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ?
వస్తువు యొక్క ప్రస్తుత అస్తిత్వం వర్తమానం ,అంతకు ముందుది భూతకాలం ,తరువాత వచ్చేది భవిష్యత్ కాలం అనీ ,ఇవన్నీ ఒక సంఘటన ఆధారంగా మానవ బుద్ధికల్పితాలనీ వైశేషికుల భావం .కాలం లాగానే దిక్కు లేక దేశానికి పరత్వ అపరత్వం ,దూరం ,దగ్గర లక్షణాలు కనిపిస్తాయి .దేశాన్ని బట్టి వస్తువు స్థాన నిర్దేశం చేస్తూ ముందూ వెనుక పొడుగు పొట్టి పైన కింద అని అనేకరకాలుగా వ్యవహరిస్తాం .దీనివలన దేశం యొక్క ఆస్తికత నిరూపి౦ప బడి ,కాలం లాగా నిమిత్త కారణం అవుతోంది .సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టి తూర్పు పడమర దిక్కుల కల్పనా ఏర్పడింది .అలాగే మిగిలిన దిక్కులు కూడా . ఇవి మానవ కల్పితాలు .నిజానికి దేశం ఏకం ,నిత్యం .అస్తూలం వ్యాప్తం .కాని నిష్క్రియం .అమూర్తంగా ఉంది అని వైశేషికులు అంటారు .మన పూర్వుల భావాలు మనకు తోచినట్లు ,తమ ప్రత్యేకభావాలు కూడా తర్వాత తరాలకు కృత్రిమంగా కనబడ అవచ్చు ,తాము ప్రతిభా వంతుల భుజ స్కంధాలపై ఆధారపడి నిలిచి ఉన్నామని ఆధునిక శాస్త్రవేత్తలు గ్రహించారని లింకన్ బార్నెట్ చెప్పాడు .
‘’our notion of time and space although much more subtle and flexible than they were before the appearance of RelativeTheory ,are not very likely yet subtle enough ‘’అన్నాడు లిమిటేషన్స్ ఆఫ్ సైన్స్ లో జే డబ్ల్యు యెన్ సల్లివాన్ .దీనిభావం అయిన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం చెప్పక పూర్వం కంటే దేశ ,కాలాలకు చెందిన మన భావనలు చాలా సూక్ష్మ తరాలుగా ఉన్నా పూర్తిగా సూక్ష్మాతి సూక్ష్మాలు కావు .ఈ దృష్టి తో చూస్తె న్యూటన్ ఎడ్డి౦గ్టన్, అయిన్ స్టీన్ మొదలైన సైంటిస్ట్ ల భావాలతో కణాద, గౌతమ సిద్ధాంతాల్ని పోల్చి చూస్తె ,ఆధునిక సైంటిస్ట్ ల సిద్ధాంతాలలో కొత్తదనం ఏదీ లేదని తెలుస్తోంది .పైగా లోపాలు బాగా కనిపిస్తాయి .దేశ కాలాల ఏకత్వ సర్వ వ్యాపకత్వాలు ,త్రికాలాలు దిక్కులు అన్నీ కల్పితాలే అని కణాదులు చెప్పినట్లే ఈనాటి శాస్త్ర వేత్తలూ చెప్పారు .గ్రహాలూ వాటి సంచారం అంతరించినా ,దేశకాలాలు నిత్యాలు నిర్వికారాలు అపరిమితాలు అని వైశేషికులు చెప్పినట్లే ఈ సై౦టిస్ట్ లూ చెప్పారు కానీ అయిన్ స్టీన్ చెప్పిన space-time continuum అంటే దేశకాల ప్రవాహ ఐక్యం సిద్ధాంతం ఇంకా పరిపూర్ణం కాలేదు .ఇందులో చాలాసిద్ధాంత రాద్దా౦తాలున్నాయి అనటానికి సల్లివాన్ చెప్పిన మాటలే తార్కాణం .
లింకన్ బార్నెట్ చెప్పిన అనిశ్చయత్వ సిద్ధాంతం అంటే ‘’ప్రిన్సిపుల్ ఆఫ్ అన్ సర్టేనిటి’’ని బట్టి ఈశ్వర సృష్టిలో సర్వ ప్రకృతి రహస్య గ్రహణం అనిశ్చయం, అనిర్దారితం గా ఉంది .అంటే మానవ బుద్ధికి అతీతంగా ఉంది .అందుకే ‘’ఈ విషయం లో గ్రీకు రోమనులకంటే మనం అధిగమించినట్లుకానీ ,అత్యున్నత నాగరకదేశాలైన చైనా భారత దేశాలకంటే మనకు ఎక్కువ తెలుసు అనికాని అనుకోవటం అనుమానాస్పదమే అంటే’’ డౌట్ ఫుల్’’అన్నాడు సల్లివాన్ పండితుడు .కనుక మన ప్రాచీన రుషి ప్రోక్త ప్రకృతి రహస్యాల కు మించిన రహస్యాలేవీ ఆధునిక శాస్త్రవేత్తలు గ్రహించ లేదని అర్ధం .
‘’My religion consists of a humble admiration of the illimitable superior Spirit who reveals Himself in the slight details we are able to perceive with our frail and feeble minds ‘’అని భారతీయ మహర్షుల భావనకు నమస్సులు అందించాడు సల్లివాన్ .’’బుద్ధికి అగోచరమైన విశ్వంలో వెలువడిన ఉత్కృష్ట ప్రజ్ఞా శక్తి ని గూర్చి హృదయ పూర్వక భావ విశ్వాసమే ఈశ్వర భావాన్ని కలుగ జేస్తోంది ‘’అని అయిన్ స్టీన్ శాస్త్రవేత్త చెప్పినట్లు ,మనప్రాచీన మహర్షులు కార్య రూప ప్రపంచాన్ని వినియోగించుకోవటమే కాకుండా ,దానికి కారణమైన అమానుష ప్రజ్ఞా శక్తి రూప సర్వజ్ఞ తత్వమైన పరమేశ్వరునే విశ్వసి౦చా రు .విశ్వ జీవ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకోవటమే కాక ,సృష్టి ప్రయోజన సమస్యా ధ్యాన తత్పరులై ,ఈశ్వర సంకల్ప రహస్యాలను గ్రహించే ప్రయత్నం చేసి సాధించి ,ఆ అద్వితీయ అలౌకిక మహాతత్వాన్ని పొంది ,ఆన౦దించి ,అభ్యుదయ నిశ్రేయస సిద్ధికోసం ప్రపంచ పరిశోధన చేశారు .అదే భారతీయ విజ్ఞాన తత్వ వైభవం .దీన్ని గ్రహించి మన సంస్కృతీ మహాత్మ్యాన్ని దాని సత్సంపదను సద్వినియోగం చేసుకొందాం .
ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –సర్వ సిద్ధాంత సౌరభం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-21-ఉయ్యూరు
—