మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -104
104 నాటక,సినీ నటుడు రచయిత గాయకుడు కృష్ణ పాత్ర ఫేం గానకోకిల ,-ఎ.వి..సుబ్బారావు
ఆరాధ్యుల వెంకట సుబ్బారావు లేదా ఏ.వి.సుబ్బారావు తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు.
జననం
1930లో గుంటూరు జిల్లా అనంతవరం (కొల్లూరు మండలం)లో జన్మించారు.
పద్యం కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. ముక్కామల రాఘవయ్య, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, కుప్పా సూర్యనారాయణ, వేమూరి సీతారామశాస్త్రి, గుళ్లపల్లి ఆదిశేషయ్య, హార్మోనిస్టు విష్ణుబొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు.
శ్రీకృష్ణ రాయబారం, గయోపాఖ్యానం, కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి గానకోకిల బిరుదుతో సత్కరించారు. ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి. ఆయన కుమారులు ముగ్గురు (ఆరాధ్యుల కోటేశ్వరరావు, ఆరాధ్యుల వెంకటేశ్వరరావు) రంగస్థల నటులుగానే జీవితాన్ని సాగిస్తున్నారు. సుబ్బారావుకు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుబ్బారావు పెద్దగా చదువుకోలేదు. పొలం పనులకు వెళుతుండేవాడు. 1960లో సుబ్బారావు శ్రీ పూర్ణశ్రీ నాట్యకళాసమితిని స్థాపించి 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. ఈలపాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు వంటి హేమాహేమీలతో శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఆయన నటనకు గుంటూరు డ్రస్ కంపెనీ అధినేత వెండి కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. గయోపాఖ్యానంలో ఆయన వేసిన కృష్ణ పాత్రను, రామాంజనేయ యుద్ధంలో రామ పాత్రను, రాయబారంలో శ్రీ కృష్ణుని పాత్రను హెచ్ఎంవి గ్రామఫోను కంపెనీ రికార్డు చేసింది. భూలోకంలో యమలోకం, ముత్యాల పల్లకి సినిమాలలో ప్లేబ్యాక్ పద్యాలు పాడారు.
మరణం
26.12.2010 న తెనాలి నాజరుపేటలోని తన స్వగృహంలో మరణించారు
నటించిన సినిమాలు
· శ్రీ సీతారామ కళ్యాణం (1961)
· శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)
· జయభేరి (1959)
· చెంచు లక్ష్మి (1958)
· మాంగల్యబలం (1958)
· సారంగధర (1957)
· పెద్ద మనుషులు (1954)
· శ్రీ కాళహస్తీశ్వర మహత్యం (1954)
· పల్లెటూరి పిల్ల (1950)
· వింధ్యారాణి (1948)
· మదాలస (1948)
· వరవిక్రయం (1939)
· మోహినీ భస్మాసుర (1938)
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్-2-3-22-ఉయ్యూరు