పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద —-2

          పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద —-2
                           వసంతుడిని పుష్పాలతో అర్చించటం ఉచితమేనా ?ఉచితమే అంటూ బహు గొప్పగా సమర్ధించాడు శూద్రక కవి .సూర్యునికి దీపారాధనతో ,సముద్రానికి అందులోని నీటితో పూజ చేయటం లోక సహజమే .వాక్కు కు ప్రభువైన బ్రహ్మదేవుడిని వాక్కులతో అర్చించటం లోక రీతి .అలాగే వసంతుడినీ ఆయన ఇచ్చే పూలతో పూజించటం సహజమేనంటాడు కవి .తనను చూసి తప్పించుకు పోతున్న విపులామాత్యుడిని పలకరిస్తూ ”కలువ స్నేహితులను మేలుకొలపని,పగటి చంద్రుడిలాగా దాటుకు పోతున్నావెం?”అని ఆలంకారికం గా ప్రశ్నిస్తాడు .వాన ,బురద తో ,వరదలతో నది కలుషితమైనపుదు ,దాన్ని శుభ్రపరచాటానికి శరదృతువు వస్తుంది .తీవ్రమైన చలి రాత్రిలో విసనకర్ర తో విసురు కోవటం వ్యర్ధం .వ్యాకరణ పాండిత్యం తో హడలగొట్టే ”దత్తకలాషి ”అనే విటుడికి స్వాగతం చెబుతూ ”స్వాగతం అక్షరాల బందెల దొడ్డికి ‘అని చురుక్కున మాటల ఈటెలతో పొడుస్తాడు .ఉక్కనేలపై తాబేలుగా తిస్తవేయటం ,వారుణీ జఘన పాత్రం గంగా తీర్ధం లాగా పవిత్రం అనటం ,గొల్లపేట లో పెరుగు అమ్మటం ,కపటప్రచార కంచుకం తీసివేయటం చక్కని పలుకుబళ్ళు .దీనికి సంస్కృతం లో శూద్రకునికి ,తెలుగు చేసిన రజనికి వందనాలు .
                      పువ్వులు అమ్మే వీధిలో అనేక పూలసముదాయం అంగ ప్రత్యన్గాలుగా రూపుదాల్చిన వసంత వధువు లాగా ఉందట పూలు అమ్మే వీధి అంతా .ఆ వర్ణనా  మనోహరం గా వుంది . .పదండి నాతో పూలరంగడులు లా ఆ వీధిలోకి .బాగా విచ్చుకొన్న తామర పూవు వసంతం అనే వధువు సిరిమోము (శ్రీముఖం )లాగా ,విరజాజిమొగ్గలు పలువరుసగా ,కలువపూలె కన్నులుగా ,ఎర్రమద్ది పూవు క్రింది పెదవిగా ,తుమ్మెద రోద తేట తేనె పలుకులా ,పూలగుత్తులు రోమ్ములుగా ,సిగచుట్టు దండలే నగలుగా ,పేర్చిన పుష్ప్పాలే వస్త్రాలుగా ,పూలమాలలేమొలనూలుగా  ,పుష్పాలతో అమరిన స్త్రీ రూపు ధరించి పుష్పవీది వసంతుని రాణి లాగా శోభలీనుతోందట ..సాహిత్యచరిత్రలో పుష్పవీధిని ఇంత ఊహాత్మకం గా వ్యూహాత్మకంగా చిత్రించిన కవి లేడేమో /
                        పండుముసలివాడిని చూసి ”ముసలితనం బాగా పండుతోంది కదా ?’అని అంటే వాడు ”ముదిసిన పాములాగా ముసలితనపు కుబుసం వదలగోట్టుకున్తున్నాను ”అని గడుసు సమాధానం చెప్తాడు .ముసలాయన సోయగాన్ని ఎట్టిపోదిచినట్లు మెచ్చుకుంటూ ”కట్టి అంటని గండభాగం తో ముఖం ,పాథ ఇంటికి సున్నం కొడితే శోభించినట్లు గా వుంది ”అని నర్మ గర్భం గా అంటాడు పాత్రధారి సూత్రధారి ,అయిన విటుడు.ముందే చెప్పినట్లు అన్ని పాత్రలు అతనే పోషిస్తాడు .వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతున్నట్లుంటాడు .అవతలి వాడు అనవలసిన మాటల్ని ,వాళ్ళు అన్నట్లు గా భావించి తనే అనటం భాణం లో ప్రత్యేకత .ఇదే కవి కున్న నేర్పు .ఇంకో బకరా గాడు తనను తప్పించుకొని పోతుంటే ,వాదిమొహం మీదే ”వెన్నెల్ని తప్పించుకొని ,గొడుగులో తలదాచుకోన్నట్లు ,స్నేహితుడిని అయిన నన్ను తప్పించుకుని ,స్థంభం చాటుకు చేరావెందుకురా ?”అని గద్దిస్తాడు .అలాగే ”అందని కోరికలు పొందే లోగా ,అందిన సుఖాలను త్యాగం చేయటం పురుషలక్షణం కాదు అని అంటూ నిప్పు వెదకటానికి దీపం కావాలా?”అని సందేశం ఇస్తాడు కోరిన స్త్రీ ని వాడు చేరు కోవటానికి వీలుగా .
                            వేశ్యవాటికను కూడా సందర్భోచితం గా వర్ణిస్తాడు శూద్రక మహాకవి .మన్మధుని ఇల్లు ,జూదరి పాథశాల ,మాయలకు నిలయం ,వంచనకు పంచ ,అది .అక్కడ డబ్బులేని వాడికి స్వాగతం హుళక్కి .వెతలు కూడా రామ్యమఎదే వేశ్యాగృహం ట.విటుడి అనుభవాలన్నీ కవి ఏకరువు పెట్టాడు .ఆయనకూ అనుభవైక వేద్యాలా ?ఒక బౌద్ధ సన్యాసి ,దొంగచాటుగా వేశ్యా సాంగత్యం పొంది ,ముఖానికి ముసుగేసుకొని ,బయటకు వస్తు మన విటశిఖా మణికి   అడ్డం గా దొరికి పోయాడు .అతన్ని ఆటపట్టిస్తూ ,పనిలో పనిగా బౌద్ధం మీద క్లాస్స్ తీసుకుంటూ విరుచుకు పడ్డాడు .”అర్ధం లేని బోడి దొంగ సన్యాసుల చేత మైలపడి పోతున్న బుద్ధ ధర్మానికి ఎటువంటి దుర్గతి పట్టింది /కాకుల ఎంగిలికి తీర్ధజలం మైలపడటం లేదా ?”అనుకొంటూ ,వాడిని ”విహార బేతాళా ?”‘అని సంబోధించాడు .”వేశ్యా వాటిక అనే దిగుడుబావి దగ్గర అప్పుడే వాలిన కొంగలా ,దొంగ అడుగులు వేస్తూ పోతావెం ?సురత (రతి) పిందపాతం అనుష్టీయతేనా ?చీకటి తప్పూ చేసి ,చేయి కడుకోవటం కాదు కదా ?”అని ఝాడించి పారేశాడు .అప్పటికే బౌద్ధం వెర్రితలలు వేసి ,ధర్మభ్రష్తమై క్షీణదశకు చేరుకోన్నట్లుంది .సంఘం నైతికం గా ,సాంఘికం గా దిగజారిన స్థితి .మళ్ళీ సనాతన ధర్మం వైపుకు ప్రజలు అడుగులు వేస్తున్న జాడ కనబడుతోంది .కాంక్షతో కాని అనుకోకుండా కాని వేశ్యల కొమ్పలకు చేరే భిక్షువులు ,జైన బౌద్ధ సూత్రాలను ఓంకార శబ్దం లాగా విఫలురు అవుతారు కాని దాని నుంచి ఏ వెలుగునూ పొందలేరు ‘అని కవి వాక్కులు .కాలమ్ దానినే రుజువు చేసింది కదా /కవిచెప్పినవన్నీ  తాను ప్రత్యక్షం గా చూసినవే ,అనుభవాలే .”సకల జనులమీద ప్రసన్న చిత్తం వుండాలి కదా ?”అని ఆ భిక్షువు,తనచేష్ట nu సమర్దిన్చుకొంటే ,మనవాడు ”అర్ధం లేని తల గోరుగుడుకి ,స్థిరం లేని మనస్సు వల్ల సిగ్గు కాక  మరేమిటి ?”అని గడ్డి పెడతాడు .,మందలిస్తాడు .”మదన భ్రమ చేత శుద్ధ ఆచమనం లాగా ,నీ వల్ల బుద్ధవచనం భ్రష్టం అయింది ”అని మనవాడు బాధ ,సానుభూతి వ్యక్తం చేస్తాడు .ధర్మ భ్రష్టులుఏ కాలమ్  లోనైనా వుంటారు అని తెలియజెప్పే సన్ని వేశం .ఇలా శూద్రక కవి ఎన్నోసామాజికాంశాలను   స్పృశించి వెలుగు లోకి తెచ్చాడు .భాణం అని పేరే కాని చెడు మీదకు ,అధర్మం మీదకు ,అపకారం మీదకు ,అశ్లీలత పైకి ,అధర్మం మీదకు ,చాపల్యం మీదకు సంధించిన బాణం అది అనిపిస్తుంది లోతుగా పరిశీలిస్తే .వ్యంగ్యవైభవం మూర్తీభావించింది ఇందులో . ,
                              ఇంకాసిని విశేషాలు ఇంకోసారి .
                                                                       మీ –గబ్బిట దుర్గాప్రసాద్ .—19 -10 -11
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.