’అవతార పురుషుడు ‘ను తీర్చి దిద్దిన అక్షర శిల్పి శ్రీ షేక్ అబ్దుల్ హకీం జాని
తెనాలి అంటే శిల్పులకు ప్రసిద్ధిమాత్రమే కాక అక్షర శిల్పులకూ నాటక సంగీత కళాశిల్పులకూ ప్రసిద్ధి .అలాంటి తెనాలిలో ఉంటున్న బాల ,యాత్రా సాహిత్య శిల్పి , సరసభారతితో పాటు అనేక సాహితీ సంస్థలనుంచి సన్మాన సత్కారాలు అందుకొంటున్న శ్రీ షేక్ అబ్దుల్ హకీం జాని- యుగపురుషుడు ,కళామతల్లి ముద్దుబిడ్డడు ,తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వమంతా చాటిన పురాణ జానపద సాంఘిక పాత్రధారి,కల్మషంగా ఉన్న తెలుగు దేశ రాజకీయాలను ప్రక్షాళనం చేసి ,కొత్తవేలుగులు ప్రసాదించి పేద అట్టడుగు వర్గాలకు పరిపాలన చేరువ అవ్వాలని తెలుగు దేశం పార్టీస్థాపించి కొన్నినెలలకే ఎన్నికలలో ఘనవిజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి , ,అప్పటిదాకా తెలుగు వాడు అంతే ఎవరో తెలియని ప్రపంచానికి చాటి , అనేక సంస్కరణలతో ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న అన్న శ్రీ నందమూరి రామారావు శతజయంతి సందర్భగా రచించి వెలువరించిన పుస్తకమే ‘’అవతార పురుషుడు ‘’.దీన్ని మనదేశం లోనే కాకుండా అమెరికాలో డెట్రాయిట్ లోనూ ఆవిష్కరింప జేసి రికార్డ్ సృష్టించారు జాని .విష్ణు ,రామ ,కృష్ణ దివ్య స్వరూపాలతోముందు ముఖ చిత్రం, ఆయన ధరించిన వివిధ పాత్రల చిత్రాలతో వెనుక ముఖ చిత్ర లతో,లోపలి కవర్ పేజీలు వివిధ ముఖ్య చిత్రాలతో పుస్తకం బహు ముచ్చటగా ఉంది .పుస్తక ప్రచురణ కర్త తెనాలి వాస్తవ్యులు, అమెరికాలో ఉంటున్న రామారావు అభిమాని సాహిత్య పోషకులు శ్రీ బాబు ఆర్. వడ్లమూడి బహుధా ప్రశంస నీయులు .ఇంత సర్వాంగ సుందరంగా పుస్తకం రూపు దాల్చటం అపూర్వ విషయం .
అన్న గారి బాల్యం నుంచి జీవితంలో వివిధ దశలను ప్రత్యేక శీర్షికలతో విలువైన విశేషాలతో జాని రూపొందించారు .అరుదైన అనేక ఫోటోలను అర్ధవంతంగా పొందు పరచారు .అడుగు అడుగునా రచయిత తీసుకొన్న శ్రద్ధ కనబడుతోంది .తెలుగు వెలుగు గా,అందాల నటునిగా ,పౌరాణిక పాత్ర ధారణలో విశ్వ విఖ్యాత కీర్తి కిరీటం ధరించిన ఎన్.టి .ఆర్ .నట విశ్వరూపాన్ని పుస్తకం లో ప్రదర్శింపజేశారు .అన్ని విధాలా పుస్తకం చిరస్థాయి గా నిలిచిపోయింది .చివరలో రచయిత జానీ సర్వతోముఖ ప్రతిభను వెలువరించే ప్రముఖుల అభిప్రాయాలు ,పొందిన బిరుదు సత్కారాలు ఫోటోలతో సహా ప్రచురించి వన్నె తెచ్చారు .అద్భుతంగా ,అమూల్యంగా ఉన్న ఈ అరుదైన పుస్తక శిల్పం నిజంగానే ‘’అమూల్యం ‘’.రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నిటికి ,ప్రసిద్ధ రచయితలకు ఉచితంగా పోస్ట్ లో పంపి ‘’అమూల్య సేవ ‘’చేశారు రచయితా ,స్పాన్సర్ .ఇద్దరూ అభినందనీయులు .ఈ అవతార పురుషుడు అందరి చేతుల్లోనూ ఉండాల్సిన అక్షర శిల్పం .కానీ మూడు వందల పేజీలతో కలర్ఫుల్ గా ముద్రించిన ఈ పుస్తకాలన్నీ అయిపోయినట్లు రచయిత జానీ పత్రికాముఖంగా తెలియబరచి క్షమించమని కోరారుకూడా .చదువరుల కోరికను పురస్కరించుకొని వీలయితే ద్వితీయముద్రణ చేసి అభిమానుల కోరిక తీర్చగలరని ఆశిద్దాం.
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-23 –ఉయ్యూరు
’అవతార పురుషుడు ‘నుతీర్చి దిద్దిన అక్షర శిల్పి శ్రీ షేక్ అబ్దుల్ హకీం జాని
