మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -2

మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -2
1975లో భారతస్వాతంత్ర్యోద్యమ చరిత్ర రాశాక ఆచార్య మామిడిపూడి మరెలాంటి గ్రంధ రచనకు పూనుకోలేదు .1974లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎనిమిది అధ్యాయాల నూటనలభై పేజీల పుస్తకం తెలుగు అకాడెమి అడిగితె రాశారు .ఇది కళాశాల విద్యార్ధులకు అధ్యాపకులకు అందుబాటులో ఉండటమేకాక సామాన్యులకు బాగా అర్ధంయ్యేట్లు రాశారు .1971తర్వాత గ్రంధ రచన ఆగినా ,1972లో 14అధ్యాయాల భారతస్వాతంత్రోద్యమ చరిత్ర దాదాపు పద్నాలుగు నెలలు కష్టపడి రాశారు .ఇది రెండుభాగాలు. ఇది అత్యున్నత ప్రామాణాలతో రాసి అందరి అభిమానం పొందారు .1973లో 22గ్రంధాలకు సమీక్షలురాశారు .రేడియోలో నాలుగు ప్రసంగాలు –మారుతున్న సమాజం లోఅధ్యాపకులపాత్ర ,రాష్ట్ర సమైక్యత ,ఆరు అంశాలపధకం ,కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చేశారు .పాలిటిక్స్ ప్రస్తుత పరిస్థితి ,అనిబిసెంట్ ఇచ్చిన యువజన సందేశం లపై ప్రసంగాలు చేశారు .రాజనీతి శాస్త్రం పై ఆయన ప్రసంగం అనేకుల్ని ఆకర్షించగా ఇండియన్ జర్నల్ ఆఫ్ పాలిటిక్స్ ప్రచురించింది .నవంబర్ లో పిహెచ్ డి పరీక్షాదికారిగా బొంబాయి వెళ్లారు .
1973లో నిజామాబాద్ వెళ్లి రెండువారాలు విశ్రాంతి తీసుకొన్నారు .అప్పుడే తెలుగు సాహిత్యం పై అభిమానమేర్పడి రావిశాస్త్రి చలం పాలగుమ్మి రచనలు చదివారు. పద్మరాజుగారి నల్లరేగడి నవల,రావిశాస్త్రి నిజం బాగా నచ్చింది .ఆగస్ట్ సెప్టెంబర్ లలో ఢిల్లీ లో ఆరువారాలు పిల్లలతో గడిపారు .రామ చంద్రగుహ రాసిన ‘’విప్లవం లో మొదటి అగ్నికణాలు ‘’చదివి ఉత్తేజం పొందారు .1972లో ఆంధ్రప్రభలో చైనా –అమెరికాల సనిహిత్వం ,రాజ్యాంగాన్ని మార్చటానికి నూతన రాజ్యాంగ పరిషత్ అవసరం వ్యాసాలూ రాశారు .కేవిరావు సంపాదకత్వం లో వారణాసి నుంచి వెలువడే పత్రికకు బందరునుంచి వచ్చే తెలుగు విద్యార్ధికి వ్యాసాలురాశారు .మనుమరాలు శాంత పిహెచ్ డి కి పాఠాలు బోధించి కుమార్తె వైదేహికి ఇండియా చరిత్ర బోధిస్తూ మనుమరాలుపద్మ ,మనుమడు జయరాం కు సబ్జెక్ట్ విషయాలు బోధించారు .మనుమడు రమణకు సంస్కృతం నేర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు .బాంబే విశ్వ విద్యాలయ రాజనీతి శాఖ రజతోత్సవానికి ప్రకటించే సావేనీర్ కు వ్యాసం రాశారు ఉస్మానియా తత్వ శాఖ ప్రధాన ఆచార్యుడు మధుసూదన రెడ్డిగారు ఏర్పాటు చేసిన గోష్టిలో పాల్గొని ‘’భారతీయ పరిపాలనా విధానం ‘’పై మాట్లాడారు .స్వాతంత్ర్యానంతరం స్థానిక పాలనలో మార్పులు పైన ఒక విలువైన వ్యాసం రాశారు
శ్రీ కోదాటి నారాయణ రావు శ్రీ కృష్ణ దేవరాయ గ్రంధాలయం లో ‘ఏర్పాటు చేసిన ‘మహాత్ముని ఆర్ధిక విధానాలు ఇవాళ ఎంతవరకు సాధ్యం ‘’అనే విషయం పై వ్యాసం రాయమనికోరితే ఆచార్య అన్ని క్షణ్ణంగా పరిశీలించి దరిద్రం నిరుద్యోగం పోవటానికి గాంధీ ఆర్ధిక విధానాలే శరణ్యం అని ఉత్తమ వ్యాసం రాశారు .ఢిల్లీ పత్రిక ‘’జర్నల్ఆఫ్ కాన్ష్టి ట్యూషనల్ స్టడీస్ ‘’ కు ‘’సమాఖ్య విధానం –రాజకీయ పక్షాలు ‘’వ్యాసం ,త్రివేణి ,ప్రసారిత లకు రెండేసి వ్యాసాలూ రాశారు .హైదరాబాద్ మేధావులు ఏర్పాటు చేసిన ‘’దేశ రక్షణకు హిందూ మహాసముద్ర ప్రాముఖ్యం ‘’చర్చలో పాల్గొని అమెరికా రష్యాలు హిందూ మహాసముద్రంలో నౌకాస్థావరాలు నిర్మించటం ,భారత వంటి సముద్ర తీర దేశాలకు నష్టమని ,దీనితో అగ్రరాజ్యాల మధ్య ఉ ద్రిక్తలు పెరిగి ఆదేశాల ఆర్ధిక స్థితి దిగజారిపోతుందని నిర్మోహ మాటంగా ప్రసంగించి తన సునిశిత మేధను అందరితో పంచుకొన్నారు .
పార్వతీ పురం కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ అప్పలస్వామి (రోణ౦కి ?) రాసిన 500పేజీల ‘’రాజకీయ తత్త్వం ‘’పుస్తకానికి ముందుమాట రాయమని హైదరాబాద్ వచ్చి కోరారు .మంచం నుంచి లేచే పరిస్థితి లేకపోవటంతో దాన్ని సున్నితంగా తిరస్కరించారు ఆచార్య .కానీ మళ్ళీ రెండు సార్లు వచ్చి బ్రతిమిలాడితే ,స్థాలీ పులాకంగా అక్కడక్కడ చదివి మొక్కుబడిగా ముందుమాటలు రాసిచ్చారు .అనేకులకు సహాయం చేసిన తాను అప్పలస్వామిగారికి ఈ రచనా సహకారం మనస్పూర్తిగా అనారోగ్య రీత్యా అయినా అందించలేక పోయినందుకు చాలా బాధపడ్డారు ఆచార్యశ్రీ .సెప్టెంబర్ నుంచి గురువుగారి డైరీగురు పత్ని గారే రాశారట .భారత దేశ సమాఖ్య విధానం పై గ్రంధం రాయ తలపెట్టి మూడు అధ్యాయాలు రాశారు .రాష్ట్ర కాంగ్రెస్ కమిటి నాగార్జున సాగర్ లో ఒక శిబిరం ఏర్పాటు చేసి ‘’మన రాజ్యంగం లోని ప్రధాన లక్షణాలు ‘’పై ఒక పుస్తకం రాయమని కోరితే రాసివ్వగా అచ్చువేసి శిబిరంలోని అందరికి పంచారు .ఒకరోజు ఓపిక చేసుకొని వెళ్లి రెండు గంటలు కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు దేశ సేవలో దాని పాత్ర మొదలైన విషయాలపై మాట్లాడి వచ్చారు .ఉస్మానియా రాజనీతిశాఖ అధ్యాపకులు డాక్టర్ శేషాద్రి ‘’ఆంధ్రోద్యమం ‘’పై పుస్తకం రాయమని కోరితే ,అదివరకే దానిపై కొంత అధ్యయనం చేశారుకనుక వెంటనే రాసి పంపారు రంగయ్యగారు .ఆంధ్రాయూని వర్సిటి లెక్చరర్ శ్రీ టి అప్పారావు ‘’మున్సిపల్ ప్రభుత్వం ‘’పై పరిశోధన చేసి పిహెచ్ డి థిసీస్ రాయగా దాని ప్రామాణికత పై మామిడి పూడి వారిని అభిప్రాయం కోరితే సంస్కరించి అనేక సూచనలు చెప్పగా అయన అనుసరించి పిహెచ్ డి పొందారు .ఇలా వార్ధక్యం లో ఉన్న జీవితాన్ని బహు వ్యాపకాలతో సార్ధకం చేసుకొన్న ధన్యజీవి ఆచార్య మామిడి పూడి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.