మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88
88-పాత రామదాసు , దేవదాసులో ధర్మన్నఫేం – ఆరణిసత్యనారాయణ
ఆరణి సత్యనారాయణ (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [-
జీవిత విశేషాలు
1898లో గుంటూరు జిల్లా సంగడి గుంట గ్రామంలో జన్మించాడు. అతను 1912లో తన 14వ యేట గయోపాఖ్యానం నాటకంలో సత్యభామ పాత్రలో నటించాడు.
మూకీ సినిమాల కాలంలో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. 1921లో ఆర్.ఎస్.ప్రకాష్ చిత్రసీమకు పరిచయం చేసాడు. తరువాత అతను ఘంటసాల బలరామయ్య నిర్మించిన రామదాసు (1933) (‘దేవదాసు’లో ధర్మన్న పాత్రధారి) సినిమాలో నటించాడు. [2] 1936లో సరస్వతి టాకీస్ నుండి వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో నటించిన విదురుని పాత్రకు గుర్తింపు పొందాడు.
కనకతార, బాలయోగిని, ధర్మాంగద, రత్నమాల, లైలా మజ్ను చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.
వినోదా పిక్చర్స్ లో అకౌంటెంట్ గా చేరాడు. వినోదా పిక్చర్స్ సినిమాలైన దేవదాసు, శాంతి సినిమాలలో నటించాడు.
సినిమాలు
- రామదాసు (1933) …. తానీషా
- బాలయోగిని (1936/I)
- ద్రౌపది వస్త్రాపహరణం (1936) … విదురుడు
- కనకతార (1937)
- చంద్రిక (1940)
- రత్నమాల (1947)
- ధర్మాంగద(1949)
- లైలా మజ్ను(1949)
- శాంతి (1952)
- దేవదాసు (1953) …. ధర్మన్న
89-ఆంద్ర నాటక రంగోద్ధారక –నెల్లూరు నాగరాజారావు
తెలుగులో రెండవ టాకీ చిత్రం శ్రీ పాదుకా పట్టాభి షేకం లో ఆంద్ర నాటక రంగోద్ధారక నెల్లూరు నాగరాజారావు నటించారు .శ్రీరాముడుగా శ్రీ యడవల్లి సూర్యనారాయణ ,సీతగా సురభి కమలాబాయి ,లక్ష్మణుడుగా నాగరాజారావు నటించారు .దర్శకుడు సర్వోత్తమ బాదామి .రైతు బిడ్డ సినిమాలోనూ నటించారు .రామదాసులో తానీషాగా నటించారు .రామదాసుగా ఆరణి అద్భుతంగా నటించారు .1934లో వచ్చిన వేల్ పిక్చర్స్ వారి సీతాకల్యాణం సినిమాలో దశరధుడుగా నాగరాజారావు నటించారు. మాధవ పెద్ది విశ్వామిత్రుడు .
1913లో నెల్లూరులో శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి శిష్యుడు రాయప్రోలు సుబ్రహ్మణ్యం ఒక నాటక సమాజం స్థాపించి విమల ,మదాలస నాటకాలు ప్రదర్శించాడు .తర్వాత జ్ఞానోదయ నాటకమండలి స్థాపించి,,ధర్మవరం వారి ప్రహ్లాద ,లవకుశ కృష్ణ లీలలు ప్రదర్శించారు .వీటిలో నాగరాజారావు ,శ్రీనివాసాచారి ,కాశీ చంచు మొదలైనవారు నటించారు .ప్రోగ్రెసివ్ ఆర్ట్ దియేటర్ లోనూ పనిచేశారు .
90-నాటక లక్షణ పండిట్ ,దాక్షిణాత్య ఔత్తరాహిక సంగీత బాణీల నిష్ణాత , పృధ్వీరాజ్ ,అర్జున ,సత్యవంత ఫేం,నాట్యాచార్య –యడవల్లి సూర్యనారాయణ
సూర్యనారాయణ ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. మైలవరం బాలభారతీ సమాజంలో నాయక పాత్రధారి.
జననం
అయిన 1888లో గుంటూరు లో జన్మించాడు.
విద్య
మెట్రిక్యులేషన్ వరకు గుంటూరులోనే చదువుకోవడం వల్ల ఇంగ్లీషులో అభినివేశం ఏర్పడింది. పండితవంశంలో జన్మించడం వల్ల సంస్కృతాంధ్ర విషయాలలో పట్టుసాధించాడు. సంస్కృత నాటక అనువాదాలు ప్రదర్శించేటపుడు తెలుగు పద్యంతోపాటు మూల సంస్కృత శ్లోకం కూడా పాడడానికి ఒరవడి పెట్టింది ఈయనే. విద్యార్థి దశలోనే మృదుమధురంగా పాడుతూ, విద్యార్థి సోదరులను ఆకర్షించగలిగాడు. హరిప్రసాదరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం ల నట, సాహిత్య, సంగీత ప్రభావం ఈయన మీద పడింది.
రంగస్థల ప్రస్థానం
ఈయన 1912లో గుంటూరులో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకుడు. దీనిని 1915 వరకు నడిపాడు. కపిలవాయి రామనాధశాస్త్రికి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చింది ఈయనే.[1] 1913లో విజయవాడలో గయోపాఖ్యానం పంచమాంకం ప్రదర్శన పోటీలలో అర్జునుడు పాత్రకు ద్వితీయ బహుమతి గెల్చుకోవడంతో ఈయన కీర్తి గుంటూరు సరిహద్దులు దాటి మైలవరం రాజా దృష్టిలో పడింది. రాజా ఆహ్వానం మేరకు మైలవరం కంపెనీలో చేరి వివిధ పాత్రలలో నటించడంతో ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. మైలవరం కంపెనీగా ప్రసిద్ధి చెందిన బాల భారతీ నాటక సంఘం మైలవరం నుండి విజయవాడకు మారిన తర్వాత యడవల్లి సూర్యనారాయణ అందులో కథానాయకుడిగా చేరాడు. అక్కడే ఉప్పులూరి సంజీవరావు, దైతా గోపాలం మొదలైనవారితో కలిసిపనిచేశాడు. హరిప్రసాదరావు ధరించిన పాత్రలనే ఎక్కువగా నటించి పేరు పొందాడు.
ఈయన నాటక లక్షణ పండితుడు. దాక్షిణాత్య ఔత్తరాహిక సంగీత బాణీలలో నిష్ణాతుడు. అనేకమంది యువనటులను తీరచిదిద్దిన నాట్యాచార్యుడు. నటనే జీవితంగా భావించడమే కాక వృత్తిగా స్వీకరించి, నటులకు అసమాన గౌరవం తెచ్చిపెట్టిన కళారాధకుడు.
ఈయన సత్యవంతుడు, దుష్యంతుడు, దుర్యోధనుడు పాత్రలు ధరిస్తున్నాడంటే నాటుగు రోజుల ముందుగానే టికెట్లు అమ్ముడుపోయేవి. నటుడి సామర్ధ్యానికి గీటురాయిగా పరిణమించిన మయసభలో దుర్యోధనుని దృశ్యం ఈయన రాయించుకున్నదే. సత్యవంతుడిగా ‘పోయేనయ్యో ననుబాసి…’ మొదలయిన పాటలు ఆనాటి శ్రోతల చెవులలో నేటికీ గింగురుమంటూంటాయి. మైలవరం కంపెనీ దెబ్బతిన్న తర్వాత ఏలూరు మోతే కంపెనీలో చేరి కొంతకాలం నటించాడు.
పృథ్వీరాజు వేషంలో నిజం గుర్రం ఉక్కి వచ్చి, సంయుక్త వేషధారిని గుర్రం మీద కూర్చోపెట్టుకొని నిష్క్రమించేవారు. ఇదంతా క్షణంలో జరిగిపోయేది. సత్యవంతుడి వేషానికి ఈయనకు వెండి గొడ్డలి, వెండితాడు బహుబతిగా లభించాయి. విజయనగరంలో రత్నఖచిత కిరీటం, వెండి కత్తి బహుకరించారు. బంగారు పతకాలు, సన్మానాలు చాలా జరిగాయి. 1932 ప్రాంతంలో సినిమారంగంలోకి ప్రవేశించి దుష్యంతుడు, రావణుడు పాత్రలలో నటించి మెప్పుపొందాడు.
నటించిన పాత్రలు
సత్యవంతుడు, యముడు, అర్జునుడు (గయోపాఖ్యానం), శ్రీ కృష్ణుడు (తులాభారం), దుర్యోధనుడు, సారంగధరుడు, దుష్యంతుడు, వత్సరాజు, పృథ్వీరాజు, నలుడు, విజయరామరాజు, శ్రీరాముడు, రామదాసు.
మరణం
యడవల్లి సూర్యనారాయణ 1939లో మరణించారు.
చిత్రమాలిక
· పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా)
· శకుంతల (సినిమా)
· సీతాకళ్యాణం (సినిమా)
· ద్రౌపదీ వస్త్రాపహర
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-22-ఉయ్యూరు