అనునిత్య కవితా ఝరి ,మధుర కవి,సరసభారతి ఆస్థాన కవి  కీ.శే.ముదిగొండసీతారామమ్మ గారు

అనునిత్య కవితా ఝరి ,మధుర కవి,సరసభారతి ఆస్థాన కవి  కీ.శే.ముదిగొండసీతారామమ్మ గారు

మొన్న సోమవారం 29-7-24 మధ్యాహ్నం ఫేస్ బుక్ లో సీతారామమ్మ గారి మరణ వార్త చూసి వెంటనే సంతాపం రాసి ,ఆమె ఫోన్ నంబర్ కు మధ్యాహ్నం ,రాత్రి ,మంగళవారం ఉదయం ఫోన్ చేస్తే ఎవరూ తియ్యక పోవటం జరిగి ,శ్రీ దత్తాత్రేయ శర్మకు  ఫోన్ చేస్తే  తను స్కూలుకు వెడుతున్నాననీ ,సోమవారం అర్ధ రాత్రి ఇంటికివచ్చాక విషయం తెలిసిందని ,వివరాలు తెలియదనీచెప్పారు  కాసేపయ్యాక సిలార్ గారికి  ఫోన్ చేయగా విషయం ఫేస్ బుక్ ద్వారానే తెలిసిందని ,తనకూ వివరాలు తెలీదని చెప్పగా ,నా ప్రయత్నాలు చెప్పి ,ఆమె కుమారుల ఫోన్ నంబర్ ఉంటే తెలియ జేయమని చెప్పగా  పూర్వం కలెక్టర్ ఆఫీస్ లో ఒకబ్బాయి పని చేసే వాడని ,ఇప్పుడు చాలా దూరం లో ఉన్నాడని ,అయినాతెలుసుకొని చెబుతానన్నారు .ఊర్కోలేక శ్రీమతి రాజ రాజేశ్వరి కి ఫోన్చేయగా ,ఆమె కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారానే తెలుసుకున్నానని అంతకు మించి తెలియదని ,కుటుంబం రాజు పేట లోనే ఉంటున్నారని తన భర్తగారికి మోకాలు ఆపరేషన్ కోసం హైదరాబాద్ లో ఉన్నానని చెప్పగా ,కాసేపట్లో సిలార్ గారు ఫోన్ చేసి సీతారామమ్మ గారి అబ్బాయి ధూర్జటి  నంబర్ మెసేజ్ లో పంపగా ,ఆతనితో మాట్లాడగా తనపేరు దూర్జటికాదని తేజస్వి ఆని చెప్పి  విషయం అడిగితె నెలరోజుల నుంచి ఆమె గారు శ్వాస విషయంగా చాలా బాధ పడుతున్నారని ,ముక్కుతో పీల్చటం కుదరక నోటితో పీలుస్తుండగా ఆస్పత్రికి తీసుకు వెళ్లి చూపించి మందులు వాడుతున్నామని  ,సోమవారం మరీ  బాధపడుతుంటే మళ్లీ తీసుకు వెళ్లామని  ,రక్తం లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువై వైటల్ ఫంక్షన్స్ అన్నీ దెబ్బతిని స్ట్రోక్ వచ్చి చనిపోయారనిఇంటికి తీసుకొచ్చామని  చెప్పారు .కార్యక్రమం మొదలు పెట్టారా ఆని అడిగితె ,అంతా సిద్ధమైందని కాసేపట్లో ఉత్తర క్రియలు జరుపుతామని చెప్పారు .  రెండు ఓదార్పు మాటలు మాట్లాడి ధైర్యంగా ఉండమని చెబుతూ ఫిబ్రవరి లో ఉయ్యూరులో జరిగిన కార్యక్రమానికి ఆమె రావటం జ్ఞాపకం చేశాను .అవునన్నాడు . తర్వాత సిలార్ గారికి అతనితో మాట్లాడి నట్లు మెసేజ్ పెట్టాను .

  ఎందుకు సీతారామమ్మ  గారి విషయం లో ఇంత తపన అంటే సుమారు 30ఏళ్ళక్రితం నేను చల్లపల్లి దగ్గర మంగళా పురం జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు తెలుగు పండిట్ శ్రీ ముదిగొండ నాగ మల్లికార్జున రావు గారు .రోజు బందరునుంచి టివిఎస్ బైక్ మీద వచ్చేవారు .గొప్ప సాహిత్య జ్ఞానం ఉన్న కవి ,మహా పండితుడు .రోజూ ఖాళీ సమయం లో సాహిత్య విషయాలు మాట్లాడుకొనే వాళ్ళం .పిల్లలకు తలలో నాలుకగా ఉండేవారు వాళ్లకు పాటలు పద్యాలు డాన్స్  నేర్పేవారు .వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిపా౦ కూడా .ఉయ్యూరులో మా గురువుగారు స్వర్గీయ లంకా బసవా చారి గారు మా అందరి సహకారంతో స్థాపించి ప్రతి మూడవ ఆదివారం నడుపుతున్న ‘’సాహితీ మండలి ‘’కి మల్లికార్జున రావు గారిని అప్పుడు మా శ్రీ సువర్చలా ఆంజనేయస్వామి దేవాలయం లో జరిగే కార్యక్రమానికి  ఆహ్వానించి  సత్కరించాము .  ఆతర్వాత   ఆయన ఏదో మాటలలో బందరులో గొడుగు పేట శంకర మఠం  దాటాక రాజుపేటలో బాలానందం అనే స్కూల్ నడుపుతున్నానని ,తనభార్య సీతారామమ్మ గారు ఆ స్కూల్ విషయం  చూసుకొంటారని చెప్పి ,ఆస్కూల్ వార్షి కొత్సవానికి మా దంపతులను రమ్మని ఆహ్వానించారు  .అలాగే వెళ్ళాం .బాగా ముచ్చటగా జరిగింది ప్రోగ్రాం .చాలాపోద్దుపోయింది .రాత్రి భోజనం అక్కడే .ఇంటికి వెళ్ళే వీలులేక అక్కడే పడుకొన్న జ్ఞాపకం .వాళ్ళ అమ్మాయికాత్యాయని  కూడా చాలా చురుకు సాహిత్య సంగీత జ్ఞానం ఉన్న పిల్ల .కళగల ముఖం. . బహుశా ఆవేసవిలోనే మల్లికార్జునరావు గారు గుంటూరు లో అకస్మాత్తుగా  మరణించారు .అప్పటి నుంచి ఆ కుటుంబం తో మాకు సాహిత్య  సాన్నిహిత్యం ఉంది .సాహితీ మండలి  నిర్వహించే కవి సమ్మేళనాలలో సీతారామమ్మగారు పాల్గొనే వారు .

 2009లో మేము స్థాపించి,నడుపుతున్న  ‘’సరసభారతి ‘’లో మా తలిదండ్రుల పేర ఇచ్చే ఉగాది పురస్కారం సీతారామమ్మ గారికి అందజేశాం .అన్ని కార్యక్రమాలకు దాదాపు ఆమె హాజరయ్యేవారు .2018 డిసెంబర్ లో రేపల్లెలో జరిపిన రెండు పుస్తకాల ఆవిష్కరణ ,కవి సమ్మేళనం లోనూ ఆమె పాల్గొని ఆనందం కలిగించారు .ఆమెను మా ‘’ఆస్థాన కవి ‘’అనే వారం .మా శ్రీ సువర్చలా ఆంజనేయస్వామి పై రాయించిన మూడు శతకాలలో ఒక శతక౦ –‘’శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం ‘’సీతారామమ్మ గారిచేత రాయించి మిగిలిన  రెండిలో మరో ఆస్థానపండిత కవి మిత్రుడు శ్రీ తుమ్మోజురామ లక్ష్మణా చార్యులచేత ,మరొకటి డా.రామడుగు వేంకటేశ్వర శర్మ గారు సూచించిన మహాకవి శ్రీ మంకు శ్రీను గారి చేత రాయించి ,మూడు శతకాలనుసరసభారతి ముద్రించి  ఒక మాఘమాసం ఆదివారం నాడు మా దేవాలయంలో జరిగిన సామూహిక సత్య నారాయణ స్వామి వ్రతం నాడు మహా పండితులు పొన్నూరు సంస్కృత కాలేజి రిటైర్ద్ ప్రిన్సిపాల్ డా .తూములూరి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,ఎమెల్ సి రాజేంద్రప్రసాద్ ,శ్రీనివాస కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ శ్రీనివాసరావు గార్ల చేత చేత ఆవిష్కరింప జేసి ,ముగ్గురు కవులకు  నూతనవస్త్రాలు ,ఒక్కొక్కకవికి పది వేల రూపాయల నగదు బహూకరించి  విందు కూడా ఏర్పాటు చేశాం  .సీతారామమ్మ గారు ,కూతురు అల్లుడు ,కుమారుడు వచ్చారు మాకు నూతన వస్త్రాలు బహూక రించారు .ఆమె మాత్రం పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు .బయట ఎక్కడా టిఫిన్ తినటం కాఫీ లాంటివి తాగటం లేదని ఆమె చెప్పారు . రెండేళ్లక్రితం జరిగిన మా సహస్ర చాంద్ర మాస ఉత్సవం ,మా వివాహ షష్టి పూర్తి ,ఉత్సవం ,ఈ ఫిబ్రవరి లో జరిగిన కవిసమ్మేళనం ఇద్దరు భాగవతారిణుల సన్మాన కార్యక్రమానికి కుమార్తెతో కలిసి వచ్చి కవిత చదివి వినిపించారు .ఎందుకో కొంచెం నీరసంగా ఉన్నట్లు అనిపించారు .

  ఫేస్ బుక్ ,వాట్సాప్ లు అందుబాటులోకి వచ్చాక సీతా రామమ్మ గారు రోజూ ఏదో ఒక విషయం పై పద్యం రాసి పంపేవారు .నన్ను చూడమనే వారు .నేను చాడివి అభినందించే వాడిని .ఇళ ఆమె ‘’తిరుప్పావై ‘’మొదలైనవి అన్నీ పద్యాలుగా అనువాదం చేశారు .చాలా శతకాలు రచించారు ,ఒకరకంగా నిత్య కృషీవల కవయిత్రి ఆమె .పద్యాలు సహజ సుందరంగా మృదు మధురంగా ఉంటాయి ఆమె హృదయాన్ని పరమేశ్వరార్పణం చేసి ,భర్త నాగామల్లికార్జునరావు గారి ప్రేరణతో నిబద్ధంగా కవిత్వం రాసేవారు .భేషజం లేని మనిషి . ఎంతో ఒదిగి ఉండటం ఆమె ప్రత్యేకత .నిండు కుండ.సమాజాన్ని అన్ని కోణాలలోనూ దర్శించి సామాజిక స్పృహను మేళవించి రాసే కవిత్వం ఆమె ది .గేయాలు ,మినీకవితలు రాశారు .అవధానాలలో నిషిద్ధాక్షరి ని ప్రశ్నించటం లో ఆమె నేర్పు నిరుపమానం ఆని అవధానులే చెప్పేవారు .మొన్న సోమవారం ఆమె రచించిన ‘’శతక సాహితీ ప్రదీప్తి ‘’కి ఉత్తమ కవయిత్రి పురస్కారం  కడప జిల్లా పొద్దుటూరు లో  అందుకోవాల్సి ఉండగా సీతారామమ్మ గారు అదే సోమవారం మధ్యాహ్నం శివైక్యం చెంది సాహితీ మిత్రులకు సాహితీ బంధువులకు అమిత శోకం కలిగించారు .ఆమె ఆత్మకు శాంతి కలగాలనీ ,ఆ కుటుంబం ఈ విషాదాన్ని తట్టుకోవాలని తెలియజేస్తూ సంతాపం ప్రకటిస్తున్నాను .ఇప్పుడు ఆమె గురించి వివరాలు తెలియజేస్తాను .

  శ్రీమతి ముదిగొండ సీతా రామమ్మ గారు 26-7-1949 న మచిలీ పట్నం లో శ్రీ నిడుమోలు శ్రీరామమూర్తి ,శ్రీమతి కామేశ్వరమ్మ దంపతులకు జన్మించారు .స్కూల్ ఫైనల్ వరకు బందరు మున్సిపల్ గరల్స్ హై స్కూల్ లో చదివి ,భాషా ప్రవీణ చిట్టిగూడూరు శ్రీ నారసింహ సంస్కృత కాలేజిలో నూ ,గుంటూరు లోని కొలచల వేంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాలలోచదివి పాసై ,నాగార్జున యూని వర్సిటి నుండి తెలుగు లో ఎం .ఏ .పాసయ్యారు  .ఇన్ని డిగ్రీలు ఉన్న ఎక్కడ తనకు ఏదో బాగా వచ్చు అనే గర్వం ఏ కోశానా లేని అత్యంత వినయ శీలి ఆమె .మధురకవి శ్రీ ముదిగోండ నాగ మల్లికార్జున రావు M.A..లిట్-తెలుగు ను వివాహం చేసుకొన్నారు .ఈ కవి దంపతులకు పెద్ద కుమారుడు -తేజస్వి .కోడలు -,కిరణ్మయి   .మనుమడు నాగమల్లిక శివాత్మకి ,మనవరాలు శ్రీ  చిన్మయి.రెండవ కుమారుడు ఫణి ధూర్జటి –ఇతనికి వివాహం  కాలేదు ..కుమార్తె –పూర్ణ బాల కాత్యాయని –అల్లుడు శివలెంక నాగ చంద్ర శేఖర్ –మనవరాండ్రు –శివ మౌక్తిక ,శివ జ్యోతిక  .

సీతారామమ్మ గారు 10  సంవత్సరాలు మచిలీ పట్నం ‘’సాహితీ మిత్రులు ‘’సంస్థకు కార్యవర్గ సభ్యురాలు ,10ఏళ్ళు కోశాధికారి గా సాహితీ సేవ అందించారు .అష్ట ,శత ,ద్విశత ,పంచ శత సహస్ర,చతుర్గణిత అవధానాలలో  ,గణిత ,గీతా ,అలంకార అవధానాల లోనూ పృచ్ఛకురాలు .

  ఈమె సాహితీ సేవకు మచిలీపట్నం ఆంధ్ర సారస్వతి సమితి ఉగాది కవితల పోటీలో విశిష్ట కవితా పురస్కారం ,మినీ కవితల పోటీలలో ద్వితీయ బహుమతి పొందారు .

రచనలు –మల్లికార్జున శతకం ,తెలుసుకొనర నీతి తెలుగు వాడ శతకం ,మానస శతకం ,నవయుగాల బాట నారిదిపుడు శతకం ,శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం ,పద్యాలలో పొడుపు కథలు ,సీస పద్యాలలో తిరుప్పావై ,అనువాదం ,సీస పద్యాలలో  తిరు వెంబావై అనువాదం .ప్రముఖ పత్రికలు ప్రమిద ,విజ్ఞాన సుధ లలో సమీక్షలు చేశారు .అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉన్నట్లు ఉండే  మధురకవి ,సరస భారతికి ఆప్తురాలు ,ఆస్థానకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ గారు 75వ ఏట ‘’దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ యేగినారు అమరపురికి ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-24-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.