’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10

’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10

అమోఘ ఆదునికత

 ఏవో నాలుగు బొట్లేరు ఇంగ్లీష్ ముక్కలునేర్చుకొని ఆధునిక వ్యామోహం లో పడిన ఆనాటి యువకులు విద్యావంతులు తలిదండ్రుల అధికారాన్నీ ,కులతత్వాన్నీ ధిక్కరించి త్వరలోనే పశ్చాత్తాపం పొందారు .ఇవన్నీ ఫకీర్ గమనిస్తూనే ఉన్నాడు .ఈ నేపధ్యం లో ‘’ప్రాయశ్చిత్త ‘’నవల రాశాడు .కథ-కటక్ తాలూకా లో ఒక సంకర్షణ మహ౦తి ధనికుడై ,జమీకొని ఆధునికడయ్యాడు .ఆ జమీకి దగ్గరలో డాబు దర్పాల  వైష్ణవ పట్నాయక్ ఉండేవాడు .ఇతడితో సమానంగా సమాజం తనను గుర్తించాలని సంకర్షన్ ఆలోచన .నడి మంత్రం సిరి తో ఉన్న ఇతడంటే పట్నాయక్ కు ఇష్టం లేదు .ఇంగ్లీష్ రాణి పట్నాయక్ తన కొడుకు గోవింద చంద్రను ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కటక్ పంపాడు  .తెలివి తేటలతో అతడు అందర్నీ మెప్పించి కవిగా గుర్తింపు పొందాడు .ఒరియా ఆశా దీపకుడిగా భాసి౦చాడు .అనేకచర్చా కార్యక్రమాలలో  మహ౦తి మేనల్లుడు రాజీవ లోచన ఇతడూ బాగా దగ్గరయ్యారు .అందమైన మహ౦తి కూతురు ఇందుమతి ని  గోవింద్ కు ఇప్పించి పెళ్లి చేయించాలని రాజీవ ఆలోచించాడు  .మేనమామకు నచ్చ జెప్పాడు .

  డార్వేనియన్ పన్నుగడ

ప్రతి ఫలాపేక్షకోసం మిడిమిడి జ్ఞానం కలవారు ఏపనైనా చెయ్యగలరు అనేదానికి ఉదాహరణగా ఫకీర్ ‘’ప్రాయశ్చిత్త ‘’నవల రాశాడు .రాజీవ కమల లోచనుడు అనే యువకుడిని పట్టుకొని సహజ ఎంపికకు సంబంధించిన డార్విన్ సిద్ధాంతం పై ఒక వ్యాసం రాయించాడు .గోవింద అధ్యక్షతన జరిగిన ‘’ఆలోచన సభ ‘’లో దీన్ని చదివాడు .కులాలతో సంబంధం లేకుండా జీవిత భాగస్వాములను ఎన్నుకోవటం జన్మ హక్కు అనే  సిద్ధాంతం సభలో ఆమోదించారు .

  సంఘంలో చిన్న చూపు కు గురౌతున్న మహానటి కుటుంబం తో వివాహం చేసుకోవాలని గోవింద ఆలోచించాడు .ఇది పట్నాయక్ కుటుంబానికి తెలిసి వారి కుటుంబ జీవితమే భగ్నమయింది  .అప్పటినుంచి తలిదండ్రులను కలవనీయకుండా  రాజీవ ప్రయత్నించాడు .మరణ శయ్యమీద ఉన్న తల్లి ఒక్కసారి చివరి చూపుగా కొడుకును చూడాలను కొని తెలిసి గోవింద బయల్దేరగా ఆపే ప్రయత్నం రాజీవ చేసి ఇందుమతి తో భావోద్వేగ పద్యాలు రాసి ,ఆమె తో సంతకం పెట్టించి గోవిందుడికి ఇస్తే ,అతడు ఆపద్యాలకు భావావేశంపొంది ,తల్లిని చూడకుండా భార్యదగ్గర కు బయల్దేరాడు .

  రాత్రి చీకటిలో మామగారిల్లు చేరాడు .వర్షాకాలం ఆ చుట్టుప్రక్కల కొన్ని దొంగానాలు జరిగాయి .ఆమెను ఆశ్చర్య పరచాలని ఆమె కిటికీ తట్టగా దొంగాలేమో నని దాసీ గట్టిగా అరవటం ప్రారంభించేసరికి అందరు ఆచీకట్లో గోవింద్ దొంగ అనుకోని పట్టుకొని కాళ్ళూ చేతులు కట్టేసి నది వడ్డున పడేసి వెళ్ళిపోయారు .తెల్లారే సరికి విషయం తెలిసి గోవింద్ ను కటక్ ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించారు .భర్తకు  జరిగిన అవమానం తెలిసి భరించలేక భార్య ఇందుమతి నదిలోకి దూకి ఆత్మ హత్య చేసుకొన్నది .తన దర్జాలకు గర్వ పడే పట్నాయక్, అలాంటి దర్జాలకు వెంపర్లాడే మహ౦తి భ్రమలు చెదిరిపోయాయి .ఒకరికి తెలీకుండా ఈ ఇద్దరూ సన్యాసం తీసుకొన్నారు .నయమైన గోవింద్ కూడా అదే ఆలోచనలతో ఇంటికి బయల్దేరాడు .

  కాషాయ వస్త్రాలతో ఉన్న ఈ ముగ్గురు మధురలో కలిశారు .పట్నాయక్ మహా౦తీలు  ప్రాణ మిత్రులయ్యారు .జమీన్ చూసుకోమని గోవింద్ ను పంపగా అతడు రెండు జమీన్ ల ఆదాయాన్ని ప్రజాభ్యుదయ పధకాలకు ఖర్చు చేశాడు .అవివాహితుడుగా ఉండి పోయాడు .ఈ నవలను చనిపోవటానికి మూడేళ్ళ ముందు ఫకీర్ రాశాడు .తాను  పొందిన విజ్ఞానాన్ని ఇలాసృజనాత్క్మకతకు వినియోగించాడు .తెలుగు పండితుడైన రంగా భట్ట వెంకట పంతులు చేత సంస్కృత శ్లోకం లో ‘’దర్శనాలు , వేదాలతో బాటు జన్మ జన్మలకూ మూడు దివ్య వరాలు –పులుపు ,కారం ,పుల్లమజ్జిగా  నాకు లభించు గాక ‘’అని రాయించాడు ఫినిషింగ్ టచ్ గా ..ఒరిస్సా జనజీవితానికి అద్దంపడుతూ ,ఆనందం ఆత్మౌన్నత్యం కలిగించే రచనలు చేశాడు సేనాపతి .

13-అచ్చమైన భారతీయత వికసించిన పుష్పం

 ఆధునిక హిందూసాహిత్యం లో ,నిజమైన భారతీయ గ్రంథాలలో  ఫకీర్ రాసిన ‘’లచ్చుమ ‘’ప్రప్రథమమైనది .భారతీయత ప్రతిబింబింప జేసే రచయితలూ కొద్దిమందే ఉన్నారు .బంకిం చద్రుని వదిలేస్తే ,రవీంద్రుని రచనలు కేవలం బెంగాలీ లేక హిందూ స్థాయినిఅధిగమిచలెదు .ఈ కోణం లో చూస్తె 80 ఏళ్ళక్రితం ఫకీర్ రాసిన  ‘’లచ్చుమ ‘’నవల  భారతీయ వాజ్మయంలో గణనీయమైన రచన .క్లుప్తంగా కథ-18వ శతాబ్ది చివరలో కొందరు జగన్నాథ తీర్ధయాత్రకు బయల్దేరగా  మరాఠా రౌతులు ఆకస్మికంగా దాడిచేసి సర్వస్వం దోచుకొని పారిపోతే ,ఆ చీకటిలో తాము ఎక్కడ ఉన్నారో తెలియక దగ్గరలో ఉన్న రైబానియా కోట  శిధిలమై అడవిలో కప్పబడి బాలాసోర్ జిల్లా జలేశ్వర్ పట్టణానికి రెండు మైళ్ళ దూరం లో కనిపిస్తాయి .అప్పుడు ఆకోట ‘’సామంతరే రాఘవ రాట్సింగ్ బైరి గంజన మాంధాత ‘’అనే ప్రముఖ ఖా౦డాయత్ నాయకుని అధీనంలో ఉంది .ముస్లిం లు,మరాఠాలు ఇతని సహాయం కోరేవారు .మానవత్వం సంస్కారంతో రాజదంపతులు అందరి అభిమానం పొందారు .సాహస వంతులైన’’ రైబెనియా పైక్స్ యోధులు’’ తనకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా  నవాబు ఆలీవర్దీ సువర్ణ రేఖా తీరం పొడవునా  పేరుపొందిన బార్గీ నాయకుడు భాస్కర్ పండితుని నాయకత్వం లోని మరాఠా వీరులపై దాడి చేశాడు .

  మర్నాడు ఉదయం రాజ సభలోకి ఒక అందమైనపల్లెపడుచుని తీసుకు రాగా ,ఆమెనుఎన్ని రకాలుగా ప్రశ్నించినా ,సమాధానం చెప్పకపోతే అంతఃపురంలో తల్లి రాణీ వద్దకు పంపాడు .క్రమంగా ఆమె మరాఠాల బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ‘’లచ్చుమ ‘’అనే పల్లెపిల్ల అని తెలిసింది .రైబాకోటలో దొరికిన ఆమె రక్షణ ఎంతో కాలం నిలవలేదు .ఆలీ వర్దీకి వ్యతిరేకంగా మరాఠా నాయకుడు పండిట్ షియో శంకర్ మాలవీర  ఈ ఖండా నాయక సాయం కోసం ఈ కోటకు వచ్చాడు .చెప్పే మాటలకు చేసే ఆకృత్యాలకు పొంతన లేని మరాఠా వారికి సాయం చెయ్యను అనగా నిరాశతో వెళ్ళిపోయాడు .కానీ పగతీర్చుకోవాలనుకొన్నాడు .

  ఖా౦డాయత్ కు గుణపాఠం చెప్పటానికి నాగపూర్ నుంచి పెద్ద సిపాయీల దండు వచ్చి,అకస్మాత్తుగా దాడి చేయగా ,చారిత్రాత్మకమైన కోట పడిపోయింది .అందరూ మృత్యువాత పడ్డారు .లచ్చుమ కొంగుకు కొన్ని బంగారు నాణాలు కట్టి ,కోట నుంచి తప్పించి,రాణి ఆత్మహత్య చేసుకొన్నది .వనమాలీ వాచస్పతిని అతని బ్రాహ్మణ్యం కాపాడింది .మరాఠాలు విజ్రుమ్భించి ఆలీసేనను బెంగాల్ దగ్గర కట్వా వరకు తరిమేశారు మూడేళ్ళు సాగిన ఈ యుద్ధంలో ఇరు పక్షాలవారు నీరసపోయారు .రాయబారాలు సాగించారు .ఈలోగా తమలపాకులు అమ్మే ఒక కుర్రాడు మరాఠాలకు దగ్గరయ్యాడు .ఆలీవర్దీ కొత్త సేనాని బాదల్ సింగ్ బాగా పేరు తెచ్చుకొన్నాడు .అతడు ఒకసారి ఆలీ వర్దీని కాపాడాడుకూడా  .

  రాయబారానికి కాట్వా లో సిల్క్ గుడారంలో జరిగే చర్చలకు భాస్కర పండితుడు వీరోచితంగా ప్రవేశించాడు .నవాబ్ ఆలీ వర్దీ హార్దిక స్వాగతం పలికాడు .ఇద్దరూ గట్టిగా కౌగిలిచుకొన్నారు .ఇంతలో ఇద్దరు వ్యక్తులుఅకస్మాత్తుగా ప్రవేశించి భాస్కర పండితుడిని కత్తులతో పొడిచి చంపేశారు .ఇందులో ఒకడు తమలపాకుల కుర్రాడు మరొకడు ,ఆలీ వర్దీ అంగరక్షకుడు బాదల్ సింగ్ .బాదల్ ఆజ్ఞతో ఆలీ సైన్యం విజ్రుమ్భించి మరాఠాలను సర్వ నాశనం చేసింది .ఈ హత్యకు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఆలీ ఖుషీ అయ్యాడు .బాదల్ సింగ్ ను బెంగాల్ లోని వన విష్ణు పూర్  పరగణా కు రాజుగా ప్రకటించాడు .తమలపాకులకుర్రాడికీ ఏదో బహుమతి ఇవ్వాలనుకొన్నాడు .అతడు నిండు సభలో తన సోదరిని బాదల్ పెళ్లి చేసుకోవటమే తనకు ఘనమైన కానుక న్నాడు .దీన్ని బాదల్ సింగ్ తిరస్కరించాడు .తనకు పెళ్లి అయి భార్య ఉందని చెప్పాడు .

  కానీ రాత్రికి రాత్రే తమలపాకులకుర్రాడు బాదల్ ముర్షీదా బాద్ నుంచి మాయమయ్యారు .గయలోని పవిత్ర ఫల్గు నది తీరం లో ఇద్దరు వృద్ధ స్త్రీలు  దూరం నుంచి పురోహితుని అనుసరిస్తూ’’ ధెన్ కల్ వర్మకుమార్తె లచ్చమ నైన నేను’’—అనే మాటలు విని దిగ్భ్రాంతి చెందారు .సరిగ్గా అప్పుడే ‘’హరిభజ సింగ్ వర్మ కుమారుడు బాదల్ సింగ్ నైన నేను ‘’అనే మాటలు రెండవ వైపు నుంచి విన్నారు .ఆ వృద్ధ వనితలు ఆనంద బాష్పాలు రాలుస్తూ ‘ఆయువతీయువకులను ఆప్యాయంగా గట్టిగా అక్కున చేర్చుకొని ‘’భగవాన్ ! నా చిట్టి తల్లి లచ్చమ్మ కదూ ‘’రామచంద్రా ! వీడు నాప్రాణానికి ప్రాణం బదలుడు ‘’అంటూ  అస్పష్టంగా గొణిగారు. దేనుకల్ సింగ్ ,హరిభాన్ సింగ్ లు ఇద్దరూ ఉత్తర ప్రదేశ్ లోని రోహిత్ ఖండ్ ప్రాంత రాజపుత్రులు .యువకులుగా ఉన్నప్పుడు ముస్లిం దొంగలతో చేతులు కలిపారు .వారి భార్యలు పవిత్ర హిందూస్త్రీలు కావటంతో వారు ఒప్పుకోలేదు .అందులో ఒక జ౦ట కు బాదల్, మరో జంటకు లచ్చుమ జన్మించి, వీరి వివాహలతర్వాత రెండు కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి .భర్తలను మార్చి మంచి దారిలో పెట్టారు .రైబానియా, ముర్షిదా బాద్ ,వన  విష్ణుపూర్ ల వైభవాలతో పాటు ,లచ్చుమ బాదల్ మరణం తర్వాత అన్నీ కాలగర్భం లో కలిసిపోయాయి .నవల చివరలో ఫకీర్ ఒక సంస్కృత శ్లోకం చేర్చాడు దాని భావం –‘’యాదవ రాజు వదిలి పోగా ఎక్కడుంది ఆనాటి మధుర ?రఘుపతిరాముడు గతించాక ఎక్కడుంది కోసలభాగ్యం ?ఏనాటికీ నశించక ఏ ఒక్కటీ నిలవదు-అది తెలిస్తేనే శాంతి నీకు ‘’ అని కాలం అనంత ప్రవాహం అని తెలిపాడు .

  సశేషం

రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.