అప్పయ్య దీక్షితులు
పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకరణుడు అయిన భట్తోజీ దీక్షితులు వీరి వద్ద వేదాంత శాస్త్రాధ్యనం చేశాడు .గురువు ను గురించి స్తుతిస్తూ
‘’అప్పయ్య దీక్షి తేంద్ర విద్యా గురూనమస్యామః యత్కృతి బోధా బోధౌ విద్వాదవిద్వాద్విభాజనో పాదీ ‘’అన్నాడు .అంటే ‘’ఒక వ్యక్తి పండితుడు ఔనా కాదా అని చెప్పటానికి ఎవని గ్రంధాలు అర్ధం చేసుకోవటం ,అర్ధం చేసుకోక పోవటం అనేవి నిర్ణాయక ప్రమాణా లో అలాంటి సమస్త విద్యా గురు వైన ఆప్పయ్య దీక్షితులకు నమస్కారం ‘’.
సర్వ తంత్ర స్వతంత్రుడైన అప్పయ్య దీక్షితుల కీర్తి ఆయన జీవిత కాలం లోనే భారత దేశం అంతా వ్యాపించింది .ఈయన సోదరుని మనుమడు మహా కవి అయిన నీల కంఠ దీక్షితులు 1637లో ‘’నీల కంఠ విజయ చంపువు ‘’రాశాడని పుల్లెల వారన్నారు .తన పన్నెండవ ఏటనే అప్పయ్య దీక్షితుల ఆశీస్సులు పొందాడు. అప్పయ్య కీర్తిని గురించి ఒక శ్లోకం లో వర్ణించాడు
‘’యం విద్మఇతి యద్గ్రంథాభ్యస్యామో ఖిలానితి –యస్య శిష్యః స్మ ఇతి శ్లాఘంతే స్వం విపశ్చితః ‘’అన్నాడు అంటే ‘’మాకు అప్పయ్య దీక్షితుల వారి పరిచయం ఉందని కొందరూ ,వారి గ్రంధాలు అభ్యసిస్తున్నామని కొందరూ వారి శిష్యుల మని మరి కొందరూ పండితులలో చాలా మంది గొప్పలు చెప్పుకొంటారు ‘’అని అర్ధం .దీక్షితులకు హరి హరాదుల విషయం లో భేద బుద్ధి లేని అద్వైత వాది.సిద్ధాంత పరం గా అద్వైత వాది అయినా పరమేశ్వరుని పై ప్రగాఢ భక్తి ఉన్న వాడినని చెప్పుకొన్నాడు .
‘’మహేశ్వరే వా జగదీశ్వరే జనార్దానేవా జగదంత రాత్మని –న భేద లేశ ప్రతి పత్తి రాస్తి మే తదాపి భక్తిసృనేంద్ర శేఖరే ‘’అని చెప్పుకొన్నాడు .అప్పటికే దక్షిణ దేశం లో వైష్ణవాన్ని బౌద్ధాన్ని ఎదుర్కోవటం కోసం శివ పారమ్యాన్ని ప్రతి పాదిస్తూ అనేక గ్రంథాలు రాశాడు .శివద్వేషం లో శివుడు కూడా జీవుడే అని వైష్ణవులు అన్నారు .విష్ణువు జీవుడే అని శైవులన్నారు అదీ ఆ నాటి పరిస్తితి .తన ప్రయత్నం అంతా ద్వేషాన్ని శమింప జేయటానికే నన్నాడు .తనకే మాత్రం విష్ణు ద్వేషం లేదని నిర్ద్వంద్వం గా తెలిపాడు .
నీలకంఠా చార్యులు రాసిన బ్రహ్మ సూత్ర భాష్యానికి అప్పయ్య దీక్షితులు తనకు ఆశ్రయం ఇచ్చిన రాజు చిన బొమ్మ నాయకుడు కోరగా ‘’శివార్క మణి దీపిక ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .ఈ గ్రంథాన్ని దీక్షితులు స్వయం గా అయిదు వందల మంది పండితులకు పాఠం చెప్పాడు .రాజు మెచ్చి ఆ పండితులందరికి భోజనం వసతి సౌకర్యాలు కల్పించాడు .ఈ పుస్తకం ప్రారంభం లో దీక్షితులు ‘’ఉపనిషత్తులకు శ్రుతులకు ,అన్ని పురాణాలకు స్మృతులకు మహా భారతం మొదలైన వాటికి కూడా గొప్ప తాత్పర్యం అద్వైతాన్ని ప్రతిపాదించటం లోనే బ్రహ్మ సూత్రాల తాత్పర్యం కూడా అద్వైత౦ లోనే అనే విషయాన్ని వదిలి విమర్శించే వారికి స్పష్టం అవుతుంది శంకరాచార్యులు మొదలైన ప్రాచీనులు కూడా దీనినే గ్రహించారు .అయినా తరుణే౦ద్రుశేఖరుడైన ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటేనే కాని మానవులకు అద్వైత వాసన కలగదు ‘’అన్నాడు అందుకే ఈశ్వర పారరమ్య ప్రతి పాదిత మైన ఈ భాష్యానికికి వ్యాఖ్యానం రాస్తున్నాననిచెప్పాడు .
అప్పయ్య దీక్షితులు నాలుగు వందలకు పైగా గ్రంథాలు రాశాడని ప్రతీతి .అందుకే ‘’చతురధిక శత గ్రంథ ప్రణేత ‘’ అనే బిరుదు పొందాడు .అన్నీ గొప్ప ప్రామాణిక గ్రంథాలే .చిన్న పుస్తకాలుగా వివిధ దేవతలపై స్తోత్రాలు రాశాడు .వీటికి విపుల వ్యాఖ్యలూ రాశాడు .అందులో ఆయా సంప్రదాయాలకు ,సిద్ధాంతాలకు సంబంధించిన ఎన్నో విషయాలు గుది గుచ్చి వివరించాడు .ఇవన్నీ చదివి అర్ధం చేసుకొనే పండితులు ఉండటం కష్టం అంటారు పుల్లెల వారు .’’దీక్షితులు సాక్షాత్ పరమ శివావతారమే ‘ అవతార పురుషులే ‘’అని శ్రీ కంచి పరమాచార్యుల వారన్నారని గుర్తు చేశారు .కువలయానందం ‘’అనే ఉద్గ్రంథాన్ని దీక్షితులు రచించాడు .
‘’శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం ‘’సాటి లేని ప్రౌఢ గ్రంథం అంటారు పుల్లెల వారు .అద్వైతానికి చెందిన ఎన్నో గ్రంథాలను చదివి సారాన్ని గ్రహించి అప్పయ్య దీక్షితులు దీన్ని రాశాడన్నారు .41గ్రంథాల పేర్లు పది రచయితల పేర్లు పేర్కొన్నాడు ఇందులో .’’ఇలాంటి గ్రంథం మరే శాస్త్రం లోను ఉన్నట్లు కనబడదు’’ అని ఆచార్య తేల్చి చెప్పారు .మాజీ ఐ జి..శ్రీ కే అరవింద రావు తనను దీనిని తెలుగు లో వ్యాఖ్యానం రాయమని కోరారని చెప్పారు .ఎప్పుడో తాను కృష్ణాలంకారం అనే వ్యాఖ్యతో తమ గురు దేవులు శాస్త్ర రత్నాకర శ్రీ ఎస్ ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రి గారు రాసిన టీకా టిప్పణి తో ఉన్న గ్రంధాన్ని చదివానని ఇప్పుడు మననం చేసుకొని తెలుగు అనువాదం చేశానని వినమ్రం గా పుల్లెల వారు చెప్పారు …’’బాలానందిని ‘’గా దాన్ని అనువాదం చేశానని చెప్పుకొన్నారు .అరవింద రావు గారే స్వయం గా ప్రూఫులు దిద్దారని గుర్తు చేసుకొన్నారు .దీనిని సద్గురు శివానంద మూర్తి గారికి అంకితమిచ్చి జన్మ ధన్యం చేసుకొన్నానన్నారు .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-21-ఉయ్యూరు
—