శని రాత్రి –కవిత

      శని రాత్రి –కవిత 

        19-11-1977  శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి   స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత. 
          అనిలం తో అనలం కలిస్తే ,సర్వం పరశు రామ ప్రీతి 
          అనిలం తో జలం కలిస్తే ,మహోధృత ప్రళయం 
           అనిలం ,జలం ,అర్ణవం ముప్పిరి గొంటే మహోప ద్రవం 
           ప్రుధివ్యాపస్తేజో వాయురాకాశ పంచ భూతాలు 
           ఒక్క ఉదుటున విరుచుకు పడితే 
           ఊహాతీత మానవ మారణ హోమం 
           శని రాత్రి -నిజం గానే మన పాలిటి ”శని రాత్రి ”
           చిలికి .చిలికి గాలి వానయై ,కురిసి కురిసి కుంభ వ్రుస్టై 
           చాలదన్నట్లు ఉప్పెన పెన వేసుకు వస్తే 
           భూమి ,జలద( ధ)రించి ,భయకంపిత మైన వేళ 
           ఆకాశం ఆవులించి ,,బడబాగ్ని కీలలు నాలుక సాచితే 
           నమ్ముకున్న భూమి తొలగి పొమ్మంటే ,
           కమ్ముకున్న గాలి తోసి పారేస్తుంటే 
           కడలి గర్భం   చీల్చుకొని ,సహస్ర కరాలు సాచితే 
           మానవునికి చోటేదీ ,దారేదీ ,దిక్కేదీ?
           ఎన్ని వేల మానవ జీవితాలకు భరత వాక్యం పలికిందీ రాత్రి ?
           ఎన్ని లక్షల మూగ జీవాల ఆర్తనాదం నినదించీ రాత్రి ?
           ఎంత మందిఅభాగ్యుల కన్నీరు కాల్వలై 
           పొంగిన సాగర తరంగాలను ,వేనుకక్కు నేట్టిందీ కలి రాత్రి ?
           కళ్ళ ఎదుటే ,కట్టుకున్న వాడు కూలి పోతుంటే 
           చూస్తూ చూస్తూనే తన వాళ్ళంతా ఊడ్చుకు పోతుంటే 
           నిస్సహాయం గా ,నీరవం గా ,జడమైనిల్చి పోతుంటే 
           సర్వస్వం కోల్పోయిన అభాగ్య సోదరుల 
           కన్నీటి గాధలు వింటుంటే 
           సాధించిన అభ్యుదయ మంతా 
           సాగరమ్  నీళ్ళ పాలై పోతుంటే 
           దిక్కు లేక మనసు వ్రక్క లై పోతుంటే 
           ఓదార్చే వారెవ్వరు ?,అక్కున చేర్చే వారెవ్వరు ?
           ఎన్ని వేల కోట్లు ,ఈ దుఖార్తుల బాధలు తీర్చ గలవు ?
           ఎన్ని వేల అశ్రు కణాలు ,ఈ అభాగ్యుల క్షుధాగ్ని ని ఆర్ప గలవు ?
           ఎన్ని వేల చేతులు ,ఈ దారుణ మానవ ఖననం చేయ గలవు ?
                  ఏటా వచ్చే తుఫానే నేడు 
                  ఉద్ద్రుతమై ,మహోద్ధ్రుతమై 
                  ఒక్క రాత్రి లో సర్వం కబళించి 
                  తెల్లారే సరికి ,జీర్ణించుకోలేక ,వెలి గ్రక్కింది 
                  ఇది తెలుగు జాతి పాలిటి ఆశని పాతం 

               ఇది భారత జాతికే పెను సవాల్ 
                  సర్వ సభ్య సమాజానికే ఒక అగ్ని పరీక్ష 
                  కొండంత ధైర్యం, గోరంత సాయం 
                  ఉడతాభక్తి గా అందరం చేస్తే 
                  ఈ శ్మశానం పై మళ్ళీ వసంతం ప్రభవిస్తుంది 
                  ఈ శవాలపై నాగరకత వికశించి ,పరవశిస్తుంది  
                  ఈ ఉప్పు నీరు గంగా జల మౌతుంది 
                  ఈ కడలి పొంగు ,కంగు తింటుంది 
                  ఈ చేలల్లో బంగారం పూసి ,స ఫలం అవుతుంది 
                  ఈ నేల నాలుగు చెరగులా 
                   మానవత మళ్ళీ చిగురిస్తుంది .

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 –
          దిగంబర కవి నగ్న ముని దివిసీమ ఉప్పెన పై రాసిన  ”కొయ్య గుర్రం ”దీర్ఘ కవిత పుస్తకాన్ని శ్రీ దేవి నేని మధుసూదన రావు (తెన్నేరు )గారు నాకు ఇటీవల పంపగా చదివి ,నేను అప్పుడు రాసిన కవిత గుర్తు వచ్చి ,వెతికి మీకోసం అందించాను .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.