గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-15
బ్రిటిషర్లు స్వార్ధం కోసమే ఇండియన్స్ ను గుప్పితో పెట్టుకొంటున్నారనీ ,కనుక ప్రజాఉద్యమం ,ప్రత్యక్షచర్య ,తిరుగుబాటు చివరికి హింస,బలప్రయోగం ద్వారానైనా దేశానికి విముక్తి కలిగించాలని యువత భావించింది .కాంగ్రెస్ లోని మితవాదులు పిరికి సన్నాసులని,దేశాన్ని ఐరోపా సంస్కృతిలోకి నెట్టి ,కాళ్ళబేరానికి వస్తున్నారని ఆక్షేపించారు .మంగళ పాండే రాసిన ‘దిబ్రేకప్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ‘’ఈ ఉగ్రవాదులకు వేదం అయింది .కాంగ్రెస్ ఇలాంటిది జరుగుతుందని ఊహించలేదు .దక్షిణాఫ్రికా విజయం తర్వాత గాంధీ ఈ సభలో పాల్గొన్నాడు .తిలక్ ,మోతీలాల్ లను మొదటి సారి కలిసి మాట్లాడాడు .తిలక్ తో ప్రత్యేకంగా వేరే గదిలో మాట్లాడాడు .తన ఆత్మకధలో గాంధీ ‘’ఆ నాడు నన్ను కలిసిన చాలామందిలో ఇవాల్టికీ గుర్తున్నవాడు మోతీలాల్ ఘోష్ ఒక్కరే .పాలక బ్రిటిషర్లపై నిప్పులు కక్కుతూ మాట్లాడారు ‘’అని రాశాడు .గాంధీ తీర్మానం చర్చలేకుండానే ఆమోదించారు .దీనిపై కూడా గాంధీ ‘తీర్మానం లో ఏముందో ఎవరికీ దృష్టి లేదు .ఎప్పుడు బయటికి పోదామా అనే ధ్యాసతప్ప ‘’అని బాధతో రాశాడు .మూడురోజుల కాంగ్రెస్ మేలా అలా ముగిసింది .1915లో కలకత్తాలో గాంధీ దక్షిణాఫ్రికాలో సేవ చేసినందుకు జరిగిన అభినందన సభకు మోతీలాల్ అధ్యక్షుడు .గాంధీని అభినందించాడు మోతీలాల్ అక్కడ చేసిన సేవకూ ఇక్కడ చేస్తున్నదానికీ .గాంధీ మితవాది లాల్ అతివాది అవటం తో ఇద్దరిమధ్య సరైన సమావేశం జరగలేదు .
రాష్ట్రాల పునర్విభజనకు తుది మెరుగులు దిద్దిన వాడు జే హెచ్ గ్రూప్ ఫీల్డ్ .స్లేవ్ రాసిన ‘’యూనిట్స్ ఆఫ్ 1904’’లో ‘’కొత్త తూర్పు రాష్ట్రాల్లో ముస్లిం లకు ,పశ్చిమ రాష్ట్రాలలో బీహారీ ఒరియావారికి మెజార్టీ స్థానాలు ఇవ్వటం జాతీయ దృక్పధాన్ని చీల్చే ప్రయత్నమే ,బెంగాల్ లో భద్రలోక్ రాజకీయ ప్రభావం కట్టడి చేయటమే .ఈ బిల్లు చట్టం కాకుండా సురేంద్ర నాద విశ్వ ప్రయత్నం చేసినా ,ఫలించలేదు .ఉగ్రవాదులు ‘’భారతీయ వాదం అనే కొత్త ప్రతిపాదనలతో ముందుకు దూకుతున్నారు .భారత దేశాన్ని మాతృభూమిగా భావిస్తూ కదం తొక్కారు .భారతీయ సాంస్కృతిక విలువలను అనుసరిస్తూ ,పాశ్చాత్య విలువలను త్యజించాలని వీరి నినాదం .బ్రిటిష్ వస్తువులు వదిలేసి భారతీయ వస్తువులు వాడుతూ ,శాంతియుత ప్రతిఘటన ఇవ్వాలని కొత్త జాతీయ దృక్పధాన్ని మోతీలాల్ బిపిన్ చంద్రపాల్ ,అశ్విని కుమార్ దత్త ,అరవింద ఘోష్ ప్రతిపాదించారు .పంజాబ్ లో లాలా లజపతిరాయ్ ,మహా రాష్ట్రలో బాలగంగాధర తిలక్ ,మద్రాస్ లో చిదంబరం పిళ్ళై ,సుబ్రహ్మణ్య భారతి నీలాకంఠ బ్రహ్మ చారి బలపరచారు .దీనికి తాత్విక ప్రాతిపదికను రవీంద్ర నాథ టాగూర్ కల్పించాడు .1907లో అరవిందుడు ‘’జాతి జీవనం లోని అన్నిశాఖలను ముందుకు నడిపించటానికి ఒక కేంద్ర సాధికార సంస్థతోపాటు విదేశీ ఆధిపత్యాన్నిఒక్క సారిగా కాకపోయినా , క్రమేణా తొలగించటానికి మనం ఆత్మ రక్షణ యుద్ధం ప్రారంభించాలి .ఒక జాతిగా ఇదే మన తక్షణ కర్తవ్య౦ తప్ప మేధావులుగా విజ్ఞానఖనులుగా సంపన్నులుగా ఎలా ఎదగాలన్నవి కాదు .జాతికి అనివార్యమైన మృత్యు మేఘాలను తొలగించాలి .మన మనో ధైర్య స్తై ర్యాలను ఎలా పెంచుకోవాలన్నది ఆలోచన చేయాలి .శాంతియుతంగా చట్టం ,పాలనా యంత్రా౦గాన్నీ ఉల్లంఘిస్తాం .చట్టపరమైన శిక్షలను శిరసావహిస్తాం ‘’అన్నాడు .దీని తర్వాత 15ఏళ్ళకు గాందెయ ఉద్యమం ప్రారంభమవటానికి ఇదే పునాది నాంది మార్గదర్శకం కూడా .’’ఆత్మ రక్షణ కోసం ప్రతి ఘటన ‘’అనటంలో విప్లవోద్యమం అనే మాట అంతర్గతంగా ఉంది .దుష్ట శిక్షణకు అది మన పవిత్రమార్గం గా గుర్తింపు పొందింది .
రాష్ట్రాల పునర్విభజన జరిగినా ఆరేళ్ళ తర్వాత అది అపరిష్క్రుతంగానే ఉండిపోయింది .మళ్ళీ సంయుక్త బెంగాల్ ఏర్పడింది .ఉగ్రవాద విదానాను హిందూ సంపన్నులు బలపరుస్తుంటే ముస్లిం లు వ్యతిరేకిస్తున్నారు .దీన్ని ఆయుధంగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ గ్రామీణ పేద ముస్లిం లను హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధం చేసింది .అయితే అశ్వినీ కుమార దత్తా ప్రాతినిధ్యం వహించిన బరిసాల్ జిల్లాలో బహిష్కరణ ఉద్యమం ప్రశాంతంగా కలహాలు లేకుండా సాగింది .బ్రిటిష్ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీ కి మారింది .ఆలీ గడ్ ఆంగ్లో –ముస్లిం కాలేజి రూపం లో సయ్యద్ మొహమ్మద్ మొలకెత్తించిన వేర్పాటు వాదం ను బెక్, మొరిసన్ ,ఆర్చిబోల్ద్ లు తీవ్రతరం చేశారు .కాంగ్రెస్ ముస్లిం లను గుర్తించటం లేదనేభావం యువకులలో రేకెత్తించారు .కాంగ్రెస్ సంపన్న ముస్లిం లకే కొమ్ము కాస్తోందని ప్రచారం చేశారు .కర్జన్ కాలం లోసాగిన ఈ హిందూ ముస్లిం భేదాలను మింటో పెంచాడు .1906 సంపన్న ముస్లిం వర్గం ‘’ముస్లిం లీగ్ ‘’గా మారింది దీనిపై మోతీలాల్ ‘’ఇదంతా అధికారుల కను సన్నలలో జరిగిందే .ముస్లిం లీగ్ కు జాతీయ స్థాయి లేదు .అందులో అంతా ముస్లిం లు కూడా కాదు .ప్రభుత్వ తప్పిదాలను కప్పి పుచ్చుకోవటానికి వీరిని పావులుగా వాడింది ప్రభుత్వం ‘అని వ్యాఖ్యానించాడు .
తూర్పు బెంగాల్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఫీల్డ్ పుల్లెర్ కూడా హిందువులపై మహమ్మదీయ దోర్జన్య కాండను,అల్లర్లను ప్రోత్సహించాడు.అతడి అతి ప్రవర్తనకు చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది .అప్పటికే జాతీయవాదులలోని ఉగ్రవాద వర్గం అజ్ఞాత విప్లవ సంఘాలు స్థాపించి బలపడింది .బెదిరిన ప్రభుత్వం ఒక చిట్కా ప్రయోగించి కొన్ని సంస్కరణలు చేసింది .ముస్లిం లను వేరే వోటర్లుగా ,భూస్వాములకు విడిగా ప్రాతినిధ్యం కల్పించటం జరిగింది .ఇతర స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుపుతారు .ఇది అన్యాయం అని ఆతర్వాత గుర్తించి రూపొందించిన మింటో మార్లేలే తల బాదుకొన్నారు .కానీ ‘’భారతీయులనుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలికనుక ఇందుకోసం చేసేదేదీ అక్రమం కాదు ‘’అని నోరు మూసుకొన్నారు .ఇదే సామ్రాజ్య వినాశానికి దారి చూపింది .
1906లో కాంగ్రెస్ లోని అతివాద మితవాదులమధ్య భేదాలు తీవ్రస్థాయికి చేరాయి .అధ్యక్షుడు దాదాభాయ్ కొంత నివారించాడు .ఇంగ్లాండ్ లాగా భారతీయులకు స్వయం పాలనకల డామియన్ లు కావాలని చెప్పాడు .సదస్సు తర్వాత వైస్రాయి ని కలవకుండా కాంగ్రెస్ లో ఘర్షణ నివారించాడు .అనివార్యమైన ఈ ఘర్షణ సూరత్ కాంగ్రెస్ లో బయటపడింది .రాస్ బిహారీ ఘోష్ ను మితవాదులు అధ్యక్షస్థానానికి పోటీ చేయిస్తే ,అతివాదులు తిలక్ కాని లజపతిరాయ్ కానీ ఉండాలని అన్నారు .తిలక్ పేరును చైర్మన్ తిరస్కరించగా ,అప్పుడే తిలక్ వేదికపైకి వెడుతుంటే ఆయనపై ఒక చెప్పు విసిరేయబడటం తో గలాభా జరిగి అర్ధాంతర౦ గా సభ ముగించారు .ఆ చెప్పు సురెంద్రనాద్ కు తగిలింది .అతివాద మితవాదులమధ్య సయోధ్య కుదర్చటానికి మర్నాడు సభజరిగి, మోతీలాల్ ప్రయత్నించాడు .సభలో ఎవరు ఎవర్ని బహిష్కరించారో తెలీడదుకాని 1908లో కలకత్తాలో మోతీలాల్ ఇంట్లో అతివాదులు సమావేశం జరిపి కాంగ్రెస్ లో తాము ఎందుకు చేరటం లేదో ఒక మాని ఫెష్టో ప్రకటించారు .1916లోకానీ వీరు కాంగ్రెస్ లో మళ్ళీ చేరలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-22-ఉయ్యూరు