శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-1
కు శ్రీకట్టమంచి రామ లింగారెడ్డి పీఠిక రాశారు .చిత్తూరు విక్టోరియా జూబిలీ ముద్రాక్షర శాలలో 1931లోప్రచురితం .పీఠిక లో రెడ్డిగారు –‘’కవయిత్రి చిత్తూరు దగ్గర గుండ్లపల్లె గ్రామస్తురాలని ,తనకు అక్క వరుస అని , వారి వంశంలో అంతటి రూప వతి గుణవతి పుట్టి ఉండలేదని ,భర్త వళ్లి వీడుకు చెందిన అప్పాసామి రెడ్డి పెండ్లి అయిన కొద్దికాలానికే మరణించి , కస్టాలు పడిణా ఆమె భర్త తమ్ముడు మరది నరసింహారెడ్డి చిత్తూరు జిల్లాలో అగ్రగణ్యుడని ,’’ధని ,దాని ‘’అనీ మహాప్రసిద్ధు డని ,రెడ్డి జన సంఘానికి 25వేల రూపాయలు సమర్పించిన వదాన్యుడని, ‘’నరసమ్మ తల్లి’’ పరమపవిత్రురాలని ఆమెను చూస్తె పూజించ మనసు పుడుతుందని ,తన చిన్నప్పుడు ప్రతియేటా అరగుండ వావిల్ తోట ,దామల్ చెరువు(ప్రఖ్యాత కధకులు మధురాంతకం రాజారాం గారి స్వగ్రామం )ఎల్లంపల్లె ,వల్లివేడు ,గుండ్లపల్లె ఒక రౌండ్ తిరిగి వచ్చేవారమని,వెళ్ళినప్పుడల్లా తనకు పట్టంచు పంచెలు ఒక్క రూపాయి సంభావన గా ఇచ్చేవారని , ఇక కోళ్ళు పొట్టేళ్ళుగడ్డపెరుగు ఇంటకాచిన కమ్మని నెయ్యి ఆప్యాయంగా అందించేవారని ,గుండ్ల పల్లే ప్రయాణం అంటే అదొక తీర్ధ యాత్రగా ఉండేదని ,’’అమ్మాయమ్మ ‘’అనే ముద్దుపేరుతో పిలువబడే నరసమ్మగారు , షడ్రసో పెత భోజనం పెట్టటమేకాక ,ఆమె మనసు నడత లతో తమల్ని వికసింప జేసేవారని ఇదే అత్యుత్తమ విందుగా అనిపించేదని ,’’ఊకుడు కథలు ‘’చెప్పటంలో ఆమె మహా నేర్పరి అని ,రాత్రిళ్ళు ఆమె కథలువింటూ అఆక్కయ్యవద్దే పడుకొనే వాడినని ,అప్పుడు తనవయస్సు సుమారు పది అనీ ఆమెకు కనీసం వందకు పైగా కథలు వచ్చునని .తనను అందరూ ‘’నూరుకథల వాడు ‘’అని అనేవారనిచెప్పారు . వదినగారి వైధవ్య బాధ తగ్గించటానికి మరిది నరసింహారెడ్డి ఆమెకు కొంచెం చదువు చెప్పించాడు, చీట్లాట నేర్పించాడు .ఆమెది సహజ పాండిత్యం .కట్టమంచి వారి తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డిగారు కొడుకుకు భారత భాగవతాలు అర్ధా లతో సహా నేర్పగానేర్చి ,గుండ్ల పల్లే వెళ్ళినప్పుడల్లా అమ్మాయమ్మగారు తనతో వాటిని చదివించుకొని విని ఆనంది౦చేవారని ,అర్ధతాత్పర్యాలు అడుగుతూ అనుమానాలోస్తే ప్రశ్నించి సమాధానం పొందుతూ ఉండేవారని అలా తనను బాగా ప్రోత్సహించేవారని అన్నారు .ఆమె వినికిడి వల్లనే అన్నీ నేర్చారని ఛందస్సు అలంకారశాస్త్రం చదవకపోయినా కమ్మని కవిత్వం కట్టే వారని చెప్పారు .ఆకవిత్వంలో ముగ్ధ భక్తీ ప్రవహి౦చేదని ,పెళ్ళిళ్ళలో ‘’తలపులు తీసే’పాటలు ,ప్రణయకలహాలు ఈ శతకం లో వర్ణించారని నీతి,సాంఘిక ధర్మాలు గుప్పించారని ఆడజన్మ పొందేబాధలు ఏకరువు పెట్టారని ,రెడ్ల కులంలో పుట్టినందుకు వేమన గారి గాలి కొంచెమైనా సోకటం సహజమని ,జ్ఞానానికి శాస్త్ర పఠనానికి సంబంధం లేదని ,తెలుగు సామెతలు ప్రవాహంగా చొప్పించారని ,’’వనితకాభరణ౦బుపతి భక్తీ వెలయుట – ఇంటి కాభరణ౦బు లెనయ సుతులు ‘’వంటి వేమన అనుకరణాలు కూడా ఉన్నాయని ,స్త్రీల ప్రకృతి చెడ్డది అని ఆమె అనటం తనను బాధించిందని ,గుణాలను గ్రహించమని కోరారు శ్రీమాన్ కట్టమంచి .తన తమ్ముని భార్య తిరుమలమ్మ ‘’గురు బోధామృతం’’గ్రంధం రాసి ,తమ వంశానికి కీర్తి తెచ్చిందని,తెలుగు భాష అక్షయంగా నిలవాలని కోరు కొంటున్నానని సుదీర్ఘంగా 12 పేజీల పీఠిక రాసి మనకు తెలియని విషయాలు చాలా చెప్పారు .తర్వాత కవయిత్రి తనమాటలుగా ఏం చెప్పారో, శతక విశేషాలేమిటో రేపు తెలుసుకొందాం.
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-23-ఉయ్యూరు
