గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
377-సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి (1759-1846)
త్యాగరాజ స్వామికుటుంబానిది కర్నూలు జిల్లా కాకర్ల గ్రామం . కాని కుటుంబం తమిళనాడుకు వలస వెళ్ళింది .తమిళనాడు లోని తిరువారూర్ 1759లో జన్మించి ,కుటుంబం సంస్కృత విద్యాకేంద్రమైన తిరువయ్యూరు కు మారటం తో అక్కడే ఉన్నారు .తండ్రి రామబ్రహ్మం .తల్లి సీతమ్మ .కాకర్ల ఇంటి పేరు .మురికి నాడు వైదీకి బ్రాహ్మణులు .భారద్వాజ గోత్రం .చిన్నప్పుడే తలి దండ్రులను కోల్పోయాడు అన్న జపేశం అన్ని రకాలా హింసించాడు .సొంఠివెంకట రమణయ్య గారి వాద్య సంగీతమ అభ్యసించాడు ..శ్రీ రామ భక్తుడైన త్యాగయ్య రామ పంచాయతనాన్ని అను నిత్యం పూజించేవాడు అన్న దాన్ని కావేరి నదిలో విసిరేశాడు .రామానుగ్రహం వలన అవి లభించాయి .తెలుగులో ఆయన రాసిన వాటికి కృతులు అనిపేరు .అందులో పంచ రత్న కీర్తనలు చాలా ప్రసిద్ధమయ్యాయి .ముఖ్యం గా ‘’ఎందరో మహానుభావులు ‘’జగత్ ప్రసిద్ధమైన కీర్తన .
త్యాగయ్య సంగీత సాధనకు మెచ్చి నారదుడు ‘’సంగీత స్వరార్ణవం ‘’అంద జేశాడు .దాన్ని సాధన చేశాడు త్యాగయ్య .తంజావూర్ రాజు ఆశ పెట్టిన ధనానికి పదవికి ఆశపడలేదు .అప్పుడే ‘’నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా ‘’అనే కీర్తన రాశాడు .తీర్ధ యాత్రలు చేసి క్షేత్ర స్వాములపై గొప్ప కీర్తనలు రాశాడు .త్రిమూర్తులలోను రాముడినే దర్శించిన మహా రామ భక్తుడు త్యాగరాజు .అనేక వందల కీర్తనలు రాసిన త్యాగ రాజ స్వామి 1846 పుష్య బహుళ పంచమి నాడు సమాధి చెందాడు .ఆ రోజుననే తిరువయ్యూర్ లో త్యాగ రాజ ఆరాధనోత్సవం ఘనం గా జరుగుతుంది బెజవాడ నాగ రత్నమ్మ అనే సంగీత విదుషీమణి అక్కడ స్వామివారికి ఆలయం కట్టించి పుణ్యం కట్టుకొన్నది .నాదానికి ప్రతి రూపం త్యాగ రాజు .రాముడే ఆయనకు రక్ష.త్యాగ బ్రహ్మ అని పిలిచేవారు .సంగీత త్రిమూర్తులు త్యాగరాజు శ్యామాశాస్త్రి ,దీక్షితులు.ముగ్గురూ వాగ్గేయ కారులే . మహితాత్ములే .
ఒక రోజు రాముడు ఒక మహా రాష్ట్ర భక్తుడికి కలలో కనిపించి మహా భక్తుడైన త్యాగయ్యను దర్శించమని చెప్పాడట అతడు వచ్చి ఈ మహా భక్తస్వామి ని దర్శించి పులకించి అక్కడే ఉండిపోయి శిష్యుడైనాడట .ఆ సమయం లో ఆయన తోడిరాగం లో ‘’దశరధ నినునమ్మి నాను ‘’కృతి పాడాడు .ఉత్తరాది సంగీతాన్ని కూడా త్యాగయ్య బాగా అర్ధం చేసుకొన్నారని సంతోషించాడట .అందుకే త్యాగయ్య ‘’మరుగేలరా ‘’లోను ‘’మనము లేదా ‘’కృతిలోనూ వాటిని వాడాడు .అతినెమ్మదిగా మొదలయ్యే ‘’నమ్మిన వారిని’’కృతి నుండి అతి వేగం గా సాగే ‘’శోభిల్లు సప్తస్వర ‘’వరకు వైవిధ్యం తో రాశాడు త్యాగయ్య .గాయకుడికి సర్వాధికారాలతో సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే గొప్ప వీలు త్యాగయ్య కలుగ జేశాడు .త్యాగయ్య ముద్ర ‘’త్యాగ రాజ వినుత ‘’.
త్యాగ రాజు మొదట్లో రాసినవన్నీ ‘’నాట రాగం ‘’లో సంస్కృతం లో రాశాడు .’’నాదం తనుమనిశం శంకరం ‘’(చిత్త రంజని రాగం ),’’శంభోమహాదేవ శంకర గిరిజా రమణ (పంతువరాళి రాగం )’’సుందర సాహసకాంక౦ ‘’గిరిజాసుత (బంగాళ ) జానకి రమణ (సుధా సీమంతిని )శ్రీ రఘువర సుజన (భైరవి )శ్రీనాధ నాద (కానడ)ఈశా పాహిమాం (కల్యాణి )’’జగదానందకారక’’(నాట)శ్రీరఘువర (కాంభోజి)సామజ వరగమనా (హిందోళ)ఏహి త్రిజగదీశ (సారంగ ‘’) శివే పాహిమాం (కల్యాణి )(మొదలైన 21కృతులు సంస్కృతం లో కృతులు రాశాడు .
378-సంగీత శాస్త్ర సంక్షేపం రాసిన -గోవిందుడు (1550)
‘’సంగీత శాస్త్ర సంక్షేపం ‘’రచించిన గోవిందుడు వెంకట మఖి అభిప్రాయాలను తోసిరాజన్నాడు .ఇది స్కంద పురాణం లోనిదని సన్ముఖుడు రాశాడని చెప్పాడు .’’ఇతి స్కంద పురాణే సద్గ్రంధ చూదామణౌ-శంముఖావిరచితే ప్రధమోధ్యాయః ‘’
గోవిందుడు త్యాగ రాజు సిద్ధాంతాలను బలపరచాడు .అచ్యుత రాయల వీణను గురించి చెప్పాడు .అచ్యుత రాయలకాలం 1572-1614)
379-వైణిక శిక్షామణి -వెంకటవైద్యనాద దీక్షితులు (1735-1817)
తిరువాడ మరుదూర్ నివాసి వెంకట వైద్యనాధ దీక్షితులు వెంకటమఖి కి మనవడు ,సంగీతాన్ని ఆయన నుండి వారసత్వంగా పొందినవాడు .వీణ పై గొప్ప ఆధారిటీ ఉన్న వాడు .వెంకటమఖి రచన ‘’చతుర్దండి ప్రకాశ ‘’ను ఆవిష్కరించాడు .ఇతని శిష్యుడు రామ స్వామి దీక్షితులు గురువు వద్ద సంగీత విద్య నేర్చిగురువును ‘’వైణిక శిక్షామణి’’ణి చేశాడు . . ,వేంకటేశ్వరుని కొడుకైన రామ స్వామి మధ్యారణ్యం అని పిలువ బడే తిరువాద మరుదూర్ లోని గోవి౦దపురానికి చెందిన వాడు . తంజావూర్ లో వీరభద్రయ్య అనే గురువును చేరి ఆకాలం లో సంగీత విద్యలో సాటి లేని వాడని పించుకొన్నాడు .కాలం 1735-1817.’’తాళమాలిక ‘’రచించాడు.
రామ స్వామి చిన్న కొడుకు బాల స్వామి లేక బాల కృష్ణ దీక్షితులు 1780లో జన్మించి బాల మేధావిగా ప్రసిద్ధి చెందాడు .మద్రాస్ లోని మానాలి చినయ మొదలియార్ ఆశ్రయం వలన అనేక సంగీత వాద్యాలను అవలీలగా వాయించే అపూర్వ నైపుణ్యాన్ని సాధించాడు .పాశ్చాత్య సంగీతాన్నీ అభ్యసించాడు .సహజ మైన ఏ శబ్దాన్ని అయినా వీణ పై పలైకించే అద్భుత ప్రతిభ ఉండేది మనకాలం లోప్రముఖ వైణిక విద్వాంసుడు ‘’ చిట్టి బాబు’’ లాగా . .
ఎట్టియ పురం పాలకులు సంగీతానికి ఒకశాతాబ్ద కాలం అధిక ప్రాధాన్యం ఇచ్చారు .ఆకాలం లో జగదీశ్వర వెంకటేశ్వర ఎట్టప్ప(1816),,అతని వారసులు జగదీశ్వర రామ కుమారఎట్టప్ప ,జగదీశ్వర రామ వెంకటేశ్వర్లు సంగీతం లో అనన్య ప్రతిభా పాటవాలు చూపించి ప్రకాశించారు .వెంకటేశ్వర్లు ఆస్థాన కవి కూడా అయ్యాడు .ఇతని గురించి ‘’కవులలో యువ రాజు ,యువ రాజులలో కవి ,ఎన్నో కీర్తనలు, చూర్ణికలు దేవీ దేవతలపై రచించాడు .అతనిని ‘’కార్తికేయ అవతారం గా భావిస్తారు .’’అని చెప్ప బడింది . సంగీతం లో అతని మిత్రులు మీనాక్షి సుందరయ్య ,సుబ్బ కుట్టిఅయ్యర్ అననావి ,వెంగు భాగవతార్ మధుర రామయ్యర్ లు . ,
380- నవావరణ కీర్తనలు రాసిన -ముత్తు స్వామి దీక్షితులు –(1775-1835)
రామస్వామి పెద్దకొడుకు ముత్తు స్వామి దీక్షితులు 1775లో తమిళనాడు తిరువాలూర్ లో జన్మించాడు .చిదంబర యోగి తో ఉత్తర భారత పర్యటన చేసి తిరిగి స్వస్థలం లో నివాసమున్నాడు .చిదంబర యోగి సమాధి కాశీలో హనుమాన్ ఘాట్ లో చక్రలింగేశ్వర దేవాలయం సమీపం లో ఉన్నది .చివరికాలం లో ఎట్టియా పురం రాజుల ఆస్థానం లో ఉన్నాడు .ఎక్కడికి ఏ దేవీదేవతను సందర్శించటానికి దీక్షితులు వెళ్ళినా అక్కడ సంస్కృతం లో ఒక పాట రాసి ఆ దేవతకు గీత హారం గా సమర్పించేవాడు .తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి దీర్ఘ సమాధిలో ఉండిపోయాడు .’’కార్తికేయ మురుగ’’స్వామి అనుగ్రహించి నోటిలో కలకండ పెట్టాడు .అప్పుడే ఆశువుగా’’శ్రీనాదాది గురుగుహో ‘’అనే కృతి మా యామాళవ రాగం ,లో ఆశువుగా వెలువడింది .పంచ భూతాలపై ‘’పంచ లింగ కీర్తన ‘’రాశాడు కంచి జంబుకేశ్వర కాళహస్తి చిదంబరం అరుణాచలేశ్వరులపై రాసిన కీర్తనలు బహుళ ప్రచారం పొందాయి .అందులో కొన్ని అనర్ఘ రత్నాలు –‘భైరవి రాగం లో ’చింతయా మాకంద కందం ‘’యమునా కల్యాణిలో ‘’జంబూ పతే ‘’,సారంగ రాగం లో ‘’అరుణాచల పతే ‘’,ఉసేని రాగం లో ‘’శ్రీ కాళ హస్తీశం’’,కేదారలో ‘’ఆనంద నటేశం ‘’,ముత్తుస్వామి దీక్షితుల కృతిలో ముద్ర ‘’గురు గుహ ‘’
నవగ్రహాలపై రాహువు కేతువు మీద తప్పించి మిగిలిన వారిపైనా , ‘’నవావరణ కీర్తనలు ‘’పేరుతొ మాయవరం అమ్మవారిపైనా ,,తిరువారూర్ లో సకల దేవతల మీద కీర్తనలు గుప్పించాడు .అక్కడి త్యాగ రాజ శివునిపై ‘’బేగడ రాగం లో ‘’త్యాగ రాజ నమోస్తుతే ‘’చాలా ప్రత్యేకత పొందింది .తిరువారూర్ లోని ‘’కమలాంబ ‘’దేవిపై దీక్షితులకు ప్రత్యెక అభిమానం .ఆమెపై నవావరణ కీర్తనలు రాసి అమ్మవారి అనుగ్రహం పొందాడు .ఆమెపై పదకొండు సార్లు కీర్తనలు పాడాడు .నీలోత్పలా౦బిక ,వినాయకులపై అద్భుత కీర్తనలు రాశాడు .అందులో ‘అక్కడి ఈశాన్యం లో ఉండే గణపతి పై శ్రీ రాగం లో రాసిన కీర్తన ‘’వాతాపి గణపతిం భజే ‘’ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది .అలాగే గౌళ రాగం లో ‘’శ్రీ మహా గణపతిం భజే ‘’,శ్రీరాగం లోనే ’’శ్రీ మూలాధార చక్ర వినాయక ‘’అనే కీర్తనా రచించాడు .ఇది త్యాగ రాజ ఆలయం లో ముందుభాగం లో ఉన్న వినాయకుని పై రాసినది .తిరువారూర్ ,అచలేశ్వర ,ఆనందేశ్వర ,సిద్దేశ్వర దేవులపై రాసిన కీర్తనలు రస గుళికలే .సావేరి రాగం లో ‘’శ్రీ రాజ గోపాల ‘’,భైరవి లో ‘’బాల గోపాల ‘’కీర్తనలు ప్రముఖమైనవి .
కీర్తనలలో తన వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రదర్శింప జేశాడు దీక్షితులు .అద్వైత సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నాడు .వేదోపనిషత్ సారాన్ని కీర్తనలలో నింపాడు .సంగీతం తో సాహిత్యం జమిలిగా ప్రవహించటం దీక్షితుల ప్రత్యేకత .మంత్రాలతో దైవాన్ని పూజించలేనివారికి ఈ కీర్తనలు ముక్తి మార్గాన్ని ప్రసాది౦చేట్లు చేసిన సంగీత వాగ్గేయ కారుడు దీక్షితులు .కర్నాటక సంగీత త్రయం లో ఒకడై భాసి౦చాడు .ఆయన నవగ్రహ కీర్తనలు మాస్టర్ పీస్ అని పిస్తాయి ఇందులో భక్తీ ,ఆరాధనా కనిపిస్తాయి .విభక్తి కీర్తనలు ఆయన ప్రత్యేకం .
తంజావూర్ లో నాట్య ప్రసిద్ధులైన’’శివనాధం ,పొన్నయ్య ,చిన్నయ్య ,వడివేలు అనే నలుగురు దీక్షితుల వద్దకు వచ్చి సంగీతం నేర్పమని కోరారు. వారికితన గురువువెంకటవైద్యనాధ దీక్షిత్ నేర్పిన డెబ్భై రెండు మేళకర్తల సాంప్రదాయాన్నిసవివరంగా నేర్పాడు . నేర్చుకొని సంతోషించిన ఆశిష్యులు గురువుకు కృతజ్ఞతగా ‘’నవ రత్నమాల ‘’రాసి అంకితమిచ్చారు .ఈ నలుగురు శిష్యులను ‘తంజావూర్ సంగీత చతుస్టయం’’అంటారు ‘’.వీరు భరత నాట్యానికి గొప్ప సంగీతం అందించారు .వీరిలో పొన్నయ్య ,చిన్నయ్యలు తిరువాన్కూర్ మహా రాజు స్వాతి తిరుణాల్ ఆస్థాన సంగీత విద్వా౦సులయ్యారు . పొన్నయ్య అన్నామలై యూని వర్సిటి సంగీత కాలేజి ప్రిన్సిపాల్ కూడా అయ్యాడు .
పాశ్చాత్య సంగీతాన్నిసెయింట్ ఫోర్ట్ జార్జి కోట లో విని నలభై గీతాలను ఆ జానపద బాణీలలో కూర్చాడు. శంకరాభరణం వంటి రాగాలలో వీటిని మిశ్రితం చేశాడు . దీనినే ఇప్పుడు ‘’నొట్టుస్వర సాహిత్యం ‘’అన్నారు .ఇందులో సెల్టిక్ ,బారోకీ శైలులు ‘’సఖీ సహిత గణపతిం ‘’కృతిలో ,’’వరశివబాలం ‘’లో కనిపిస్తాయి .వీటిని కడప జిల్లా కలెక్టర్ ,ఆంద్ర భాషా సేవకుడు సి పి బ్రౌన్ కోరికపై చేశాడని అంటారు .కాని ఈ ఇద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు కనుక అసంబద్ధం అన్నారు .బ్రౌన్ మద్రాస్ కు 1817లో వచ్చి తెలుగును 1820లో నేర్చుకొన్నాడు .ఆ ఏడాదే కడప కలెక్టర్ గా వెళ్ళాడు .
దీక్షితుల మరణం అకస్మాత్తుగా జరిగింది .ఎట్టు పాలెం లో 1835లో దీపావళి రోజు శిష్యులుఆయన గమక క్రియ ను పూర్వ కల్యాణి రాగం లో ‘’మీనాక్షి మే ముదం ‘’కీర్తనలో గానం చేస్తుండగా వింటూ తన్మయం చెంది మరోసారి పాడమని అడిగాడు .వారు అనుపల్లవి’’మీన లోచన పాశ మోచన’’శివే -ను ఆలాపిస్తున్నారు .అమ్మవారు స్వయంగా తనను విముక్తుడిని చేస్తోందని భావించాడు .ఆకీర్తన వింటూనే కళ్ళు మూసుకొని తుదిశ్వాస వదిలి అమ్మ సాన్నిధ్యం1835లో చేరు కొన్నాడు .ఆయన సమాధి ప్రసిద్ధ తమిళ దేశ భక్తకవి సుబ్రహ్మణ్య భారతి సమాధి ప్రక్కన కాలిపట్టి తూట్టికోరిన్ మధ్య ఉన్నఎట్టుపాలెం లో ఉన్నది .
381- శ్యామ శాస్త్రి (1762-1827)
త్యాగ రాజు సమకాలికులలో దీక్షితులతో బాటు ఉన్నవాడు శ్యామ శాస్త్రి .సంగీత త్రయం లో ఒకడు .ఎక్కువ కీర్తనలు తెలుగులోనే రాశాడు . కానీ సావేరి రాగం లోసంస్కృతం లో ‘’రాసిన ‘’శ౦కరి ‘’కీర్తన తలమానికం .తిరువారూర్ లోనే కర్నాటక సంగీత త్రయం జన్మించారు .ఇందులో త్యాగరాజు పెద్దవాడు.ఎక్కువ కాలం జీవించాడు .రెండు శ్యామ శాస్త్రి మూడవ చివరి వాడు దీక్షితులు జీవితకాలం తక్కువే ..దీక్షితులే ఎక్కువకాలం తిరువాయూర్ లో ఉన్నాడు .త్యాగరాజు తిరువయ్యార్ చేరాడు .ఇది పంచనదీ క్షేత్రం .శ్యామ శాస్త్రి తంజావూర్ చేరుకొన్నాడు .ఈ సంగీత త్రయం కావేరీ నదీ తీరాన్ని పవిత్రకర్నాటక సంగీత సారం తోమరింత పవిత్రం చేశారు .
శ్యామ శాస్త్రి 1762-1827 కాలం వాడు .విశ్వనాధ అయ్యర్ వెంగ లక్ష్మి దంపతులకు 12-4-1762లో జన్మించాడు .ఔత్తరవాదామ అనే తమిళ బ్రాహ్మణుడు .తండ్రి విశ్వనాధుడు ,ఆ పై తరాల వారు ‘’బంగారు కామాక్షి దేవి ‘’అర్చకులు .శ్యామ శాస్త్రి అసలు పేరు వెంకటసుబ్రహ్మణ్యం.శ్యామ శాస్త్రి శిష్యగణం తక్కువే మిగిలిన ఇద్దరు వాగ్గేయ కారులకంటే తక్కువ కృతులే రాశాడు కాని అవి ప్రసిద్ధి చెందాయి .అయన కృతులలో ముద్ర ‘’శ్యామ కృష్ణ ‘’.రత్నత్రయం ‘’అనే మూడు స్వరజతులను కూర్చాడు .అవి భైరవి యదుకుల కాంభోజి తోడి రాగాలలో ఉన్నాయి .అవే ‘’కామాక్షి అనుదినము’’ ,కామాక్షిపదయుగమే ,’’రావే హిమగిరి కుమారి ‘’మొదటి రెండు మిశ్ర చాపు తాళం లో ,మూడవది ఆదితాళం లో ఉంటాయి .సంక్లిష్ట తాళ రచన శ్యామ శాస్త్రి ప్రత్యేకత .అందుకే ఆయనను ‘’తాళ ప్రస్తార శ్యామ శాస్త్రి ‘’అంటారు .అరుదైన రాగాలలోకాక ,అందుబాటులో ఉన్న రాగాలలో కృతులు చేయటం ఆయన కిష్టం .ఈయన కుమారుడు సుబ్బరాయ శాస్త్రి తండ్రితో బాటు మిగిలిన ఇద్దరు వాగ్గేయ కారుల వద్దా సంగీతం నేర్చాడు ఈయన ముద్ర ‘’కుమార.శ్యామ శాస్త్రి పెంపుడు మనవడు ’’అన్నస్వామి శాస్త్రి కూడా సంగీతజ్ఞుడే .
శ్యామ శాస్త్రి సంస్కృత కృతులు –సావేరి రాగం లో ‘’శంకర శంకర చారుముఖీ ‘’,పున్నాగ వరాళి లో ‘’కనక శైల విహారిణీ ‘’,
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-15 –ఉయ్యూరు


గత కొన్ని రోజులుగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 అనే శీర్షిక న మీరు రాస్తున్న విషయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ ఎక్కడ సంపాదిస్తున్నారు . చాల చాల మంచి విషయాలు
LikeLike