చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో
అముల్యాభరణం
“శంకరాభరణం“
|
నేపధ్య సంగీతం :
శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ, నేత్రానంద రస స్ఫోరక కళా భిజ్నత . ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం . శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పాదాల ల సవ్వడిలో మంద్రగానం ధ్వని0ప జేయటం అతని లోని కళాభిజ్ఞతకు ,నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది . తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే ” అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ ఊహ కు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాట ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని దృష్టి . ”శ్రీ రమణీ కుఛ దుర్గ విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట. మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది . ఇది మహ దేవన్ విశ్వనాధ్ ల అపూర్వ భావ సంయోగ ముక్తా ఫలం .
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి గాం భీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం శంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయేటట్లు జీవి0 చేట్లు నటించాడు” కలెక్టర్” సోమయాజులు . అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం, నేపధ్యం గా సాయ పడింది . అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత. సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుందా తనం అనితర సాధ్య మనిపించాడు . అదో తపస్సు గా ,యోగ సమాధి గా నిర్వహించాడు.”నట సోమయాజి ”అనిపించాడు .
అసలు ఆ పాత్ర ఏమి చెప్పదు .అ0తా మనం ఊహించు కోవలసిందే .ఊహా సామ్రాజ్యమే. అంతా . వ్యంగ్య వైభవమే .”లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను . నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ charector ను విశ్లేషిస్తుంది . తులసి రైల్ ఎక్కేటప్పుడు, మైసూర్ లో పరాభవం జరిగినప్పుడు, ఎక్కడా తొణకడు , బెణకడు ఎవర్ని ఏమీ అనడు ,తులసి తాను హత్య చేసి వచ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తొట్రుపడడు . .
తనకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయనా విచారించడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితే ఆ గంభీరం వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది .అది సంస్కార చేతన . అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు అందనిది అంత ఉత్తమమైనది . .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర శి ష్టాచార పరాయణు డైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత సాహిత్య మూర్తి అందించే సారాంశం . .సంగీతానికి భాష, భేదం లేదని ,అది ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic గా ఒక కలెక్టర్ హుందా తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ,ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి కూతురు వెన్న రాస్తుంటే సుజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయిన హృదయం ,తేలిక పడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన శిఖరారోహణం చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశం .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవత మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన ,అదే నటన అనిపించింది . సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యడయాడు
చివరి సీన్ లో ”దొరకునా ఇటువంటి సేవ ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత కు ,నా నమోవాకాలు ఆ ళాభిజ్ఞతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లావితమౌతుంది . బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసులో .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు . అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవదరించరా ,,విని తరించరా ”అని అనిపించిన పాత్ర అది . తెలుగు చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విశ్వనాధ్ కళా విశ్వ నాధ్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా విశ్వనాధ్ సృష్టికర్తగా ,కళా నరాజనాలు అందుకొన్నారు . ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతుందో తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి న మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుందని ఎవరూ ఊహించలేక పోయారు ఊహించలేదుకూడా . .ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో కాసేపే నాట్యం చేసినా బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విశ్వనాధ్ చేతిలో మనోజ్ఞ మనోహర శిల్ప మూర్తిగా గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .ఉన్నా చాల పొదుపు .అంతా సాత్విక అభినయమే .ఊహాలోక సంచారమీ . .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చత . అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకా లకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు, శంకర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట గట్టి నపుడు, ,తిట్టినపుడు, ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ నివారించుకోవటం చాలా కష్టమే .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .శం కర శాస్త్రి రాగానికి తాను భావించిన, ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్రాలుగా దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలు పరమ మనోహరాలు. శంకర శాస్త్రికి సన్మానం జరిగేటప్పుడు ఆమె కళ్ళు కృతజ్ఞతా భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మవుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది.మనసులో చెరగని ముద్ర వేసింది . .
”బ్రోచే వారెవరురా ”పట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు, సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరా ననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆనందం తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంతృప్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శంకర శాస్త్రిని చూపిస్తూ చిరిగిన పంచె లోంచి flashback లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత గొప్పదో ఆమె చూపిన చూపుతో అర్ధమవుతుంది . అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె ఆత్మానందాన్ని ప్రతీక .
జమీన్ దారును హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆధనాకృతి ఆకృతి గా నిలబడాలన్న తపన అది .తనమూలం గా శంకరశాస్త్రికి మరింకే కళంకం రాకూడదనే ఆరాటం . ఒక మూగమనసుగా మనసున్న వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose చేసిన కళా తపస్వి విశ్వనాధ్ పరిశీనా దృష్టికిహట్స్ ఆఫ్.
అల్లు రామ లింగయ్య :
శి వునిహృదయం మాధవునికి మాధవుని మనసు శంకరుడికి తెలుసు . సృష్టి లో తీయనిది స్నేహం . అది యెంత విషమ పరిస్థితులలో అయినా పరిక్షలకు తట్టు కొని నిలబడుతుంది . .ఆ స్నేహ బంధం వీడదు .వాడదు శంకర మాధవులు దేవతా స్వరూపులుగా స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా శంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్రధారికి కూడా గర్వ కారణం .అల్లు రామలింగయ్య లోని కళా జీవి ధన్యుడయాడు ”వాడెంత ?నేను గట్టిగా కన్నెర్ర జేస్తే గడగడ లాడ్తాడు ” అంటాడు శాస్త్రి ఎదురుగా లేనప్పుడు . అలా డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కళ్ళు నేలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్కా పోతాడు .
ఇలా యెంత చెప్పినా తరగనిగని , ఘని శంకరాభరణం . చూసి పులకి0చా ల్సిందేకాని , చెప్పి ,మెప్పించలేము.అయినా ఇదొక చిన్న ప్రయత్నం .
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03- 99 న స్వర్గీయ శ్రీ వేటూరిసుందరరామ మూర్తి కృష్ణా జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకళ్ళే పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నే చూపించాను. చదివి బాగుంది అని నా పుస్తకం లో ఆ కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం.
కళాతపస్వి రాజర్షి శ్రీ కాశీనాధుని విశ్వనాధ్ కు కేంద్ర ప్రభుత్వం ”దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ”అంద జేసి చాలా నెలలు అయినా ,ఆ వ్యాసాన్ని దుమ్ముదులిపి మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా ,
|
|
—

