మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22
22-వణుకుతున్నట్లున్న కంఠం తో రైతు వేషాలేసిన పెరుమాళ్ళు
సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు కృష్ణా జిల్లా లోని ఉంగుటూరు లో జన్మించారు.వెడల్పు ముఖం చెవికి పోగులు పంచె పైకి ఎగకట్టి ,బుజం మీద తుండుతో అసలు సిసలు కృష్ణా రైతుగా కనిపిస్తారు .సాఫ్ట్ కేరక్టర్లే ఎక్కువ చేసి మెప్పించారు .గొంతు ఎందుకో కొంచెం వణుకుతున్నట్లు అనిపిస్తుంది .యాస ను బాగా మాట్లాడేవారు .
విత విశేషాలు
చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా సుంకర వాసిరెడ్డి రచించిన “కష్టజీవి” బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.
కృష్ణా జిల్లా ప్రజా నాట్యమండలి లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన “ముందడుగు” నాటకాన్ని కోడూరు అచ్చయ్య గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు. వీరు “మా భూమి” నాటకంలో దాదా పాత్రను అంతే చక్కగా పోషించారు.
తర్వాత మద్రాసు చేరి దాదాపు 50 తెలుగు సినిమాలలో పాత్రలు పోషించారు. వీరు బడుగు రైతు, రైతు కూలీ, పెద్ద సంసారాన్ని ఈదలేక అవస్థపడుతున్న సగటు మనిషి తరహా పాత్రలు ధరించడానికి పెట్టింది పేరు. వీరు ధరించిన పాత్రలలో రోజులు మారాయి (1955) లో కథానాయకుని తండ్రి పాత్ర, వరకట్నం (1968) లో కథానాయకురాలి తండ్రి పాత్ర, ప్రజానాయకుడు (1972) చిత్రంలో కోటేశు పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
మరణం
పెరుమాళ్ళు 1972 సంవత్సరంలో పరమపదించారు.
సశేషం
కనుమ శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-22-ఉయ్యూరు
, ,