మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -7
· 19-తెలుగుకన్నడ కవి,మయూరధ్వజ నాటక కర్త కవిరాజు ,కవి సవ్యసాచి –శ్రీ కలుగోడు అశ్వత్ధ రావు
· బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు (జూలై 25, 1901 – జూలై 19, 1972) [1] 1901 వ సంవత్సరం జూలై 25 వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం లోని కలుగోడు లోను, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా తళుకు గ్రామంలోను కరణముగా పనిచేశాడు. ఈ రెండు గ్రామాలలోను ఇతనికి చాలినన్ని భూములున్నాయి. ఇతని జీవితం హాయిగా గడచింది.ఇంటికి వచ్చిన అతిథులను గొప్పగా సత్కరించేవాడు.తన గ్రంథాలను ప్రచురించుకోవటానికి స్వంతంగా రాయదుర్గంలో కవిరాజ ముద్రాక్షరశాలను నెలకొల్పాడు. తన చివరి దశలో దీనిని రాయల పరిషత్తుకు ఉచితంగా ఇచ్చివేశాడు.
రచనలు
- సర్వజ్ఞునివచనములు – కన్నడభాష నుండి తెలుగులోనికి అనువాదం
- ವೇಮನ ರತ್ನಗಳು – వేమన పద్యాలను కన్నడ భాషలోనికి అనువాదం
- అనుభవామృత సారము – మహాలింగ రంగ కన్నడలో వ్రాసిన అనుభవామృత అనే అద్వైత వేదాంత గ్రంథానికి తెలుగు అనువాదం
- సోమేశ్వర శతకము – పాల్కురికి సోమనాథుని కన్నడ శతకానికి తెలుగు అనువాదం
- హరిభక్తసారము – కనకదాసు కన్నడరచనకు తెలుగు సేత
- ಭಾಗವತ ಗೀತಿಗಳು – పోతనభారతంలోని గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము, ప్రహ్లాదచరిత్ర, వామనచరిత్ర ఘట్టాల కన్నడానువాదము
- ಶೃಂಗಾರ ವರೂಧಿನಿ – మనుచరిత్ర కన్నడానువాదము
- ಕಂದಪದ್ಯ ರಾಮಾಯಣ – స్వతంత్ర కన్నడ రచన
- ಶ್ರೀಕೃಷ್ಣಲೀಲೆ (ಬೈಲು ನಾಟಕ) – స్వతంత్ర కన్నడ వీధి నాటకము
- ಸುಭದ್ರಾಪರಿಣಯ ನಾಟಕ – స్వతంత్ర కన్నడ రచన
- గధాయుద్ధము – రన్న కవిచే రచింపబడిన ಸಾಹಸ ಭೀಮ ವಿಜಯ అనే కన్నడ కావ్యానువాదము
- దండకరామాయణము
- అశ్వత్థ భారతము (ఆది చతుష్కము మాత్రము)
- అశ్వత్థేశ త్రిశతి (కందములు)
- మూడు శతకములు
- మయూరధ్వజము (నాటకము)
- యువతీ వివాహభాగ్యోదయము (నాటకము)
- అక్కమహాదేవి వచనములు
- బ్రాహ్మణుడు
- గురుదక్షిణ
రచనల నుండి ఉదాహరణలు
· దండకరామాయణం నుండి మచ్చుకు కొంతభాగము:- కైకేయి: “హా నాథా! మత్ప్రేమనాథా! ధరానేత్రునేతా!ప్రతాపాధినాథున్ నిన్ను భర్తగా బొందియున్ నే నథా కృతిన్ గుందెదన్ మోహనాంగా! మదీ యేప్సితార్థంబు దీర్పంగ నేనుంటినం చంటివే? అంత భాగ్యంబు నాకున్నదే? సత్యమున్ బల్కుదే? బాళి నీ వంతగా నాయెడన్ జుల్కుదే? పల్కవే!” యన్న భూనాథు “డో మానిని! నా యెడన్ నీకు సందేహ మిట్లుండ నే హేతువో? నాతిరో! మున్ను కన్నావటే నా యుదాసీన భావంబు నీపట్ల?నీకై చితిన్ దూకగా వచ్చినన్ దూకెదన్ గోర్కె నేదీర్తు, నీడేర్తు నో కామినీ! కోరుమం”చన్న, నా జాణ వేలేచి, ముద్దారగా గౌగిటన్ గ్రుచ్చి, యా వృధ్దు మాయా విమోహంబులన్ గుప్పి, తీపౌ చమత్కారపున్ భాషణల్ సెప్పి, యిట్లాడు…..
బిరుదములు,పురస్కారములు
· కవిరాజ
· 1967 మే 6వ తేదీ హిందూపురంలో రాయలకళాపరిషత్ సత్కరించి కవిసవ్యసాచి బిరుదును ప్రదానం చేసింది.[2]
· ఉభయభాషాభాస్కర
· 20-దైవోపాసన తో ప్రజలైక్కట్లు తీర్చి శ్రీరామ స్తవ క్షేత్రమాల ,విచార దర్పణ కర్త –శ్రీ మేడవరము సుబ్రహ్మణ్య శాస్త్రి
మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి.[1][2]
జీవితసంగ్రహం
శాస్త్రిగారు 1885లో నెల్లూరుజిల్లా దర్శితాలూకా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా దొనకొండమండలంలో ఉన్న) పోలేపల్లి గ్రామంలో అన్నపూర్ణమ్మ,కోటయ్య దంపతులకు జన్మించాడు. ఋగ్వేది. ఆశ్వలాయన సూత్రము, కామకాయన విశ్వామిత్రస గోత్రజుడు. వైదిక బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. ఇతడు మొదట తిరుపతి, గుంటూరు జిల్లా కొల్లూరు మొదలైన చోట్ల కావ్యాలు నేర్చుకుని, ఆ తరువాత గోదావరి జిల్లా కాకరపఱ్ఱు గ్రామంలో ఉన్న వేదుల సత్యనారాయణశాస్త్రి వద్ద కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు చదువుకున్నాడు. మంత్రశాస్త్రము, జ్యోతిష్యశాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. తన జీవితకాలంలో ఎక్కువభాగము కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోను, అనంతపురం, కడప జిల్లాలలోనూ నివసించినందువల్ల ఇతడిని రాయలసీమవాసిగా గుర్తిస్తున్నారు. ఇతడు మూడువందలకు పైగా శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను నేర్పాడు. నిరతాన్నదానము చేసేవాడు. ఇతడు గద్యాలకు వెళ్లి అక్కడి మహారాజాతో చండీయాగము చేయించాడు. దైవోపాసనతో సంతానము లేనివారికి సంతానము కలిగేటట్లు చేశాడు. తన మంత్ర శక్తులతో గ్రామాలలో మశూచి మొదలైన బాధలనుండి విముక్తి గావించాడు. శీతలాయంత్ర ప్రతిష్ఠాపన, అష్టదిగ్బంధనాలు చేసి గ్రామాలను కాపాడుతూ, అకాల మరణాలు సంభవించకుండా, శిశువృద్ధి కలిగేటట్లు, పాడిపంటలతో తులతూగేట్లు చేశాడు.
ఇతడి శిష్యులలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ ప్రముఖులు. జీవితకాలమంతా సాహిత్యసేవలో గడిపిన ఇతడు 1960, మే 22న మరణించాడు.
రచనలు
- యథార్థ విచారము
- విచారదర్పణము
- అద్వైతాధ్యాత్మిక తత్త్వము
- శ్రీరామస్తవన క్షేత్రమాల
- సీతాస్తోత్రము
- విభీషణ శరణాగరి
- విశ్వామిత్రచరిత్ర
- జీవితచరిత్ర (అసంపూర్ణము. 1947 వరకు మాత్రమే వ్రాశాడు. దీనిని అతని శిష్యుడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశాడు
· 21-కృతికర్త కృతిభర్త ,సంఘ సంస్కర్త ,సర్వోదయనాయకుడు ,ప్రకృతిమాత సంపాదకుడు నాటక డిటెక్టివ్ నవలా రచయిత ,సాహిత్య సరస్వతి –శ్రీ శీరిపి ఆంజనేయులు
· శీరిపి ఆంజనేయులు (జూన్ 1, 1890 – నవంబర్ 27, 1974) [1][2] కృతికర్తగా, కృతిభర్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, సంఘసంస్కర్తగా, పరిశోధకుడిగా అనంతపురం జిల్లాకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఆర్జించిపెట్టాడు.
జీవిత విశేషాలు
ధర్మవరం వీధిబడులలోను, మిషన్ స్కూలులోను ఇతని ప్రాథమిక విద్య సాగింది. కలకత్తాలోని అఖిల భారత విద్యాపీఠం నుండి ఉత్తమశ్రేణిలో పట్టపరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. తాను చదివిన మిషన్ స్కూలులోనే ఉపాధ్యాయుడిగా పదేండ్లు పనిచేశాడు. జిల్లాపరిషత్ హైస్కూలులో ఐదేళ్లు, అనంతపురం లోని గర్ల్స్ ట్రైనింగ్ స్కూలులో 22 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ధర్మవరంలో విజ్ఞానవల్లికా గ్రంథమాలను స్థాపించి తన రచనలనే కాకుండా నారు నాగ నార్య,
…