త్యాగశీలి ,స్వాతంత్ర్య సమర యోధులు ,విశిష్టాద్వైత గురు –శ్రీ చిలక మర్రి వేంకట కృష్ణ మాచార్యులు
1900లో కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో శ్రీ వెంకటార్యులు శ్రీమతి ఆండాళమ్మదంపతులకు వేంకట కృష్ణ మాచార్యులు జన్మించారు .తండ్రి ఇంజనీర్ గా ఉద్యోగం లో చేరి ,,పంటపొలాలకు కాలువలు త్రవ్వించి వ్యవసాయాభి వృద్ధికి విశేషంగా తోడ్పడ్డారు .కాపురం విజయ వాడలో . టైఫాయిడ్ తొ మరణించారు .
రెండేళ్ళ వయసున్న కృష్ణమా చార్యులను తల్లి ,నాయనమ్మ సూరమ్మ గుంటూరుజిల్లా గోవాడ తీసుకు వెళ్లారు .యాభై ఎకరాల ఆస్తికి ఈయనే ఏకైక వంశాంకురం .వీధి బడిలోనే చదివి ఆంధ్ర నామ సంగ్రహం ,అమరకోశం పూర్తి చేసి ,తెనాలి హైస్కూల్ లో చదువుతూ ,గాంధీజీ పిలుపుతో 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు .16వ ఏట బాపట్లలో శ్రీమాన్ కొమాండూరి రామానుజాచార్యుల వద్ద మూడేళ్ళు సంస్కృతం నేర్చారు .విశిష్టాద్వైత విధానం లో మంత్రాలు ,వాటి అర్ధాలు శ్రీ భాష్యం ,ద్రావిడ నాలాయిరం ,తిరువాయిమొడివగైరా అధ్యయనం చేసి మళ్లీ గోవాడ చేరారు . పదహారవ ఏట మొదటి వివాహం జరిగి ,భార్య కొద్దికాలం లోనే టైఫాయిడ్ తొ మరణించింది .22వ ఏటతల్లి నాయనమ్మ ల బలవంతం పై రామానుజమ్మ గారిని ద్వితీయం చేసుకొని ,దంపతులిద్దరూ గాంధీ గారి నిర్మాణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు .గోవాడలో అస్పృశ్యతా నివారణ చేశారు .తల్లి ఎంత వద్దని వారించినా ఆచార్యులు గారు ఒక హరిజన సోదరుడి చేత ఇంటి బావి లోని నీరు తోడించి నోట్లో పోసుకొని తాగారు..ఆనాడు ఆచార్యశ్రీ చేసినది అత్యంత సాహసోపేత చర్యగా ప్రజలంతా చెప్పుకొనే వారు .
1929లాహోరు కాంగ్రెస్ సభలలో పాల్గొని వచ్చి ఉన్నవ లక్ష్మీనారాయణ ,కొండా వెంకటప్పయ్య ,మద్ది సుదర్శనం మొదలైన ఆనాటి అగ్ర నాయకుల అడుగు జాడలలో నడుస్తూ ,పల్లెల్లో ,పట్టణాలలో అనేక ఉద్యమాలలలో పాల్గొన్నారు .స్వయంగా గోవాడ లో యువ మిత్రుల ఉద్యమం నడిపి ,బావినీరు కాచి ఉప్పు తయారు చేశారు .దీనికి ఈయన ఆబృందం అరెస్ట్ చేయబడి 7-8-1930 నుండి ఒక ఏడాది బి క్లాస్ జైలు శిక్ష విధీంప బడ్డారు .ఈ శిక్ష రాజమండ్రి ,రాయవెల్లూరు ,కన్ననూరు జైళ్ళలో అనుభవించారు .సత్యాగ్రహోద్యమం లో ఉండగా ఆచార్యుల వారు తనకున్న చాలాభూమిని అమ్మేశారు .
తర్వాత ఆయన దృష్టివ్యాపారం పై పడింది .ఉన్న భూములన్నీ అమ్మేసి 1941లో తెనాలి లో ‘’గుడ్ విల్ అండ్ కొ ‘’సంస్థ స్థాపించి ,అయిదుగురు గుమాస్తాలతో ఫాన్సీ సామగ్రి, రేడియోలు, రికార్డ్ ప్లేయర్లు ,సంగీత పరికరాలు వంటివి అమ్మారు .అమ్మకాలు బాగా ఉన్నా బాకీలు ఎక్కువై ,వసూలు కాకపోవటం తొ ,ఒత్తిడి చేయలేని మనస్తత్వం కల ఆచార్యస్వామి వ్యాపార౦ ఎత్తేసి ,గోవాడలో ఇల్లు అమ్మేసి ,తెనాలిలో డాబా కొన్నారు .అప్పటికే వైరాగ్యం ప్రవేశించి ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తూ ,ప్రచారం చేస్తూ 25-7-1975 న 75వ ఏట శ్రీ కైవల్యం చేరారు .’’విశాల ఫాలభాగంతో ,,విరాజిల్లే ఊర్ధ్వ పు౦డ్రాలతో ,పెద్దంచు శాలువాతో వైష్ణవ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబి౦బించేట్లు శ్రీమాన్ చిలకమర్రి వేంకట కృష్ణ మాచార్యులు గారు ఉండేవారు ‘’ఆని జ్ఞాపకం చేసుకొన్నారు గోవాడ వాస్తవ్యులు శ్రీ తుమ్మల వెంకటరత్నం గారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-24-ఉయ్యూరు
