మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91
91-గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి
ప్రసిద్ధ రంగస్థల నటులు, గాయకులైన కపిలవాయి రామనాథశాస్త్రి గారు 1890 1890 కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా మంతెనలో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. యడవల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నటనలోను, పద్యపఠనంలోనూ మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. వీరిలాగా పాడాలని చాలామంది నటులు, నటీమణులు ఆరాటపడేవారు. పద్యంలోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది. ఆనాడు ఈయనకు ఈనాటి సినిమా తారలకున్నంత అభిమానులు ఉండేవారు. ఈయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టి మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ఒకే రాత్రి రెండు పట్టణాలలో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు ధరించిన రోజులు ఉన్నాయి. ఈయన నాటకానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. మైలవరం కంపెనీ మూతపడిన తర్వాత కిరాయి నాటకాలలో నటించారు.
ఈయన స్వరంతో వెలువడినన్ని గ్రామఫోన్ రికార్డులు ఆ రోజుల్లో ఏ నటుడు ఇవ్వలేదు. ఈ రికార్డులు ఆ రోజుల్లో కొన్ని వేలు అమ్ముడుపోయాయి. పెళ్ళిళ్లలోనూ, ఇతర శుభకార్యాలలోనూ కపిలవాయి రికార్డులనే విరివిగా పెట్టేవారు. ఇవి తమిళనాడు, మైసూర్ రాష్ట్రాలలో కూడా ప్రజాదరణపొందాయి. అతి తక్కువకాలంలో ఆంధ్రదేశమంతటా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు చేతులా సంపాదించాడు కానీ, సంపాదనంతా దురభ్యాసాలకు ఖర్చు చేశాడు.
ధరించిన పాత్రలు
· సారంగధరలో సారంగధరుడు
· రామదాసులో రామదాసు
· చింతామణిలో భవానీ శంకరుడు
· పాదుకలో రాముడు
· గయోపాఖ్యానంలో అర్జునుడు
· శ్రీకృష్ణతులాభారంలో నారదుడు
· సావిత్రిలో సత్యవంతుడు
· విప్రనారాయణలో విప్రనారాయణుడు మొదలైనవి.
టాకీ చిత్రాలు వచ్చిన తర్వాత సక్కుబాయి, కృష్ణ తులాభారం (నారదుడిగా, 1935) వంటి కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు.
బిరుదులు
· రంగమార్తాండ
మరణము
తెలుగు నాటకరంగంలో ధ్రువతారగా వెలిగిన శాస్త్రి ధనార్జన బాగా చేసినా అవసానదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. అతి తక్కువ వయస్సులో అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన శాస్త్రి 1935, అక్టోబరు 1వ తేదీన విజయవాడలో పక్షవాతంతో మరణించారు[1].
కృష్ణ తులాభారం 1935లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకటరమణయ్య, ఋష్యేంద్రమణి నటించారు. ఈ సినిమాతో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈ చిత్రంలో భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి అనే మూడు పాటలు రాశాడు. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం (1955), శ్రీకృష్ణ తులాభారం (1966) నిర్మించినపుడు కూడా వాడుకున్నారు
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు