శ్రీనాథ కవి సార్వ భౌముడు

శ్రీనాథ కవి సార్వ భౌముడు

 శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం వాడని కొందరు  నెల్లూరి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాథుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు చెప్పాడట .తాత మారనను  ‘’వినమత్కకతిసార్వ భౌమడని ,కవితా విద్యాధరుడు ‘’అని చెప్పాడు .శ్రీనాథుడి నాలుకపై బాణుడు ,మయూరుడు ,బిల్హణుడు మొదలైన ప్రౌఢ కవులు నర్తిస్తూఉంటారు  .అయితే భారవి శ్రీనాథుడికి అందడు అంటారు ఆచార్యశ్రీ .హరవిలాసం లోని కిరాతార్జునీయం భారవి తో సంబంధమే లేదు .అతడు ‘’సర్వాంగీణ  కీర్తి ఖర్జువు ‘’ప్రతిభ కంటే పాండిత్యం ఎక్కువ .శ్రీనాథుడు ‘’కచ్చిపోతు‘’.తనంతటి వాడు ఇంకోడు ఉంటె సహించ లేడు.అందుకే ‘’కంటకుడైన శాత్రవు డోకండు తనంతటి వాడు కల్గినన్ –కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతి కేళి ‘’?అన్నాడు .

    వామన భట్ట భాణుడు ఆ కాలం లో కొండ వీటిలో ఉన్నాడు .తరువాత విద్యానగరం నుండి వచ్చి రెడ్డిరాజులను చేరాడు .ఇతనికి డిండిమ భట్టు పై అభిమానం .మన కవి సార్వ భౌముడు రెడ్డి రాజుల విద్యాధికారి .అనేక దేశాల పండితులతో భాషించాడు .పండితులు ‘’క్రోడ పత్రాలు ‘’కూడా బయట పెట్టె వారుకాదు .శాస్త్ర చర్చలు ఎడతెగక సాగేవి .పరస్పర అవహేళనలే ఎక్కువ .సిద్ధాంత గ్రంథాలకంటే పూర్వ పక్ష గ్రంథాలపైనే అధికారం ఉండేది .ఉత్తరాది మఠానికిచెందిన’’ సత్య ధ్యాన తీర్ధులు’’ద్వైతులు. దాన శూరులు .ఆది శంకరుల గ్రంథాలన్నీ కొట్టిన పిండి వారికి .శాస్త్ర వాద పద్ధతిని రాయలు నాలుగు పద్యాలలో భేషుగ్గా వర్ణించాడు .

 వేదాంత దేశికులు  డిండిముడిని ఓడించారు .కాని శ్రీనాథుడు  డిండిమ భట్టును ఓడించి అతని కంచు ఢక్క పగల కొట్టించే దాకా నిద్ర పోలేదు .రాజసం శ్రీనాథుడి సొత్తు .అప్పుడే ‘’కర్నాటక దేశ కటక పద్మ వన హేళి’’అని పించుకొన్నాడు .రెడ్డి రాజులు రాసిన  మాళవిక ,గాధా ,అమరుకం మొదలైన కావ్యాలలో శ్రీనాధుడి హస్తం ఉండి ఉండచ్చు అని నారాయణాచార్యుల వారి ఊహ .కవిత్వాన్ని జీవితాన్ని ఒకటిగా చేసుకొన్న కవి ఇంకోడు లేడు.’’దూడ పేడ ,పసిపిల్లల ఉచ్చ ,జంగమ రాలి వక్షోజాలు అన్నీ కవిత్వీకరించాడు .శ్రీశ్రీ గారి ‘’అగ్గిపుల్లా సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం ‘’కు శ్రీనాథుడే స్పూర్తి అనిపిస్తోంది  నాకు .మగడు చచ్చిన మగువ బతక రాదని శ్రీనాథుడి అభిప్రాయం .వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు నీచం గా ‘’మగడు చచ్చిన ముండ ,ముండ దీవెన ,తలకు మాసిన ముండ ‘’అని తిట్టాడు ‘’విశ్వస్త వడ్డించటం హేయం గా భావించాడు .

 శ్రీనాథుడికి దేనినైనా ‘’ఆస్ఫాలించటం ‘’ఇష్టం ఆ శబ్దాన్ని పలుమార్లు ఉపయోగిస్తాడు .శబ్దాలను ఆలోచించి ప్రయోగించడు మనల్నీ ఆలో చింప నీయడు  అంత వేగం గా పద్యం ప్రవిహిస్తుంది .పెద్దన గారి శబ్ద ‘’వశిత్వం ‘’ఎవరికీ రాలేదు .ఇతను వాచ్య కవి .’’కుల్లా యుంచితి కోక గట్టితి మహా కూర్పాసమున్ దొడ్గితిన్ –తల్లీ కన్నడ రాజ్య లక్ష్మీ దయ లేదా నేను శ్రీనాడ న్ ‘’అని రాయల దర్శనానికి వెళ్లి చెప్పాడు పూర్తిగా కన్నడ వేషం వేసుకోన్నాననే చెప్పాడు తల్లీ అంటూనే నేను శ్రీనాదుడన్ అన్నాడు .శ్రీనాధుడు అంటే లక్ష్మీ దేవి భర్త .ఇది ఆలోచించకుండా ఆ వేగం లో అనేశాడు అంటారు సరస్వతీ పుత్రులు .కాళిదాసు ను అందుకోవాలనే తపన. కాని అది సాధ్యంకాలేదు. కాళిదాసు సున్నిత వీణాగానం .శ్రీనాధుడు ‘’ఆర్గాన్ ‘’ధ్వని .ఆయన జీవనాడి ఈయనకు చిక్కదు .అంటారు ఆచార్యులు .శ్రీనాధుని పద్యం పైన పటారం లోన లొటారం .

     విజయనగర కవులు శ్రీనాధుడిని అడ్డం పెట్టుకొని బాగా గడించారట .అర్ధ గామ్భీర్యంలేని పద్యాలెన్నో చెప్పాడు రచనలో, జీవితం లో లౌల్యం ఎక్కువ .ఆడదికనిపిస్తే చాలు బహిరంగం గానో రహస్యం గానో చాటువు లు చేటల్లో చెరిగాడు .నారదుడి మహతి అనేవీణ ను తానె మోసుకొని వెళ్ళినట్లు మన పురాణాలు శాస్త్రాలు అన్నీ చెప్పాయి. కాని శ్రీనాధుడు మహాతిని ధరించటానికి ఒక  ‘’ఆడమనిషిని ‘’ పెట్టాడు  దటీజ్ శ్రీనాథ –మగాళ్ళు రోత, ఆడాళ్ళు మోత ఆయనకు .’’శివుడైనా అగస్త్యుడైనా భార్య ల ‘మెరుగు పాలిండ్ల పై పవళించాల్సిందే ‘’ ‘’అదిలేక పొతే ‘’ఆయన కు తోచదు శృంగార ప్రియుడు కదా .దాన్ని వాళ్ళకీ అంటించాడు .

       శ్రీనాధుని శృంగార నైషధం సర్వాంగ సుందరం గా స్వతంత్ర కావ్య గౌరవాన్ని పొందింది .దీన్ని చూసి పిల్లల మర్రి పిన వీర భద్రుడు ‘’మా –డు ము వు లు ‘’మాకిచ్చి మీ సంస్కృతాన్ని తీసుకోండి ‘’అని ఆక్షేపించడట. అంటే అన్నీ సంస్కృత పదాలే నువ్వు పొడి చేసిందేమిటి ?’’అని దెప్పాడన్నమాట .’’శ్రీనాధుడు తప్ప మరే కవి అయినా నైషధం మీద చెయ్యి వేస్తె అది కోతి పిల్ల అయ్యి ఉండేది ‘’అని నిష్కర్షగా నిర్మొహమాటం గా హృదయ స్పూర్తిగా శ్రీనాదుడిని మెచ్చిన పుట్టపర్తి వారి ఔదార్యానికి జేజేలు .చిత్ర విచిత్రాలైన కల్పనలకు దూరాన్వయ ,క్లిస్టాన్వయాలకు  హర్ష నైషధం పెన్నిధి .హర్షుడికి ఉన్న రస కండూతి ఏ సంస్కృత కవికీ లేదన్నారు .’’అడుగడుగునా ‘’అమృతాంజనం ‘’‘’పట్టించుకోవాల్సిందే . భావాలకు హర్షుడు భోషాణం ‘’అన్నారు .’’శ్రీనాధుడికి నాలుక దురద ‘’ ఎక్కువ .హర్షుడు హర్షుడే శ్రీనాథుడు శ్రీనాథుడే –గురువు గురువే శిష్యుడు శిష్యుడే .ఒకరి చేతిలో ఇంకొకరు ఓడిపోలేదని తేల్చి చెప్పారు పుట్టపర్తి వారు .గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-21-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.