వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ

వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ
వైష్ణవ కుటుంబంలో శ్రీ మామిళ్ళపల్లి రామానుజా చార్యులు ,శ్రీమతి తాయారమ్మ దంపతులకు శ్రీమతి సుభద్రమ్మ 1904లో కాకినాడ లో జన్మించింది .చాలా చిన్నతనంలోనే శ్రీ పెరంబదూర్ బుచ్చయాచార్యులతో వివాహం జరిగింది .విధి వక్రించి భర్త కొద్దికాలానికే మరణించాడు .ఉన్నపరిస్థితుతులలో ఆమెను నాలుగో తరగతి వరకేచదివించ గలిగారు .ఆమెను ఎలాగైనా విద్యావంతురాలిని చేయాలని ‘’మెసపోటేమియా’’లో ఉంటున్న చిన్నాన్న ,తగిన ధన సహాయం చేసి ఆమెను విశాఖ పట్నం క్వీన్ మేరీ గరల్స్ హై స్కూల్ లో,హాస్టల్ వసతికూడా కల్పించి అయిదవ తరగతి లో చేర్పించాడు .1927లో స్కూల్ ఫైనల్ పాసై౦ది .దయ సానుభూతి మెత్తని హృదయం ఉన్న సుభద్రమ్మ పేద విద్యార్ధులకు తనదగ్గరున్న డబ్బు ,పుస్తకాలు,బట్టలు వగైరాలను మూడవ వ్యక్తికితెలియకుండా అందజేసి సాయం చేసేది .కాకినాడ పిఠాపురం రాజాకలేజిలో ఇంటర్ పూర్తీ చేసి ,దృష్టి విద్యపై కంటే రాజకీయం పై ప్రసరించి ఊరేగింపులు సభలు సమావేశాలలో పాల్గొంటూ .ఖద్దరు ధరించటం , రాట్నం పై నూలు వడకటం ,జాతీయగీతాలు ఆలాపిస్తూ ప్రచారం చేయటం చేసింది .
సుభద్రమ్మ చిన్నాన్న విశాఖ పట్నంలో ఉద్యోగం లో చేరగా ,చెల్లెల్ని రప్పించి బిఏ ఆనర్స్ లో చేర్పించినా, ఆమెకు ఇంగ్లీష్ చదువుపై మోజు లేకపోవటం ,వలన జాతీయోద్యమం లో పాల్గొని స్వరాజ్య సంపాదనకు కృషి చేయాలని నిశ్చయించుకొని,ఆనర్స్ పూర్తికాగానే బహిరంగ సభలలో ప్రసంగించటం సభలు సమావేశాలు సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొనటం చేసింది .శ్రీమతి పాదుర్తి సుందరమ్మ,,శ్రీమతి కొల్లా కనక తాయారమ్మ ,,శ్రీమతి సంగం లక్ష్మీ బాయమ్మ ,శ్రీమతి దేవులపల్లి సత్యవతమ్మ వంటి అంకితభావంతో ఉద్యమిస్తున్న దేశ సేవికల తో కలిసి ,ఏలూరు గుంటూరు బెజవాడ వంటి పట్టణాలలో తిరుగుతూ,తన నిస్వార్ధ సేవ ,చురుకుదనం ,సాహసాలతో అందరి దృష్టినీఆకర్షించింది.సుందరమ్మతో పశ్చిమ కృష్ణా అంతా పర్యటించి ప్రచారం చేసింది .1930లో ఉప్పుసత్యాగ్రహం లో నాయకులు అందరు అరెస్ట్ అయి జైళ్ళలో ఉంటే ,సత్యాగ్రహం చల్లారిపోకుండా బందరుకోనకు వెళ్లి ,సహచరులతోకలిసి ఉప్పు వండింది .కల్లు సారా దుకాణాల వద్ద పికకెట్టింగ్ లు నిర్వహించి,1930లో అరెస్టయి ,ఆరునెలలు రాయవెల్లూరు జైలులో కఠిన శిక్ష అనుభవించి౦ది .ఆసమయంలో పశ్చిమ కృష్ణాలో అరెస్ట్ అయిన 168మందిలో సుభద్రమ్మ సుందరమ్మ ఇద్దరే ఇద్దరు స్త్రీలు .వీరితోబాటు ఆనాడు జైలు శిక్ష అనుభవించిన వారిలో సంగం లక్ష్మీ బాయమ్మ ,ఎక్కల పున్నమ్మ ,చుండూరి రత్నమ్మ ,దుర్గాబాయమ్మ ,వేదాంతం కమలాదేవి గార్లవంటి వారెందరో ఉన్నారు .
జైలునుంచి విడుదలాయినా సుభద్రమ్మలో ఆవేశం ఉత్సాహం చల్లారలేదు .గాంధి-ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా రాజకీయ ఖైదీల౦దర్నీ ప్రభుత్వం విడుదల చేసింది .సుందరమ్మ సుభద్రమ్మ మరికొందరు మహిళలు కలిసి విజయవాడలో ఒక సన్మాన సంఘం ఏర్పాటు చేసి ,విడుదలైన స్త్రీ సత్యాగ్రహులను ఊరేగింపుగా తీసుకు వెళ్లి తలంట్లు పోయించి, విందులు చేసి ,సన్మాన సభలు జరిపి గౌరవించి వారివారి ఊళ్లకు సగౌరవంగా పంపేవారు .ఇలా తరగని ఉత్సాహంతో సుభద్రమ్మ కావలసినంత కాలక్షేపం కల్పించుకొని అందరికి స్పూర్తి కలిగించింది .1931లో జరిగిన కరాచీ కాంగ్రెస్ కు ఆంధ్రదేశం నుంచి తండోపతండాలుగా మహిళలు పురుషులు సుభద్రమ్మ ఆధ్వర్యం లో తరలి వెళ్లారు .బొంబాయి స్టీమరుపై కరాచి చేరారు.బాలవితంతువుగా ఇంట్లో మగ్గిపోవాల్సిన సుభద్రమ్మ జీవితం జాతీయ సమైక్యతాభావానికి ,కార్యనిర్వహణ దక్షత పెంచుకోవటానికి తోడ్పడి సార్ధకమై ప్రేరణ గా నిచింది . గాంధి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ఇంగ్లాండ్ వెడితే ,సంధి ప్రయత్నాలు విఫలమైతే ,మళ్ళీ శాసనోల్లంఘన చేయటానికి ,తగినంత తర్ఫీదు ఇవ్వటానికి ఏర్పాటు చేయబడిన ‘’హిందుస్తానీ సేవాశిబిరం ‘’లోఆంధ్రదేశం తరఫున సుభద్రమ్మ చేరి ,శిక్షణ పొంది కర్రసాము ,గస్తీతిరగటం నగర సంకీర్తనమొదలైనవాటిలో నిష్ణాత అయింది .
1931డిసెంబర్ 31 న దేశవ్యా,దేశ వ్యాప్తంగా శాసనోల్లంఘనకు మహాత్ముడుఅనుమతినివ్వగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.ఆంధ్రరాష్ట్ర నియంతగా వ్యక్తి సత్యాగ్రహం లో సుభద్ర పాల్గొని ,1932 ఏప్రిల్ 2న గుంటూరుజిల్లా పెనుమాకలో అరెస్ట్ అయి ,రాయవెల్లూరు లో ఒక ఏడాది సిక్లాస్ శిక్ష అనుభవించింది .అక్కడ భారతీ రంగా ,దిగుమర్తి జానకి బాయమ్మ మొదలైన వారున్నారు .జైలులోనే చదువుకొనసాగించి బిఏ పరీక్ష రాసి,పాసైంది .విడుదల అయ్యాక బ్రిటీష ప్రభుత్వం కింద ఉద్యోగం చేయరాదని నిర్ణయించుకొని ,బెజవాడలో తంగిరాల రాఘవయ్యగారి ‘’నేషనల్ ఇండియన్ లైఫ్ ఇన్స్యూ రెన్స్ కంపెని ‘’స్త్రీ విభాగంలో ఏజెంట్ గా చేరి ,తన శక్తి సామర్ధ్యాలు చూపి గొప్ప పేరు తెచ్చుకొన్నది. తరచుగా మద్రాస్ వెళ్ళాల్సి రావటం వలన ,మద్రాస్ కే మకాం మార్చింది .ఆమె ఇల్లు ఎప్పుడూ సాహాయం పొందే వారితో నిండి ఉండేది .పరీక్షలకు కట్టేవారికిడబ్బు సాయం చేసేది .పునర్వివాహాలకు సహకరించేది .మద్రాస్ లో లేడి సుబ్బారావు స్థాపించిన ‘’సేవాసదన్ ‘’కు కొంతకాలం సూపరి౦టే౦డెంట్ గా ఉన్నది .
మద్రాస్ లో తెలుగు బడులు అతి తక్కువగా ఉండటం గమనించి తెలుగు విద్యార్ధులకోసం పెరంబూర్ లో ‘’వెంకట రమణ ప్రాధమిక పాఠశాల ‘’స్థాపించి విద్యా వ్యాప్తికి సాయపడింది .ఇది విజయం పొందటంలో పరిసర ప్రాంతాలలో మరిరెండు స్కూళ్ళు నెలకొల్పి మొత్తం మూడు స్కూళ్ళను అత్యుత్సాహంగా వినోద విజ్ఞాన కేంద్రాలుగా నడిపింది .ప్రభుత్వం ఒక్కపైస కూడా సాయం చేయలేదు .ఊరూరా తిరిగి విరాళాలు సేకరించి నిర్వహించింది .పెరంబదూర్ లో ‘’బాలానంద సంఘం ‘’ స్థాపించి ,ఆంద్ర బాలానంద సంఘానికి అనుబంధం చేసి తెలుగు బాలలకు విజ్ఞాన దాత అయింది సుభద్రమ్మ .తల్లులకోసం ఒక మహిళా మండలి స్థాపించిసమర్ధంగా నిర్వహించింది .హిందీక్లాసులు నిర్వహించి పరీక్షలకు పంపేది. కుట్టు అల్లికలు నేర్పి పరీక్షలు రాయించేది .
అమరజీవి పొట్టిశ్రేరాములుగారిఆత్మబలిదాన౦ తో ఆంద్ర రాష్ట్రం ఏర్పడటానికి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి మహజర్లు సమర్పించింది. శ్రీమతి జాస్తి సీతామహ లక్ష్మి ఆధ్వర్యంలో 20-1-1953 న మద్రాస్ శుభోదయ భవనం లో సభ జరిపి ,ఆంధ్రరాష్ట్రాన్ని ఏక భాషా ప్రయుక్తంగా లేక ,పాలనా సౌలభ్యంగా వెంటనే ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి,వాఛూ కమిటికి అందజేసింది .విద్యావంతురాలు సమర్ధురాలు స్వేచ్చాజీవి .పరప్రభుత్వంకింద బానిసగా ఉండను అని తెగేసి చెప్పి స్వతంత్రమైన జీవికనుఎన్నుకొన్న ఉత్తమోత్తమ దేశ సేవా పరురాలు ,మహిళలకు ఆపన్నురాలు , విద్యకు సేవలు చేసి జీవితాన్ని ధన్యం చేసుకొన్న కర్మిష్టి శ్రీమతి పెరంబదూరు సుభద్రమ్మ 1974లో 70 వ ఏట హైదరాబాద్ లో పరమపదించింది. ఆమె జీవితం సేవామయం ,ఆదర్శం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.