మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-181
· 181-తెల్లగుబురు మీసాలమధ్య హాస్యపు రత్నాలు వెదజల్లిన లాయర్ రేడియో ఆర్టిస్ట్ ,హాస్యరచయిత ,రేడియో ఆర్టిస్ట్ ఆనందభైరవి హై,హైనాయకా’’ సినీ ఫేం ‘’అల్లుడూ ఆమె ఎవరో మహాబాగుందయ్యా ‘’డైలాగ్ ఫేం –పుచ్చా పూర్ణానందం
· పుచ్చా పూర్ణానందం సుప్రసిద్ధ తెలుగు హాస్యరచయిత, నటుడు
జీవిత విశేషాలు
ఇతడు గుంటూరు జిల్లా, పెద్ద కొండూరు గ్రామంలో 1910, ఆగష్టు 10వ తేదీన జన్మించాడు[1]. ఇతడు దుగ్గిరాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకూ చదివి, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఏ., బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మదన్ మోహన్ మాలవ్యా వైస్ ఛాన్సలర్గా వుండగా ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి., చదివాడు. ఇతడు ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇతనికి టంగుటూరి ప్రకాశంతో పరిచయం, స్నేహం ఏర్పడింది. వీర సావర్కర్ అంటే గౌరవాభిమానావల్ల గాంధేయవాద సిద్ధాంతాలకు కొంత దూరంగా నడిచాడు. రాజమండ్రిలోనే భమిడిపాటి కామేశ్వరరావుతో పరిచయం కలిగి, ఆయన రచించిన నాటకాల్లో వేషాలు వేశాడు. ఇతని కోసమే భమిడిపాటి కొన్ని పాత్రలు సృష్టించాడు కూడాను[1].
నాటక రంగం
ఇతడు పద్య నాటకాలు ఎక్కువ వేయలేదుగానీ ద్రౌపదీ వస్త్రాపహరణంలో భీష్ముడిగా వేశాడు. అనార్కలి నాటకంలో సలీం, వాపస్, ఆడది, పుట్ట, సంభవామి యుగేయుగే, టీకప్పులో తుఫాను, దంతవేదాంతం వంటి రంగస్థల నాటకాల్లో వేశారు. ప్రాచుర్యం పొందిన చిలకమర్తి రేడియో నాటకం “గణపతి”లో ఉపాధ్యాయునిగా, ఇంకా కంఠాభరణం, వయోలిన్ మాస్టారు, ఇంటినెంబరు, మృచ్ఛకటికం వంటి రేడియో నాటకాల్లో నటించాడు. బందా కనకలింగేశ్వరరావు, కాశ్యప, విన్నకోట రామన్న పంతులు, బళ్లారి రాఘవ, స్థానం నరసింహారావు వంటి వారితో పరమ ఆప్తుడిగా, ఆత్మీయుడిగా మసిలాడు[1].
సినిమా రంగం
1942లో సినిమారంగం హీరోగా ఇతనికి అవకాశం వచ్చినా కాదని తన లాయరు వృత్తిని వదలలేదు. కానీ జంధ్యాల పట్టుబట్టగా ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, శ్రీవారి శోభనం, మదన గోపాలుడు, హై హై నాయకా మొదలైన చిత్రాలలో నటించాడు[1].
ఇతడు మొదట తెనాలిలో ప్లీడర్గా ఖ్యాతిపొంది, త్రిపురనేని రామస్వామి చౌదరికి సన్నిహితుడిగా, త్రిపురనేని గోపిచంద్ సహధ్యాయిగా ఉన్నాడు. 1944లో విజయవాడకు వచ్చి లాయర్గా ప్రాక్టీసు కొనసాగించాడు. ఇతడు మరణించే వరకూ కూడా హాస్య రచయితగా, నటునిగా, ప్రసిద్ధ లాయరుగా రాణించాడు[1].
రచనలు
· కవి నియంత (1951)
· ఆవకాయ – అమరత్వం (1966)
· ఆషాఢ పట్టీ (1971)
· మీసాల సొగసులు (1984)
· అచ్చమైన తెలుగు దానానికి స్వచ్చమైన తెలుగు హాస్యానికీ పుట్టిన ,పెట్టిన పేరు పుచ్చా పూర్ణానందం గారు .ఆ వాచకం అనితర సాధ్యం .ప్రతి పదం లో హాస్యం చిప్పిలాల్సిందే .అదీ ఆయన రచనా వైభోగం .పుచ్చ పువ్వు లాంటి ,పండు వెన్నెలలాంటి హాస్యం ఆయనది .ఉదారుడు స్నేహశీలి ,కలుపుగోలుతనమున్నవారు .
· పుచ్చావారబ్బాయి లెక్కల మాస్టారు .పేరు గుర్తు లేదు .బెజవాడ మునిసిపల్ స్కూల్ లో టీచర్ .బందరులో ఉండే మా కుటుంబమిత్రులు ప్రముఖ కధా రచయితా ,విమర్శులు లెక్కల మేష్టారు భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు నాకు మరింత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కే మూర్తి గారు పుచ్చావారబ్బాయికి తోడల్లుడు .టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ లో కలుస్తూ ఉండేవారు .ఈయనా గొప్ప హాస్యం ఒలికిం చేవారు. ఒకసారి మాటలలో పూర్ణానందం గారు తమ తండ్రి అనిచేబితే ,,బెజవాడ విద్యాధర పురం లో ఉన్న వారి ఇంటికి వెళ్లాను అప్పుడు పూర్ణానందం గారిని మొదటి సారి చూశాను చక్కగా మాట్లాడారు .హాయిగా నవ్వించారు .గొప్ప అనుభవం అనిపించింది .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-22-ఉయ్యూరు