మునిపల్లె సుబ్బయ్య తొలి తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు. ఈయన అసలు పేరు వల్లూరి వెంకట సుబ్బారావు. గుంటూరు జిల్లా, మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన ఆ తర్వాత మునిపల్లె సుబ్బయ్య, మునిపల్లె వెంకట సుబ్బయ్యగా వ్యవహరించబడ్డాడు.[1] ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందాడు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుడు సుబ్బయ్యనే.
· 1929లో తండ్రి చనిపోవడంతో సుబ్బయ్య స్వగ్రామమైన మునిపల్లెకు తిరిగివచ్చాడు. హెచ్.ఎం.రెడ్డి కోరిక మేరకు దొరస్వామి నాయుడు (భక్తప్రహ్లాద సినిమాలో ఇంద్రుడు పాత్రధారి) మునిపల్లె వెళ్ళి సుబ్బయ్యను బొంబాయికి తీసుకుని వచ్చాడు.[2]
· 1931లో హెచ్.ఎమ్.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో హిరణ్యకశపునిగా నటించి మునిపల్లె వెంకటసుబ్బయ్య చరిత్ర సృష్టించాడు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తెలుగు సినిమాలలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా సాధించాడు. 1936లో రూపొందిన సతీ సులోచన అనే చిత్రంలో రావణబ్రహ్మగా, ఇంద్రజిత్గా అలరించి ఓ కొత్త ప్రక్రియకు నాంది పలికాడు.[3] ఆ తరువాత ద్రౌపదీ మానసంరక్షణం, సతీ సావిత్రి తదితర చిత్రాల్లో నటించాడు సుబ్బయ్య. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘సతీ సావిత్రి’లో సుబ్బయ్య యమధర్మ రాజు పాత్రను పోషించాడు.
· భక్తప్రహ్లాద తెలుగులో నిర్మిచిన తొలి టాకీ చిత్రము. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ చిత్రము సెప్టెంబర్ 15, 1931న విడుదలైనది. హిందీలో తొలి టాకీ తీసిన అర్దేషిర్ ఇరానీ తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనుకొని ఆ భాద్యతలను హెచ్.ఎమ్.రెడ్డి తెలుగువాడు గనక ‘భక్తప్రహ్లాద’ని , తమిళ ‘కాళిదాసు’ని తీయవాల్సిందింగా అప్పజెప్పారు.
· అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన “భక్త ప్రహ్లాద” నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూ వీటోన్ స్టూడియోలో తీశారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.
· భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ చిత్రపు నరసింహారావు నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాతికాలంలో దర్శకునిగా మారిన ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఎల్.వి.ప్రసాద్ మొట్టమొదటి తమిళ టాకీ ”కాళిదాసు”లో కూడా నటించారు.
· సినిమాలో సంగీత దర్శకులు లేకున్నా అప్పట్లో స్టేజి మీద పాడే వరసల్లో కొన్ని పద్యాల వంటి పాటలు రాసారు అవి
1 తనయా ఇటులనే తగదురా బలుకా – కమలాబాయి
2 పరితాప భారంబు భరియింప తరమా – రచన: కేసవదాసు – గానం: కమలాబాయి
3 భీకరమగు నా ప్రతాపంబునకు – సుబ్బయ్య
· సినిమా సంబంద విశేషాలు
- ఈ చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారు.
· * ఇందులో ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణారావుకు 400 రూపాయలు పారితోషికం. ఈ తెలుగు టాకీ హీరో అప్పటి వయసు 9 సంవత్సరాలు. తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.
2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.
· * 1929 లో మనదేశంలో విడుదలైన తొలి టాకీ చిత్రం యూనివర్సల్ వారి ‘ది మెలోడీ ఆఫ్ లవ్’ అది విపరీతంగా ఆకర్షించడంతో, భారతీయ చిత్ర నిర్మాతలు తామూ శబ్ద చిత్రాలు తియ్యాలని ఉత్సాహ పడ్డారు. ‘ఆలంఆరా’ తిసిన “ఆర్దేషిర్ ఇరానీ” యే తెలుగు ‘భక్త ప్రహ్లాద’ కూడా తీశారు. అప్పుడు సంగీత దర్శకులు అంటూ లేరు. ఉన్న వరసల్నే, వాడుకున్నారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి హార్మొనీ వాయిస్తూ అందరికీ పాట, పద్యం నేర్పారు. ‘భక్త ప్రహ్లాద’ లో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, చాలా చోట్ల మాట వినిపించకపోయినా, ప్రేక్షకులు మాత్రం విరగ బడి చూశారు. ఈ రోజుల లెక్కల్లో అది ఆనాడు ‘సూపర్ డూపర్ హిట్ సినిమ.బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇవాళ్టిది కాదు. ‘భక్త ప్రహ్లాద” సమయంలోనే వుంది. నాలుగు అణాల టిక్కట్లను, నాలుగు రూపాయలకి ‘ఆలంఆరా’ కి కొన్నట్టే, “భక్త ప్రహ్లాద” కీ కొన్నారు.
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-22-ఉయ్యూరు