పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -౩

పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -౩

1920 సెప్టెంబర్ కలకత్తా కాంగ్రెస్ సభలలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడి ,నజ్రుల్ భావాలకు దగ్గరగా ఉండి,బరీంద్ర కుమార్ ఘోష్ ,అవినాష భట్టాచార్య వంటి అండమాన్ విప్లవ వీరులతో ,నలినీ కాంత సర్కార్ వంటి సంగీతజ్నులతో ,ఇతర అతివాద విప్లవ వాదులతో నజ్రుల్ కు గొప్ప పరిచయమేర్పడింది .అతని నిష్కలంక హృదయం వారిని బాగా ఆకర్షించింది .బిజిలీ కి చెందిన సాహిత్య వర్గాలు అతన్ని అభిమానించాయి .ఇన్నాళ్ళకు ముస్లిం బెంగాలీలకు ఒక ప్రతిభా వంతుడు ,జాతీయ సమైక్యతకు అగ్రగామి లభించాడు .పాఠకులందరికి అతడు ఆరాధ్యమయ్యాడు .భారతి ,ఉపాసన పత్రికలూ కూడా అతని రచనలు ప్రచురించాయి .బరీన్ద్రుని బిజిలీ పత్రిక విశేషంగా ఆదరణ పొందింది .అందులో రష్యా గురించి సోవియట్ విప్లవం గురించి చర్చలు ఉండేవి .అతని పద్యాలు గద్యాలు పుంఖానుపుమ్ఖం గా ఆపత్రిక ప్రచురించి మాంచి ఉత్సాహమిచ్చింది .తనపాటలు రవీంద్రుని గీతాలు బాగా పాడి మెప్పించేవాడు .ఆయన కలకత్తా హిందువుల అందరికీ ప్రేమపాత్రు డయ్యాడు .జన సామాన్యం లో కలిసిపోయి పాడుతూ వారిని కదిలించేవాడు .టాగూర్ వర్గీయులు కూడా అతడిని గొప్పగానే సమాదరించే వారు .టాగూర్ తర్వాత సత్యేంద్ర నాద దత్త ,,మణిలాల్ గంగూలీ ,ప్రేమ కుమార్ అతర్ది ,కవిగా గాయకుడుగా ప్రసిద్దు డైన మోహిత లాల్ మజుందార్  లు అందరూ అభిమానించేవారు నజ్రుల్ ను .అందులో మోహిత్ లాల్  మజుందార్ కు నజ్రుల్ గొప్ప వరం అయ్యాడు .నజ్రుల్ శాలి ,శక్తివంతమైన శబ్ద ప్రయోగం ,అన్త్యానుప్రాస పై ఉన్న అధికారం పారశీ భాషా జ్ఞానం ఆశబ్దాలను ధారాళంగా వాడే విధానం చూసి బెంగాలీ కవిత్వానికి నూతల జవసత్వాలు కలిగిస్తాడని లాల్ నమ్మేవాడు .తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన లాల్ అంటే నజ్రుల్ కు అమిత గౌరవం  .1922లో తన యుగ కర్త్రుత్వు గేయం ”బిద్రోహి ”వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు .

  ఆడు నజ్రుల్ కు కలకత్తా లో కావలసింది పొట్ట పోసుకోవటానికి తగిన ఆర్ధికం.ముస్లిం పత్రికలూ రచయితలకు పారితోషికం ఇచ్చేవికావు .రామానంద చటర్జీ స్థాపించిన ””ప్రవాసి ”మాత్రం రచన కవిత లకు పదేసి రూపాయలు ఇచ్చేది.గద్య రచనకు పేజీకి మూడురూపాయలు ఇచ్చేది.శరత్ మాత్రం తన కలం బలం తో జీవితం గడిపే వాడు .ఆయన పేరు ప్రఖ్యాతులకు  అది బంగారుకాలం.భరత్ వర్ష అత్రికలో ఆయన రచనలకు ఆదాయం తక్కువే అని చెప్పాలి .మిగిలిన రచయితలూ గుమాస్తాగానో ,ప్లీడర్ లేక మేష్టర్ గా,జర్నలిస్ట్ గా  జీవితం గడుపుతూ రచనలు చేసేవారు .

  అదృష్ట వశాత్తు నజ్రుల్ కి జర్నలిజం ఆఫర్ వచ్చింది .ఆయన మిత్రుడు ముజఫర్ అహ్మద్ స్థానిక హైకోర్ట్ వకీల్, జాతీయ నాయకుడు అయిన ఎకే.ఫజులుల్ హక్ ను ఒప్పించి  ఒక దిన పత్రిక స్థాపించటానికి ప్రయత్నం చేశాడు.ముస్లిం జాతీయ వాదాన్ని సంఘటిత పరచటం ఆపత్రిక ఉద్దేశ్ష్యం .నజ్రుల్ ముజఫర్ ఇద్దరూ అనుభవం లేనివారే అయినా సంపాదకులై ”నవ యుగ్”పత్రిక ను 12 – 7-1920 న మొదటి పత్రిక ప్రచురించారు .ఆనాటి సాంఘిక జీవనం పై ఈ పత్రిక ప్రభావం బాగా పడింది .హాక్ గారి అనుమానాలు హుష్ కాకి అయ్యాయి .స్పష్టమైన బెంగాలీ శైలికి ,ప్రభావ వంతమైన రాజకీయ భావాలకు పత్రిక వేదిక అయి మంచి ప్రాచుర్యం పొంది పూర్తీ జాతీయ దినపత్రిక గా ప్రసిద్ధమైంది .స్వాతంత్ర పోరాటం లో సామాన్య వర్గమే ,చదువుకొన్న వారికంటే ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఈ పత్రిక రుజువు చేసింది .జనం గుండె చప్పుడు ను ప్రతిధ్వనిమ్పజేసి జనవాణికి నీరాజనాలిచ్చింది పత్రిక .నజ్రుల్ ఈ పత్రిక కు కొండ లా గోప్ప అండ అయ్యాడు .సంపాదకత్వ ప్రతిభా వార్తలను పసిగట్టే నేర్పు అతనికి పుష్కలం ఉన్నాయి .సంపాదకీయాలు శక్తివంతంగా సమతూకంగా ఉత్సాహ భరితంగా రాసేవాడు .పత్రిక కార్యాలయానికి దగ్గరగా ఉండటానికి ఇద్దరూ టర్నర్ స్ట్రీట్  కు మారారు .వీరిద్దరి గదులు సాహిత్య రాజకీయ చర్చా కేంద్రాలుగా విలసిల్లాయి .హిందూ ,ముస్లిం లు సమానంగా పత్రికను ఆదరించారు .సర్వ జనామోదం పొందిన పత్రికగా పేరు పొందింది .ఇదే పత్రిక కు శాపం అయింది  .పత్రికలో వచ్చే విషయాలు ప్రభుత్వానికి వ్యతిరేకం అని పోలీస్ నిఘా పెట్టారు .ప్రాధమిక ధరావత్ డబ్బు వెయ్యి రూపాయలు ప్రభుత్వం జప్తు చేసింది .రెండు వేలు కట్టమని ఒత్తిడి తెచ్చింది .ఎలాగో అలా తెచ్చికడితే దాన్నీ జప్తు చేశారు .పెద్దాయన ఫజ్లుల్ హాక్ నిర్లిప్తంగా ఉండేవాడు .నిజాయితీ పరుడైన ఆయన జాతీయ రాజకీయాలలో కలిసి నడవ లేక పోయాడు .నవయుగం ప్రారంభమై సహాయ నిరాకరణ ఉద్యమం తీవ్రమై స్కూళ్ళు కాలేజీలు బహిష్కరించమని కలకత్తా కాంగ్రెస్ తీర్మానం చేసింది .డబ్బు సేకరణకోసం కొంతకాలం పత్రిక ను ఆపేశారు సంపాదక ద్వయం .వీరిద్దరిని హక్ తన ఇంటికి ఆహ్వానించి చర్చలు జరిపాడు కానీ రాజకీయంగా అభిప్రాయ భేదం ఉండటం తో పత్రికను మళ్ళీ ప్రారంభించారు కానీ డిసెంబర్ లో నజ్రుల్ హఠాత్తుగా పత్రికను వదిలేశాడు .కొంతకాలానికి ముజఫర్ కూడా కాడి పారేశాడు .

  విశ్రాంతికి సాహిత్యరచనలకు వీలుగా ఉంటుందని నజ్రుల్ కలకత్తా వదిలి దేవ ఘర్ చేరాడు .అక్కడ ముస్లిం భారత్ పత్రిక ఆయనకు నెలనెలా వంద రూపాయలు ఇచ్చేట్లు దానికి తగిన రచనలు పంపెట్లు అంగీకారం కుదిరినా అది ఫలించలేదు .ఆయన ఇక్కడ అపరిచితుడు కనుక ఎవ్వరూ అతనికి డబ్బు సాయం చేయలేదు .ఒకటి రెండు గేయాలు మాత్రమె రాయగలిగాడు .రెండు నెలల తర్వాత కలకత్తాకు పీచే మూడ్ అయి నవయుగ్ లో మళ్ళీ కొంతకాలం పనిచేశాడు .1920 -21వరకు ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం యేర్పడ లేదు. 

  నవయుగ్ లో మానేశాక నజ్రుల్ కి బాలసాహిత్యం ముద్రించే ఆలి అక్బర్ ఖాన్ మిత్రుడై అతనితో ”లీచూ దొంగ ”కవిత రాయించి తనతో తూర్పు బెంగాల్ తిప్పెరాజిల్లా దౌలత్ పూర్ కు తీసుకు వెళ్లాడు .దారిలో కొమిల్లాలో నాలుగురోజులు ఇంద్ర సేన గుప్తా ఇంట్లో ఆతిధ్యం పొందారు .నజ్రుల్ కు ఘనస్వాగతమే లభించింది .గుప్తా భార్య విరాజ్ సుందరీ దేవి మాత్రు వాత్సల్యం చూపి ఆదరించింది .ఆమెను నజ్రుల్ ”అమ్మా ”అని ఆప్యాయంగా పిలిచే వాడు .ఆమె చెల్లెలు గిరిజాబాలను ”పిన్నమ్మా ”అని పిలిచేవాడు .వీరిద్దరిమధ్య స్నేహ పూర్వక సంబంధం ఉండేది .విధవ రాలైన ఈవిడ కూతురు 13 ఏళ్ళ ప్రమీలను  పెళ్లి చేసుకొన్నాడు నజ్రుల్ .స్నేహితులిద్దరూ దౌలత్ పూర్ వెళ్లారు .రెండు నెలలతర్వాత నజ్రుల్ ఆలీ విధవ చెల్లెలి కూతురు నర్గీస్ బేగం ను పెళ్లి చేసుకొంటున్నట్లు శుభలేఖ చూసి అతని మిత్రవర్గం అవాక్కై౦ది .కవులు ఇలా త్వరగా ప్రేమలో పడటం వదిలేయటం మరోమనువాడటం సహజమే .బేగం చదువుకోలేదు .పెళ్లి కి ఆలీ పెట్టిన షరతులకు నజ్రుల్ కుంగి పోయి వాటిని అంగీకరించక సంతకం పెట్టలేదు .కనుక ఈ పెళ్లి జరగలేదు .కోపం తోకోమిలాకు వెళ్లాడు .సేన్ గుప్తా కుటుంబం విచారం హృదయభారంతో మర్నాడు కొమిలాకు వచ్చింది .ఈ సంఘటనల వివరాలకు దాఖలాలు లేవు అంటాడు రచయిత.బేగం మనసు గాయపడి ఆలీకి ఎదురు చెప్పలేక కుములుతూ నజ్రుల్ కు అనేకజాబులు రాసింది .దేనికీ జవాబు ఈయన రాయలేదు .అందులో జులై 1937లోనజ్రుల్  రాసిన ఉత్తరం ఒక్కటే దొరికింది .అందులో ఆయనకు ఆమెతో పెళ్ళికి అంగీకరించినట్లు ఉంది.అదే తేదీన హెచ్ ఎం వి కంపెనీకి రికార్డ్ కోసం ఒక పాట రాశాడు .దానిభావం -పూలమాలతో ఎవరి మెడ ను అలంకరిద్దామనుకొన్నావో వారిని నీ మనస్సులో దాచుకోవటం ఎందుకు ?మరచిపో వారిని పూర్తిగా మరచిపో ”. 

  సశేషం 

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-23-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.