మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -363
· 363-మహారధి కుమారుడు ,సంతానం ,గెలుపు సినీ దశక నిర్మాత –త్రిపురనేని వరప్రసాద్
· త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి) తెలుగు సినిమా దర్శకుడు.[1] అతని తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. అతని నాన్నగారి పినతండ్రి త్రిపురనేని సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ లోని తొలి థియేటర్ మారుతీ టాకీస్ లో పార్టనర్. అలా ఆ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది.
జీవిత విశేషాలు
త్రిపురనేని మహారథి 1955 జూలై 28న కృష్ణా జిల్లాకు చెందిన గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించాడు. తరువాత తన కుటుంబం నిజామాబాదులో స్థిరపడింది. అతని తండ్రి త్రిపురనేని మహారథి హైరదాబాదులో అప్పట్లో దక్కను రేడియో కేంద్రంలో అనౌన్సరుగా పనిచేయడంతో వారి కుటుంబం కొంత కాలం హైదరాబాదులో ఉండేది. ఆక్కడి నుండి చెన్నై వెళ్ళి మహారథి రచయితగా స్థిరపడినందున వరప్రసాద్ చదువంతా చెన్నైలోనే సాగింది. పాఠశాల జీవితంలో అతను నాటకాలలో నటిస్తుండేవాడు. చెన్నైలోని పచ్చయప్ప కాలేజీలో పి.యు.సి చదువుకుంటూనే సినిమా రంగంపై మక్కువతో తన తండ్రి నిర్మించిన దేశమంటే మనుషులోయ్ చిత్రం షూటింగ్ కు సరదాగా వెళ్లాడు. ఈ విధంగా వివిధ సినిమా అంశాల్ని గమనిస్తూ ఉండేవాడు. సినిమాలో దర్శకునిగా ఉండాలనే కోరిక బలంగా ఉండడంతో అతని తండ్రి అతనిని ఆత్రేయ, అప్పలాచార్యల వద్ద కొంత కాలం పనిచేసే ఏర్పాటు చేసాడు. వారివద్ద కొంతకాలం పనిచేసాడు. ఆత్రేయ సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ తరువాత దర్శకుడు ఎం.మల్లికార్జునరావు వద్ద అప్రెంటిస్ గా చేరాడు. అతనితో పాటు కె.ఎస్.ఆర్.దాస్, కొమ్మినేని శేషగిరిరావు తో పాటు తమిళ దర్శకులు ఏ.సి.త్రిలోక్ చందర్, అమృతం, రాజేంద్రన్ దగ్గర కూడా పనిచేసాడు. పద్మాలయా సంస్థ నిర్మించిన హిందీ చిత్రాలకూ పనిచేసాడు. కురుక్షేత్రం సినిమాలో బాబూభాయ్ మిస్త్రీ అనే ఛాయాగ్రాహకునితో కూడా పనిచేసాడు. “నవభారత్” బాబూరావు నిర్మించిన చిత్రాలలో కో డైరక్టరుగా పని చేసాడు. ఈ అకవాశం రావడానికి ప్రధాన కారకుడు మోహన్ బాబు.[2]
దర్శకునిగా
అతను సంతానం సినిమాతో దర్శకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ పురస్కారాలు కూడా లభించాయి. ఇదే కథను కొంచెం మార్చి పదేళ్ల తరువాత మాతృదేవోభవ సినిమాగా తీసారు. సంతానం సినిమాలో హీరో ఘట్టమనేని కృష్ణ అతిథి పాత్రను పోషించాడు. అతని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి కావడంతో కృష్ణ ఒక స్టార్ గా ఎదిగినా గెస్ట్ పాత్రను పోషించాడు.
సంతానం సినిమా విడుదల కాగానే అతనికి నాలుగు కొత్త ఆఫర్లు వచ్చాయి. అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. ఆ తరుణంలో రాఘవ సినిమా చేద్దామని అతనిని కబురు పంపారు. రాఘవపై ఉన్న గౌరవంతో అతని ఆఫర్ ను అంగీకరించాడు. రాఘవ ఒప్పందం ప్రకారం ఒక సినిమా చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమాకు పని చేయకూడదు. అతని తో చేయవలసిన సినిమా ఆలస్యమైంది. రాఘవతో అతనికి వచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల స్వంతంగా సినిమా తీయకుండా, మరో సినిమాలో చేయకుండా బ్లాక్ కావలసి వచ్చింది. వారి మధ్య రాజీ కుదరక రాఘవతో పనిచేయలేనని అతను చెప్పేసాడు.
రాఘవ సినిమా అతను వదిలెసిన తరువాత అతను అంగీకరించిన చిత్రం నా పేరే దుర్గ. ఆ సినిమాకు సిల్క్ స్మిత కథానాయిక. తరువాత సిల్క్ స్మిత బ్రహ్మా నీ రాత తారుమారు అనే సినిమాను తీస్తూ అందులో అతనిని దర్శకునిగా ఎన్నుకుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. కానీ ఆ సినిమా అనేక అడ్డంగులతో రిలీజ్ కాలేదు. అది కెరీర్ పరంగా అతనికి నష్టం కలిగిందించి. తరువాత స్వంతంగా సినిమా తీద్దామని భావించి రైతు భారతం సినిమాను ప్రారంభించాడు. అందులో సౌందర్యను కథానాయకిగా పరిచయం చేసాడు. కానీ దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు అభ్యర్థన మేరకు ఆమెను మనవరాలి పెళ్ళి చిత్రానికి నటించేందుకు అవకాశం ఇచ్చాడు. అది హిట్ కావడంతో ఆమె మరో తమిళ సినిమాలో కూడా నటించింది. అలా రైతుభారతం విడుదల కాకుండానే ఆమె బిజీ హీరోయిన్ అయింది.
ఆతనికి సామాజిక సందేశంతో సినిమాలు తీయడమంటే యిష్టం. అందువల్ల కమర్షియల్ సినిమాలు కాకుండా ఇష్యూ ఆధారిత సినిమాలు తీయడానికి యిష్టపడుతుంటాడు. అలా కేరళలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా “గెలుపు” సినిమా తీసాడు. ఇది న్యూస్ ని ఆధారంగా తీసిన సినిమా. తరువాత అతను మా నాన్న పెళ్ళి సినిమా సినిమా తీసాడు ఈ సినిమా సౌందర్య నటించిన చివరి సినిమా. ఆమె తొలి సినిమా, చివరి సినిమా కూడా అతనిదే కావడం విశేషం. [3]
రాజకీయ జీవితం
1998లో అతని జీవితంలో మలుపు తిరిగింది. అతను భారతీయ జనతా పార్టీలో చేరాడు. నాలుగేళ్ళపాటు ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. వాజ్ పేయి గారిని ప్రధాన మంత్రిగా చూడాలనుకున్నాడు. అది నెరవేరిన తరువాత అతను మళ్లీ సినిమా రంగంలోని ప్రవేశించి “గెలుపు” సినిమాను తీసాడు.
· 364-బందరు కుర్రాడు యానిమేషన్ ఎక్స్పెర్ట్ ,ప్రతిరోజూ పండగే ,బస్టాప్ దర్శకుడు –దాసరి మారుతి
· దాసరి మారుతీ ఒక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.[2]
నేపథ్యము
ఇతడిది మచిలీపట్నం.[3] పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో హైదరాబాదు వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.
ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాడు. జూబ్లీహిల్స్ లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్లో చేరాడు. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్స్టిట్యూట్కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.
ఇతడికి బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. గోల్కొండ, చార్మినార్, నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాడు. సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచింగ్లో చూపించే ప్రయత్నం చే సేవాడు.
సినీ జీవితము
2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు
- ఈ రోజుల్లో (2012)
- బస్టాప్ (2012)
- ప్రేమకథా చిత్రమ్ (2013)
- కొత్తజంట (2014)
- భలే భలే మగాడివోయ్ (2015)
- బాబు బంగారం (2016)[4]
- మహానుభావుడు (2017)
- ప్రతిరోజూ పండగే (2019)
సహా నిర్మాత
- గ్రీన్ సిగ్నల్ (2014)[5]
- లవ్ యు బంగారమ్ (2014)
365-ఘరానామొగుడు ,అమ్మరాజీనామా సినీ నిర్మాత –దేవీ వరప్రసాద్
దేవీవర ప్రసాద్ తెలుగు సినీ నిర్మాత. దేవీఫిలింస్ బేనరు పై పలు విజయవంతమైన తెలుగు చిత్రాలు నిర్మంచాడు.
జీవిత విశేషాలు
అతను 1943 డిసెంబరు 6న విజయవాడలో జన్మించాడు. నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు.
దేవి వర ప్రసాద్ తండ్రి తిరుపతయ్య సినిమా పంపిణీదారుడు అయిన ఎన్టీఆర్ కు సన్నిహితుడు. అతను ఎన్టీఆర్ యొక్క మూడు సినిమాలకు కూడా భాగస్వామి. ప్రసాద్ నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. నిర్మాతగా అతను ఎన్టిఆర్తో కథానాయకుని కథ, కేడీ నంబర్ 1, తిరుగులేని మనీషి, నా దేశం వంటి చిత్రాలను తీసాడు[1]. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత దేవి వర ప్రసాద్ చిరంజీవితో సినిమాలు చేయడం ప్రారంభించాడు. చట్టంతో పోరాటం సగటు కంటే ఎక్కువగా ఉండగా కొండవీటి దొంగ, మంచి దొంగ పెద్ద విజయాలు సాధించాయి. ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్గా మారింది. చిరంజీవి యొక్క టాప్ 5 సూపర్ డూపర్ హిట్స్లో ఈ చిత్రాన్ని పేర్కొనాలి. తరువాత అల్లుడా మజాకా చిత్రం కూడా మంచి కలెక్షన్లు సాధించి విజయాన్ని సాధించింది. అయితే తదనంతరం మృగరాజు టైటిల్తో గుణ శేఖర్తో దర్శకుడిగా దేవి వర ప్రసాద్ చిత్రం పూర్తిగా అపజయం పాలైంది. దేవి వర ప్రసాద్ యొక్క దాదాపు అన్ని ఆదాయాలు ఈ చిత్రంతో కొట్టుకుపోయాయి.[2] ఆ తర్వాత అతను చిరంజీవితో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మృగరాజుతో ప్రతిదీ కోల్పోయినందున, చిరంజీవి తనపై దయ చూపవచ్చని ఆతను భావించాడు. కానీ అది జరుగలేదు. తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయాడు. అతని చివరి సినిమా భజంత్రీలు కూడా అనుకున్న విజయం సాధించక ఇంకా ఆర్థిక నష్టాలను అనుభవించి అనారోగ్య పాలయ్యాడు.
సినిమాలు
భలే తమ్ముడు , కథానాయకుని కథ, భలేదొంగ, మంచి దొంగ, కొండ వీటి రాజా, అల్లుడా మజాకా, కేడీ నెంబర్ వన్, ఘరానా మొగుడు ,మృగరాజు, భజంత్రీలు, అమ్మరాజీనామా వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
మరణం
దేవి వర ప్రసాద్ కాలేయ సంబంధిత వ్యాధి, మధుమేహంతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో చేరాడు. అతను 2010 డిసెంబరు 10 న మరణించాడు.[3]
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-22-ఉయ్యూరు