సకలేశ్వర శతకం
గుంటూరు జిల్లా నండూరు కు చెందినశ్రీ నండూరి లక్ష్మీ నరసింహా రావు గారి చె రచింపబడిన ‘’సకలేశ్వర శతకం ‘’ను ,పిఠాపురం లోని ఇస్సలాయాం ప్రెస్ లో 1924లో ముద్రించారు .వెల- ఆరు అణాలు .దీనికి ముందుమాట శ్రీ ఉమర్ ఆలీషా కవి రాశారు –అందులో –‘’భక్తి ,ఆవేశం ,ఆత్మ సమర్పణ ,తన్మయత్వం జ్ఞాన సంపత్తి .మృదు మధుర పద సంపత్తి ఉన్నాయి .వ్యాకరణ దోషాలున్నాయి కొంతవరకు సరిచేశాను –‘’అపశబ్దంబులు గూడియున్ .హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగంబులు ‘’అని భాగవతం లో ఉ౦దికనుక బాధలేదు ‘’అన్నారు .పండితాభిప్రాయాలు న్నాయి –శ్రీ రా రా .గారు ‘’నండూరి గ్రామ ఈశ్వరునిపై కవి భక్తిగా చెప్పిన శతకం .కవితా సంప్రదాయం చక్కగా పాటించారు .పరమేశ్వరునిపై చేసిన రూపకల్పనలు బాగున్నాయి .భక్తుని వేదన ఉంది’’అన్నారు ఇది సీస పద్య శతకం .’’గిరిజ హృదయేశ నండూరు పురనివాస –స్ఫటిక సంకాశ సకలేశ భావ వినాశ ‘’అనేది శతకం మకుటం .
మొదటిపద్యం –‘’శ్రీక౦ఠ సురవాస సేవిత శృంగార –భాక్తమందార సంభవ విదూర –గౌరీ మనశ్చోర –కారుణ్య విస్తార –దుష్ట సంహార నిర్దిష్ట శూర – గంగా జటాభార ,కైలాస సంచార –సురుచిరాకార బంధుర విచార –వారాశి గంభీర వైరి వీర విదార –శుభాతార హీర సన్నిభ శరీర –
గీ –చోర దనుజాపహార త్రిశూల ధార – భయ విపద్ఘోర దావాగ్ని వర్ష ధార -’’గిరిజ హృదయేశ నండూరు పురనివాస –స్ఫటిక సంకాశ సకలేశ భావ వినాశ ‘’
రెండవ పద్యం లో పృధివి అంబు పావకం,సమీరం తోకూడిన పంచ భూతాత్మకుడవు నువ్వు ,ఆదిత్యాది నవగ్రహ రూపుడవు .బ్రహ్మ విష్వక్సేన పశుపతులు బహిర్ముఖాలు ,నిత్య శుద్ధ శ్రౌత,సత్య యజ్ఞాలు త్రిలోకాలు నీవే .సర్వమూర్తివి జీవుల్ని బొమ్మల్ని చేసి ఆడిస్తావు .బ్రహ్మజ్ఞానంతో నీ పదభక్తికలగటం మహా ప్రసాద౦ .సగర ,మార్కండేయ ,దేవతలు నిన్నర్చించి అబీష్ట సిద్ధిపొందారు.భక్తులకు ‘’పెరటికల్ప వృక్షం నీవు ‘’.బాణాసురుని ఇంటికావలి కాశావ్ ,మార్కండేయునికి శతాయుస్సునిచ్చావ్ ,గుహ్యకేశ్వరుని బ్రోచావ్ ,అర్జుడికి పాశుపతాస్త్రం ఇచ్చావ్ .వీరందరికంటే భక్తుడను నన్ను ఉపెక్షిస్తున్నావ్ .సూర్య చంద్రులు రధ చక్రాలుగా,భూమి రధం , వేదాలు ఆశ్వాలుగా ,నభం విల్లు ,మాధవుడు బాణ౦ గా ,హాఠకాచలం బాణం ములికిగా,దేవతలే సేనగా భావాన్ని శక్తిరూపంగా ఉంటే దుష్ట త్రిపుర సంహారం చేసి లోకాలను కాపాడావు .కాలసర్పం చేతి కంకణం ,హాలాహలం ఆహారం ,సర్వభక్షకుడు పావకుడు నీ మూడవ కన్ను .శ్రీమహా విష్ణువే నీకు పెద్ద విల్లు .ఇన్ని ఉన్న వేల్పువు నువ్వుకాక ఇంకెవరు మోక్షమివ్వగలరు ?
ఏమీలేకపోయినా మోక్షం భక్తిగల పుణ్య పురుషుల సొమ్ము అంటారు..మరోపద్యంలో –సర్వజన పశుపతీమహేశ్వర ఇందుఖండ భూష ,శంకర చంద్ర శేఖర ,మృత్యుంజయ ,శూలి సర్వేశ్వరా శితి కంఠ హరా అంటూ నామోచ్చారణ చేసి తరించారు కవి .కాటి రేడు అంటే పాపాలుకాల్చేస్తావు ,గంగాధరాం అంటే పవిత్రుల్ని చేస్తావ్ ,భూతి రుద్రాక్ష ప్రపూతదారీ అంటే భూతినిస్తావ్ .లోకస్వరూపం నువ్వే నాకొకసారి కనిపించకూడదా?-‘’ఇలపాదములుమహాబిలము ,పొక్కిలి యునై ,నలినాప్తుడు శశి నయనములుగా –దిక్కులు శ్రోత్రముల్ ,దివి శిరంబుగాగా ,వహ్ని బిమ్బంబొప్పు వదనముగను ,గాలిప్రాణములు దివౌకసాలు బాహువులు ,నిశి దివానీకాలు నిముషాలుగా,అమ్బుజాసనుడు గుహ్యం ,వర్షం వీర్యం ,ప్రాచదువులు అంటే వేదాలు ఆసనం ‘’గా ఒప్పే విశ్వ రూపుడవు విశ్వేశ్వరా ‘’అంటూ మహా రుద్రరూపాన్ని వర్ణించారు కళ్ళకు కట్టినట్లుగా .
సనకాది ముని సంసేవితుడవు ,రావణ గర్వాన్ని పాదంతో అణచావు ,త్రిపురసంహారం చేసి లోకాలని కాపాడావు .ఆపదోద్దారకుడవు ,లోక బంధవుడవు అని చంద్రమౌళి స్తవం చేశారు .భూ సంబంధమైన ఈ తిత్తి ప్రాణం పొతే మట్టిలో కలుస్తుంది ,వాయు సంబంధమైన ఈ తిత్తి లోనుంచి గాలిపోతే గాలిలో కలుస్తుంది ,నీటి సంబంధమైనది అంతా చావుకు ద్రవంలో చేరిపోతుంది .ఆకాశ.తేజస్సులు చివరికి గగనాగ్నిలో చేరిపోతాయి .కానీ ఆత్మ స్వరూపమైన నీ తేజస్సు ఎక్కడికీ పోదు .నీడగ్గరకే చేరుతుంది అని జీవి తత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు .’’నీనామ జపం దుష్టరాక్షస సంహారం చేసే ఖడ్గం ,నీసేవ దారిద్ర్యం రూపుమాపుతుంది .నీ సద్గోష్టి శత్రుజన నష్టంకల్గించి సుఖాన్నిస్తుంది .నీకై విచారం మంచిమార్గంలో నడిపించే గురువు .నీ అర్చనం రోగాదులను పోగొట్టే గొప్ప ఔషధం .
దర్పలోభామోహాదులే మొసళ్ళు ,దారేషణ ,పుత్రేషణాదు లు తరంగాలు ,ధర్మం శుచి సత్యాదులు రత్నాలు ,యజ్ఞస్వరూపి అఖిల గర్భస్థ సంచలితుదవైన నీవు గట్టు గా ఉండేదే సంసారమనే సముద్రం .దీనులపాలిటి దేవ దేవుడవు నువ్వు –పసలేని దీనమానవుడిని నేను –ధీరతగల నేతవునువ్వు –ప్రాపులేని వాడిని నేను ,లోకాలను గర్భంలో నువ్వు దాచుకొ౦టే ,దిక్కులేకుండా లోకం లో నేనున్నాను .మాయారూపంతో మాయ చేస్తావు ,మాయలో మునిగినవాడిని నేను .నీకూ నాకు ఇలాంటి బాంధవ్యం ఉంది ,నన్ను ప్రేమతో రక్షించటం నీ ధర్మం .కాసులు అడిగానా డబ్బు ఇమ్మన్నానా గుడ్డలు ఆహారం అడిగానా ,భూములు భూషణాలు కావాలన్నానా ,రమ్యహర్మ్యాలు అధికారాలు కోరానా .మోక్షం మాత్రం ఇమ్మని చిన్న కోరిక కోరాను అంతేగా అంతేగా అన్నారు కవి చాలాగడుసుగా ఆర్తిగా సభక్తికంగా. భక్త రామదాసులాగా .
కాళహస్తిలో పుడితే జన్మపాపాలు నశిస్తాయి .శ్రీశైల దర్శనం జన్మరాహిత్య మిస్తుంది.అరుణాచల దర్శనం మోక్షప్రదం,కాశీ విశ్వనాధ దర్శనం నీ సాన్నిధ్యమిస్తుంది .ఇది తెలిసినవాడే విబుధుడు .’’నిన్ను ఎరిగిన వాడే నీతి ధనుడు ‘’అ౦టారుకవి ..తర్వాత శరీరంలోని నాడీ చక్రాలను వర్ణించారు .గంగాది నదులలో స్నానం కంటే జ్ఞానపద తీర్ధం గొప్ప . కాశీ రామేశ్వరాది క్షేత్రదర్శనం కంటే సుజ్ఞాన దర్శనం గొప్ప..లక్ష దానధర్మాలు చేయటం కంటే ఒక జ్ఞాని కి ఆతిధ్యమివ్వటం చాలాగొప్ప .దేవాలయాలలో అర్చామూర్తుల సేవకంటే శ్రేష్టుడైన జ్ఞాని నికొలవటం శ్రేష్టం ‘’జ్ఞాని వైన నిన్ను కొలవటమే అన్నిటికన్నా గొప్ప అంటూ మహాగొప్పగా సత్యాన్ని చెప్పారు .
నూరవ పద్యం లో .తన గురించి చెప్పుకోన్నారుకవి .తుంగభద్రా నదీ తీరంలోని నండూరి వాడను కౌశికగోత్రం భక్త గోవింద వంశం వాడు శివరామయ్య సుందరమ్మ దంపతులకు పుత్రుడు .సుబ్బారయకవికి మేనల్లుడు ,లక్ష్మీ నరసింహం పేరు ‘’నీకు శతకమన్ శతపత్ర మిచ్చినాను – తప్పులున్నను మన్నించి దయజూడు ‘’అని వేడుకొన్నారుకవి .101వ పద్యం లో మంగళగానం చేసి శతకం ముగించారు కవి .ఈ శతకం ఈ కవి గురించి మనవారు ఎవ్వరూ ఎక్కడా పేర్కొన్నట్లు కనిపించలేదు .సీసాలు హాయిగా సాగిపోయాయి భక్తీ వరదలైంది .భావం కట్టలు తె౦చు కొన్నది .ప్రపత్తి మహా లోతుగా ఉంది .ధార ,శైలి విశిష్టం .ఈశతకాన్ని, కవి నండూరి లక్ష్మీ నరసింహ౦ గారిని పరిచయం చేసి నేను ధన్యుడిని అయ్యాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-23-ఉయ్యూరు . . .