నమ్మకానికి అమ్మతనం వంటి భవానిగారి ’ రాం బాబు ‘’గారు
సుమారు నలభై ఏళ్ళనుంచి పరిచయం లో ఉన్న మాకుటుంబ స్నేహితురాలు ,మాఇంటి ఆడపడుచు అనుకొనే శ్రీమతి భవానిగారి భర్త శ్రీ ఐనపర్తి రాంబాబు గారు 23-5-26 శనివారం రాత్రి 3గంటలకు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి ఉయ్యూరులోనే వారు ఉంటున్న ఇంట్లో చనిపోయారు .ఈ విషయం ఆదివారం ఉదయం మా ఇంటి మరో ఆడపడుచుగా భావించే మాకుటుంబ స్నేహితురాలు శ్రీమతి సీతంరాజు మల్లికాంబ గారు ఫోన్ చేసిచేప్పేదాకా తెలియదు .వెంటనే భవానిగారికి ఫోన్ చేస్తే కడివెడుడుఖంతో ‘’నిజమే మాస్టారూ నన్ను అన్యాయం చేసి ఒంటరిదాన్నిచేసి ఆయన వెళ్లి పోయారు ‘’అని విలపించారు .మా శ్రీమతి ఆమెను ఓదార్చింది .తట్టుకోమని చెప్పింది.’’మీకన్నా చిన్నవయసులో మల్లిక గారికీ ఇలానే జరిగిందికదా.కొంచెం ధైర్యంగా ఉండండి ‘’అని చెప్పింది .ఉదయం 8గం లకు మాఅబ్బాయి రమణ బండిమీద వీరమ్మ గుడిదాటాక బీరువాలరెడ్ది లేక మీసాలరెడ్డి గారు అని మేమంతా పిలుచుకొనే శ్రీ కట్టుకోలు సుబ్బారెడ్డి గారి ఫస్ట్ఫ్ ఫ్లోర్ లో కాపురం ఉంటున్న రామబాబు గారింటికి వెళ్లాం .అప్పటికే బాడీని ఐస్ బాక్స్ లో పెట్టి ఏర్పాట్లు చేస్తూ రెడ్డిగారు కనిపించారు .కాసేపటికి మల్లికగారు ఆమె రెండవ అల్లుడు వచ్చారు .మాదగ్గర కొంతసేపు కూర్చుని మల్లికగారు భవానిగారిని పలకరించటానికి పైకి వెళ్ళారు .బెజవాడ నుంచి అక్కడి దత్తాశ్రమం లో పని చేస్తున్న రా౦బాబు గారి తమ్ముడి కూతురు వచ్చి ఉన్నారట .మిగతా వారంతా బయల్దేరి వస్తున్నారని తెలిసింది .జరగాల్సిన అన్ని ఏర్పాట్లు రెడ్డిగారే స్వయంగా చూస్తున్నారు .ఒకఅరగంట మేమిద్దరం ఉండి ఇంటికి వచ్చేశాం .భవానిగారమ్మాయి పాలకొల్లులో ఉన్న సీతకు ఫోన్ చేశా .అందరం వచ్చేస్తున్నామని చెప్పింది .నేను ఇంటికి వచ్చిస్నానం సంధ్య పూజ చేసుకొన్నాను .
నిన్న అంటే శనివారం ఉదయం సుమారు 10 గంటలకు భవానిగారు ఫోన్ చేసి ‘’మాస్టారూ !ఆయన పరిస్థితి ఏమిటోగా ఉంది కదలటం లేదు .మాట్లాడటం లేదు .బ్యా౦కి నుంచి డబ్బు తేవటానికి విత్ ద్రాయల్ ఫారం మీద సంతకం పెట్టారు .డబ్బు తేవటానికి మీమనవడిని పంపిస్తారా ?’’అని అడిగారు .’’డబ్బు అ౦తఅవసరం అయితే నాదగ్గర పదివేలున్నాయి .పంపనా ?’’అన్నాను .వెంటనే ‘’అక్కర్లేదు రెడ్డి గారి మనిషి వచ్చాడు .ఆతను ఈయనా కలిసి వెడతారు ‘’అన్నారు సరే అన్నాను .కాసేపయ్యాక ‘’ఇవాళ బ్యాంకి సెలవట.మీ దగ్గరున్న డబ్బు పంపండి .సోమవారం బ్యా౦కి లో తీసి మీకు ఇస్తాము ‘’‘’అనగానే మా మనవడు చరణ్ ,మనవరాలు రమ్య వెళ్లి నేనిచ్చిన పదివేలరూపాయలుభవానిగారికి ఇచ్చారు .ఇంట్లో అన్నం వండలేదట .రమ్య బియ్యంకడిగి అన్నం వండి వచ్చిందట .ఆతర్వాత మాకే వివరాలు తెలియలేదు . రాంబాబు గారు కులాసాగానే ఉన్నారని అనుకొన్నాం .ఆదివారం పైన చెప్పిన విషయాలు జరిగాయి .ఈ నలభైయేళ్ళ కాలం లో రాంబాబు గారు మమ్మల్ని కానీ, మేము ఆయన్నికానీ ఒక్క రూపాయ ఇచ్చిపుచ్చుకోవటం జరగలేదు .సోమవారం ఉదయం సీత నేను ఇచ్చిన పదివేలరూపాయలు ఇచ్చేసింది .అంటే రూపాయి ఋణం లేకుండా రాంబాబు గారు తనువుచాలించిన ధన్యాత్ముడు పుణ్యాత్ముడు .సోమవారం అస్తికలు కృష్ణానదిలో కలిపి సాయంత్రం భవానీ గారితో సహా అంతా పాలకొల్లు పెడతామని సీత చెప్పింది .మిగిలిన కార్యక్రమాలు పాలకొల్లులోనే అని కొన్నొరొజులయ్యాక ఉయ్యూరువచ్చి సామానంతా తీసుకు వెడతామని భవానిగారు తమతోనే పాలకొల్లు లో ఉంటారని చెప్పింది.ఇది మంచి వార్త.
నిక్కచ్చి నిజాయితీ ప్రతిరూపం రాంబాబుగారు
రెడ్డిగారితో సుమారు 50 ఏళ్ళనుంచి భవానిగారికి రా౦బాబు గారికి పరిచయం .ఈ దంపతులు పెదవోగిరాలలో ఉన్న రెడ్డిగారి దంపతులకు గొప్ప కుటుంబ స్నేహం .భవానిగార్ని రెడ్డిగారు ‘’గంగా ‘’అని అమిత ఆత్మీయంగా కూతురులా పిలుస్తారు .అలానే అన్ని విషయాలలో నూ ఉంటారు .వారి౦ట్లో యే కార్యక్రమం జరిగినా ఈదంపతులు, వీరింట్లో యే కార్యక్రమం జరిగినా రెడ్ది దంపతులు తప్పక సహకరించుకొంటారు .రెడ్డిగారు తన భార్యకు, ఆడపిల్లలకు యే కొత్త నగ నట్రా కొన్నా,అలాంటిదే భవానిగారికి కొనే ఆప్యాయత ,సంస్కారం రెడ్డిగారిది వీరమ్మాయి సీతకును కూడా అలాగే చూస్తారు ..ఊరగాయలదగ్గర్నుంచి అన్నీ అంతే.
రెడ్డిగారికి బీరువాలషాపు ఉంది.అది మొదట్లో పెద్దమసీదు దగ్గర ఉండేది అద్దెకు. తర్వాత ఇప్పుడున్న చోట రెండు అంతస్తుల భవనం కట్టి ఇక్కడికి మార్చారు .మేమంతా సాహితీ మండలి జరుపుతున్నప్పుడు సాయం వేళ రెడ్డి గారి శాపులోకూర్చుని ఆయన ఇచ్చే టీఆరగాఆరగా తాగుతూ సాహితీ చర్చాలు చేసేవాళ్ళం సినిమా కబుర్లు చెప్పుకోనేవాళ్ళం పజిల్స్ పూర్తి చేసేవాళ్ళం .మా బృందం లో నేనుకాక గూడపాటికోటేశ్వరరావు ,కేసిపిలో కెమిస్ట్ టివి సత్యనారాయణ ,రామల్క్ష్మణాచార్యులు,పీసపాటి కోటేశ్వరరావు ,సారధి వగిరాలు౦ డేవాళ్ళం . రెడ్డిగారికి వాయిదాలమీద డబ్బు కట్టి బీరువాలు తీసుకొనే విధానం ఉంది .ఆ వ్యాపార రహస్యాలు రా౦బాబు గారికే బాగా తెల్సు .కనుక ఆబాధ్యత రెడ్డిగారు రాంబాబు గారిమీదే ఉంచారు .ఈయన ప్రతిరోజూ ఉదయం షాపు తెరవటం ,రెడ్డిగారు వచ్చెదాకాఉండటం తర్వాత స్కూటర్ పై ఊళ్లు తిరిగి వాయిదాలు వసూలుచేసి రెడ్డిగారికి రసీదులతో సహా లెక్కఅప్ప చెప్పటం నిత్యకృత్యం .ఎక్కడా పైసా తేడాలేకుండా ఇంతకాలం నడిచింది .మధ్యాహ్నం నుంచి షాపు చూసుకోవటం .రెడ్డిగారు ఫైనాన్స్ కూడా చేస్తారు అంటే కావాల్సిన వారికి వడ్డీకి అప్పు ఇచ్చి వసూలు చేయటం. ఆబాధ్యతకూడా రా౦బాబు గారు పరమ నిక్కచ్చిగా నిజాయితీ గా చేశారు .ఒకరకంగా రెడ్డిగారు రా౦బాబు గారు’’ ఏకోదరులు ‘’అన్నట్లు గా వ్యవహరించారు .సుమారుఏడేనిమిది ఏళ్ళక్రితం బీరువా వ్యాపారం బంద్ చేసి ,పై అంతస్తులో రాంబాబు దంపతులు ఉండటానికి ఏర్పాటుచేసి ,తనుకింద ఫైనాన్స్ మాత్రమె చూస్తున్నారు. అయినా రా౦బాబు గారు లేనిది అడుగు ముందుకు వేయలేరు రెడ్డిగారు .అంతనమ్మకం .రా౦బాబు గారు నమ్మకానికి అమ్మ వంటివారు .
భవాని రాంబాబు గారి కుటుంబం
పాలకొల్లు దగ్గర ఉన్న ఉల్లం పర్రు గ్రామం రాంబాబుగారిది .ఆయన అక్కగారి కూతురు అంటే మేనకోడలు భవానీ గారి ని వివాహం చేసుకొన్నారు .సంతానం లేదు. ఆయన తమ్ముడి భార్య చనిపోతే వాళ్ల అమ్మాయి సీతను రాంబాబు భవానీ దంపతులు పెంచి విద్యాబుద్ధులు నేర్పి భవానీ గారి పినతండ్రికొడుకు కుఇచ్చి పాలకొల్లులోభవానిగారి తమ్ముడి ఇంట్లో అయన ఆధ్వర్యంలో వివాహం చేశారు .పెళ్ళికి మేమిద్దరం ఉయ్యూరునుంచి వెళ్లాం .రెడ్డిగారు కూడా వచ్చారు .ఆతను తర్వాత ఎల్ ఐ సి లో ఉద్యోగం సంపాదించి ఆఫీసరై స్వంతిల్లు కట్టుకొన్నాడుపాలకొల్లులో .వీరికి ఇద్దరమ్మాయిలు .ఇద్దరు ఉన్నత చదువులు చదివారు .పెద్దమ్మాయి పెళ్లి జరిపారు .
ఉయ్యూరులో రాంబాబు గారు కాటూరు రోడ్ గారు ఒక ఇల్లుకట్టి ఉన్నారు అక్కడికి మేము తరచూ వెళ్ళేవాళ్ళం .తర్వాత ఆయిల్లు అమ్మేసి ,కాపులవీది రామాలయం దగ్గర అద్దెకు ఉండేవారు .ఇక్కడికీ మేము వెళ్ళేవాళ్ళం .తరచూ ఆదంపతులు మాఇంటికి వచ్చేవారు .రాంబాబుగారి తమ్ముడికూతురు వివాహం బెజవాడ దత్తాశ్రమం లో జరిగితే మేమూ వెళ్లాం .భవానిగారి తల్లి గారు ఉయ్యూరు వచ్చినప్పుడల్లా మాఇంటికి వచ్చేవారు .బాగాపాటలు పాడేవారు .గొప్పదైవభక్తి ఉన్నవారు. ఆలక్షణం భవానిగారికీ వచ్చింది .రోజూ ప్రార్ధన చేసి పూజ చేస్తేకానీ వంట మొదలు పెట్టేవారుకాదు .దేవాలయాల దర్శనం మామూలే .రాంబాబు గారికి అంతగా భక్తి ఉండేదికాదు .కానీ ఆవిడను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్ళేవారు .సీత భర్త పిల్లలు కూడా ఊళ్లోకివస్తే, మా ఇంటికి రాకుండా వెళ్లరు .ఒకసారి కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద అభిషేకం ,సత్యనారాయణ స్వామి వ్రతానికి సీత దంపతులు భక్తిగా కూర్చుని చేశారు ముచ్చట వేసింది.వాళ్ల అమ్మాయికూడా కూడా ఉంది .మాఇంట్లో యేవ్రతం ఉపనయనం వివాహం వగైరా అన్నికార్యక్రమాలకు భావానీదంపతులు ,మల్లికా౦బగారు తప్పని సరి .రా౦బాబు గారు మాత్రం మాఇంట్లో ఎప్పుడూ భోజనం చేయలేదు .ఎప్పుడు అడిగినా ‘’నేను మీ ఇంట్లో భోజనం చేసే అర్హత కలవాడిని కాను ‘’అని తప్పించుకోనేవారు .ఆయనకు ఆమెతో కారియర్ పంపేవాళ్ళం .అదిమాత్రం తినేవారు .దంపతులు మాఇంట్లో ప్రతిఫన్క్షన్ కు వచ్చి మాకు నూతనవస్త్రాలు స్వీట్లు పళ్ళు ఇచ్చి మాఇద్దరి పాదాలకు వంగి నమస్కారం చేసి,ఆశేస్సులుపొ౦ది అక్షతలు వేయించుకోకుండా వెళ్లేవారుకాదు . అంతగౌరవం మా ఇద్దరిపైనా .భవానీగారి బహిప్రాణ౦ రా౦బాబు గారు రా౦బాబు గారి అంతర్ ప్రాణం భవానీ గారు .వారిద్దరూ ‘’జీవికాజీవులు’’ .ఒకరిపై ఒకరికి విపరీతైన ప్రేమ అభిమానం .చక్కని నవ్వుముఖంతో పలకరించేవారు .భావానీగారి నుదుట పెద్ద కుంకుమబొట్టు ,చేతులకు గాజులు సంప్రదాయ బద్ధంగా ఉంటారు .మంచితనానికి నిలువెత్తు అద్దం రాంబాబు గారు .
ఓర్వలేనిదేవుడు
ఇంత అన్యోన్యంగా ఉన్న భవానీ రాంబాబు దంపతుల కు దైవం అన్యాయం చేశాడు .రా౦బాబుగారికి సుమారుఆరునెలలక్రితం బైపాస్ జరిగింది .ఒకరకంగా ఇనుముకు చెదలు పట్టినట్లయింది .విలవిలలాడిపోయారు భవానిగారు .తర్వాత గుండెలో నీరు చేరిందని మూడు సార్లు తీశారట .ఇది ఇలాఉండగా భవానీగారు ఇంట్లో జారిపడి తు౦టిదగ్గర ఫ్రాక్చర్ అవటం ఆయన్ను మరింత కుంగదీసింది .తట్టుకోలేకపోయారు .అప్పటిదాకా భవానిగారే కనీసం వారానికి ఒకసారైనా మా ఆవిడకు ఫోన్ చేసి మాట్లాడేవారు .ఈ పరిస్థితిలో మేమే ఆవిడకు ఫోన్ చేసి ఇద్దరితోమాట్లాడేధైర్యం చెప్పేవాళ్ళం .ఆవిడ ట్రీట్మెంట్ కోసం బెజవాడ లో మూడుగదుల ఇల్లు అద్దెకు తీసుకొని మూడు నెలలనుంచి ఉంటున్నారు .కిందటినెల 26వతేదీ ఆదివారం బెజవాడ హనుంతరాయ గ్రంథాలయం లో సరసభారతి ప్రచురించిన40వపుస్తకం శ్రీ చలపాక ప్రకాష్ గారిపై ఉగాదికి జరిపిన కవిసమ్మేళనం కవితాసంకలనం ‘’సాహితీ ప్రకాశం ‘’ఆవిష్కరణ అయ్యాక భోజనాలు చేసి నేనూ శివలక్ష్మి ,గంగాధరరావు గారు కలిసి తిరుగుప్రయాణం లో దత్తాశ్రమానికి ఎదురుగా ఉంటున్న భవానీ రాంబాబు దంపతులను చూసి పలకరించి ధైర్యం చెప్పి వచ్చాం .ఒకవారం క్రితం భవానీగారు ఫోన్ చేసి తాము ఉయ్యూరు వచ్చేశామని అంతా బాగానే ఉందని చెప్పారు .చాలాసంతోషించాం .రా౦బాబు గారితోనూ మాట్లాడాం .ఇంతలో ఇంతటి ఉపద్రవం .భగవంతుడు రాంబాబు గారి ఆత్మకు శాంతి కలిగించాలని ,భవానిగారి కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాము .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-26-ఉయ్యూరు
6:17 PM (38 minutes ago)