మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44 · 44-నవ్యమానవ వాది,అసమర్ధుని జీవితయాత్ర ఫేం ,తెలుగులోచైతన్య స్రవంతి ప్రవేశపెట్టిన జీనియస్ సినీ దర్శకుడు –గోపీ చంద్
జననం , విద్య
గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో త్రిపురనేని రామస్వామి చౌదరి, పున్నాంబలకు జన్మించారు. ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు హేతువాది సంఘసంస్కర్త. గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నారు .ఇంటి పనులతోపాటు, తండ్రి నాస్తికోద్యమమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది.
ఈయనకు కొమ్మా నారయ్య గారి పుత్రిక శకుంతలా దేవితో 1932 లో వివాహం జరిగింది, 1933లో బి.ఎ పట్టా పొంది ఆ తర్వాత నద్రాసులో లా డిగ్రీ చదివారు. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయారు. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమాయిలు.ఈయన ఆఖరి కుమారుడు త్రిపురనేని సాయిచంద్ సినీ నటుడు, దర్శకుడు.
రచనావ్యాసంగం
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. అతని మీద చాలా కాలము వారి నాన్నగారి ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి. మొదట్లో కథా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్దికాలానికి నవలా రంగంవైపు కూడా మళ్ళారు. ఆయన రచనల్లో అసమర్ధుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవి పేరు గాంచాయి. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[1]
భావజాలం
గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించారు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువుగా, తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ- ‘ఎందుకు’ అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసారు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగారు.
నవ్య మానవ వాది
మార్కిజాన్నిఅధ్యనం చేసి ‘బీదవాళ్ళాంతా ఒక్కటే’ , గోడమీద మూడోవాడు , పిరికివాడు వంటి కథలు రాసారు. మార్కిజం అంటే ఏమిటి? , పట్టాభి గారి సోషలిజం, సోషలిజం ఉద్యమ చరిత్ర వంటి గ్రంధాలు రాసారు. తరువాత మార్కిజంలో లోటుపాటులు గ్రహించి ఎం.ఎన్. రాయ్ గారి నవ్య మానవ వాదం వైపు పయనించారు. రాడికల్ డెమక్రటిక్ పార్టీ కార్యదర్శిగా నవ్య మానవ వాదాన్ని విస్త్రుతంగా ప్రచారం చేసారు. పార్టీ రహిత నవ్య మానవ సమాజం నిర్మాణం వైపుగా భావ విప్లవం కొరకు సాహిత్య కృషి చేసారు.
గోపీచంద్ నెమ్మదిగా నాస్తిక సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు – ఈ గ్రంథాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది.
గోపిచంద్ ఒక చోట ఇలా అంటాడు, “మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు”. మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ.
సినిమా రంగం
1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు. కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతుబిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు రాశాడు. ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
తెలుగు సినిమాలు
చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)
ధర్మదేవత (1952) (మాటల రచయిత)
ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత, దర్శకుడు)
పేరంటాలు (1951) (దర్శకుడు)
లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)
గృహప్రవేశం (1946) (కథా రచయిత)
రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)
జీవిత క్రమం[2][మార్చు]
8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.
హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు.
1932 లో వివాహం; 1933లో బి.ఎ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం (మార్క్సిజం) పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ మానవతావాదం ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం (1943). నూతన దృక్పదంతో షూమారు 300 కథలు రాసారు.
1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.
1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసారు.
1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసారు. వారి 'ఉభయకుశలోపరి ' కార్యక్రమం జనరంజకమైనది. కాళిదాసు రచనలన్నిటిని రేడియో రూపకాలుగా రాసారు. వీరు రచించిన అనేక నాటకాలు, నాటికలు శ్రోతలను విశేషంగా ఆకర్షిచాయి. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించారు.
మరణం
1962 నవంబర్ 2 నాడు 52 సంవత్సరాల వయస్సులోబహుముఖ ప్రతిభాశాలి అయిన గోపీచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.
1963లో వీరు రాసిన [పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ‘ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[1]
భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీ చంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. అంతకుముందు 1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది. తెలుగు వారిలో తండ్రి, కొడుకులు ఇద్దరికి తపాల బిళ్ళలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది.
రచనలు
నవలలు
అసమర్థుని జీవయాత్ర
గడియపడని తలుపులు
చీకటి గదులు
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
ప్రేమోపహతులు
పరివర్తన
యమపాశం
శిధిలాలయం
వాస్తవిక రచనలు
తత్వవేత్తలు
పోస్టు చేయని ఉత్తరాలు
మాకూ ఉన్నాయి సొగతాలు
నవ్య మానవతా వాదాన్ని అవలంబించి వ్యాపింపజేశారు గోపీచంద్.ఆంధ్రా రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ కార్యదర్శిగా ఎందరో హేతువాదులను తయారు చేశారు .విశ్వ కథా సాహిత్యంలోని మెళకువలు ఆకళింపు చేసుకొని సమకాలీన వాస్తవిక ఆంద్ర జీవిత చిత్రణ ధ్యేయంగా శతాధిక రచనలు చేశారు .నిరాడంబర శైలి ,సూటిదనం,సంక్షిప్తత ,నిర్దుష్ట దృక్పధం ,ఆయన రచనలలో ప్రధాన లక్షణాలు .భార్యల్లోనే ఉంది ,గీతాపారాయణం ,తండ్రులు కొడుకులు దేశం ఏమయ్యేట్లు ,సరే కానివ్వండి,ధర్మాసుపత్రి ,దేవుని జీవితం మొదలైనవి గోపీచంద్ కథా సంపుటాలు .హేతువాదం మార్క్సిజం మొదట్లో ఆకర్షించినా ‘’ఆకలి ‘’ని తృప్తి పరచటం తో సాంఘికన్యాయం చేకూరదని గ్రహించారు .నవ్య మానవతావాదం తో అసమర్ధుని జీవిత యాత్ర నవల రాశారు .తెలుగు నవలా సాహిత్యం లో ఇదొక మైలురాయి .’’ స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్’’ ను తెలుగు వారికి దీనిలోనే మొదటిసారిగా పరిచయం చేశారు .జీవిత తత్వ చర్చ అంతా దీన్లో ఉంటుంది .దీనికి ముందు భావకవుల దారిలో ‘’పరివర్తన ‘’నవల రాశారు .తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారి భావ ధార బాటలో పడి,చివరకు పుదుచ్చేరి వెళ్లి అరవిందుల దర్శనం చేసి ,మహర్షి రాసిన ‘’లైఫ్ డివైన్ ‘’మొదలైన ఉద్గ్రంధాలు అధ్యయనం చేసి భౌతిక –ఆధ్యాత్మిక వాదాల సమన్వయము సాధించారు .అంతకు మునుపే ఆయనలో ఉన్న నవ్యమానవతా వాదం జోడించి విశాలమైన సమ్యక్ దృక్పధం తో ‘’పోస్ట్ చేయని ఉత్తరాలు ‘’గ్రంధం రాశారు .భౌతిక,ఆధ్యాత్మక వాదాలలో దేనినీ వదిలిపెట్టకుండా సమన్వయము తో ‘’పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా ‘’నవల రాశారు .
మాంచాల ,పశ్చిమ వాహిని గ్రుడ్డిసంఘం అభాగిని ,తత్వమసి నాటకాలు కూడా గోపీ చ౦ద్ రాశారు .మరో గొప్పరచన ఉన్నవ వారి విఖ్యాత నవల ‘’మాలపల్లి ‘’ని నాటకంగా మలచారు .దీన్ని రేడియో ద్వారా ప్రసారం చేశారు .ఆంధ్రగ్రామీణ జీవితం ఆధునిక నాగరకతా ప్రభావం వలన ఏయే మార్గాలలో ప్రయా ణి౦చి౦దో విశ్లేషిస్తూ ‘’ఉభయ కుశలోపరి ‘’పేరిట రేడియోలో అత్యద్భుత ప్రసంగాలు చేసి ఆకట్టుకొన్నారు .
1953లో ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంద్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా పని చేశారు .తర్వాత హైదరాబాద్ రేడియో కేంద్రం లో గ్రామస్తుల కార్యక్రమాల ప్రయోక్తగా పని చేశారు .గోపీచంద్ గొప్ప జీనియస్ .ఆయన ప్రాచ్య పాశ్చాచ్య తత్వ వేత్తల దృక్పధాలను చర్చిస్తూ అమూల్యమైన ‘’తత్వ వేత్తలు ‘’గ్రంథం రెండుభాగాలుగా రచించారు .
ఇంతటి ప్రతిభా సంపన్నుడు జీనియస్ సమన్వయదృక్పధమున్న సృజన శీలి త్రిపురనేని గోపీచంద్ 52వ ఏట నడి వయసులోనే 22-11-1962న పరమపదించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-22-ఉయ్యూరు